చిత్తూరు జిల్లా
?చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°12′00″N 79°07′00″E / 13.2000°N 79.1167°ECoordinates: 13°12′00″N 79°07′00″E / 13.2000°N 79.1167°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 15,152 కి.మీ² (5,850 చ.మై) |
ముఖ్య పట్టణం | చిత్తూరు |
ప్రాంతం | రాయలసీమ |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
41,70,468 (2011 నాటికి) • 275/కి.మీ² (712/చ.మై) • 2083505 • 2086963 • 67.46 (2001) • 78.29 • 56.48 |
చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం, జిల్లాకేంద్రం. చిత్తూరు జిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడుకు చెందిన జిల్లాలు ఆర్కాట్, ధర్మపురి, కర్ణాటకకు చెందిన కోలార్ జిల్లా, తూర్పున తమిళనాడుకు చెందిన అణ్ణా, చెంగై జిల్లాలు, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల మధ్య ఉంది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం.తిరుపతి, కాణిపాకం, శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది ధాన్యములు, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు, గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. Map
జిల్లా చరిత్ర[మార్చు]
చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్ 1 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ డిసెంబరు 6, 1782లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.
చిత్తూరు జిల్లా ప్రముఖులు[మార్చు]
ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో జన్మించాడు. విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా వాసి. మా తెలుగు తల్లికి గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్సభ స్పీకర్, బీహార్ మాజీ గవర్నర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలోని, నారావారి పల్లెకు చెందినవారు. ఆయన విద్యాభ్యాసం తిరుపతిలో చేశారు.
చారిత్రిక/పర్యాటక ప్రదేశాలు[మార్చు]
చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాలగా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.[1] కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. చిత్తూరు జిల్లా - పుణ్యక్షేత్రాల ఖిల్లాగా ప్రశస్తి పొందింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీ కాళహస్తి, కాణిపాకం - ఈ జిల్లాలోనే ఉన్నాయి.
భౌగోళిక స్వరూపం[మార్చు]
జిల్లాకు వాయవ్యాన అనంతపురం జిల్లా, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, ఈశాన్యమున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దక్షిణమున తమిళనాడు రాష్ట్రము, నైఋతి దిక్కున కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రములో బాగా వెనుకబడి ఉన్న ప్రాంతములలో ఈ జిల్లా ఒకటి. చిత్తూరు పట్టణం చుట్టుపక్కల మామిడి తోటలు, చింత తోపులు విస్తారముగా ఉన్నాయి. జిల్లా, పశుసంపదకు కూడా ప్రసిద్ధి చెందినది.
నదులు[మార్చు]
ఆర్ధిక స్థితిగతులు[మార్చు]
పరిశ్రమలు[మార్చు]
చిత్తూరు జిల్లాలో మ్యాంగో పల్ప్ పరిశ్రమ ప్రధానంగా ఉంది. చిత్తూరు జిల్లా వేరుశనగ, మామిడి, చెఱకు పంటలు విశేషంగా పండుతాయి, గ్రానైట్ పరిశ్రమ వేళ్ళూనుకుంది. రేణిగుంటలో ఎలాయ్ కాస్టింగ్, ఎస్వి షుగర్స్, అశ్వినీ ఫార్మసీ, సెమీ గవర్నమెంట్ మింటు ఫ్యాక్టరీ ఉన్నాయి. చిత్తూరులో విజయా, గోపిక మిల్క్ డైరీ, శ్రీనివాస డిస్టిల్లరీస్, కోపరేటివ్ షుగర్స్, న్యూట్రిన్ చాక్ లెట్ కంపనీ ఉన్నాయి. చిత్తూరు జిల్లా 21148 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అమరరాజా బ్యాటరీ కంపనీ ఉంది. చిత్తూరు జిల్లాలో 101 కంపనీలు ఉన్నాయి. బంగారుపాలెంలో ఫుడ్ ప్రొసెసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు జరుగుతుంది. నాలుగు సహకార చక్కెర మిల్లులు, రెండు యాజమాన్య చక్కెర మిల్లులు ఉన్నాయి. లాంకో ఇండస్ట్రీలు, స్పాంజ్ ఐరన్, జైన్ ఇరిగేషన్, ఐదు డైరీలు ఉన్నాయి. రహదారి, రైలు, విమాన రవాణా సదుపాయాలు ఉన్న కారణంగా చిత్తూరు జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉంది.
శ్రీసిటీ పరిశ్రమలకు చిరునామా
రాష్ఠ్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పరిగణిస్తున్న సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి పరచి, అక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించడంతోపాటు, ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలన్న ధ్యేయంతో, 2006లో శ్రీసిటీ పేరుతో ఇక్కడ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించటానికై ప్రభుత్వం అనుమతించింది. ఆ మండలాల పరిధిలో, ఆంధ్ర- తమిళనాడు రాష్ఠ్రాల దక్షిణ సరిహద్దుకు చేరువలో, బాగా వెనుకబడిన 14 గ్రామాలలోని వ్యవసాయానికి పనికిరాని లేదా అతితక్కువ ఫలసాయం ఇచ్చే భూములలో 2008 ఆగస్టు 8న శ్రీసిటీ ప్రారంభమైనది. అనతి కాలంలోనే 'ఇంతింతై, వటుడింతై' న చందాన, వివిధ దేశాలకు చెందిన అనేక భారీ పరిశ్రమల స్థాపనతో, శ్రీసిటీ ప్రగతి ప్రస్థానంలో పరగుతీస్తూ, నేడు ప్రపంచ వాణిజ్య పటంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. దేశ, విదేశ సంస్థల ఎగుమతి వాణిజ్య సౌలభ్యం కొరకు 3800 ఎకరాలలో ఏర్పరచిన 'ప్రత్యేక ఆర్థిక మండలి' [Secial Economic Zone (SEZ) - సెజ్], 2200 ఎకరాలలో దేశీయ ఉత్పత్తుల వాణిజ్య కేంద్రము (Domestic Tariff Zone), స్వేచ్ఛావ్యాపారం మరియూ గిడ్డంగి మండలం (Free Trade and Warehousing Zone), వంటి వసతులన్నీ ఒకే చోట ఉండేలా, శ్రీసిటీ నిర్మాణ రూపకల్పన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత జురాంగ్ కన్సల్టెంట్స్ (సింగపూర్) వారిచే రూపొందించబడిన శ్రీసిటీ, ఒక ప్రపంచస్థాయి వ్యాపారకేంద్రానికి ఉండవలసిన అన్ని మౌలిక వసతులనూ, అంతర్జాతీయ జీవన శైలి సదుపాయాలను, హంగులనూ కలిగియున్నది. శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ విశాలమైన రహదారులు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, మంచినీటిశుద్ధి కేంద్రం, సౌర విద్యుత్ కేంద్రము, మురుగు, పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధి వసతులు, హరిత వనాలు, నివాస భవన సముదాయాలను నిర్మించారు.
అచిరకాలంలో సాధించిన విజయాలే శ్రీసిటీకి పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువగా రావటానికి దోహద పడ్డాయి. ఇప్పటిదాకా, 26 దేశాలకు చెందిన 165 కు పైగా కంపెనీలు, సుమారు 25,000 కోట్ల పెట్టుబడితో తమ వ్యాపార కలాపాల నిర్వహణకు శ్రీసిటీనే గమ్యంగా ఎంచుకున్నాయి. వీటిలో దాదాపు 90 పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకోగా, మిగిలినవి నిర్మాణ దశలో లేదా ప్రభుత్వ అనుమతులు పొందే దశలో ఉన్నాయి.
శ్రీసిటీలో అడుగిడిన ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు
ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రక్షణ, సౌరశక్తి, ఏరోస్పేస్ పరికరాలు-విడిభాగాల ఉత్పత్తి, భారీ వాహనాలు, ఖనిజాలను వెలికి తీసే యంత్ర సామగ్రి, హార్డ్ వేర్ వంటి బహుళ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థలను నెలకొల్పటానికి శ్రీసిటీ ఎంతో అనువైనది. తమ భారి పెట్టుబడులకు శ్రీసిటీ తగిన ప్రాంతంగా గుర్తించిన అనేక దేశ, విదేశ సంస్థలు తమ కర్మాగారాలను స్థాపించాయి.
పెప్సీకో, అల్స్టం, కొబెల్కో, కాల్గేట్ పామోలివ్, కెల్లాగ్స్, డేనీల్ ఇండియా, నిట్టాన్ వాల్వ్స్, లావాజ్జా, పయోలాక్స్, వీఅర్వీ, వెస్ట్ ఫార్మా, అస్త్రోటెక్, రాక్వర్త్, ఎవర్టన్ టీ వంటి పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. జపాన్ దేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన ఉత్పత్తి సంస్థ 'ఇసుజు', తన అనుబంధ కంపెనీ 'ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' యొక్క కర్మాగారాన్ని రెండు దశలలో మొత్తం రూ.3000 కోట్ల వ్యయంతో, ఇక్కడ నిర్మించింది. అదేవిధంగా, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మొండెలెజ్ ఇంటర్నేషనల్ సంస్థ, తన అనుబంధ కంపెనీ 'కాడ్బరీ ఇండియా' ను, సుమారు 1000 కోట్ల రూపాయిల పెట్టుబడితో, ఆసియ-పసిఫిక్ ప్రాంతంలోనే అతి పెద్ద చాక్లెట్ల ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించింది. ఆరోగ్య పరిరక్షణకుపకరించే వస్తు వుల తయారీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జపాన్ కంపెనీ యూనిచాం ఉత్పత్తి ప్రారంభించింది. ఇవికాకుండా, ఇంకా అనేక దేశ విదేశ భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఆటో మొబైల్ పరిశ్రమలకు కేంద్రం
ప్రస్తుతం ఇక్కడ జపాన్ దేశానికి చెందిన 16 కంపెనీలు స్థాపింపబడినవి. వీటిలో ఒకటి రెండు మినహా మిగతావన్నీ ఇంజనీరింగ్ / ఆటో మొబైల్ రంగానికి సంబంధించినవి. వాటిలో ఇసుజు కంపెనీ కార్లను తయారు చేస్తుంది. మిగిలినవన్నీ ఆటో మొబైల్ విడిభాగాలను తయారు చేస్తాయి. చెన్నై పరిసర ప్రాంతాలలో స్థాపింపబడిన అనేక కార్ల కంపెనీలకు అవసరమైన వివిధ విడిభాగాలను తయారు చేసి అందించటానికి అనువుగా, శ్రీసిటీ చెన్నైకి అతి చేరువలో ఉన్నందున ఈ పరిశ్రమలు ఇక్కడ స్థాపింపబడినవి. ఈ కంపెనీల స్థాపనతో శ్రీసిటీ దేశంలో ఒక ప్రముఖ 'ఆటో మొబైల్ హబ్' గా వృద్ధి చెందుతూ, ఈకోవకు చెందిన మరిన్ని చిన్న- మధ్య తరహా పరిశ్రమలకు నెలవు కానున్నది.
మెరుగైన ఉపాధి అవకాశాలు
ఈ కంపెనీల రాకతో సుమారు 35000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఉపాధి పొందుతున్న వారిలో 50 శాతం మహిళలే. అధిక శాతం మంది మహిళా ఉద్యోగులున్న పరిశ్రమలు అనేకం ఇక్కడున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన దొరికితే వారి కుటుంబ స్థితిగతులు మెరుగై, పిల్లల భవిష్యత్ బాగుంటుందన్న తలంపుతో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీసిటీ ప్రణాళికలు రచించింది. తదనుగుణంగా అక్కడి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు స్త్రీ శక్తికి అగ్రతాంబూలం ఇచ్చారు, మహిళా శక్తికే పెద్దపీట వేశారు. ఒక్క ఫాక్స్కాన్కు చెందిన రైజింగ్ స్టార్ పరిశ్రమలోనే 11 వేలకు పైగా మహిళలు పనిచేస్తుండగా, మిగిలిన వారు ఎం.ఎస్.ఆర్. గార్మెంట్స్, కెల్లోగ్స్, పాల్స్ ప్లష్, మాండెలెజ్ (క్యాడ్బరీ), ఎవర్టన్ టీ, కాల్గేట్ పామోలివ్, యూనీఛాం, పెప్సికో మొదలైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఆయా కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో మహిళలు, సుమారు 20 నుండి 90 శాతం దాకా ఉన్నారు.
పాలనా విభాగాలు[మార్చు]
- రెవెన్యూ డివిజన్లు
- నగరపాలక సంఘాలు (కార్పోరేషన్)
- పురపాలక సంఘాలు (మునిసిపాలిటీలు)
1. మదనపల్లె 2. శ్రీకాళహస్తి 3. పుంగనూరు 4. పలమనేరు 5. పుత్తూరు 6. నగరి
- మండలాల సంఖ్య: 66
- రెవెన్యూ గ్రామాల సంఖ్య 1399
భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 66 రెవిన్యూ మండలాలుగా విభజించారు[2].
1 పెద్దమండ్యం | 23 కె.వి.బి.పురం | 45 నగరి |
2 తంబళ్ళపల్లె | 24 నారాయణవనం | 46 కార్వేటినగరం |
3 ములకలచెరువు | 25 వడమాలపేట | 47 శ్రీరంగరాజపురం |
4 పెద్దతిప్పసముద్రం | 26 తిరుపతి గ్రామీణ | 48 పాలసముద్రం |
5 బి.కొత్తకోట | 27 రామచంద్రాపురం | 49 గంగాధర నెల్లూరు |
6 కురబలకోట | 28 చంద్రగిరి | 50 పెనుమూరు |
7 గుర్రంకొండ | 29 చిన్నగొట్టిగల్లు | 51 పూతలపట్టు |
8 కలకడ | 30 రొంపిచెర్ల | 52 ఐరాల |
9 కంభంవారిపల్లె | 31 పీలేరు | 53 తవణంపల్లి |
10 యెర్రావారిపాలెం | 32 కలికిరి | 54 చిత్తూరు |
11 తిరుపతి పట్టణ | 33 వాయల్పాడు | 55 గుడిపాల |
12 రేణిగుంట | 34 నిమ్మనపల్లె | 56 యాదమరి |
13 ఏర్పేడు | 35 మదనపల్లె | 57 బంగారుపాళ్యం |
14 శ్రీకాళహస్తి | 36 రామసముద్రం (చిత్తూరు జిల్లా) | 58 పలమనేరు |
15 తొట్టంబేడు | 37 పుంగనూరు | 59 గంగవరం |
16 బుచ్చినాయుడు ఖండ్రిగ | 38 చౌడేపల్లె | 60 పెద్దపంజాణి |
17 వరదయ్యపాలెం | 39 సోమల | 61 బైరెడ్డిపల్లె |
18 సత్యవేడు | 40 సదుం | 62 వెంకటగిరి కోట |
19 నాగలాపురం | 41 పులిచెర్ల | 63 రామకుప్పం |
20 పిచ్చాటూరు | 42 పాకాల | 64 శాంతిపురం |
21 విజయపురం | 43 వెదురుకుప్పం | 65 గుడిపల్లె |
22 నింద్ర | 44 పుత్తూరు | 66 కుప్పం |
నియోజక వర్గాలు[మార్చు]
- లోక్సభ స్థానాలు (2)
- శాసనసభ స్థానాలు (14)
2007 లో జరిగిన డీలిమిటేషన్ వలన క్రొత్తగా విలీనాలు చేయబడిన నియోజక వర్గాలు.
- గమనిక : క్రింద ఇవ్వబడిన నియోజకవర్గాలను నొక్కినచో, నేరుగా ఆయా అసెంబ్లీవర్గాల పేజీలలో వెళ్ళవచ్చును. ఎడమవైపున ఇవ్వబడిన సంఖ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య.
281. తంబళ్ళపల్లె, 282. పీలేరు, 283. మదనపల్లె, 284. పుంగనూరు, 285. చంద్రగిరి, 286. తిరుపతి, 287. శ్రీకాళహస్తి, 288. సత్యవేడు, 289. నగరి, 290. గంగాధరనెల్లూరు, 291. చిత్తూరు, 292. పూతలపట్టు, 293. పలమనేరు, 294. కుప్పం.
రవాణా వ్వవస్థ[మార్చు]
చిత్తూరు రోడ్డు మార్గంలో దేశంలోని ప్రధాన నగరాలతో విమాన, రైలు, రహదారి మార్గాలలో అనుసంధానించబడి ఉంది. రైళ్లు నడవడం రాష్ట్రంలోనే ప్ర ప్రథమంగా ఈ జిల్లలోనే ప్రారంభం అయినది. జిల్లాలో ఐదు మార్గాలలో పయనించే రైలు మార్గాలున్నాయి. ఇక్కడి రేణిగుంట అతి పెద్ద రైల్వే కూడలి. ఇక్కడే రైలు పెట్టెల మరమ్మత్తు కర్మాగారం ఉంది.
జనాభా లెక్కలు[మార్చు]
2011 జనగణన ప్రకారం జనాభా 41,70,468, పురుషులు 20,83,505, స్త్రీలు 20,86,963. జనగణన 2001 ప్రకారం అక్షరాస్యత శాతం 67.46, పురుషులలో 78.29, స్త్రీలలో 56.48. (1981 జనగణన ప్రకారం జనాభా: 27.37 లక్షలు. స్త్రీ పురుషుల నిష్పత్తి: 966:1000, అక్షరాస్యత: 31.60 శాతం. అనగా గత ముప్పై సంవత్సరాలలో పెరిగిన జనాభా సుమారు 10,33,000, పెరిగిన అక్షరాస్యత 35.86 శాతం. *మూలం: ఆంధ్రప్రదేశ్ వార్షికదర్శిని. 1988. పుట.288)
సంస్కృతి[మార్చు]
చిత్తూరు జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు : సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ విశిష్టమైనది. దాన్నే జల్లి కట్టు అంటారు. అప్పుడు జరిగే పార్వేట ఉత్సవం, గంగ పండుగ, ఆ సందర్భంలో జరిగే గంగ జాతర, ముక్కోటి ఏకాదసి, కావిళ్లు పండుగ, కార్తీక మాసంలో జరిగే సుద్దుల పండుగ, మహాభారత ఉత్సవాలు మొదలగునవి ఈ జిల్లాకే ప్రత్యేకం.
పశుపక్ష్యాదులు[మార్చు]
తూర్పు కొండలలో భాగమైన శేషాచల కొండలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వృక్ష, జంతు సంరక్షణ చక్కగా జరుగుతుంది. అంతరించి పోతున్న వృక్షాలను పోషించడమే కాక ఇక్కడ ఔషధ మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఒక పరిశోధక బృందం ఇక్కడ నిరంతర పరిశోధనలు సాగిస్తుంది.ఇక్కడ ఇలియాన్ షెల్డి టైల్ అనే కొత్త పామును కనుగొన్నారు. స్లెండర్ కోరల్ స్నేక్ అనే విషపూరిత పామును 2009లో కనుగొన్నారు. ఇది దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము. బెట్లుడత ఇది ఇండియన్ జైంట్ స్కైరల్ అని పిలువబడే ఈ ఉడుత బరువు 2.5 కిలోలు ఉంటుంది. బంగ్ళాదేశ, శ్రీ లంకలో ఉండే ఈ ఉడుత భారతదోశంలో ఇది తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుంది అని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. బంగారు బల్లి (గోల్డ్ గెకోగా) పిలువబడే పూర్తి బంగారువర్ణంతో కనిపించే ఈ బల్లి తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకుల అభిప్రాయం. ఇది భారత దేశంలో మరి కొన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది. ఇవి తిరుమలలో శిలాతోరణం, కపిల తీర్థం వద్ద కనిపిస్తుంది. దేవాంగ పిల్లి (స్లెండర్ లోరీన్)గా పిలువబడే ఈ జంతువు భారతదోశంలో, శ్రీ లంకలో కనిపిస్తుంది. 1940-1950 కాలంలో ఆఫ్రికాలో కనిపించిన ఈ జంతువు ప్రస్తుతం అంతరించింది. తిరుమలలో మాత్రమే కనిపించే ఇది రాత్రివేళలో సంచరిస్తూ కీటకాలను తింటూ చెట్ల కొమ్మల మీద జీవిస్తుది. బూడిద రంగు అడవి కోళ్ళు. ఇవి ప్రపంచంలో మరెక్కడా లేవని పరిశోధకుల అభిప్రాయం.శ్రీ వెంటేశ్వర జంతుప్రదర్శనశాలలో వీటి పునరుత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించారు.
విద్యాసంస్థలు[మార్చు]
సంఖ్య | విద్యాసంస్థ | వివరణ | సంఖ్య |
1 | పాఠశాలలు | నవోదయా పాఠశాల | 1 |
2 | గురుకులాలు | 1 | |
3 | జూనియర్ కళాశాలలు | పి సి ఆర్ | 1 |
4 | కళాశాలలు | ||
5 | ఉన్నత కళాశాలలు | పి.వి.కే.న్.డిగ్రీ&పి.జి.కళాశాల, | |
6 | ఇంజనీరింగ్ కళాశాలలు | రమణమ్మ | |
7 | టెక్నో పాఠశాలలు | మదనపల్లె,శ్రీనివాస,కాళహస్తి,రామానుజ | 4 |
8 | సంగీత కళాశాల | శ్రీవెంకటేశ్వర | 1 |
9 |
వైద్య కళాశాలలు | బి టి కళాశాల, కృష్ణతేజ డెంటల్ కాలేజ్ | 2 |
10 | ఫార్మసీ | ||
11 | మేనేజ్మెంట్ స్కూల్స్ | ||
12 | విశ్వనిద్యాలయాలు | పద్మావతి, ద్రవిడ, వేదిక్, సంస్కృత, స్విమ్స్, ఎస్వియు | 7 |
13 | ఇతరాలు |
ఆకర్షణలు[మార్చు]
ప్రధాన వ్యాసం: చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు
పూర్వము ఏనుగు మల్లమ్మకొండ అని పిలవబడిన హార్సిలీ హిల్స్ మదనపల్లె పట్టణానికి సమీపమున ఉన్న ఒక వేసవి విడిది. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ"గా పేరు పొందినది. అనేక రకమైన పండ్లు, కూరగాయలు (ప్రత్యేకముగా టమాటాలు) పండించే చుట్టు పక్కల వ్యవసాయ ప్రాంతమునకు మదనపల్లె కేంద్ర స్థానం. హార్స్లీ హిల్స్ వద్దనున్న రిషి వ్యాలీ గురుకుల విద్యకు ప్రసిద్ధి.
జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న గుర్రంకొండ ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట, రాగినీ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. ఆర్ధ్రగిరి, చంద్రగిరి జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు. ఇవే కాక ఈ రాష్ర్టంలో అనేకమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, చూడదగిన ప్రదేశములెన్నియో గలవు. వాటిలో ఈ క్రింద పేర్కొన్నవి కొన్ని
- తిరుపతి
- కాణిపాకం
- అప్పలాయ గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం
- శ్రీనివాస మంగా పురం
- నాగలాపురం
- తిరుమల
- నారాయణవనం
- మొగిలి.
- కార్వేటినగరం
- కైలాసనాథ కొండ
- అరగొండ
- తిరుచానూరు
- యాదమరి/ఇంద్రపురి
- హార్సిలిహిల్స్
- తలకోన
- బొయ కొండ గంగమ్మ
- పులికాట్ సరస్సు
- గుర్రంకొండ
- ఆరోగ్యవరం
- కైలాసనాథ కోన
- చంద్రగిరి
- గుర్రంకొండ
- గుడి మల్లం
- శ్రీకాళహస్తి
- సురుటుపల్లి
- వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురం
ప్రముఖవ్యక్తులు[మార్చు]
- మాడభూషి అనంతశయనం అయ్యంగారు (1891-1978) స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ స్పీకర్.
- జిడ్డు క్రిష్ణమూర్తి, తత్వవేత్త. (1895 - 1986)
- ముంతాజ్ అలి తత్వవేత్త.
- నారా చంద్రబాబు నాయుడు రాజకీయవేత్త.
- ఆచార్య జి.ఎన్.రెడ్డి (1928-1989) భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విద్యావేత్త, నిఘంటు నిర్మాత.
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ వేత్త.
- సాహితీ కారులు
- తరిగొండ వెంగమాంబ (1730 - ?) 19 శతాబ్ఘపు కవయిత్రి. అనేక పాటలు యక్షగానాలు రచించిన రచయిత్రి..
- కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) విద్యావేత్త, సాహితీవేత్త, వక్త, పండితుడు, రచయిత, ఆదర్శవాది బహుముఖ ప్రఙాశాలి.
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937 - 2007), సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
- రాజన్నకవి (1920 - 1997)
- కనక సభాపతి పిళ్ళై (1923 - 1980)
- శంకరంబాడి సుందరాచార్య (1914 - 1977) కవి రచయిత.
- శ్రీనివాసపురం సోదరులు - సింహశ్రీ, శుభశ్రీ
- మధురాంతకం రాజారాం (1930 - 1999) సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత.
- నూతలపాటి గంగాధరం (1931 - 1975)
- ఆర్.ఎస్. సుదర్శనం (1927 - 2001)
- సాకం నాగరాజ
- మన్నవ భాస్కరనాయుడు
- సినీ రంగ ప్రముఖులు
- చిత్తూరు నాగయ్య (1904 - 1973) - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా పేరొందాడు.
- రమాప్రభ హాస్యనటి - 1400 దక్షిణభారతదేశ చిత్రాలలో నటించిన 16 17 నటీమణి.
- దేవిక - అందాల తారగా వెలుగొందిన నటీమణి.
- ఉమామహేశ్వరరావు - రంగస్థల, చలనచిత్ర నటుడు.
- టిజి కమలాదేవి
- జయంతి
- మోహన్ బాబు
- తాళ్ళూరి రామేశ్వరి
- రోజా
- శివప్రసాద్
- రామిరెడ్డి
- శ్రీరాం
- మంచు విష్ణు
- మంచు మనోజ్ కుమార్
- అనామిక
- షఫి
చిత్రమాలిక[మార్చు]
కపిలతీర్థం, తిరుపతి
తలయేరు గుండు అలిపిరి
చంద్రగిరి కోట, రాజా సౌధం
కాణిపాకం చిత్తూరు, మందిర దృశ్యం
మూలాలు[మార్చు]
- ↑ http://www.thehindu.com/arts/history-and-culture/article1587813.ece
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో చిత్తూరు జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
చిత్తూరు జిల్లా - భౌగోళిక సరిహద్దులు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Chittoor district. |