టి.వి. సుందరం అయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.వి సుందరం అయ్యంగార్
దస్త్రం:TVS iyyengar.jpg
జననం
తిరుక్కురుంగుడి వేంగరం సుందరం అయ్యంగార్

(1877-03-22)1877 మార్చి 22
మరణం1955 ఏప్రిల్ 28(1955-04-28) (వయసు 78)
వృత్తివ్యాపారవేత్త
పిల్లలు
  • టీఎస్ సౌందరం
  • టీఎస్ రాజం
  • టీఎస్ దొరైస్వామి
  • టీఎస్ సంతానం
  • టీఎస్ అము అమ్మాళ్
  • టీఎస్ రంగా అమ్మ
  • టీఎస్ శ్రీనివాసన్
  • టీఎస్ కృష్ణ
బంధువులు

టి.వి సుందరం అయ్యంగార్ ( 1877 మార్చి 22 - 1955 ఏప్రిల్ 28) భారతదేశంలో మోటారు పరిశ్రమకు పునాదులు వేసిన దార్శనికులలో ఒకరు.[1] 1911 లో ఆయన టీవీఎస్ అయ్యంగార్ అండ్ సన్స్ అనే పేరుతో ఒక రవణా సంస్థను ప్రారంభించాడు. తరువాత ఇది వాహన ఉత్పత్తి సంస్థగా రూపాంతరం చెందింది. ఒక సాధారణ న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అప్పట్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగాడు. టీవీఎస్ గ్రూపు కింద అతని కుమారుడు టీవీఎస్ దొరైస్వామి టీవీఎఎస్ మోటార్స్ అనే సంస్థను ప్రారంభించాడు. టీవీఎస్ గ్రూపు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటి.[2]

జీవిత విశేషాలు[మార్చు]

టీవీఎస్ అయ్యంగార్ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరునల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో 1877 మార్చి 22న సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి కోరిక మేరకు న్యాయవిద్య నభ్యసించాడు. న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశాడు. అది నచ్చకపోవడంతో కొన్నాళ్లు రైల్వేలో, బ్యాంకులో ఉద్యోగాలు చేశాడు. ఆయనకు వాటిలోనూ సంతృప్తి కలగలేదు. సొంతగానే ఏదైనా చేయాలనుకున్నాడు. మధురై కేంద్రంగా 1911లో సదరన్ రోడ్‌వేస్ లిమిటెడ్ పేరిట రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించాడు. దాని ఆధ్వర్యంలో బస్సులు, లారీలు నడిపేవాడు.

అప్పట్లో మద్రాసు నగరంతో పాటు మధురై, తిరుచ్చి వంటి పట్టణాల్లోనూ ఎడ్లబళ్లు, జట్కాబళ్లు విరివిగా నడిచేవి. వాటిని లాగే గుర్రాలు, ఎద్దుల నాడాలు, వాటికి గుచ్చిన మేకులు తరచుగా ఊడిపోయి రోడ్లపై పడేవి. వాటి వల్ల బస్సులు, లారీల చక్రాలకు పంక్చర్లు పడి అంతరాయం కలిగేది. పంక్చర్లు పడి ఆగిపోయిన బస్సులను ప్రయాణికులే నెట్టాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి టీవీఎస్ అయ్యంగార్ తమ కంపెనీ బస్సులు నడిచే మార్గంలో మాగ్నెటిక్ రోడ్డురోలర్‌ను నడిపేవాడు. రోడ్డు రోలర్‌కు అమర్చిన మాగ్నెట్లకు దారిలో పడ్డ మేకులు, నాడాలు అతుక్కునేవి. ప్రయాణికులు నెట్టాల్సిన పని లేకుండానే బస్సులు నిరాటంకంగా నడిచేవి. దాంతో అప్పటి ప్రయాణికులు టీవీఎస్ అయ్యంగార్‌ను ఆప్యాయంగా తల్ల వేండం సార్ (నెట్టక్కర్లేదు సార్) అని ఆప్యాయంగా పిలిచేవారు.

సదరన్ రోడ్‌వేస్ విజయవంతంగా నడుస్తున్న దశలోనే ఆయన టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్ పేరిట వాహన రంగంలోకి అడుగుపెట్టాడు. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సేవలు, ఉత్పత్తులు అందించేందుకు మద్రాస్ ఆటో సర్వీసెస్ లిమిటెడ్, సుందరం మోటార్స్ సంస్థను ప్రారంభించాడు. సుందరం మోటార్స్ అప్పట్లో జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసే వాహనాలకు అతిపెద్ద పంపిణీదారుగా ఉండేది. రెండోప్రపంచ యుద్ధం కొనసాగినప్పుడు పెట్రోల్‌కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు అయ్యంగార్ టీవీఎస్ గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పాడు. టీవీఎస్ గ్రూప్ పలు రంగాలకు విస్తరించి, ఇప్పుడు దేశంలోనే అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఘనతను చాటుకుంటోంది.

టీవీఎస్ అయ్యంగార్ స్వతహాగా సంప్రదాయవాది. ఒకవైపు స్వాతంత్ర్యోద్యమం సాగుతున్నా, ఆయన తటస్థంగానే ఉంటూ తన వ్యాపారాలను కొనసాగించేవాడు.

కుటుంబం[మార్చు]

టీవీఎస్ అయ్యంగార్‌కు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. కొడుకుల్లో ఒకరైన దొరైస్వామి చిన్న వయసులోనే మరణించగా, మిగిలిన నలుగురు కొడుకులూ ఆయన వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. వైద్యుడైన ఆయన అల్లుడు సౌందరరాజన్ ప్లేగు రోగులకు చికిత్స చేసే క్రమంలో అదే వ్యాధికి గురై అకాల మరణం చెందడంతో కూతురు సౌందరం చిన్న వయసులోనే వితంతువుగా మిగిలింది. భర్త మరణం తర్వాత ఆమె మధురై నుంచి ఢిల్లీ వెళ్లి, అక్కడి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో చేరి, మెడిసిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే గాంధీ సిద్ధాంతాలపై ఆకర్షితురాలయ్యింది.

చదువు పూర్తయ్యాక గాంధీ ఆశ్రమానికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. సౌందరం పరిస్థితి తెలుసుకున్న గాంధీజీ ఆమెకు మళ్లీ వివాహం చేయాలని అయ్యంగార్‌కు సలహా ఇచ్చాడు. గాంధీజీ సలహాతో మెత్తబడ్డ అయ్యంగార్ కూతురికి రామచంద్రన్ అనే యువకుడితో పునర్వివాహం జరిపించాడు. వయసు మళ్లిన దశలో నలుగురు కొడుకులకు వ్యాపారాలను అప్పగించి, రిటైర్మెంట్ ప్రకటించిన టీవీఎస్ అయ్యంగార్, 1955 ఏప్రిల్ 28న కొడైకెనాల్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.

మూలాలు[మార్చు]

  1. "నల్లకోటు వదిలి... మోటారు పరిశ్రమకు..." sakshi.com. జగతి పబ్లికేషంస్. Retrieved 16 August 2016.
  2. "TVS Iyengar". Archived from the original on 2009-03-08. Retrieved 2016-08-16.