తారాశంకర్ బంద్యోపాధ్యాయ

వికీపీడియా నుండి
(తారాశంకర్ బందోపాధ్యాయ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తారాశంకర్ బంద్యోపాధ్యాయ
పుట్టిన తేదీ, స్థలం(1898-07-23)1898 జూలై 23
లాభ్‌పూర్, బీర్బం జిల్లా, బెంగాల్, బ్రిటీష్ ఇండియా
మరణం1971 సెప్టెంబరు 14(1971-09-14) (వయసు 73)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తినవలా రచయిత
పురస్కారాలురవీంద్ర పురస్కారం
సాహిత్య అకాడెమీ పురస్కారం
జ్ఞానపీఠ పురస్కారం
పద్మభూషణ్ పురస్కారం

తారాశంకర్ బంద్యోపాధ్యాయ (23 జూలై 1898[1] - 14 సెప్టెంబర్ 1971) ప్రముఖ వంగ నవలా రచయిత. ఈయన 65 నవలలు, 53 కథా సంకలనాలు, 12 నాటకాలు, 4 వ్యాస సంకలనాలు, 4 ఆత్మకథలు, 2 యాత్రా వర్ణనలు వ్రాశాడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రబీంద్ర పురస్కార్, సాహిత్య అకాడెమీ పురస్కారం, జ్ఞానపీఠంతో పాటుగా పద్మభూషణ్ కూడా అందుకున్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

బంద్యోపాధ్యాయ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్) అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ లోని బీర్భూమ్ జిల్లాలోని లాభ్పుర్ గ్రామంలో వారి పూర్వీకుల ఇంట్లో పుట్టాడు. ప్రభావతీ దేవీ, హర్దాస్ బంద్యోపాధ్యాయ ఇతని తల్లిదండ్రులు. తారాశంకర్ కు ఎనిమదవ యేటనే తండ్రి శ్రీ హరిదాస్ మరణించారు. తల్లిచలవ వల్ల పైకివచ్చిన కొందరు ఉజ్జ్వల ప్రపంచవ్యక్తులవలె తారాశంకర్ను కూడా ఆయన తల్లి శ్రీమతి ప్రభావతీదేవి శ్రమ అనక ఎంతో శ్రద్ధతో పెంచి పెద్దవాడిని చేసింది.ఈయన లాభ్పుర్ జాదబ్‌లాల్ హెచ్.ఈ. పాఠశాల నుండి 1916లో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యాడు. ఆపై మొదట సెయింట్ జేవియర్ కళాశాల కలకత్తాలో తరువాత సౌత్ సబర్బన్ కాలేజీ (ప్రస్తుతం ఆశుతోష్ కాలేజీ) లో చదివాడు. సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుతుండగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనటం వలన, ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వలన యూనివర్సిటీ చదువు కొనసాగించలేకపోయాడు.[2]. అప్పుడే తారాశంకర్ నూనుగు మీసాల నూత్న యౌవనంలో నిప్పులు కక్కే వంగవిప్లవ కారులతో సన్నిహిత్వం ఏర్పడింది.అప్పతి ప్రభుత్వం అతని పేరును బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.కాలీజీలో చదువుతూ ఉండగానే అతనిని ప్రభుత్వం స్వగ్రామంలో నిర్భంధంలో ఉంచింది.అతడు స్వగ్రామం పొలిమేరలు దాటిపోకూడదని కట్టడి చేసింది. అంతటితో అతని విద్యాభ్యాసానికి స్వస్తి జరిగింది. గ్రామ నిర్భంధంలో ఉన్నప్పుడు ఆయన జీవితం ప్రయోజనాత్మకమైన కార్యకలాపాలతో తీరికన్నది లేకుండా ఉండేది.అప్పుడే చాల నవలలు, కవితల, నాటకాలు వ్రాయటం మొదలుపెట్టినాడు.1928లో అతడు కథానికలు వ్రాయటానికి గట్టిగా ప్రారంభించాడు.అప్పుడే కల్లోల అనే నవ్య సాహిత్య పత్రికకు వ్రాయటం మొదలుపెట్టాడు.తారాశంకర్ కల్లోల వర్గంతో చాలా కాలం పనిచేసారు.

జాతీయోద్యమ సమయంలో ఆయన బీర్బూం స్థానిక కాంగ్రెస్ నాయకుడిగా పరిగణింపబడ్డారు.ఈ సందర్భంలో విదేశీ ప్రభుతవ ఆగ్రహకోపాలకు లోనయినారు. అందుఫలితంగా 1930లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం ఇతడు వలన జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అయితే సంవత్సర కాలం తరువాత విడుదలయ్యాడు. ఆ తరువాత ఇతడు పూర్తి స్థాయిలో సాహిత్యాన్ని వృత్తిగా చేపట్టాలనుకున్నాడు[3] . 1932లో రవీంద్రనాథ్ ఠాగూరుని శాంతినికేతన్ వద్ద మొదటి సారి కలిశాడు. ఇదే సంవత్సరంలోబంద్యోపాధ్యాయ మొదటి నవల చైతాలి ఘుర్నీ వెలువడింది (వేసవి గాలిదుమారం) [2] దీనిలో ఆయన సృజన ఉత్తమ రచనా లక్షణాలు ఈ నవలలో కనిపిస్తాయి.

1940లో ఇతడు తన కుటుంబాన్ని కలకత్తాలోని బాగ్బజార్‌కు మార్చాడు. 1941లో ఇతడు బారానగర్‌కు మకాం మారాడు. 1942లో బీర్భూం జిల్లా సాహిత్య సదస్సును నిర్వహిస్తూ, కలకత్తా ఫాసిస్ట్-విరుద్ధ రచయితల, కళాకారుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1944లో కాన్పుర్ బెంగాలీ సాహిత్య కాన్ఫరెన్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1947లో ఇతడు ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనాన్ని కలకత్తా ప్రారంభించాడు. బొంబాయిలో జరిగిన ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనం రజతోత్సవానికి అధ్యక్షత వహించాడు. 1948లో కలకత్తా యూనివర్సిటీ ఇతనికి శరత్ స్మారక పతకం ప్రదానం చేసింది[2]. సాహిత్యంలో అకలుషితమైన, సహజమైన గ్రామసీమల సొగసును మునుపెన్నడూ లేని మౌలికతతో చిత్రించడానికి, సజీవమైనదాని కోసం, కొత్తదనం కోసం తహతహలాడే దేశవ్యాప్త ప్రజానీకానికి ఆసొగసును ఇంటింటికీ అందజేయటానికి తారాశంకర్ విస్తృతభూములు, వాని సంప్రదాయాలు, ప్రజల ఇతివృత్తాలను గాఢమైన ప్రేమతో చిత్రించటం ప్రారంభించారు.హసూల్ బకేర్ ఉపకధా , నాగినీ క్న్యార్ కహానీ అనే నవలలో ఆయన ఉపేక్షిత ప్రాంతాలను, నీల సఊందర్యాన్నీ, అడవి పూవులను, నాగరికతా విహీనమైన మానవదేహ సుగంధాన్నీ, నిర్మానుష్య, నిర్జనభూముల సొగసును, ప్రాచీనమైన మతాచారాలను, కొత్తవిధంగా వాస్తవ జీవితానికి తెచ్చారు.

1952లో ఇతడు పశ్చిమ బెంగాల్ శాసనమండలికి నామినేట్ చేయబడ్డాడు. 1952-60ల మధ్య ఇతడు పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తు (శాసన మండలి) సభ్యునిగా కొనసాగాడు. 1955లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇతనికి ఆ రాష్ట్రపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన రవీంద్ర పురస్కారాన్ని అందజేసింది. 1956లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇతడిని వరించింది. 1957లో ఇతడు ఆఫ్రో - ఆసియన్ రచయితల సంఘపు సన్నాహక కమిటీ సభ్యుడిగా సోవియట్ యూనియన్ దేశంలో పర్యటించాడు. తరువాత చైనా ప్రభుత్వం ఆహ్వానంపై భారతీయ రచయితల ప్రతినిధి వర్గ సభ్యుడిగా తాష్కెంట్ పర్యటించాడు[2].

1959లో ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి జగత్తరణి స్వర్ణపతకం పొందాడు. మద్రాసులో జరిగిన అఖిల భారత రచయితల సదస్సుకు అధ్యక్షత వహించాడు. 1960లో పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తులో సభ్యత్వం ముగిసిన తర్వాత రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నామినేట్ చేయబడి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగాడు. 1962లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1963లో శిశిర్‌కుమార్ పురస్కారాన్ని చేజిక్కించుకున్నాడు. 1966లో నాగపూర్‌లో జరిగిన బెంగాలీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. అదే సంవత్సరం భారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠంను గెలుచుకున్నాడు. 1969లో ఇతనికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. 1970లో వంగీయ సాహిత్యపరిషత్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఇతనికి కలకతా విశ్వవిద్యాలయం, జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించాయి. ఇతడు విశ్వభారతి విశ్వవిద్యాలయం, కలకతా విశ్వవిద్యాలయాలలో స్మారకోపన్యాసాలు చేశాడు[2].

ఇతడు 1916వ సంవత్సరంలో ఉమాశశీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతనికి సనత్‌కుమార్ బంద్యోపాధ్యాయ, సరిత్‌కుమార్ బంద్యోపాధ్యాయ అనే ఇద్దరు కుమారులు, గంగ, బులు, బని అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు[2].

ఆయనలోని ఆశ్చర్యకరమైన సర్జనశక్తి 70ఏండ్ల వార్దక్యంలోను తొణికిసలాడింది.ఆయన యత్రంలాగా పనిచేసి పలు రచనలు చేసారు.నాటకకర్తగా కూడా ఆయన విశేష కీర్తినిగాంచారు. అవి అప్పట్లో కలకత్తా నాటకరంగాలలో నిరంతరం ప్రదర్సించబడేవి. ఆయన రచన కవి మూలాధారంగా తీసిన సినిమా బహుప్రజాకర్షణ పొందింది.

అమృత అనే వారపత్రికలో ఆయన వ్రాసిన వ్యక్తి స్వభావచిత్రణలు మానవుని నాగరికత అస్తవ్యస్తతను తెలుపుతూ గీసారు.

బంద్యోపాధ్యాయ తన స్వగృహంలో 1971 సెప్టెంబర్ 14న కన్నుమూసాడు. ఉత్తర కలకత్తాలోని నింతలా శ్మశానవాటికలో ఇతని అంతిమసంస్కారాలు జరిగాయి[2].

అవార్డులు[మార్చు]

1955 - ఆరోగ్య నికేతన్ అనే నవలకు రవీంద్ర పురస్కారం 1956 - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1966 -గణదేవత నవలకు జ్ఞానపీఠ పురస్కారం.[4] 1962 - పద్మశ్రీ పురస్కారం 1969 - పద్మభూషణ్ పురస్కారం[5] 1948 - శరత్ స్మృతి పురస్కారం 1959 - కలకత్తా విశ్వవిద్యాలయంచేజగత్తరణి స్వర్ణపతకం

రచనలు[మార్చు]

ఇతడు అనేక నవలలను, కథలను రచించాడు. ఇతని కథలు బంగశ్రీ, ప్రబాసి పత్రికలలో ఎక్కువగా ప్రచురింపబడ్డాయి.[6]

ఇతని రచనల జాబితా

కవిత్వం[మార్చు]

  • త్రిపాత్ర (1926)

నవలలు[మార్చు]

  • చైతాలి ఘుర్ని (1928)
  • పషన్‌పురి (1933)
  • నీలకంఠ (1933)
  • రాయ్‌కమల్ (1935)
  • ప్రేమ్‌ ఓ ప్రయోజన్ (1936)
  • ఆగన్ (1938)
  • ధాత్రిదేవత (1939)
  • కాళింది (1940)
  • గణదేవత (1943) - మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించాడు.
  • పంచగ్రామ్‌ (1944)
  • మన్వంతర్ (1944)
  • కవి (1944)
  • బింగ్‌షో శతాబ్ది (1945)
  • సాందీపన్ పాఠశాల (1946)
  • ఝర్ ఓ ఝరాపాత (1946)
  • అభిజన్ (1946)
  • ఛోటోదర్ సాందీపన్ పాఠశాల (1948)
  • పాదచిహ్న (1950)
  • ఉత్తరాయణ్ (1950) - ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. మద్దిపట్ల సూరి తెలుగులోనికి అనువదించాడు.
  • హంసులి బ్యాంకర్ ఉపకథ (1951)
  • తమస్ తపస్య (1952)
  • నాగిని కన్యార్ కహిని (1952)
  • ఆరోగ్య నికేతన్ (1953)
  • చంపదంగర్ బవ్ (1954)
  • పంచపుత్తలి (1956)
  • బిచారక్ (1957)
  • సప్తపది (1958)
  • బిపాష (1959)
  • రాధ (1959)
  • మనుషెర్ మాన్ (1959)
  • డాక్ హర్కరా (1959)
  • మహాశ్వేత (1961)
  • యోగభ్రష్ట (1961)
  • నా (1961)
  • నాగరిక్ (1961)
  • నిషిపద్మ (1962)
  • యతిభంగ (1962)
  • కన్నా (1962)
  • కల్‌బాయిశాఖి (1963)
  • ఏక్‌తి చరువై పాఖీ ఓ కలో మేయె (1963)
  • జంగల్‌ఘర్ (1964)
  • మంజరీ ఒపెరా (1964)
  • సంకేత్ (1964)
  • భువన్‌పురేర్ హాత్ (1964)
  • బసంత్ రాగ్ (1964)
  • స్వర్గొ -మర్తొ (1965)
  • బిచిత్ర (1965)
  • గన్నా బేగం (1965)
  • అరణ్యబహ్ని (1966)
  • హీరాపన్నా (1966)
  • మహానగరి (1966)
  • గురుదక్షిణ (1966)
  • షుక్సారి కథ (1967)
  • షక్కర్ బాయి (1967)
  • మోనీ బౌది (1969)
  • ఛాయాపథ్ (1969)
  • కాళ్‌రాత్రి (1970)
  • రూపసి బిహంగిని (1970)
  • అభినేత్రి (1970)
  • ఫరియాద్ (1971)
  • శతాబ్దిర్ మృత్యు (1971)
  • కిష్కింద కాండొ (పిల్లల నవల, 1972)
  • జనపద
  • కీర్తిహతెర్ కర్చ

కథా సంపుటాలు[మార్చు]

  • చలనమొయి (1937)
  • జల్‌సాగర్ (1938) - మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించాడు
  • రాసకేళి (1939)
  • తీన్ శూన్యొ (1942)
  • ప్రతిధ్వని (1943)
  • బెదెని (1943)
  • ఢిల్లీ కా లడ్డు (1943)
  • జాదూకారి (1944)
  • స్థలపద్మ (1944)
  • తెరొషొ పొంచాష్ (1944)
  • ప్రసాద్‌మాల (1945)
  • హరనో శూర్ (1945)
  • ఇమారత్ (1947)
  • రామ్‌ధను (1947)
  • తారాశంకరెర్ శ్రేష్ఠ గల్ప (1947)
  • శ్రీ పంచమి (1948)
  • కామధేను (1949)
  • తారాశంకర్ బంద్యోపాధ్యాయయెర్ శ్రేష్ఠ గల్ప (1950)
  • మాతి (1950)
  • శిలాసన్ (1952)
  • తారాశంకర్ బంద్యోపాధ్యాయయెర్ ప్రియొ గల్పొ (1953)
  • స్వ-నిర్బచితొ గల్పొ (1954)
  • గల్ప-సంచయన్ (1955)
  • బిస్ఫోరణ్ (1955)
  • ఛోటోదర్ శ్రేష్ఠ గల్ప (1956)
  • కాలాంతర్ (1956)
  • బిష్పథర్ (1957)
  • రబిబరెర్ ఆసర్ (1959)
  • ప్రేమెర్ గల్ప (1961)
  • పౌష్ - లక్ష్మి (1961)
  • అలోకభిసర్
  • చిరంతని (1962)
  • ఆక్సిడెంట్ (1962)
  • ఛోటోదర్ భలొ భలొ గల్పొ (1962)
  • తమాషా (1963)
  • గల్పొ పంచషట్ (1963)
  • ఆయెన (1963)
  • చిన్మయి (1964)
  • ఏక్తి ప్రేమెర్ గల్పొ (1965)
  • కిశోర్ సంచయన్ (1966)
  • తపోభంగ
  • దీపర్ ప్రేమ్ (1966)
  • నారి రహస్యమయి (1967)
  • పంచకన్య (1967)
  • శిబనిర్ అదృష్ట (1967)
  • గోబిన్ సింఘెర్ ఘోర (1968)
  • జయ (1968)
  • ఏక్ పష్ల బ్రిష్టి (1969)
  • ఛోటోదర్ శ్రేష్ఠ గల్పొ (1969)
  • మిచిల్ (1969)
  • ఉనిష్ షో ఎకత్తర్ (1971)

నాటకాలు[మార్చు]

  • కాళింది (1942)
  • దుయ్‌పురుష్ (1943)
  • పథెర్ డాక్ (1943)
  • ద్వీపాంతర్ (1945)
  • యుగబిప్లబ్ (1951)
  • కవి (1957)
  • కాళరాత్రి (1957)
  • సంఘట్ (1962)
  • ఆరోగ్య నికేతన్ (1968)

ప్రహసనాలు[మార్చు]

  • చక్‌మకి (1945)

స్వానుభవ చరిత్రలు[మార్చు]

  • అమర్ కలేర్ కథ (1951)
  • బిచిత్రొ స్మృతికహిని (1953)
  • అమర్ సాహిత్య జీబన్, సంపుటం. I (1953)
  • కొయిషొర్ స్మృతి (1956)
  • అమర్ సాహిత్య జీబన్, సంపుటం. II (1962)

యాత్రాచరిత్రలు[మార్చు]

  • మాస్కో - తె - కోయెక్ దిన్ (1959)

వ్యాసాలు[మార్చు]

  • సాహిత్యేర్ సత్య (1961)
  • భరత్‌బర్ష ఓ చిన్ (1963)
  • రబీంద్రనాథ్ ఓ బంగ్లర్ పాళి (1971)

సంకలనాలు[మార్చు]

  • రచనా సంగ్రహ మొదటి భాగం (1959)
  • రచనాబళి 25 భాగాలు
  • గల్పగుచ్ఛ 3 భాగాలు

సినిమా రంగం[మార్చు]

ఇతని రచనల ఆధారంగా బెంగాలీ భాషలో బెదెని, అంతర్‌మహల్, జీవన్ మషాయ్, అగ్రదని, ఆంచల్, గణదేవత, దుయ్ పురుష్, హార్ మానా హార్, బిపాషా, హంసులి బాంకర్ ఉపకథ, సప్తపది, బిచారక్, జల్‌సాగర్, రాయ్‌కమల్, కవి మొదలైన సినిమాలు వెలువడ్డాయి. ఇతడు ఆమ్రపాలి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. గణదేవత, రాయ్‌కమల్ సినిమాలకు పాటలు కూడా రచించాడు.

మూలాలు[మార్చు]

  1. తారాశంకర్ బంద్యోపాధ్యాయ పై తీయబడిన డాక్యుమెంటరీ
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 దేవి, మహాశ్వేతా (1983) [1975]. తారాశంకర్ బంద్యోపాధ్యాయ. భారతీయ సాహిత్య నిర్మాతలు (2nd ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ. pp. 77–79.
  3. సుబోధ్ చంద్ర సేన్‌గుప్తా, అంజలీ బోస్ (సంపాదకులు), (1976/1998), సంసద్ బంగాలీ చరితాభిధాన్ (Biographical dictionary) Vol I, మూస:Bn icon, కోల్‌కాతా: సాహిత్యసంసద్, ISBN 81-85626-65-0, p 195
  4. "జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల అధికారిక జాబితా". Jnanpith Website. Archived from the original on 13 అక్టోబరు 2007. Retrieved 27 మార్చి 2018.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
  6. Sen, Sukumar (1979) [1960]. History of Bengali Literature (3rd ed.). New Delhi: Sahitya Akademi. p. 345. ISBN 81-7201-107-5.
  • 1967 భారతి మాస పత్రిక (6). వ్యాస కర్త శ్రీ. ఎ.కే.ఘోష్

బయటి లింకులు[మార్చు]