Jump to content

పొన్నెగంటి తెలగన్న

వికీపీడియా నుండి
పొన్నెగంటి తెలగన్న
జననంసా.శ.1520
మరణంసా.శ.1600
నివాస ప్రాంతంపొటం చెరువు లేదా పొట్ల చెరువు, మెదక్ జిల్లా.
ప్రసిద్ధితొలి అచ్చ తెలుగు కావ్య రచయిత

పొన్నెగంటి తెలగన్న తొలి అచ్చతెలుగు కావ్యం రాసిన విశిష్టమైన కవి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

పొన్నెగంటి తెలగన్న కాలం సా.శ. 1520-1600గా పరిశోధకులు నిర్ధారించారు. మెదక్ జిల్లాలో ఉన్న పొటం చెరువు లేదా పొట్లచెరువు అనే గ్రామం పొన్నెగంటి తెలగన్న నివాసం. ఆయన మేలిరచన యయాతి చరిత్రను గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా (మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు. తెలుగు+అన్నగా ఉన్న పేరు వాడుకలో తెలగన్నగా మారిపోయిందని విమర్శకులు ఎం. రంగకృష్ణమాచార్యులు భావించారు.

వ్యక్తిత్వం

[మార్చు]

పొన్నెగంటి తెలగన్న సాంప్రదాయకుడైనా ఒక మహమ్మదీయ ప్రభువు అమీన్ ఖాన్ కు కావ్యాన్ని అంకితం చేయడం ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. భూపతి కనుక అతనిది విష్ణుమూర్తి అంశంగా భావించి, అతని అంతఃపుర కాంతలను హైందవ స్త్రీ దేవతా మూర్తులతో పోలుస్తూ పద్యాలు రచన చేశారు. హైందవ దేవీదేవతామూర్తులు అమీన్ ఖానుని స్థిరంగా రక్షించాలని ఆశీర్వదించారు. ఇవన్నీ అతని వ్యక్తిత్వంలోని వైవిధ్యాన్ని పట్టిచూపుతున్నాయి.[2]

రచనలు-విశిష్టత

[మార్చు]

యయాతి చరిత్రము అరుదైన అచ్చ తెలుగు కావ్యాల కోవలో తొలికావ్యం.[3] తెలగన్నకు ప్రాచుర్యాన్ని తీసుకువచ్చింది. తెలుగు భాషలో పదాలు సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలుగా ఆరు రకాలుగా విభజించారు. సంస్కృత సమాలు (నేరుగా సంస్కృతంలోని పదాలకు చివర తెలుగు విభక్తిని కలపగా వచ్చినవి) తప్ప మిగిలినవి అచ్చతెలుగుగా లెక్కిస్తారు. అచ్చతెలుగుకు సంస్కృత సమాలు కలిస్తే మనది ఆంధ్ర భాష లేదా తెలుగు భాష.

సంస్కృత సమపదం ఒక్కటి కూడా రాకుండా పద్యాన్ని రచించడం కొంచెం కష్టమైన పనే. తెలుగు (ఆంధ్ర) భాషలో వందల పద్యాలతో రాస్తూ మధ్యలో ఎక్కడయినా ఒకటి అచ్చతెలుగు పద్యం రాస్తే, అది పాఠకునికీ, శ్రోతకీ ఒక విశ్రాంతిగా ఉంటుంది. వైవిధ్యం వల్ల మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది. ఐతే మొత్తం పుస్తకమంతా అచ్చతెలుగులోనే చెప్తే, ఇంకెంత సంబరపడతాడు! దాని చందం తెలిసినవాడు ఎంతగా ఆశ్చర్యపడతాడు! శ్రమను గుర్తించి ఎంతగా కొనియాడతాడు! ఊహించలేం. ఈ అభిప్రాయంతోనే తెలగన్న అచ్చతెలుగు కావ్యాన్ని రాశానన్నాడు అవతారిక పద్యంలో. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు.[4]

ప్రఖ్యాతి

[మార్చు]

పొన్నికంటి తెలగనా మొట్టమొదటి తెలుగు రచయత

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2021-08-29). "మొదటి అచ్చ తెలుగు కావ్యం మనదే!". www.ntnews.com. Retrieved 2025-03-02.
  2. పొన్నెగంటి తెలగన్న యయాతి చరిత్రము అవతారిక
  3. "మొదటి అచ్చ తెలుగు కావ్యం మనదే!-Namasthe Telangana". web.archive.org. 2025-03-02. Archived from the original on 2025-03-02. Retrieved 2025-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. బేతవోలు రామబ్రహ్మం రాసిన పద్యకవితా పరిచయం-1లోని పొన్నెగంటి తెలగన్న వ్యాసం

ఇవి కూడా చూడండి

[మార్చు]