Coordinates: 14°42′N 77°35′E / 14.7°N 77.59°E / 14.7; 77.59

అనంతపురం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతపురం జిల్లా
పెనుకొండ కోట
Coordinates: 14°42′N 77°35′E / 14.7°N 77.59°E / 14.7; 77.59
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
ప్రధాన కార్యాలయంఅనంతపురం
Area
 • Total10,205 km2 (3,940 sq mi)
Population
 (2011)[1]
 • Total22,41,100
 • Density220/km2 (570/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం అనంతపురం. 2022 లో ఈ జిల్లాను విభజించి కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప,అరటి,నువ్వులు, చెరుకు, పట్టు. ఇక్కడి ముఖ్యమైన పరిశ్రమలలో సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, ఆటోమొబైల్ ఉన్నాయి.Map

జిల్లా చరిత్ర[మార్చు]

మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.

పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.

తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారానికి కాపలాగా ఉన్న మొదటి హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. బుక్కరాయల పేరు మీదుగా ఈ ప్రాంతంలో ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది. ఈ ప్రాంతపు పట్టణానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశపు అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది.

1677 లో ఈ ప్రాంతం మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్థులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,మదిగుబ్బ,నల్లమాడ,నంబులిపులికుంట,తలుపుల,నల్లచెరువు, ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.[2][3]

శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు[మార్చు]

2022 ఏప్రిల్ 4 న శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు జిల్లా నుండి 29 మండలాలను విడదీశారు.[1][4]

భౌగోళిక స్వరూపం[మార్చు]

జిల్లా విస్తీర్ణం: 10,205 చ.కి.మీ [1]

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం 2022 లో సవరించిన హద్దులపు అనంతపురం జిల్లా జనాభా 22.411 లక్షలు.[1]

రెవెన్యూ డివిజన్లు, మండలాలు[మార్చు]

భౌగోళికంగా జిల్లాను 3 రెవెన్యూ డివిజన్లుగాను,31 మండలాలుగా విభజించారు. గుంతకల్ రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటైంది.[4]

మండలాలు[మార్చు]

అనంతపురం జిల్లా మండలాల పటం (Overpass-turbo)


  • అనంతపురం జిల్లాలో మొత్తం 503 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]

నగరాలు, పట్టణాలు[మార్చు]

  • నగరం:అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు.
  • పట్టణాలు:
  1. కళ్యాణదుర్గం
  2. గుత్తి
  3. రాయదుర్గం
  4. ఉరవకొండ
  5. కణేకల్లు
  6. పామిడి

రాజకీయ విభాగాలు[మార్చు]

లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]

  1. అనంతపురం
  2. హిందూపురం (పాక్షికం): రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలు.[4]

శాసనసభా నియోజక వర్గాలు[మార్చు]

మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలు:

  1. అనంతపురం పట్టణ
  2. ఉరవకొండ
  3. కళ్యాణదుర్గం
  4. గుంతకల్లు
  5. తాడిపత్రి
  6. రాప్తాడు (పాక్షికం): రాప్తాడు, అనంతపురం మండలం (గ్రామీణ భాగం), ఆత్మకూరు మండలాలు ఈ జిల్లాలో వుండగా, కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో వున్నవి [4]
  7. రాయదుర్గం
  8. శింగనమల

రవాణా వ్యవస్థ[మార్చు]

రహదారి సౌకర్యాలు[మార్చు]

NH-44, NH-42 జాతీయ రహదారులు జిల్లాలో అనంతపురం గుండా పోతున్నాయి. జిల్లాకు రైలు సదుపాయం కూడా ఉంది, జిల్లాలో ఉన్న గుంతకల్లు రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లో రెండవ అతిపెద్ద జంక్షన్, ఇక్కడినుండి దేశ నలుమూలలకు రైలు సదుపాయం ఉంది.

రైలు సౌకర్యాలు[మార్చు]

దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ అయిన గుంతకల్లు ఈ జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి.

విమానయాన సౌకర్యాలు[మార్చు]

168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. జిల్లాలో అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో గుత్త విమానయాన సేవలకు మాత్రమే పరిమితమైన పుట్టపర్తి విమానాశ్రయం ఉంది.

సంస్కృతి[మార్చు]

  • రాగి సంకటి, జొన్నరొట్టె ఎక్కువగా తీసుకుంటారు

పరిశ్రమలు[మార్చు]

  1. యాడికి, గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.
  2. జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. శింగనమల, వజ్రకరూరు కూడేరు జిల్లాలోని కొన్ని ముఖ్య పవనవిద్యుత్కేంద్రాలు.
  3. పారిశ్రామికపరంగా గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, మోటారు కారు (కియా) పరిశ్రమలు ఉన్నాయి.
  4. జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
  5. సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )

విద్యాసంస్థలు[మార్చు]

అనంతపురం లోని గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.

ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థల వివరాలు:

సంఖ్య విద్యాసంస్థ వివరణ సంఖ్య
1 ప్రాథమిక పాఠశాలలు ఆంగ్ల మాద్య పాఠశాలలు 3
2 హైస్కూల్స్ ప్రభుత్వ, ప్రవేట్ హైస్కూపాఠశాల రెసిడెన్షియల్ 7
3 జూనియర్ కాలేజులు బాలల, బాలబాలికల జూనియర్ 3
4 కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు 6
5 ఉన్నతకళాశాలలు ఎమ్ ఎస్ సి, పి జి, డిగ్రీ, పిజి కాలేజులు 4
6 విశ్వవిద్యాలయాలు కేంద్ర, జవహర్లాల్ 2
7 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 1
8 ఫార్మసీ రాఘవేంద్రా కాలేజ్ 1 1
9 ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు 4
10 పోలీస్ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ 1
11 నర్సింగ్ శ్రీ సాయీ నర్సింగ్ 1
12 ఇన్‌స్టిట్యూట్స్ ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ 10
13 టీచర్ ట్రైనింగ్ సత్యసాయీ, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి 2
14 ఫిజియోథెరఫీ కస్తూర్భా ఫిజియోథెరఫీ 1

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

అనంతపురం జిల్లాలోని జైన క్షేత్రాలు[మార్చు]

  • కొనకొండ్ల ఈ కొనకొండ్ల, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలానికి చెందిన గ్రామం. శాసనపరంగాను జినకథనం పరంగాను చూస్తే కుందకుందాచార్యుడు కొనకొండ్ల దాపున గల కొండపై నివసించినట్లు బోధపడుతున్నది. ఇంద్రనంది శృతావతారం పద్మనంది అనే జినగురువు ఇక్కడ నివచించినట్లు తెలుస్తున్నది. దీని అసలు పేరు కుంద కుంద పురం, కుందకుందాచార్యుని అసలు పేరు పద్మనంది అనియు అక్కడ లభించన శాసనాల వలన తెలుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ జినావాశేషములన్నియు కొనకొండ్ల దాపునగల రససిద్ధుల గుట్టపై మనం ఇప్పటికీ చూడవచ్చును. ఇందులో కాయచ్చర్గ భంగిమ బాగా ప్రసిద్ధి చెందినది. నిటారుగా ఏ వంపులు లేకుండా నిలబడి రెండు చేతులను మోకాలివరకు తిన్నగా వ్రేలాడువేయు భంగిమను కాయచ్చర్గ భంగిమ అంటారు. జిన మతానుసారం ఋషభనాధుడు, నేమినాఢుడు, మహావీరుడు మినహా మిగిలిన 21 తీర్ధంకరులు ఈ భంగిమలోనే సిద్ధి పొందారు. ఇక్కడ సిద్దచక్రం చెక్కబడి ఉంది.
  • రాయదుర్గం రాయదుర్గం అంటే రాజాగారికోట. ఈ కోటదాటి ఉత్తరదిశగా 1 కి.మీ. పయనిస్తే మనకు శిద్ధుల గుట్ట కావవస్తుంది. ఇది అసలు జినక్షేత్రం. ఇది యాపనీయ శాఖకు చెందినది.యాపనీయులు జైనమతాచారాలన్నిటినీ సరళంచేసి సామాన్య ప్రజలకు సైతం ఆచరణయోగ్యంగా చేసేవారు.అటువంటి యాపనీయ సంఘమునకు చెందిన జినక్షేత్రం ఇది.జినులు స్త్రీలను మోక్షానికి అనర్హులుగా యెంచి వారిని జైనమతంలో చేర్చుకొనకపోతే యాపనీయులు స్త్రీలుకూడా మోక్షానికి అర్హులేఅని స్త్రీలకు జైనమతంలో ప్రవేశం కల్పించిరి.
  • కంబదూరు ఇది కల్యాణదుర్గంలో తాలూకాలోనిది.ఇక్కడ ఉన్న మల్లేశ్వరస్వామి దేవాలయం ఒకప్పటి జినాలయం. జైన వీరశైవ మత కలహాల తరుణంలో వీరశైవులు విజృంభించి ఇక్కడ ఉన్న జిన్నమతాన్ని ఛ్హిన్నాభిన్నం చేసిరి.అందుకే ఈ ఆలయంలో ఇంకా జినప్రతిమలు కనబడుతున్నవి.శిక్షరం పైన పరియం కాసానం (పద్మాసనం) లో ఉన్న జైనమునిని మనం చూడవచ్చును. ఇక్కడే ఉన్న అక్కమగుడి ఆలయాకృతినిబట్టి ఇదికూడా జినాలయం అని తెలియుచున్నది.
  • అమరాపురం ఈగ్రామం బాలేందు మలధారి అనే జినగురువుచే ప్రభావితమైనది.ఇతడు మూలసంఘము, దేశీయగుణము, పుస్తక్ గుఛ్చ, ఇనగలి బలికి చెందిన జిన సంఘారామానికి గురువు.జైనమతంలో కూడా బౌద్ధమతంలో వలే అనేక సంఘారామశాఖలు ఉన్నాయి. ప్రతి జినగురువును తెలిసేటప్పుడు ఆతని సంఘము, గుణము, గుఛ్ఛము విధిగా తెలుపవలెను.ఈ గ్రామం మొత్తం ఒకప్పటి జిన క్షేత్రం.
  • రత్నగిరి ఇది విజయనగర రాజుల కాలంలో పరసిద్ధిగాంచిన జినక్షేత్రం. ఇచ్చట శాంతినాధుని దేవాలయం ఉంది.ఇది చాలా పెద్దది.స్థానిక జైనులతో మరమ్మత్తులు చేయించుకొనబడింది.శాంతినాధుడు జైనుల 16వ తీర్ధంకరుడు.
  • తాడిపత్రి సా.శ. 12వ శతాబ్దంలో ఇది జైనుల క్షేత్రమని తెలియుచున్నది.సా.శ.1198లో ఉదయాదిత్యుడనే సామంత ప్రభువు ఇచ్చటగల చంద్రనాధ పార్స్వనాధ జినాలయానికి భూమిదానమిచినట్లు ఇక్కడ ఒక శాసనం ఉంది.
  • తగరకుంట సా.శ. 11-12వ శతాబ్దంలో ఇది జైనుల చంద్రప్రభువు తీర్ధంకరుడి క్షేత్రమని తెలియుచున్నది. ఆరవ చాళుక్య విక్రమదిత్యుడు రాజ్యం చేస్తున్న తరుణంలో ఆతని సామంతరాజు ఇక్కడ జినాలయమునకు భూమిని దానం చేసినట్లు ఇక్కడ లభించిన శాసనం తెలుపుచున్నది.
  • పెనుగొండ ఇది ప్రఖ్యాత జినక్షేత్రమని జినసారస్వతంలో కీర్తించబడింది.పైగా పెనుగొండ యావద్భారతంలో గల నాలుగు జినవిద్యాకేంద్రాలలో ఒకతిగా జిన కథన,ఉలు తెలుపుచున్నవి.మిగిలిన్ మూడు ఢిల్లీ, కొల్హాపూర్, జినకంచి.విజయనగర రాజుల పాలనలో కూడా పెనుగొండ జినక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అజితనాధుని, పార్స్వనాధుని బసదులను లేదా జినాలయములు ఇప్పటికీ తెలుయుచున్నవి.అజితనాధుడు రెండవ తీర్ధంకరుడు. ఏనుగు ఆతని లాంచనము.పార్స్వనాధుడు 23వ తీర్ధంకరుడు. ఇచట కల అజితనాధ దేవాల్యం దక్షిణ శిఖరం కలిగి ఉంది.అంటే హిందూ దేవాలయాల శిఖరాలను పోలిన శిఖరాకృతి. ఈ అజితనాధ జినాలయం శీఖరం మార్పు జైనమతం చివరి దశలో జరిగి ఉండవచ్చును.అదియును విజయనగర రాజులలోనే ఈ మార్పు జైరిగి ఉండవచ్చును.

ఇతరాలు[మార్చు]

  • పెనుకొండ: (ఘనగిరి) హజారత్‌బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం, కొండశిఖరం మీద ఉన్న కోనేరు, గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది)
  • గుత్తి కోట, గుత్తి: ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి.
  • లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పెన్న అహోబిళం, ఉరవకొండ మండలం
  • శ్రీ రామలింగేశ్వరాలయం,ఉరవకొండ మండలం జారుట్ల రాంపురం: ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయాన్ని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ, పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.
  • శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, కసాపురం, గుంతకల్లు మండలం

క్రీడా సౌకర్యాలు[మార్చు]

  • ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 44 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
  • 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ మైదానం అనంతపురంలో ఉంది.

క్రీడల నిర్వహణ[మార్చు]

1963-1964 లో ఇరానీ కప్పు, పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు అనంతపురంలో జరిగాయి.

జిల్లా ప్రముఖులు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. కలవటాల జయరామారావు (1928). "అనంతపురం జిల్లా చరిత్ర" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-01-02.
  3. కొమర్రాజు లక్ష్మణరావు, ed. (1934). Wikisource link to ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం). వికీసోర్స్. 
  4. 4.0 4.1 4.2 4.3 "సరికొత్త అనంత". ఆంధ్రజ్యోతి. 2022-04-04. Retrieved 2022-04-18.
  5. "అనంతపురం జిల్లా హోమ్". Retrieved 2022-04-20.

బయటి లింకులు[మార్చు]