తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక విధాలైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పూజల వివరాలు ఇవి:

స్వామి వారి సేవల బోర్డు

రోజువారీ సేవలు[మార్చు]

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు.

తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

  • సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.
  • శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు.
  • అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
  • తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.
  • కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
  • సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
  • మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
  • అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
  • రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
  • సహస్ర దీపాలంకరణ: ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారు, సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో వేదపండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తారు. నాదస్వరవిద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోను, పురందర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు. వేద, నాథ, గానాలను ఆలకిస్తూ, మలయప్పస్వామి మెల్లమెల్లగా ఉయ్యాలలూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
  • రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
  • ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
  • గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు[మార్చు]

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన , గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ , శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.

  • సడలింపు : గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.
  • పూలంగిసేవ : ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
  • తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.
  • అభిషేకం: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]