కట్టమంచి రామలింగారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టమంచి రామలింగారెడ్డి
జననం
కట్టమంచి రామలింగారెడ్డి

(1880-12-10)1880 డిసెంబరు 10 [1]
మరణం1951 ఫిబ్రవరి 24(1951-02-24) (వయసు 70)
మద్రాసు
మరణ కారణంవృద్ధాప్యం
వృత్తిఉపకులపతి, కవి, పండితుడు, విద్యావేత్త
తల్లిదండ్రులు
  • సుబ్రహ్మణ్యరెడ్డి (తండ్రి)
  • నారాయణమ్మ (తల్లి)

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. కవిత్వతత్వవిచారం, అర్థశాస్త్రం, ముసలమ్మ మరణము ఆయన రాసిన గ్రంథాల్లో పేరు గాంచినవి. ముసలమ్మ మరణము ఆంధ్రభాషాభిరంజని సంస్థ నిర్వహించిన పోటీలో బహుమాన కావ్యంగా నిలిచింది. అర్థ శాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్ర విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారు ప్రచురించారు.

బాల్యం[మార్చు]

రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబరు 10న జన్మించాడు. చిత్తూరు - తిరుపతి మార్గంలో ఇది ఒక చిన్న పల్లె. సుబ్రహ్మణ్యంరెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఇతడు మూడో సంతానం. సుబ్రహ్మణ్యంరెడ్డి సోదరుడు పెద్దరామస్వామిరెడ్డి రామలింగారెడ్డిని దత్త పుత్రుడుగా స్వీకరించాడు.

చదువు, పురస్కారాలు[మార్చు]

ట్యాంకుబండపై కట్టమంచి విగ్రహం
ట్యాంకుబండపై కట్టమంచి విగ్రహం
ఐ యస్ బి సింహ ద్వారము
ఐ యస్ బి సింహ ద్వారము
కట్టమంచి రామలింగారెడ్డి

సి.ఆర్‌.రెడ్డి చదువు అతని అయిదో ఏట వీధి బడిలో మొదలయినది. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర, బాల రామాయణాన్ని చదివేవాడు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటిఫారంలో చేరాడు. ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు.

ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసాడు. 1899లో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందాడు. 1902 లో బీ.ఏ. పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నాడు.

డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.

భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1904లో 'విద్వాంసుడు' పురస్కారం అందుకున్నాడు. 1905 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై, అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు ప్రశంసలు అందుకొన్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. 1906లో ఎం.ఏ. పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు అక్కడివారు ఆశ్చర్యపడేవారట.

ఉద్యోగ జీవితం[మార్చు]

బరోడా సంస్థానాదీశుడు శాయాజీరావు గైక్వాడ్ సి.ఆర్‌.రెడ్డి ప్రతిభను గుర్తించి, తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలచి, అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించడానికి అతనిని అమెరికా పంపాడు. అతని పర్యటన పూర్తయ్యాక 1908 లో స్వదేశానికి వచ్చి తన 28వ యేట బరోడా కళాశాలలో ఆచార్యునిగాను, ఉపాధ్యక్షునిగాను తన తొలి ఉద్యోగం ప్రారంభించాడు. విద్యా వ్యవస్థను మరింత అధ్యయనం చేయడానికి అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కూడా పర్యటించాడు.

ఆ తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించాడు. అక్కడ ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు బాధ్యతలు వెరవేర్చాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాల కాలంలో హరిజనులకు పాఠశాలలలో ప్రవేశం కల్పించడానికి కృషి చేశాడు. విద్యార్థులు అతనిని ఆచార్యునిగా అమితంగా గౌరవించేవారు. అతని ప్రణాళిక ఆధారంగా మైసూర్ విశ్వవిద్యాలయం 1916 లో ప్రారంభమయ్యింది. దానికి కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. తరువాత రెండేళ్ళకు మైసూర్ సంస్థానం విద్యాశాఖాధికారిగా నియమింపబడ్డాడు. ఆ హోదాలో "ప్రతి ఊరికి ఒక పాఠశాల" అనే ఉద్యమం ప్రారంభించాడు. 1921లో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

1921 తరువాత రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1922 లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 2వ సారి చిత్తూరునుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. 1921-25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించాడు. 1935 లో కాంగ్రెస్‌ తరఫున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 1936 లో కొంతకాలంపాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు. శాసన సభలో సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపకులపతిగా[మార్చు]

ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసన సభలో ఎన్నో ప్రసంగాలు చేశాడు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) గా 1926 నుంచి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. అయితే ప్రభుత్వం వారి దమననీతికి నిరసనగా తన ఉపకులపతి పదవికి రాజీనామా చేసి చిత్తూరు తిరిగి వచ్చేశాడు. తరువాతి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్ళినప్పుడు రెండోసారి 1936 లో మళ్లీ అదే బాధ్యతను చేపట్టాడు. 1949 వరకు 14 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగాడు. 1949 లో మద్రాసు విశ్వవిద్యాలయం ప్రొ-ఛాన్సలర్‌ పదవిని స్వీకరించాడు.

సాహితీ సేవ[మార్చు]

సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డాడు. ఒకవైపు తెలుగు కవితను మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి. సంభాషణలతో దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు, వాదనాచాతుర్యం ఆయన శైలి. హాస్య ప్రియత్వం, ఛలోక్తులు, చమత్కార సంభాషణా నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవాడు.

ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది. భారత అర్థశాస్త్రం, కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి, వేమన మొదలయినవి తెలుగులో ఆయన రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను ఆయన చేయితిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా. ఆంగ్లంలో ఆయన రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నాడు.

రచనలు[మార్చు]

తెలుగులో
  • ముసలమ్మ మరణము - 1899లో ఆంధ్ర భాషాభిరంజని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900 లో అచ్చయ్యింది.
  • కవిత్వతత్త్వ విచారము - పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయం కావ్యం రెడ్డికి ఎంతో ఇష్టమైనది. ఆ ప్రబంధం గురించి తాను వ్రాసిన వ్యాసాన్ని తరువాత ఇంకా విస్తరించి "కవిత్వ తత్త్వ విచారము" అనే గ్రంథంగా వెలువరించాడు. ఇది తెలుగులో తొలి సాహిత్య విమర్శ గ్రంథం కావచ్చును. సాహితీ విమర్శలో క్రొత్త మార్గాలకు ఈ రచన మార్గదర్శి అయ్యింది. లింకు
  • భారత అర్థశాస్త్రం - కౌటిల్యుడి అర్ధశాస్త్రం ఆధారంగా చరిత్ర, సామాజిక అంశాలను అన్వయిస్తూ వ్రాసిన గ్రంథం. లింకు
  • ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి
  • లఘుపీఠికా సముచ్చయం
  • వ్యాసమంజరి - వ్యాసాల సంపుటం - నవయామిని, భారత ప్రశంస, అంపకం వంటి ఖండ కావ్యాలు
  • పంచమి - వ్యాసాల సంపుటం[2]
  • వేమన -
  • డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు - 1983 సంకలనం
  • సరస్వతీ సామ్రాజ్యము - గ్రంథాలయోద్ధారక అయ్యంకి వేంకటరమణయ్య సన్మాన సభలో రామలింగారెడ్డి సంకలనం చేసి సమర్పించిన సంచిక లింకు
  • ముత్యాలసరములు
  • దేవీభాగవతము
  • ప్రహసనములు
  • ప్రతాపరుద్రీయము
  • కీ.శే.కట్టమంచి సుబ్రహ్మణ్యరెడ్డిగారి సంక్షేప చరితము
  • ఆధునిక సాహిత్య విమర్శ రీతులు
ఆంగ్లంలో
  • Drama in the East and West
  • Speeches on Universitry Reform
  • Democracy in contemporary India
  • Congress in Office
  • Education, Industry & Commerce.లింకు

ఛలోక్తులు[మార్చు]

సి.ఆర్.రెడ్డి ఛలోక్తులు, హాస్య చతురత, సమయస్ఫూర్తి చాలాచోట్ల ఉటంకించడం జరుగుతుంది. భాషలో శ్లేషను, భావాన్ని సందర్భానుసారంగా వాడడంలో అతను దిట్ట. అతిశయానికీ, ఆత్మ విశ్వాసానికీ, సంభాషణా చతురతతో ఇబ్బందికర పరిస్థితులలోంచి తప్పించుకోవడానికీ అతని మాటల నైపుణ్యం గొప్పగా ఉపయోగపడేది.[3]

  • ఒకసారి పేరుమోసిన వక్తలు పాల్గొన్న, 8 గంటలు సాగిన, సైన్సు గురించిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో రెడ్డి జడ్జిగా వ్యవహరించాడు. చివరకు ఆయన అన్న మాటలు - ఈరోజు బోనులో ఉన్నది సైన్సు కాదు. నేను జడ్జినికాను. ఇంత సేపు పడుతుందని తెలియక న్యాయనిర్ణేతగా ఒప్పుకొన్నందున దోషినయ్యాను.
  • ఒకసారి మద్రాసు శాసనసభలో తన మిత్రుడైన పానగల్లు రాజాపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై తన పార్టీ ఆదేశానుసారం రెడ్డి గంటలతరబడి ఘాటుగా ఉపన్యసించాడు. అంతకుముందు ఆ రెడ్డే స్వయంగా తనను ప్రశంసించిన లేఖలు చూపబోయాడు. పానగల్లు రాజా. అందుకు రెడ్డి - "రాజాగారూ! విడాకుల సమయంలో భార్యాభర్తలు తమ పాత ప్రేమలేఖలు ఎవరివి వాఱికి ఇచ్చేయడం ధర్మం" అన్నాడు.
  • ఒక రాజకీయ సభలో ఆయనున్న వేదికపై రాళ్ళు రువ్వినపుడు - "మన జస్టిస్ పార్టీవారు రాజకీయాల్లో రాతియుగం ప్రవేశపెడుతున్నారు"
  • ఒకసారి ఆయన తన అల్లుడింటిముందు కారుదిగి 'కుక్కలున్నవి జాగ్రత్త' అన్న బోర్డు చూశాడు - "ఇచట ఇంతకు ముందు మనుషులుండేవారు. వారేమయ్యిరి?"
  • ఒకసారి తన ప్రసంగం మధ్యలో కరెంటు పోయినప్పుడు - "చీకట్లో మాట్లాడడం నాకు అలవాటు లేదు. బ్రహ్మచారిని గదా?"
  • శాసన సభ్యుల గురించి - "వీరిలో చాలామంది ముద్ద మింగుటకును, ఆవులించుటకును మాత్రమే నోరు తెరిచెదరు"
  • ఈనాటి యువత సలహా తీసుకోవడం కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు
  • మనం పేదవాళ్ళం కావచ్చును. కాని బిచ్చగాళ్ళం కానక్కరలేదు.

కొన్ని ఛలోక్తులు వాటి వాడి తరుగకుండా తెలుగులోకి అనువదించడం కష్టం.

  • 'If man cannot find a satisfactory axiom, he invents a hypothesis'.
  • 'We may be poor, but we need not be paupers'.
  • 'Applied science is Herculean power'.
  • 'Will without reason, reason without will, either is an unhappy combination. The two must go together balancing each other'.
  • 'Government and parties are agreed in this, they prefer creatures to creators of ideas who are always a troublesome lot'.
  • 'Every form of government, especially democracy, rests on two foundations. The first is a strong character and the second a sane and balanced judgement'.
  • 'Brevity is the soul of curfew'.
  • 'Democracy is a means to an end. The end is not partisan party government. The end is good government'.

విమర్శలు[మార్చు]

కట్టమంచి రామలింగారెడ్డి విద్యారంగాన్నో, రాజకీయ రంగాన్నో, మరి ఏదైనా రంగాన్ని ఒక్కదాన్ని ఎంచుకుంటే అందులో అత్యున్నత స్థాయికి చేరుకునేవాడని, అయితే సరిగా ఒక రంగంలో పనిచేసి మంచి స్థానానికి చేరుకునే సమయానికి మరొక రంగానికి మారిపోయేవాడని ఆవటపల్లి నారాయణరావు తన విశాలాంధ్రములో రాశాడు. ఈ చంచలత్వం వల్లనే ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో మొదటి మెట్టు మీదే ఉంటూ వచ్చాడని అతని విశ్లేషణ.[4] తన గురించి తానే ఛలోక్తులు వేసుకోవడంలో పెళ్ళి గురించి వేసుకున్న ఛలోక్తులు అపకీర్తిని తెచ్చిపెట్టాయి. ఒకసారి మద్రాసు గోఖలే హాలులో జరిగిన సన్మానంలో వక్త "బ్రహ్మచారి, సద్గుణ సంపన్నుడని" పొగడితే సి.ఆర్.రెడ్డి మాత్రం ఆ ప్రసంగం మరీ అతిశయోక్తులతో ఉందనీ, తనను బ్రహ్మచారి అనడం కన్నా అవివాహితుడు అనడమే సరైనదన్నాడు. అలానే "నాకోసం ఇతరులు పెళ్ళిచేసుకుంటూంటే నేనెందుకు పెళ్ళాడలనీ", "కావాలనుకున్నప్పుడల్లా పాలు లభిస్తుండగా ఆవును కొనుక్కోవడం ఎందుకనీ" పలు సందర్భాల్లో అన్న ఛలోక్తులు అప్రతిష్టపాలు చేశాయి.[3]

సి.ఆర్‌.రెడ్డి విగ్రహాలు[మార్చు]

సి.ఆర్‌.రెడ్డి 1951 ఫిబ్రవరి 24న అనారోగ్యంతో మద్రాసులో మరణించాడు. తమిళనాడుతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల విగ్రహాలున్నాయి. ఆయన జన్మించిన పట్టణంలో మాత్రం విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారు. ఈ లోటును ప్రముఖ డాక్టరు, సి.ఆర్‌.రెడ్డి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి కేశవరెడ్డి తీర్చడానికి సన్నాహాలు పూర్తి చేశారు. కలెక్టరు బంగ్లా ఎదురుగా సర్కిల్‌లో విగ్రహాన్ని నెలకొల్పారు.

పదవులు[మార్చు]

1926లో డాక్టర్ సి.ఆర్‌.రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యాక్షునిగా నియమితులయ్యాడు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా 1930 లో రాజీనామా చేశాడు. 1936 లో ప్రభుత్వం మళ్లీ ఆయనకు ఆ పదవిని అప్పగించింది.

విద్యాసంస్థలు[మార్చు]

సి.ఆర్‌.రెడ్డి పేరు మీద ఏలూరు నగరం లొ విద్యాసంస్థలు వున్నాయి. అందులో సర్ సి.ఆర్. ఆర్. పబ్లిక్ స్కూల్, Archived 2020-02-28 at the Wayback Machine సర్ సి.ఆర్. ఆర్. జూనియర్ కాలేజీ, సర్ సి.ఆర్. ఆర్. కాలేజీ, సర్ సి.ఆర్. ఆర్. ఇంజనీరింగ్ కళాశాలమహిళా కళాశాల Archived 2020-02-18 at the Wayback Machine మొదలైనవి అనేక సంవత్సరాలనుండి విద్యాసేవలు అందిస్తున్నాయి.

వనరులు, మూలాలు[మార్చు]

  1. Rajeswara Rao, P. (1991). The Great Indian Patriots, Volume 2. New Delhi: Mittal Publications. p. 69. ISBN 81-7099-288-5.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో పంచమి పూర్తి పుస్తకం ప్రతి.
  3. 3.0 3.1 డా.సి.మృణాళిని - తెలుగు ప్రముఖుల చమత్కార భాషణములు
  4. ఆవటపల్లి, నారాయణరావు (1940). విశాలాంధ్రము. p. 111.

బయటి లింకులు[మార్చు]

ఆర్చీవులలో లభిస్తున్న రామలింగారెడ్డి పుస్తకాలు
ఇతర లింకులు