వక్కంతం సూర్యనారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వక్కంతం సూర్యనారాయణ రావు
జననం1942
వృత్తిరచయిత
పిల్లలువక్కంతం వంశీ
తల్లిదండ్రులు
  • వరదయ్య (తండ్రి)

వక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ తెలుగు రచయిత. ఇతడు అనేక కథలు, నవలలు, ఆధ్యాత్మిక రచనలు, అనువాదాలు రచించాడు. ఇతని కుమారుడు వక్కంతం వంశీ తెలుగు సినిమా రచయితగా రాణించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, అరికెల గ్రామంలో 1942లో జన్మించాడు. ఇతనికి బాల్యం నుండే దేశభక్తి, సామాజిక స్పృహల పట్ల అవగాహన ఉంది. ఇతడు పాఠశాల ఫైనల్ వరకు చదువుకున్నాడు. ఇతడు బాల్యంలో తన మొదటి కథను పిల్లల కోసం వ్రాసి తన తండ్రి వరదయ్యకు చూపించాడు. అది చదివిన వరదయ్య తన కుమారుని ఎంతగానో ప్రోత్సహించాడు. రచనలు చేయడానికన్నా ముందు అన్ని రకాల పుస్తకాలను చదవమని సలహా యిచ్చాడు. అతడు తను కుమారునికి టెంపోరావు డిటెక్టివ్‌ నవల "ఇతన్ని నమ్మకండి"ను బహూకరించాడు. తండ్రి సలహా ప్రకారం ఇతడు తన బాల్యంలో అన్ని రకాల పుస్తకలను విరివిగా చదివాడు. ఇతడు ప్రముఖ డిటెక్టివ్ రచయిత "టెంపోరావు"కు అత్యంత సన్నిహితుడయ్యాడు. టెంపోరావు ఇతనికి రచనలలో మెళకువలను నేర్పించాడు. ఇతడి రచనలను ఎంతగానో ప్రోత్సహించాడు. టెంపోరావు ఇతడిని తన రచనా వారసుడిగా ప్రకటించాడు.[1]

ఇతడు తన దృష్టిని సమాజంలోని సమస్యల పట్ల ముఖ్యంగా స్త్రీల మానసిక, శారీరక సమస్యలు, వారికి జరుగుతున్న అన్యాయాలపై సారించాడు. ఇతని మొదటి నవల "అబల ఆంతర్యం" 1966లో ప్రకటించబడింది. ఈ నవలను మద్రాసులోని ఒక పబ్లిషర్ ప్రకటించాడు. ఈ నవలకు ప్రచురణ కర్త ఏ పారితోషికం ఇవ్వలేదు. అసలు ఈ నవల ప్రచురిస్తున్నట్టు కూడా తెలియజేయ లేదు. ఇతనికి ఒక ప్రతి కూడా పంపలేదు. ఇతడు ఎంతో శ్రమకోర్చి మద్రాసు వెళ్లి ఈ నవల కాపీ ఒకటి కొన్నాడు. రచయితగా ఇది ఇతని తొలి అనుభవం. అప్పటి నుండి ఇతడు స్త్రీ సమస్యల పట్ల అనేక నవలలు, కథలు వ్రాశాడు. ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ ఇతని రచనల పట్ల ఆకర్షితుడై ఇతడిని "మగ రచయిత్రి" అని కొనియాడాడు.

1980 నుండి ఇతడు పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఇతడు తన డిటెక్టివ్ నవలలను, కథలను వి.ఎస్.రావు అనే పేరుతోను, ఆధ్యాత్మిక, సాంఘిక రచనలను తన పూర్తి పేరు వక్కంతం సూర్యనారాయణరావు అనే పేరుతోను ప్రకటించాడు. ఇతడు ఇంకా 'బాటసారి', 'కౌండిన్య ', 'సూర్యాత్రేయ ', 'చిత్రభాను ' అనే కలంపేర్లతో రచనలు చేశాడు.

ఇతడు 84 కు పైగా క్రైమ్‌, డిటెక్టివ్ నవలలను, స్త్రీవాద నవలలను, నాటకాలను, ఆధ్యాత్మిక రచనలను చేశాడు.ఇంకా ఇతడు వందల కొద్దీ భక్తి పాటలను వ్రాసి క్యాసెట్లుగా విడుదల చేశాడు.

ఇతడు టెంపో అనే డిటెక్టివ్ పాత్రను సృష్టించి సుమారు 12 నవలలలో ఆ పాత్రను హీరోగా చేశాడు. ఈ పాత్రకు తన అభిమాన రచయిత టెంపోరావు ప్రేరణ. టెంపోరావు మరణించిన తర్వాత ఈ టెంపో పాత్ర సృష్టించబడింది. ఈ పాత్ర తెలుగు పాఠకులలో ఎంత ప్రాచుర్యం పొందింది అంటే ఆ పాత్ర సజీవమైనదని ఎందరో నమ్మారు.

ఇతడు తిరుమల తిరుపతి దేస్థానం వారి "దాస సాహిత్య ప్రాజెక్టు"లో అనువాదకునిగా పనిచేశాడు. ఈ సమయంలో ఇతడు చాలా ఆధ్యాత్మిక రచనలను కన్నడ భాష నుండి తెలుగులోనికి అనువదించాడు. వాటిని తి.తి.దే. వారు ప్రచురించారు.

రచనలు[మార్చు]

===ఆధ్యాత్మికం,తాత్త్విక రచనలు===
  1. నవగ్రహ పురాణం
  2. భగవాన్ పరశురాం
  3. శ్రీ శివరాత్రి మహాత్మ్యం
  4. అష్ట దిక్పాలక వైభవం
  5. శని చరితామృతం
  6. ఆత్మ సందర్శనం
  7. కర్ణాటక హరిదాస పంచకం
  8. సూక్ష్మంలో మోక్షం

నాటకాలు/నాటికలు

  1. న్యాయదుందుభి
  2. శ్రీనివాస కళ్యాణం
  3. యత్ర నార్యస్తు బాధ్యంతే
  4. గౌరీ కళ్యాణం
  5. పరమ చోర చక్ర
  6. చంపి చూడండి
  7. అమ్మకు పాలు పట్టండి
  8. దిష్టి బొమ్మలు
  9. సంభవామి గృహే గృహే (రేడియో నాటకం)
  10. రామబాణం (రేడియో నాటకం)

నవలలు

సస్పెన్స్ థ్రిల్లర్స్

  1. విచిత్ర వధ
  2. వజ్రాయుధం
  3. ఇంటర్వ్యూహం
  4. తిరుగులేని మందు
  5. డబ్బు కోసం దారుణం
  6. మృత్యు భస్మం
  7. బూతు బొమ్మ
  8. అడ్డం తిరగని కథ
  9. చదివింపు
  10. బకాసుర వధ
  11. బలిపీఠం

డిటెక్టివ్ నవలలు

  1. అడకత్తెర
  2. నీలినీడలు
  3. తోలుబొమ్మ
  4. జలసమాధి
  5. ఫాలనేత్రం
  6. వజ్రకిరీటం
  7. పాముపగ
  8. బీజాక్షరాలు
  9. రుద్రసింహం
  10. అగ్నినేత్రాలు
  11. అన్వేషణ

సాంఘిక నవలలు

  1. అబల ఆంతర్యం
  2. సంభవామి గృహేగృహే
  3. మదర్ ఇండియా
  4. మాయ
  5. మృత్యుంజయుడు
  6. బాలభారతం
  7. పెళ్ళాడి ప్రేమించు
  8. వెన్నెల బొమ్మ

బాలసాహిత్యం

  1. శ్రీనివాస కళ్యాణం
  2. ఏకలవ్య
  3. సత్యహరిశ్చంద్ర

తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురణలు

  1. పాండురంగోపనిషత్
  2. కేశవాది రూపాలు
  3. పురంధరదాస కీర్తనలు
  4. శ్రీనివాస సంకీర్తనలు
  5. దాస తత్త్వప్రకాశిక
  6. పురంధర దాస
  7. ప్రసన్న వెంకటదాస
  8. గోపాలదాస
  9. మహీపతిదాస

పురస్కారాలు[మార్చు]

ఇతడు అనేక పురస్కారాలను, బహుమతులను అందుకున్నాడు. ఇతని మోడల్ కథ హిందీ అనువాదం భారతీయ విశిష్ట కహానియాఁ వార్షిక సంచికలో ప్రచురింపబడింది. ఇతని రచనలపై ఒక విద్యార్థి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించుకున్నాడు. ఇతని స్త్రీ ప్రధాన సాంఘిక నాటకం న్యాయదుందుభి మనస్విని - ఆత్రేయ లిటరరీ అవార్డును గెలుచుకుంది. అదే నాటకానికి కుప్పం రెడ్డమ్మ సాహిత్య పురస్కారం లభించింది. యత్రనార్యస్తు బాధ్యంతే నాటకానికి సోమేశ్వర సాహిత్య పురస్కరం లభించింది. గౌరీ కళ్యాణం నాటకానికి ఎన్.టి.ఆర్. విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డ్ లభించింది. చతుర నవలల పోటీలో సంభవామి గృహే గృహే నవలకు మూడవ బహుమతి లభించింది. ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు నిర్వహించిన నవలల పోటీలో ఇతడు వ్రాసిన మదర్ ఇండియా నవలకు రెండవ బహుమతి లభించింది. ఈ నవల నవ్యవీక్లీలో ధారావాహికగా ప్రచురింపబడింది.

మూలాలు[మార్చు]

  1. "వక్కంతం సూర్యనారాయణరావు జీవితచరిత్ర". Archived from the original on 2018-04-26. Retrieved 2018-04-04.