రంతి దేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంతి దేవుడు భాగవత పురాణం నవమ స్కందంలో ప్రస్తావించబడిన చంద్రవంశపు రాజు.[1] దానగుణానికి మచ్చుకగా ఈయనను ప్రస్తావిస్తారు. రాజ్య పరిత్యాగం చేసి అడవిలో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. రంతి దేవుని ప్రస్తావన భాగవత పురాణంతో పాటు మహాభారతంలోనూ, సంస్కృత కవి కాళిదాసు రచించిన మేఘదూతంలోనూ ఉంది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది చంబల్ ప్రాంతంలోని ఆధునిక రణతంబూరుగా పరిగణించబడుతున్నది.[2] చంబల్ ప్రాంతం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉంది.

ఒక రోజు రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా ఉపవాసం ఉంటాడు. 49 వరోజు కొద్దిగా అన్నం వండుకుంటాడు. దాన్ని ఆరగించేలోగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు. అతను ఆ అన్నం తినేసి తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. ఆ సమయానికి ఒక కుక్క అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటాడు.

మరుక్షణమే దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

మూలాలు[మార్చు]