తిరుపతిఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం. తిరుపతి జిల్లా కేంద్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయం, ఇతర చారిత్రక దేవాలయాల వున్నందున "ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని" అని అంటారు.[6]విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, 287,035 జనాభాను కలిగి, ఆంధ్రప్రదేశ్లో 9 వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది.[7]కర్నూలు తరువాత రాయలసీమలో ఇది రెండవ అతిపెద్ద నగరం. 2012–13 సంవత్సరానికి, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిని "ఉత్తమ వారసత్వ నగరంగా" పేర్కొంది.[8] స్మార్ట్ నగరం క్రింద అభివృద్ధి చేయబడే వంద భారత నగరాలలో ఒకటిగా ఎంపిక చెయ్యబడింది .
రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటుచేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. శ్రీశైలపూర్ణుడు, అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయవ్యదిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.[9]
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీ వారి మెట్టు ద్వారా శ్రీ కృష్ణదేవరాయలు తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తరువాతి శతాబ్దపు తంజావూరుచోళులు, మదురైని పరిపాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్ఠింపజేశాడు. ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. మరాఠీ సేనాని, రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు, గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు. హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది. అయితే చరిత్రపరంగా ఆలయం మొదట బౌద్ధ దేవాలయమని వాదించే చరిత్రకారులు ఉన్నారు.[10]
1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.
1933 లో, మద్రాసు శాసన సభ ఆలయనిర్వహణ, నియంత్రణ బాధ్యతలను "తిరుమల తిరుపతి దేవస్థానములు" (టి.టి.డి) అనే సంస్థకి అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నియమించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టి.టి.డి నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి, నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ జాతర పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబిస్తుంది.
గోవిందరాజ స్వామి దేవాలయం: తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. సా.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామిభక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్ శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
కోదండ రామాలయం: ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లిరాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్ర సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
కపిలతీర్థం:కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం, ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
వరదరాజ స్వామి దేవాలయం:ఇది కపిల తీర్థం రోడ్డులోఉంది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు. ఇక్కడ సన్నిధిలో శ్రీ నృసింహస్వామి, శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిలలో పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధిలో కూడా పూజలందుకుంటున్నారు.
జీవకోన:జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్భుతం.
ఇస్కాన్ దేవాలయం: ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
శ్రీనివాస మంగాపురం: తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు: తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్ (దీన్నే అలివేలుమంగాపురం అంటారు) లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలో తిరుచానూర్ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కళ్యాణమే.
ముక్కోటి: ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది ఒడ్డున ఉంది.ప్రసిద్ధి గాంచినది, కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
కాణిపాకం: తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది.
శ్రీకాళహస్తి: తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది.పంచభూతాలలో ఒకటైన వాయువు, ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా వెలసిన "శ్రీ వాయులింగేశ్వరుడు", అమ్మవారు సాక్షాత్తు జ్ఞానాన్ని ప్రసాదించే "శ్రీ జ్ఞాన ప్రసునాంబిక".
యోగిమల్లవరం:ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరంలో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది, మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
గుడిమల్లం: ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట :తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసినí అందమైన చిన్న ఆలయం ఇది.
బోయకొండ గంగమ్మ:తిరుపతికి సుమారు 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.
అష్టలక్ష్మీ ఆలయం:తిరుపతికి సుమారు 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేపంజెరి అను గ్రామంలో ఉంది.
శ్రీ లలితా పీఠం, శ్రీనివాసమంగాపురం, తిరుపతి శ్రీ లలితా పీఠం: తిరుపతికి 10 కి.మీ దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో నెలకొల్పబడింది.ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఇచ్చటనే దర్శించుకునే అద్భుత అవకాశం ఇక్కడ కలుగుతుంది.[11]
అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు:---దీన్నె తలయేరు గుండు అని కూడా అంటారు.- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి ఉన్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు
ఇక్కడే శ్రీ వారి పాదాల మండపం ఉంది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, వెండివి ఉన్నాయి. వాటిని భక్తులు కొంత రుసుం చెల్లించి తమ నెత్తిన పెట్టుకొని ఇస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శ్రీక్రిష్టదేవరాయలచే నిర్మితం అయిన పెద్ద గోపురం ఉంది.
చంద్రగిరి కోట: తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్ళాల్సిందే.
హార్సలి హిల్స్: తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్లీహిల్స్ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్ డబ్ల్యు.డి.హార్స్లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
తలకోన: పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
కళ్యాణీ డ్యాము /కళ్యాణి ఆనకట్ట:తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
శ్రీ శుకబ్రహ్మశ్రమమం:తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉంది.మలయాళస్వామి ఆశ్రమం అని కూడా పిలుస్తారు.
నారాయణవనం:తిరుపతి నుండి 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఏన్నో జలపాతాలున్నయి, ఉదాహరణ:కైలాస కోన
తిరుపతి నగర పరిపాలన, నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఉంటుంది. తిరుపతి నుండి ఒక శాసనసభ సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటారు. రాష్ర్టవిభజన సందర్భంగా తిరుపతిని మెగా సిటీగా రూపొందుటకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూనుకొన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల పంచాయతీలను నగర పాలక సంస్ధలో విలీనం చేయటం ప్రారంభించారు. విశాఖపట్నం మెట్రో, అమరావతి మెట్రో అనంతరం తిరుపతిలో మెట్రో నిర్మాణమునకు డి.ఎమ్.ఆర్.సి. సహకరించనుంది. తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీ ( తుడా) నగర ప్రణాళికా సంఘంగా వ్యవహరిస్తుంది.
పద్మావతి బందోపాధ్యాయ: భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళగా చరిత్రలో నిలిచారు.