నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్

వికీపీడియా నుండి
(అబ్దుల్ వాహబుఖాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కర్నూలు నవాబు బంగ్లా

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ : (نواب عبدل وہاب خان) కర్నూలును 17 వ శతాబ్దంలో పరిపాలించిన వారిలో నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ ఒకడు. ఇతను పదహారు సంవత్సరాల కాలం నవాబుగా కర్నూలును పరిపపాలించాడు.[1] 1619-20 లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్, విజయనగర సామ్రాజ్యపు సామంత రాజైన ఆరవీటి గోపాలరాజు మధ్య యుద్ధం జరిగింది.[2] గోపాలరాజు తన బంధువులైన ఆనెగొంది, గండికోట, అవుకు, పెనుగొండ రాజుల సహాయంతో వహాబ్ ఖాన్ ను తిప్పి కొట్టాడు.[3] వహాబ్ ఖాన్ కర్నూలు కోటను ఆక్రమించే తొలి ప్రయత్నంలో విఫలుడైనాడు. వహాబ్ ఖాన్ 1624లో రెండవసారి దండయాత్ర చేశాడు. ఈసారి గోపాలరాజు తన బంధువుల నుండి ఏ సహాయాన్ని పొందలేకపోయాడు. ఒంటరిగా పోరాడి పరాజయం పాలయ్యాడు. వహాబ్ ఖాన్ కర్నూలును వశపరచుకున్నాడు. బీజాపూరు సుల్తాను, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా, ఈ విజయానికి కానుకగా వహాబ్ ఖాన్ ను కర్నూలు నవాబుగా ప్రకటించాడు.

అబ్దుల్ వహాబ్ ఖాన్, అబిస్సీనియా (ప్రస్తుత ఇథియోపియా - ఆఫ్రికా శృంగపు పరిసరాలు) కు చెందిన మహమ్మదీయుడు. ఈయన పాలనకు వస్తూనే అనేక హిందూ దేవాలయాలను మసీదులుగా మార్చి, వాటిని ధారాళంగా పోషించాడు. ఈయన పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసినట్టు చెబుతారు. కర్నూలు ప్రధానవీధిలోని ఆర్చితో గల అంగళ్ళను అబ్దుల్ వహాబ్ ఖాన్ చే కట్టించబడినవిగా చెప్పుకుంటారు.[4]

వహాబ్ ఖాన్ పదహారు సంవత్సరాల పాటు కర్నూలును పరిపాలించాడు. ఈయన తర్వాత తమ్ముడు అబ్దుల్ మహమ్మద్ పరిపాలించాడు. 1686లో బీజాపూరు సామ్రాజ్యం పతనమయ్యేవరకు జీజాపూరు సామంతులు కర్నూలును పరిపాలిస్తువచ్చారు.[4] ఔరంగజేబు సేనాని గయాజుద్దీన్ వహాబ్ ఖాన్ ను కూలదోశాడు. ఔరంగజేబు సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్ పన్నీకి కర్నూలును జాగీరుగా ఇచ్చారు. అతని కుమారుడు నవాబుగా ప్రకటించుకున్నాడు. దావూద్ ఖాన్ వంశస్థులు కర్నూలును 1839 వరకూ పరిపాలించారు. ఆతరువాత ఆంగ్లేయులు అప్పటి తన సామంతుడైన గులాం రసూల్ ఖాన్‌ తమ పాలనపై కుట్రచేస్తున్న విషయం తెలిసి ఖైదుచేసి కర్నూలును వశపరచుకున్నారు.[5]

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ హయాంలో కర్నూలు కోట.

నవాబ్ సమాధి[మార్చు]

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి, కర్నూలు.

కర్నూలు పట్టణంలోని ఉస్మానియా కాలేజి వద్ద ఈ సమాధి ఉంది. పట్టణంలో ప్రముఖ రాజవిహార్ కూడలి వద్ద గల రాజవిహార్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు ఒక వంతెనతో కలుస్తుంది. ఈ వంతెన హంద్రీనదిపై గలదు. దీని ఆవలే ఈ సమాధి ఉంది. ఈ సమాధి మరమ్మత్తులకు గాను పురావస్తుశాఖ, పర్యాటక శాఖ రెండుకోట్ల రూపాయలు కేటాయించింది.[6] ఈ సమాధిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఆయా శాఖలచే పలు కార్యక్రమాలు చేపట్టబడినాయి. ఈ సమాధి నిర్మాణం నవాబ్ వహాబ్ ఖాన్ మరణించిన తరువాత 1618 లో జరిగినట్టు విశ్వసిస్తున్నారు. ఈ సమాధి నిర్మాణంలో రెండు గుమ్మటాలు, మూడు వరండాలు, ఐదు ఆర్చీలు, చేపట్టుగోడలు ఉన్నాయి. నాలుగు శతాబ్దాల తరువాత దీని వీక్షకుల సంఖ్య పెరిగింది. కాబట్టి పురావస్తు శాఖ వారు దీనిని వారసత్వ ప్రదేశంగా పరిగణించి, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-03. Retrieved 2014-01-20.
  2. K. A., Nilakanta Sastri (1966). A History of South India: From Prehistoric Times to the Fall of Vijayanagar (Third ed.). Oxford University Press. p. 302. Retrieved 6 December 2014.
  3. "Gopal Darwaza stands as a witness to history". The Hindu. No. April 22, 2014. Retrieved 6 December 2014.
  4. 4.0 4.1 Narahari, Gopalakristnamah Chetty (January 1, 1886). A manual of the Kurnool district in the presidency of Madras. p. 29. Retrieved 4 December 2014.
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  6. "Wahab Khan tomb in Kurnool to get a facelift". The Hindu. No. July 2, 2013. Retrieved 6 December 2014.