దొమ్మేటి సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొమ్మేటి సూర్యనారాయణ సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. ఇతడు "రంగూన్ రౌడీ" నాటకంలో రౌడీ పాత్రను ధరించి ప్రేక్షకులను మెప్పించిన మేటి.

వీరు తూర్పు గోదావరి జిల్లాలోని బోడసకుర్రు గ్రామంలో జన్మించారు. దొమ్మేటి వారి కుటుంబం రంగూన్ వెళ్ళి వ్యాపారంలో ప్రఖ్యాతి గడించారు. సూర్యనారాయణ గారు ఆంధ్ర దేశంలోనే కాకుండా బర్మాలో కూడా తెలుగు నాటకాలను విస్తృతంగా ప్రదర్శించి అఖండమైన ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది.

రంగూన్ రౌడి నాటకపు పతాక సన్నివేశంలో తాను చేసిన హత్యానేరాన్ని తన భార్య నెత్తినేసుకుని ఉరిశిక్ష అనుభవించే సందర్భంలో రౌడీ పాత్ర పడే పశ్చాత్తాప సన్నివేశాన్ని ఎంతో హృదయ విదారకంగా, ఉదాత్తంగా నటించేవారు. చివరకు తాను చేసిన పాపానికి నిష్కృతి లేదని రొమ్ములు బాదుకుని, రక్తం కక్కుకుని చనిపోయే ఘట్టం అతి సమర్ధవంతంగా పోషించేవారు.

తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించి కొన్ని సరస్వతీ టాకీసు వారు నిర్మించిన ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో భీమునిగా ధరించిన పాత్ర మరువలేనిది. ఆ తర్వాత కనకతార (1937) చిత్రంలో ధరించిన క్రూరసేనుడి పాత్ర చాలా విశిష్టమైనది. ఆనాడు అలాంటి తామస పాత్రలు ధరించడంలో వేమూరి గగ్గయ్య గారితో సమవుజ్జీగా కీర్తినార్జించారు.

మూలాలు[మార్చు]

  • దొమ్మేటి సూర్యనారాయణ, నటరత్నాలు, ద్వితీయ ముద్రణ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, 2002, పేజీలు: 280-1.