స్వర్ణ సరస్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్ణ సరస్వతి
జననం1921
మరణం1985(1985-00-00) (వయసు 63–64)
వృత్తినాట్య కళాకారిణి, నాట్య గురువు
Dancesభరతనాట్యం

స్వర్ణ సరస్వతి భరతనాట్య కళాకారిణి.

విశేషాలు[మార్చు]

ఈమె సంగీతకళాకారుల, నాట్యకళాకారుల కుటుంబం నుండి వచ్చింది.[1] ఈమె తల్లి రాజమణి అమ్మాళ్ పేరుమోసిన గాయని. ఈమె అమ్మమ్మ అమృత ఎతిరాజ అమ్మాళ్ భరతనాట్య కళాకారిణి. ఆమె కుర్తాళం నారాయణస్వామి పిళ్ళై, పందనల్లూర్ అమృతాచలం పిళ్ళైల శిష్యురాలు.

స్వర్ణ సరస్వతి తన నాట్యవిద్యను మొదట తన అమ్మమ్మ వద్ద అభ్యసించింది. తరువాత కాంచీపురం తిరువేంగడ నట్టువనార్ వద్ద శిక్షణను తీసుకుంది. విర్సి చిన్నయ్య నాయుడు ఈమెకు భరతనాట్యం పాఠాలను బోధించాడు. మైలాపూర్ గౌరి అమ్మ వద్ద అభినయాన్ని నేర్చుకుంది. ఈమె సంగీతంలో శిక్షణను టైగర్ వరదాచారి, నమక్కల్ శేష అయ్యంగార్, సత్తూర్ కృష్ణ అయ్యంగార్‌ల వద్ద తీసుకున్నది. ఈమె తన 7వ యేటి నుండి తన తల్లితో సంగీత కచేరీలకు హాజరయ్యేది. ఈమె కచేరీ ఇవ్వగలిగినంత స్థాయిలో వీణను కూడా అభ్యసించింది.

ఈమె తన 10వ యేట 1931లో తొలి భరతనాట్య ప్రదర్శనను ఇచ్చింది. తరువాత ఈమె నాలుగు దశాబ్దాలపాటు అనేక భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె దక్షిణభారత దేశమంతటా తిరిగి తన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. 1952లో ఈమె ఐరోపా దేశాలను దర్శించి అక్కడి ప్రేక్షకులకు తన భరతనాట్య అభినయాన్ని ప్రదర్శించింది.

ఈమె వద్ద భరతనాట్యం నేర్చిన శిష్యులలో గీతా చంద్రన్, ఉషా నారాయణ్, శశికళా రవి మొదలైన వారున్నారు.

1967లో ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 1978లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఫెలోషిప్ లభించింది. ఈమెకు నాట్యకళానిధి అనే బిరుదు ఉంది. 1954లో ఈమె మద్రాసులో భరతనాట్య అకాడమీని స్థాపించింది. 1962లో ఈ అకాడమీ ఢిల్లీకి తరలింపబడింది.

మూలాలు[మార్చు]

  1. Shveta Arora. "GEETA CHANDRAN'S TRIBUTE TO HER GURU, SWARNA SARASWATHY". KALA UPASANA. Retrieved 11 April 2021.