ఊమెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊమెన్
జయదేవ్ చిత్రించిన ఊమెన్ రేఖా చిత్రం. (ఇతని ఫొటో ఎక్కడా అందుబాటులో లేదు)
జననంఫిబ్రవరి 20, 1920
కటానం గ్రామం, కేరళ
మరణంJuly 18 1984
మదరాసు
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంచెన్నై
ఇతర పేర్లుఊమెన్
వృత్తివ్యంగ్య చిత్రకారుడు
సంతకం

ఊమెన్ (Oomen) ఒక వ్యంగ్య చిత్రకారుడు. ఇతని రాజకీయ వ్యంగ్య చిత్రాలు ఎంతగానో ప్రసిద్ధిపొంది, శంకర్ పిళ్ళై (శంకర్స్ వీక్లీ ఆంగ్ల వారపత్రిక-1975లో ప్రచురణ ఆపివేశారు), అబు అబ్రహం (ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకప్పటి కార్టూనిస్ట్), ఆర్‌ కే లక్ష్మణ్ (టైమ్స్ ఆఫ్ ఇండియాలో కార్టూనిస్ట్) వంటి ప్రముఖ వ్యంగ చిత్రకారులు వేసిన వ్యంగ్య చిత్రాలతో సమానంగా నిలబడ్డాయి.

తెలుగులో వ్యంగ్య చిత్రాలు వేసేవారిలో ఎక్కువమంది, రాజకీయ వ్యంగ్య చిత్రాలకు దూరంగా ఉంటారు. బహు కొద్దిమందిమాత్రమే రాజకీయ వ్యంగ చిత్రాలు చిత్రించి, వార్తాపత్రికలలోని వార్తలను వినోదాత్మకంగా, సమాజానికి చురకలు అంటించి ప్రచురిస్తూ తమ జర్నలిజం ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటారు. తెలుగులో అటువంటి రాజకీయ వ్యంగ్య చిత్రకారులకు ఆద్యుడు ఊమెన్. నిజానికి, ఊమెన్‌కు తెలుగు రాదు. ఇతను ప్రతిరోజూ, ప్రతి వారం తాను వేసిన వ్యంగ్య చిత్రాలను ఆంగ్ల సంభాషణలను వ్రాసి, పత్రికకు పంపేవారట. అక్కడ పత్రిక సంపాదకులయిన శివలెంక రాధాకృష్ణ ఆ ఆంగ్ల సంభాషణలను తెలుగులోకి అనువదించి బొమ్మకి సరిపొయ్యేట్టుగా చేసి దిన/వార పత్రికలలో ప్రచురించేవారట.

ఊమెన్‌ను తెలుగు వారికి పరిచయం చేసిన ఘనత ఆంధ్ర పత్రికకు దక్కింది. 1960లలో ఆంధ్ర పత్రిక దినపత్రికలో "లోకం పోకడ" శీర్షికన ఇతని రాజకీయ వ్యంగ్య చిత్రాలు ప్రతిరోజూ ప్రచురించబడేవి. ఆ తరువాత ఆంధ్ర పత్రిక వారపత్రికలో కూడా "ఊమెన్ కార్టూన్లు" అని ఒక పూర్తి పేజీ శీర్షికను మొదలు పెట్టి, అంతకు మునుపటి వారంలో జరిగిన దేశీయ, అంతర్జాతీయ రాజకీయ సంఘటనల మీద వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టారు. ఈ శీర్షిక ఊమెన్ మరణించేవరకు నిరాఘాటంగా నిర్వహించబడింది..

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఊమెన్ కేరళీయుడు. ఈయన కేరళలోని తిరువాన్కూరుకు దగ్గరలో ఉన్న కటానం గ్రామంలో, ఒక సంపన్న కుటుంబంలో 1916, ఫిబ్రవరి 20న జన్మించాడు. తిరువనంతపురం సైన్సు కాలేజీ నుండి పట్టభద్రులయినాడు. ఆ తరువాత జర్నలిజం మీద ఉన్న ఇష్టంతో లండన్‌ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చేరి జర్నలిజంలో డిప్లొమా పొందినాడు. 1949లో తన వివాహం అయిన తరువాత మద్రాసు నగరంలో స్థిరపడ్డాడు. 1984 జులై 18 న హృదోగంతో మదరాసులో మరణించారు.

వృత్తి జీవితం[మార్చు]

స్వతహాగా మంచి చిత్రకారుడు ఊమెన్. దానికి తోడు, జర్నలిజంలో డిప్లొమా, వీటన్నిటికి మించి రాజకీయాలమీద అమితమయిన ఆసక్తి, తమ ఊళ్ళోని గ్రంథాలయంలో చేసిన అధ్యయనం, ఇవన్ని ఈయనను రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా మలిచాయి. తన ఇరవై రెండవ ఏట కార్టూనిస్ట్ జీవితం మొదలు పెట్టాడు. మొట్టమొదట, ఇతని కార్టూన్లు పాట్నా, అలహాబాదు నగరాలనుండి వెలువడుతున్న 'లీడర్ గ్రూపు' కు చెందిన ప్రచురణలలో వేయటం జరిగిందట. 'భారత్', 'సంగం' పత్రికలలో వేసిన కార్టూన్లకు మంచి ప్రజాదరణ లభించింది. తమిళ భాషలో వెలువడుతున్న 'కల్కి' పత్రికలో కూడా ఇతని వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి. భారత దేశంలోనే కాకుండా అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించబడ్డాయట. తెలుగులో ఆంధ్ర పత్రికలో మాత్రమే ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యేవి.

వ్యంగ్య చిత్రాల విశిష్టత[మార్చు]

తెలుగు వారిలో ఎంతగానో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడీయన. ఈయన తెలుగు వాడు కాదన్న విషయం కొంత తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే కాని తెలియని విషయమేకాని, ఈయన కార్టూన్లు చూస్తే తెలియదు. వ్యంగ్య చిత్రాలకు తీసుకున్న రాజకీయ విషయం, బొమ్మల కనుముక్కు తీరు ఇతని కార్టూన్లకు మంచి పేరు తెచ్చినాయి, ఎంతోమందికి చక్కటి రాజకీయ స్ఫూర్తిని అందచేసినాయి. రాజకీయాలను సామాన్యులకు కూడా అర్ధం అయ్యేట్టుగా చెయ్యటంలో ఈయన వ్యంగ్య చిత్రాలు మంచి సాఫల్యం పొందాయని చెప్పవచ్చు. తెలుగులోకి తర్జుమా చేసిన అప్పటి సంపాదకుకుడు శివలెంక రాధాకృష్ణ తెలుగులో రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తెర తీసి, మంచి ఒరవడిని ఏర్పరిచి తీర్చిదిద్దాడు. అప్పట్లో ఊమెన్ కార్టూన్ల కొరకు ప్రతి రోజూ, ప్రతి వారం ఎదురు చూసేవారట. ఫలానా, ఫలాన రాజకీయ సంఘటన జరిగింది, దీనికి ఊమెన్ తన కార్టూన్లలో ఎలా స్పందిస్తాడు, అని పాఠకులు ఆసక్తిగా ఎదురు చూసేవారట. ఇతను తమ వ్యంగ్య చిత్రాలలో రాజకీయ నాయకుల బోలుతనాన్ని, నోటితో ఒకటి చెప్పి, ఆచరణలో మరొకటి చేసే తత్వాన్ని హాస్య పూర్వకంగా ఎండకట్టేవాడు. ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఏదో ఒక రాజకీయ గొడుగు కిందకు చేరి, మిగిలిన రాజకీయ పార్టీలను ఎద్దేవా చేసి ఇరుకున పెట్టే జర్నలిజం ప్రక్రియకు దూరంగా ఉండి, సాధ్యమయినంత వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు, గౌరవం సంపాదించుకున్నాడు.

ఊమెన్ చురకలు[మార్చు]

ఇతని కార్టూన్లలోని కొన్ని చురకలను ఇక్కడ ఉదహరించబడినాయి.

  • 1960లలో ప్రచురించబడ్డ ఒక వ్యంగ్య చిత్రంలో, చూడంగానే రాజకీయనాయకుడు అనిపించే ఒకాయన, తన ఇంట్లో బల్లెక్కి నుంచుని ఉపన్యాసం దంచుతుంటే, అతని కొడుకు తల్లిని అడుగుతుంటాడు, "అమ్మా! నాన్నకేమైనా పిచ్చెక్కిందా" అని. కొడుక్కి సమాధానంగా తల్లి "లేదు బాబూ! ఆయన పార్లమెంటుకు ఎన్నికైతే ఇవ్వదలచిన ఉపన్యాసం రిహార్సల్‌రా ఇది" అని. పార్లమెంటులో సభ్యుల నడవడిక తీరు మీద వ్యంగ్యం.
  • 1960లలోనే ప్రచురించబడ్డ మరొక వ్యంగ్య చిత్రంలో, రాజకీయ నాయకుడు ప్రజలను ఉద్దేసించి మాట్లాడుతూ "మహాజనులారా! ......ఈనాడు విద్యావసతులు వృద్ధి అయ్యాయి కనుకనే, నిరుద్యోగ సమస్య ఎదురైంది; ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టే, ధరవరలు పెరిగాయి; వాడకం ఎక్కువయింది కాబట్టే కాటకం ఏర్పడింది; అవినీతి అంటారా దినదినాభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో, అది ఉండక తప్పదు మరి....."అని అంటూ ఉంటే, నివ్వెరపోయి వింటూ ఉంటారు శ్రోతలు. రాజకీయ నాయకులు తమ వాదనా పటిమతో తప్పులను కప్పి పుచ్చుకోవటానికి చేసే అసమంజస వాదనలను ఎండకడుతుంది ఈ వ్యంగ్య చిత్రం. అమెరికా అధ్యక్షుడు, జార్జ్ బుష్ 2008 సంవత్సరంలో వారి దేశంలో ఎర్పడ్డ ఆర్థిక సంక్షోభ కారణాలు విశ్లేషిస్తూ, ఇటువంటి వితండవాదమే చేసి ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలయ్యాడు.

అభిప్రాయాలు[మార్చు]

  • ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ -రాజకీయాలను కార్టూన్లలో ఇమడ్చటం చాలా కష్టమైన పని. అదొక ప్రత్యేకమైన కళ. ఎంతోమంది ప్రయత్నించినా, ప్రతిభ కొందరికే దక్కింది. శంకర్, లక్ష్మణ్, అబూలకు అంతర్జాతీయ ఖ్యాతి కూడా లభించింది. వీరిని గురించి అందరికీ తెలుసు. ఇంచుమిచు అంతే ఖ్యాతిని అర్జించుకునీ, కొందరికి మాత్రమే మిగిలి పోయిన రాజకీయ చిత్రకారుడు ఊమెన్. ఊమెన్ కార్టూన్లలో కొట్టొచ్చిన విశిష్టత కనిపిస్తుంది.

మూలాలు[మార్చు]

స్వాతి పత్రికలో శ్రీ జయదేవ్ వ్రాసిన వ్యాసంలోనుండి కొన్ని వివరాలు, ఈ వ్యాసంలో పొందుపరచటం జరిగింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఊమెన్&oldid=3590984" నుండి వెలికితీశారు