కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె | |
---|---|
జననం | కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె 1936 ఫిబ్రవరి 1 చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామం |
మరణం | చిత్తూరు జిల్లా మదనపల్లె | 2016 జనవరి 11
నివాస ప్రాంతం | మదనపల్లి |
ఇతర పేర్లు | భాషాప్రవీణ |
వృత్తి | తెలుగు పండితులు |
ప్రసిద్ధి | మదనపల్లె రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి |
పదవి పేరు | భాషాప్రవీణ |
మతం | హిందూ |
భార్య / భర్త | హేమావతి |
పిల్లలు | విద్యాసాగర్ వినయ సాగర్ అరుణశ్రీ కరుణశ్రీ |
తండ్రి | కుమారస్వామి పిళ్ళె |
తల్లి | కృష్ణమ్మ |
భాషాప్రవీణ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (ఫిబ్రవరి 1, 1936 - జనవరి 11, 2016) ప్రముఖ రచయిత, తెలుగు పండితులు.
జీవిత విశేషాలు[మార్చు]
1936, ఫిబ్రవరి 1 న చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామంలో కృష్ణమ్మ కుమారస్వామి దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య మదనపల్లె, పలమనేరులలోనూ, ఇంటర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి, భాషాప్రవీణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆపై చిత్తూరు జిల్లాలోఅనేక ఉన్నతపాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేసి 1994 లో కలిచెర్లలో పదవీ విరమణ చేసారు.
వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. ఆయన తెలుగు పద్యకావ్యం "విషాద మాథవి"కి ముందుమాట రాసిన పల్లంపాటి వెంకటసుబ్బయ్య "పద్య విద్య తెలిసిన కవి" అని ప్రశంసించాఅరు. తరువాతి పద్యకావ్యం "చరిత్రకెక్కిన మారణహోమం" అత్యాధునిక స్త్రీవాద భావాలతో కూడిన ఈ రెండు గ్రంథాలకూ మూల కథలు మహాభారతంలోనివి. మరో పద్యకావ్యం "ఒక రాఘవరెడ్డికథ" మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్యన నలిగిపోయే అటవీ ప్రాంతాల ప్రజల దీనగాథ. దీనినే "మర్రిమాను సాక్షిగా" పేరిత సాంఘిక నవలా రూపంలో వెలువరించారు.
"ఓరుగల్లు-వీరగల్లు" పద్యకావ్యం, "చండాలుడు" పౌరాణిక నవల, ఆధ్యాత్రిక గ్రంథం "శ్రీశంకరాచార్యులట కవితా వైభవం" వెలువరించిన పిళ్ళైని ఆకాశానికి ఎత్తిన చారిత్రక నవల మాత్రం "బోయకొట్టములు పండ్రెండు". ఇక, తెలుగు మీద అపారమైన అభిమానంతో తెలుగు భాష స్థితిగతులమీద "వెలుగు తగ్గిన తెలుగు", "తెలుగు ఎప్పుడు? ఎక్కడ? ఎలా?" రాశారు. ఇంకా కథలు, నాటకాలు, వ్యాసాలు లెక్కలెనన్ని వెలువరించిన వీరు ఒక నడిచే గ్రంథాలయం లాంటి వారని ఆయన్ని ఎరిగిన వారందరికీ తెలుసు.
వారి చొరవతోనే నిద్రావస్థలో ఉన్న మదనపల్లె చేతన కళాపరిషత్ కాస్తా మదనపల్లె రచయితల సంఘం (మరసం) గా మార్పు చెంది నిరవధికంగా సాహిత్య కార్యక్రమాలు మొదలు పెట్టింది. అని రచయిత టి.ఎస్.ఎ.కృష్మూర్తి గుర్తుచేసుకున్నారు.
రచనలు[మార్చు]
సంస్కృతం[మార్చు]
- కలిచెర్ల శ్రీ పట్టాభిరామ సుప్రభాతం
- యక్షప్రశ్నోపాఖ్యానం
- ఘోషయాత్ర
తెలుగు[మార్చు]
పద్యకావ్యాలు[మార్చు]
- విషాద మాధవి
- చరిత్రకెక్కిన మారణహోమం
- ఒక రాఘవరెడ్డి కథ
- ఓరుగల్లు - వీరగల్లు
నాటకాలు[మార్చు]
- దివిలో కవిసమ్మేళనం
- అన్వేషణ - అంభి
కథలు[మార్చు]
- ఆ నవ్వే
- జింకపిల్ల
- గుండె ఊసులాడింది
నవలలు[మార్చు]
- చండాలుడు
- మర్రిమాను సాక్షిగా
- బోయకొట్టములు పండ్రెండు
వ్యాస సంపుటులు[మార్చు]
- ఈ పద్యం నేర్చుకుందామా!
- వెలుగు తగ్గిన తెలుగు
పురస్కారాలు, బిరుదులు, గుర్తింపు[మార్చు]
- 9వ ఆటా మహాసభల కథల పోటీలో రూ. 7000 పారితోషికం అందుకున్న కథకు రచయిత
- 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీలో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం రచయిత
మరణం[మార్చు]
వీరు 2016, జనవరి 11వ తేదీ మదనపల్లెలో మృతిచెందారు.