రక్తమోక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సా.శ..పూ 800 ప్రాంతంలో రక్తమోక్షణ వైద్య విధానం ఉపయోగించిన శుశ్రుతుడు చిత్రం

రక్తమోక్షణ వైద్య విధానం సా.శ..పూ 800 ప్రాంతంలో శుశ్రుతుడు ఉపయోగించిన వైద్య విధానం. ఈ రోజున ప్రపంచ దేశాలలో అత్యంత గౌరవాన్ని అందుకుంటోంది. శరీరంలో ఏదైనా భాగంలో రక్తం గడ్డకట్టుకుపోవడం, రక్తనాళాలు మూసుకు పోవడం వలన రక్త ప్రసరణ నిలిచిపోయే వంటి రుగ్మతలు సంభవించినపుడు దీనికి మించిన వైద్య చికిత్స లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జలగతో చికిత్స[మార్చు]

"జలగ" అనగానే రక్తం పీల్చే అపాయకరమైన ప్రాణిగా స్ఫురించినప్పటికీ, ఆధునిక వైద్యరంగంలో ఇది కీలక పాత్రను పోషిస్తున్నది. విదేశీ వైద్య నిపుణులు జలగలను "ప్రాణంతో ఉన్న ఔషధాలు" (లివింగ్ డ్రగ్) గా పిలుస్తారు. అనేక దీర్ఘ వ్యాధులకు, "పిత్త దోషము" తో బయల్దేరిన పలు వ్యాధులకు "రక్తమును పీల్చే జలగతో చికిత్స" ఉందని సుశ్రుతుని వైద్య గ్రంథాలు తెలిపాయి. శరీరానికి గాయం చేయడమే కాకుండా, ఆ గాయం నుంచి గంటల తరబడి రక్తం స్రవించే విధంగా చేయగలిగే ప్రత్యేక గుణం కలిగి ఉండటం వల్లనే జలగలకు ఇంతటి ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

జలగ నుండి వెలువడే ఒక రకమైన ద్రవపదార్థం గాయానికి చుట్టూ ఉన్న శరీరం పైన మత్తు మందులా పనిచేసి, రక్తం గడ్డ కట్టకుండా చేయటమే కాకుండా, రక్తనాళాల రంధ్రాలను పెద్దవిగా చేసే గుణాన్ని కూడా కలిగి ఉంది. ప్రాచీన కాలంలో అతి మోటుగా శస్త్రచికిత్సలు చేస్తున్నఫ్ఫుడు సత్ఫలితాలు రాని సందర్భాలు అనేకం కాగా, శరీరంలో రక్త ప్రసరణను పునరుద్ధరణ చేసేందుకు జలగలతో రక్తం పీల్చు విధానాన్ని కనుగొన్నారు. జలగలను వైద్యపరమైన అవసరాలకు ఉపయోగించడం ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రవేత్త సుశ్రుతుడి నుంచే ప్రారంభమైనది. అనేక ప్రయోగాల సారాంశాన్ని కూడా తన గ్రంథంలో వివరించాడు.

శరీరంలో ఏదైనా భాగంలో రక్తప్రసరణ లేక నల్లగా మారినపుడు, చెడు రక్తంతో నిండిపోయి ఆ భాగం ఉబ్బినపుడు ఆప్రాంతంలో సూదితో సన్నని రంధ్రాన్ని చేసి అక్కడ జలగను ఉంచితే చాలునని, ఒక్కొక్క జలగ 20 నిముషాల నుంచి గంట సమయంలో చెంచాడు రక్తాన్ని (15 నుండి 30 మిల్లీలీటర్లు) పీల్చిన తర్వాత శరీరాన్ని వదిలిపెడుతుందనీ, అయితే జలగ చేసిన గాయం నుంచి కనీసం ఆరుగంటల సేపు నెమ్మది స్థాయిలో రక్తస్రావం జరుగుతూనే ఉంటుందనీ వివరించాడు.

ఈ తరహా వైద్య ప్రక్రియకు వినియోగించే జలగను ఆకలితో అలమటించేలా చేయాలని, అలా చేయడం వలన అవి ఎక్కువ వేగంగా రక్తాన్ని పీల్చేందుకు అవకాశం ఉంటుందనీ సూచించాడు. మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉండే బోదకాలు వ్యాధికి కూడా గతంలో ఆయుర్వేద వైద్యులు ఈ జలగ చికిత్సనే చేసేవారు. ప్రకృతినే ఆధారం చేసుకొని తర్వాతనే వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టిన సుశ్రుతుని వైద్యగ్రంథం వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆధునిక కాలంలో వైద్య చికిత్సలకు స్ఫూర్తిని అందిస్తోంది. రక్తమోక్షణ లోని "జల్లోవ్క అపచరణ్" అనే అధ్యాయంలో విషరహిత జలగలను గూర్చి వివరణ ఉంది. అవి 10 నుంచి 12 సెం.మీ పొడవు కలిగి ఉంటాయని తెలుస్తున్నది.

ఆధునిక కాలంలో[మార్చు]

ఈ "జలగ వైద్యం" మూడు శతాబ్దాల క్రితం వరకు మన దేశంలో ఆయుర్వేద వైద్యులు వాడేవారు. శరీరంలోని వివిధరకాల రుగ్మతలను తొలగించేందుకు కూడా ఈ వైద్యాన్ని ఉపయోగించే వారు. ఆధునిక వైద్యవిధానాలు ఉధృతంగా అందుబాటులోనికి రావడంతో దీనికి ప్రాధాన్యత తగ్గింది. "మైక్రో వ్యాస్కులర్ సర్జరీ" తరహా సూక్ష్మ స్థాయి ఆపరేషన్లలో ప్రతి రక్తనాళాన్ని, కణజాలాన్ని కలపడం వంటి అవసరాలు ఏర్పడడంతో మన ప్రాచీన వైద్య చికిత్స తిరిగి వెలుగులోనికి వచ్చింది.

19 వ శతాబ్దంలోనే దేశదేశాల సంప్రదాయ వైద్యులు జలగలను నొప్పిహారకాలుగా వినియోగించడం ప్రారంభించారు. జలగవైద్యం ద్వారా ఎంతో మంది రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడటంతో వైద్యరంగంలో వీటిని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చుననే అంశం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆసుపత్రి (ఎర్రగడ్డ) కు చెందిన రీసెర్చ్ ఆఫీసరు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి.ఎల్.ఎస్.శాస్త్రి జలగవైద్యమును గూర్చి అనేక పరిశోధనలు చేశారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]