మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్
| కర్నల్ మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్ వీరచక్ర | |
|---|---|
మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్ | |
| మారుపేరు | కర్నల్ బసప్ప |
| మరణం | ఏప్రిల్ 4, 2018 బెంగళూరు |
| రాజభక్తి | |
| సేవలు/శాఖ | |
| ర్యాంకు | |
| సర్వీసు సంఖ్య | IC-38662 |
| యూనిట్ | 2 RAJ RIF |
| పోరాటాలు / యుద్ధాలు | కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ |
| పురస్కారాలు | |
కర్నల్ మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్ భారతీయ సైసిక దళంలో సైనికుడు. అతడు రాజపుటాన రైఫిల్స్ 2వ బెటాలియన్ లో కర్నల్ గా కార్గిల్ యుద్ధములో పాల్గొన్నాడు.[1] కార్గిల్ యుద్ధంలో భాగమైన "ఆపరేషన్ విజయ్"కు నేతృత్వం వహించాడు. అతనికి 2009 జూన్ లో "వీరచక్ర" పురస్కారం లభించింది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]బసప్ప కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ సైనిక పాఠశాలలో చదివాడు. 1976లో నేషనల్ డెఫెన్స్ అకాడమీలో చేరాడు. జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీయే) లో బీఎస్సీ పూర్తిచేసి, సైన్యంలో చేరాడు. 1980లో అరుణాచల్ ప్రదేశ్ లో ఉద్యోగంలో చేరాడు. అరుణాచల్ప్రదేశ్లో తొలి పోస్టింగ్ను సమర్థంగా నిర్వహించాడు. జమ్మూకశ్మీర్లో సరిహద్దుల వద్ద 1986, 1989-90, 1994-96, 1999లో పనిచేశాడు. మిలటరీ శిక్షణ సంస్థల్లో ఫేకల్టీగా సేవలందించాడు. కార్గిల్ యుద్ధం సమయంలో 2-రాజ్పుటాన రైఫిల్స్ దళాలకు నేతృత్వం వహించాడు. ‘ఆపరేషన్ విజయ్’తో ఆయన పేరు నేల నలుచెరుగులా పాకింది. పదవీ విరమణ తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. తన కుటుంబం నిర్వహించే మాగోడ్ లాసెర్స్ సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు.[3]
కార్గిల్ యుద్ధంలో
[మార్చు]జమ్మూ కశ్మీర్లో వ్యూహాత్మక కార్గిల్ను పాక్ సేనలు 1999లో ఆక్రమించినప్పుడు.. కార్గిల్కు వెళ్లే దారుల్లో మోర్టార్ షెల్స్తో శత్రు సేనలు మన సైన్యాన్ని నిలువరిస్తున్న తరుణంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కు నేతృత్వం వహించిన ధీరుడు బసప్ప రవీంద్రనాథ్. అద్భుతమైన వ్యూహరచనతో శత్రు సేనల్ని తరిమి కొట్టారు.
టోలోలింగ్ పాయింట్ కార్గిల్ యుద్ధంలో అత్యంత కీలకమైనది. శత్రుమూకల అధీనంలో ఉన్న ఈ పాయింట్ను తిరిగి చేజిక్కించుకోవడంలో రవీంద్రనాథ్ కీలకపాత్ర పోషించాడు. ఈ పోరాటం భారత సైన్యం చేసిన అత్యంత కఠినమైనది. ఈ యుద్ధం "బ్యాటిల్ ఆఫ్ టోలోలింగ్"గా ప్రసిద్ధి చెందింది. శతృ సైనికులు ఈ పాయింట్ పై కాపుకాసి భారత సైనికులకు ఆహారం అందకుండా కాపలా కాస్తున్నారు. వారు పైన ఉండటంతో క్రింది నుండి పైకి వచ్చిన భారత సైనికులపై కాల్పులు జరప సాగారు. కర్నల్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని రాజ్పుటాన రైఫిల్స్లో ఉన్న 90 మంది సైనికులు మూడు బృందాలుగా విడిపోయి మూడు వైపుల నుంచి శత్రుసేనలను ముట్టడించారు. ముట్టడి ప్రారంభమయ్యే ముందు కర్నల్ రవీంద్రనాథ్ వారితో.. ‘‘మీరు కోరినవి నేను ఇచ్చాను. ఇప్పుడు నేను కోరుతున్నది మీరు ఇవ్వాలి’’ అన్నాడు. ఆయన మాటలకనుగుణంగా సైనికులు పోరాడి మర్నాడు తెల్లవారుజామున 4.10 గంటలకల్లా టోలోలింగ్ పాయింట్ను దక్కించుకున్నారు. ఆ పాయింట్పై అదుపు లభించాక భారత సైన్యానికి మిగతా పాయింట్లపైనా గెలుపు జెండా ఎగరేయడం సులువైంది. శత్రు సైనికులు ఎల్వోసీకి ఉత్తరంగా పలాయనం చిత్తగించి ప్రాణాలు కాపాడుకున్నారు.[2][3]
అస్తమయం
[మార్చు]అతడు బెంగళూరులో ఏప్రిల్ 8, 2018 నాడు అతని నివాసం సమీపంలో వాహ్యాళికి వెళ్ళి గుండెపోటుతో మరణించాడు. అతడు మిలిటరీ ట్రైనింగ్ పాఠశాలలో శిక్షకునిగా పనిచేస్తూ 1986లో కాశ్మీర్ కు పంపబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Kargil war hero dies on way to jog".
- 1 2 "MOGOD BASAPPA RAVINDRANATH | Gallantry Awards". gallantryawards.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-04-11.
- 1 2 "కార్గిల్ హీరో కర్నల్ బసప్ప కన్నుమూత". www.andhrajyothy.com. the original నుండి 2018-04-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-04-11.