మా పసలపూడి కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి ముద్రణ ముఖచిత్రము
ముఖచిత్రము
బాపు-రమణల ప్రశంస పత్రము

మా పసలపూడి కథలు ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన వంశీ కలం నుండి వెలువడిన అందమైన కథలు. స్వాతి వారపత్రికలో ఈ కథలు అశేష ప్రజాధరణ పొందినవి. ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు బాపు వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు. స్వాతి వారపత్రికలో ధారా వహికంగా వచ్చిన ఈ కథలను కుట్టి మాస్ ప్రెస్ , హైదరాబాద్ వారు పుస్తకరూపంలో పాఠకులముందుకు తెచ్చారు. ఈ కథలసంపుటి ముద్రణను SVPCL లిమిటెడ్, అమీర్ పేట్, హైదరాబాదు వారు తమభుజస్కందముల మీద వేసుకున్నారు. డి.టి.పి. పనిని చిన్నా (పి.వి.రాఘవరెడ్ది) చెయ్యగా, లేఅవుట్ డిజైనింగ్ గడ్డమల్ల నాగరాజు చేసాడు. ఈ పుస్తకము యొక్క ముఖచిత్రాలనే కాకుండ, లోపల కథలకు కూడా అందమైన రంగుల బొమ్మలను వేశారు బాపు.బొమ్మలతో వున్న ఈ కథల పుస్తకం ఒకనాటి చందమామమాస పత్రికను జ్ఞప్తికి తెస్తుంది. ఈ కధలను వాటిపై అభిప్రాయాల తెలిసిన 72 మంది ప్రముఖులకు అంకితం ఇచ్చాడు.[1]

కథలు[మార్చు]

ఇందులో మొత్తము 72 కథలున్నాయి. వరుసగా అవి.

1.1శ్రీశ్రీశ్రీ పూసపాటి రాజావారు,2.రామభద్రం చాలా మంఛోడు,3.వాళ్ళ బంధం.4.కోరిరావులుగారి బస్‍కండక్టర్,5.జక్కం వీరన్న,6.డా.గుంటూరుశాస్త్రి,7.మృత్యువు అక్కడుంది.8.దారుణం కదా!, 9.దేవాంగుల మణి,10.నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి తీర్పు.11.మలబార్ కాఫీ హోటల్,12తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం,13.అసలు కథ,14.రామశేషారెడ్డిగారి ఇంద్రభవనం, 15.కోరిక,16.ఉంచుకున్న మనిషి,17.గుత్తినాగేశ్వరరావు భళే అదృష్టవంతుడు,18.గొల్లపాలెం గురువుగారు,19.భద్రాచలం యాత్ర-వాళ్లక్క కథ,20.బళ్ళనారాయణరెడ్డి,21.ఎర్రనూకరాజుగారి జంక్షన్, 22.పిచ్చివీర్రాజు,23.పాముల నాగేశ్వరరావు,24.మునగచెట్టు,25.ఆరని పొయ్యి,26.నవూతూ వెళ్ళిపోయిందా మనిషి,27.బసివేశ్వరుడి గుడిమీద బూతుబొమ్మలు,28.బలంతగ్గింది మరి,29సత్యాన్ని పలికే స్వరాజ్యరెడ్డిగారు,30.మేరీ కమల,31.తూర్పుపేటలో పుత్రయ్య,32.బురకమ్మ కర్రీరెడ్డి,33.పోతంశెట్తి గనిరాజుగారు,34.అల్లుడు మావగిత్తలు,35.కుమ్మరి కోటయ్య,36.వెలగలగోపాలంగారి చిట్టిరెడ్డి, 37.దూళ్ళ బుల్లియ్య,38.సుక్యది-రామచంద్రపురం,39.నల్లుంకి తూము,40.ఇది కలిదిండి రాజుగారి కథ,41.నాగభూషణం గారి సీత,42.తెలుకుల రవణ,43.మున్సబుగారూ గుర్రబ్బండి, 44.అచ్యుతానిది అమృతహస్తం,45.గవళ్ళ అబ్బులు గాడి అల్లుడి చావు,46.గాలిమేడ,47.సాయం,48.పాస్టర్ ఏసుపాదం,49.చంటమ్మ సంపాదన,50.కుమారి మావూరొచ్చింది.,51.అమ్మాజీ జాతకం, 52.నల్లమిల్లిసుబ్బారెడ్డి కథ,53.గొల్లభామరేవు,54.పిచ్చికల్లంకలో రవణరాజు,55.వాస్తు గవరాజు,56.మండసోమిరెడ్డి సమాధి,57.గుడ్డోడు,58.తూరుపోళ్ళు,59.మేట్టారు సుబ్బారావు, 60.హోటల్ రాజు కథ,61.మాచెల్లాయత్తమ్మ మొగుడు,62.పొట్టిసూరయమ్మ,63.బ్రాహ్మాణరెడ్దిగారి తమ్ముడు సుబ్బారెడ్దిగారు,64.మాణుక్యం మళ్ళీ కనిపించలేదు,65.దత్తుడుగారల్లుడు తమ్మిరెడ్డి, 66.ప్రేమించింది ఎందుకంటే,67.చంటి నాన్నగారి కళ్ళు మనకెలాగొస్తాయి,68.సినిమా షూటింగోళ్లొచ్చారు,69.చెట్టెమ్మ కాసే చేపలపులుసు,70.దీపాలవేళ దాటేకా వెళ్ళిపోయింది,71.నావ ఎప్పటకీ తిరిగిరాలేదు,72.పొలిమేరదాటి వెళ్ళిపోయింది.

రచనా శైలి[మార్చు]

ఈ కథలలో రచయిత కథా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ తూర్పు గోదావరి జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకొన్నాడు.కథా వస్తువేదైనా తనదైన శైలి, రచనానైపుణ్యంతో రసవంతమైన వ్యవహారిక భాషలో, దృశ్సీకరణ సంవిధానంతో రచన సాగించడం వంశీ ప్రత్యేకత.పుస్తకము మొదలెడితే చివరివరకు ఆపకుండ చదివించే ఆకర్షణ ఈపుస్తకము లోని కథలకుంది.ఈకథలలోని కథా కాలనేపథ్యము ఇంచుమించు 60ఏళ్ల క్రితం మొదలై, ఈమధ్యకాలము 20 సంవత్సరములముందు వరకు జరిగినవిగా భావించాలి.పట్టణాలలో పుట్టిన వారిని మినహాయించి, పై మధ్యకాలంలో గ్రామాలలో పుట్టినవారు ఈ కథలను చదువుచున్నప్పుడు, ఈ కథలలోని పాత్రలు తన నిజజీవితంలో ఎక్కడొకచోట తనకు పరిచయమున్నట్లు అన్పిస్తుంది.

ఈ 72 కథలలోని ముఖ్య పాత్రలు అతి సామాన్యంగా ఉంటూనే అత్యధ్భుతంగా మలచబడ్డాయి. మనిషికి కావలసింది చదువు, డబ్బు – నిజమే. కానీ వీటి కంటే ముఖ్యమయినది ఒకటుంది. అదే సంస్కారం. అది లేనప్పుడు మిగితావి ఎన్ని ఉన్నా లేనట్టే. ఆ సంస్కారం ఉట్టి పడుతూ ఉంటాయి ఈ పాత్రలు. వారు పెద్దగా చదువుకున్న వారో, బాగా డబ్బున్న వారో కాకపోవచ్చు, కానీ గొప్ప సంస్కారం ఉన్నవారు. - [2]

వంశీ గారి కథలలో వర్ణనకి పెద్ద పీట వేస్తారు. తన వర్ణనలతో, మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకెల్తారు.. ఆ పాత్రలు కూడా మనం రోజూ కలిసే వ్యక్తుల లాగ అగుపించడం, మనం వాళ్ళలో ఒకరిగా అనిపించడం వుంటుంది. కథలలో చివరగా సున్నితమైన చిన్న మెలిక పెట్టటం (“వాళ్ళ బంధం”, “రామభద్రం…” కథలలో ముఖ్య పాత్ర మరణం, “కోరి రావులు గారి బస్ కండక్టర్ ”లో అందరికి సాయ పడే భద్రం చివర్లో కనిపించకుండా పోవటం..) తో, హృదయాన్ని ఎక్కడో సుతి మెత్తగా ఓ ఆవేదనా తరంగం స్పృశిస్తుంది…[3]

ప్రముఖుల స్పంధన[మార్చు]

ప్రముఖచిత్ర దర్శకుడు బాపు గారు, ఆయన అనుంగు మిత్రుడు, ప్రముఖ చిత్రరచయిత ముళ్ళపూడి రమణ గార్లు ఈ మాపసలపూడి కథలు చదివి తమప్రశంసను చిన్న చిత్రలేఖగా యిచ్చారు. ఇలా

వంశీ !
మధుర కథల కంచీ
మధురభావాల విపంచీ
కథాసుధా విరించీ
నీకలాన్ని తేనెతెలుగులో ముంచి
రచించీ వినిపించిన
'మా పసలపూడి కథలు' చదివీ
చదివి చదివి చదివీ
అదిరిపోయి
హడలిపోయి
ఆనందించి
పులకించీ
మళ్ళీ మళ్ళీ తలంచి తరించి
ఉక్కిరిబిక్కిరై
మక్కువ మిక్కిలై
ఆకథల గురించి
ఏమి చెప్పినా ఎంతచెప్పినా
మిక్కిలీ తక్కువై
చెప్పలేక
ఈ చిన్నిలేఖ !
చిత్రలేఖ!
- బాపు-రమణ

ఒకసారి నెమరేసుకుందాం!అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన పీఠికను పుస్తకం చివరలో చేర్చారు.ఇందులో వాడ్రేవు గారు చక్కగా వంశీకథలను-వంశీ కథలల్లే నైపుణ్యాన్ని చక్కగా పాఠకులముందుంచాడు.

మూలాలు[మార్చు]

  • మా పసలపూడి కథలు పుస్తకం, స్వాతి వారపత్రికలనుండి.
  1. మా పసలపూడి కధలు. p. 7.
  2. "మా వంశీ "మా పసలపూడి కథలు"". magazine.maalika.org. 2014-02-01. Archived from the original on 2012-06-23. Retrieved 2014-03-03.
  3. "గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్\publisher=mhsgreamspet.wordpress.com". Retrieved 2014-03-03.