బచేంద్రి పాల్

వికీపీడియా నుండి
(బచేంద్రీపాల్ నుండి దారిమార్పు చెందింది)

బచేంద్రి పాల్ భారత దేశానికి చెందిన పర్వతారోహకురాలు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

ఉత్తరకాశి లోని అతిచిన్నగ్రామంలో 1954 లో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే ధైర్యంగల అమ్మాయిగా గుర్తింపు పొందింది. తండ్రి కిషన్‌సింగ్‌ పాల్‌, తల్లి హన్సాదేవి. కిషన్‌సింగ్‌ చిన్న వ్యాపారి. భారత, టిబెట్‌ల మధ్య హిమాలయాల్లో ఉండే చిన్నచిన్న జనావాసాలకు ఆహారధాన్యాలను సరఫరా చేయడం అతని వ్యాపారం. ఐదుగురు సంతానంలో బచేంద్రి పాల్‌ మూడవ సంతానం. చిన్నతనం నుంచే చురుకుగా ఉంటూ ఆటల్లో రాణించేది.

బచేంద్రి పాల్‌ కుటుంబంలో 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానివేసి ఇంటిపనుల్లో తల్లికి తోడుగా ఉండేవారు. కాని అందుకు ఆమె ఒప్పుకోలేదు. చదుపు పై ఆమెకు ఉన్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ప్రోత్సహించడంతో ఆమె ఎం.ఎ, బి.ఎడ్‌. పూర్తిచేయగలిగింది. ఆ తరువాత పర్వతారోహణ పై ఉన్న ఆసక్తి తో నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనింగ్‌(ఎన్‌ఐఎం)లో చేరింది. 1982 లో 21,900 అడుగుల ఎత్తు ఉన్న గంగోత్రి , 19, 091 అడుగుల ఎత్తు ఉన్న రుద్రగిరి ని అధిరోహించింది.

భారత్‌ నుంచి ఎవరెస్ట్‌ పర్వతారోహణకు బయలుదేరిన నాలుగవ బృందం మౌంట్‌ ఎవరెస్ట్‌ 84 లో ఆమె చేరింది. ఈ బృందంలో నలుగురు మహిళల్లో ఆమె ఒక్కతె. వారి పర్వతారోహణ ప్రారంభంలోనే, మంచుతుఫానులో బచేంద్రి పాల్‌ పూర్తిగా చిక్కుకుని పోయింది. తుఫాను కారణంగా విరిగిపడిన పెద్ద మంచుపెళ్లల మధ్య చిక్కిన ఆమెను తోటి పర్వతారోహకులు అతికష్టంపై బయటకు తీశారు. ఈ సంఘటనకు భయపడిన ముగ్గురు మహిళలు తమ ప్రయత్నాన్ని విరమించుకుని మౌంట్‌ ఎవరెస్ట్‌ 84 నుంచి వైదొలిగారు. బచేంద్రి పాల్‌ మాత్రం ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికే ఆసక్తి చూపించింది. ఆమె లోని ధైర్యం, పట్టుదల కారణంగా 1984 సంవత్సం మే నెల 23న మధ్యాహ్నం ఒంటిగంట ఏడు నిమిషాలకు ఆమె ఎవరెస్ట్‌ పర్వతాగ్రాన్ని చేరుకున్నది. 29, 084 అడుగల ఎత్తు ఉన్న మౌంట్‌ ఎవరెస్ట్‌ ను అధిరోహించిన మొదటి భారత మహిళ గా, ప్రపంచంలోని ఐదవ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సాధించింది. దుర్గా మాత పటాన్ని , హనుమాన్‌ చాలీసా ను పర్వతాగ్రంపై ఉంచి, తాను సాధించిన ఘనతకు భగవంతుని కటాక్షమే కారణమని భక్తిపారవశ్యంలో చాటింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నది.