బకర్ అలీ మిర్జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బకర్ అలీ మిర్జా

పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం సికింద్రాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 7, 1900
హైదరాబాదు
మరణం జనవరి 1, 1973
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
జీవిత భాగస్వామి ప్రభావతీ దాస్ గుప్తా

బకర్ అలీ మిర్జా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 3వ, 4వ లోక్‌సభ సభ్యుడు.[1]

బకర్ అలీ మిర్జా, 1900, మార్చి 7న హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి డాక్టర్ సఫ్దర్ అలీ మిర్జా, నిజాం సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో టర్కీ నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. బకర్ అలీ అక్క సుఘ్రా హుమాయున్ మిర్జా ప్రముఖ ఉర్దూ రచయిత్రి.

బకర్ అలీ విద్యాభ్యాసం హైదరాబాదులోని నిజాం కళాశాలలో, మద్రాసు క్రైస్తవ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధితమైన సెయింట్ కేథరిన్స్ కళాశాలలో సాగింది. ఆక్‌ఫర్డ్‌లో చదివే రోజుల్లోనే, స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడై క్రియాశీలకంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. ఆక్స్‌ఫర్డ్ మజ్లిస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆక్స్‌ఫర్డ్ నుండి వెలువడిన భారత్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 1926లో ప్రాగ్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యార్ధి సదస్సుకు సదస్యుడిగా వెళ్ళాడు. 1927లో బ్రసెల్స్‌లో జరిగిన లీగ్ ఎగెయిన్స్ట్ ఇంపీరియలిజం (సామ్రాజ్యావాద వ్యతిరేక సదస్సు) కు సదస్యుడిగా హాజరయ్యాడు.[1] బకర్ అలీ ఆక్స్‌ఫర్డ్‌లో అటవీశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అప్పటికే క్రియాశీలక రాజకీయ విద్యార్ధిగా బ్రిటీషు ప్రభుత్వం దృష్టిలో పడిన బకర్ అలీ, లీగ్ ఎగెయిన్స్ట్ ఇంపీరియలిజం యొక్క బ్రిటీషు కమిటీకి హాజరయ్యాడని తెలుసుకొని, బకర్ అలీ చదువు పూర్తయిన తర్వాత భారతదేశం తిరిగివెళితే అక్కడ ఇండియన్ ఫారెస్టు సర్వీసులో కానీ, హైదరాబాదు ప్రభుత్వంలో కానీ ఉద్యోగం రాకుండా చేసేందుకు, సంబంధిత వర్గాలకు ఈయన సరైన అభ్యర్థి కాదని ముందస్తుగా హెచ్చరిస్తూ సందేశాలను పంపింది.[2]

భారతదేశం తిరిగివచ్చిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాదు నిజాం ప్రభ్యుత్వంలో సహాయక అటవీ సంరక్షకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1929లో అఖిల భారత కాంగ్రేసు కమిటీ యొక్క కార్మిక పరిశోధనా విభాగంలో చేరాడు. 1929 నుండి 1935 వరకు బెంగాల్ జౌళి కార్మికసంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1930లో స్వాతంత్ర్యయోద్యమంలో జైలుకెళ్లాడు. ఉస్మాన్‌షాహీ మిల్లులకు, సింగరేణి కాలరీస్‌కు కార్మికాధికారిగా పనిచేశాడు. పార్లమెంటు సభ్యుడిగా, బకర్ అలీ, ఇస్తాంబుల్‌లో జరిగిన వివిధ దేశాల పార్లమెంటుల సమాఖ్యా సమావేశంలో భారతదేశపు ప్రతినిధిగా వెళ్ళాడు. రష్యా, మంగోలియాలో పర్యటించిన పార్లమెంటు బృందంలో ఉన్నాడు. గయానా దేశంలో జరిగిన ఎన్నికలను పర్యవేక్షించి, నివేదిక అందించేందుకు వెళ్ళిన కామన్‌వెల్త్ పరిశీలక బృందంలో సభ్యుడిగా గయానాను పర్యటించాడు. ఆఫ్ఘానిస్తాన్ ప్రభ్యుత్వానికి సాహితీ సలహాదారుగా పనిచేశాడు.[1][3]

1940లో డాక్టర్ ప్రభావతీ దాస్ గుప్తాను వివాహం చేసుకున్నాడు. ఈమె ఎం.ఏ కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేటు ఫ్రాంక్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలోనూ చేసింది.[1] వీరికి సంతానం లేదు. బకర్ అలీ మిర్జా 1973, జనవరి 1న ఊపిరితిత్తుల కాన్సర్ తో మరణించాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "4th Lok Sabha - Member Profile". Lok Sabha. Retrieved 15 December 2017.
  2. Brückenhaus, Daniel (2017). Policing Transnational Protest: Liberal Imperialism and the Surveillance of Anticolonialists in Europe, 1905-1945. Oxford University Press. p. 148. ISBN 9780190660017. Retrieved 16 December 2017.
  3. 3.0 3.1 Lok Sabha Debates Seventh Edition (PDF). New Delhi: Loksabha Secretariat. p. 28. Archived from the original (PDF) on 27 ఆగస్టు 2019. Retrieved 27 August 2019.
  4. Fuechtner, Veronika (Nov 14, 2017). A Global History of Sexual Science, 1880–1960. Univ of California Press. p. 415. ISBN 9780520293373. Retrieved 16 December 2017.