కాళ్ళకూరి సదాశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో తొలి జానపద చిత్రం గులేబకావళి కథ తీసాడు. 1939లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. పాటలు, పద్యాలకు భిన్నంగా ఆ సినిమాలో ఉన్న కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

జీవిత విశేషాలు[మార్చు]

అతను "చింతామణి" , "వరవిక్రయం", "మధుసేవ" వంటి నాటకాలు రాసి జనాన్ని చైతన్యవంతుల్ని చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు కుమారుడు సదాశివరావు. మూకీల కాలం నుండి అతనికి చిత్రపరిశ్రమతో సంబంధం ఉంది. అతను 1901 ఫిబ్రవరి 13న కాకినాడలో జన్మించాడు. నెల్లూరు లో జిల్లా బోర్డు విద్యా శాఖాధికారి కాళ్లకూరి దక్షిణామూర్తి అతని అన్నయ్య. కాకినాడలో పి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ కోర్స్ చదివారు. ఉద్యోగ వేటను ప్రారంభించి అతను రంగూన్‌లో సినిమా మెజిస్టిక్ అనే థియేటరుకు అసిస్టెంటుగా 1932లో ఉద్యోగంలో చేరి నాలుగు నెలల పాటు పనిచేసాడు. అక్కడి వాతావరణంలో ఇమడలేక కాకినాడ తిరిగి వచ్చేసాడు.[1]

చిత్ర పంపిణీ సంస్థ స్థాపన[మార్చు]

చిత్తజల్లు పుల్లయ్య కు కాకినాడలో ఒక థియేటర్, ఒక టూరింగ్ టాకీసు ఉండేవి. రంగూను నుండి వచ్చిన తరువాత సదాశివరావు పుల్లయ్యను పరిచయం చేసుకొని అతని వద్ద అసిస్టెంటుగా చేరాడు. ఆ థియేటర్ల నిర్వహణా భాద్యతలను చూసుకొనేవాడు. ప్రదర్శనా రంగంలో అనుభవం పొందడంతో పుల్లయ్య ప్రోతసహంతో కొంతమంది మిత్రులనుకలుపుకొని "ఇంపీరియల్ పిక్చర్ ప్యాలస్" అనే థియేటరును ప్రారంభించాడు. ఆధాయం పెరిగే సరికి భాగస్వముల మధ్య విభేదాలు తలెత్తడంతో స్వంతంగా "కాకినాడ ఫిలిం ఎక్చేంజి" పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పాడు.

చిత్ర రంగ ప్రవేశం[మార్చు]

ఎనిమిదేళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాలను కొనసాగించిన అతను ఎన్నో మూకీ చిత్రాలను తీసుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు ప్రదర్శించాడు. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తారనే అవగాహన ఏర్పడింది. ఆ సమయంలో టాకీల నిర్మాణం ప్రారంభమైంది. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో అతను కలకత్తా వెళ్ళి రాధాకిషన్ చమ్రియాను కలిసాడు. అతని సంకల్పం తెలిసిన రాధాకిషన్ మదన్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి సదాశివరావు దర్శకత్వంలో చింతామణి చిత్రాన్ని నిర్మించాడు. 1933లో విడుదలైన ఈ చిత్రంలో రామతిలకం, పులిపాటి తదితరులు నటించారు. తన తండ్రి రాసిన చింతామణి నాటకం ఆధారంగా తొలి సినిమా తీసాడు.

అతను తన సినిమాలకు స్వయంగా స్క్రిప్టు తయారుచేసుకొనేవాడు. "సతీ సులోచన" చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం అతను ప్రవేశపెట్టాడు. తొలి టాకీ సినిమా "భక్త ప్రహ్లాద" లో హిరణ్యకశిపునిగా నటించిన వి.వి.సుబ్బారావు ఈ చిత్రంలో రావణాసురునిగా, ఇందజిత్తుగా రెండు పాత్రలను పోషించాడు. అలాగే జానపద చిత్రాల్ని నిర్మించిన ఘనత కూడా అతనిదే.[1]

1940 లో చంద్రహాస సినిమాకు మొదటి సారిగా దర్శకత్వం వహించాడు. కానీ మధ్యలో కంపెనీ వారితో అబిప్రాయ భేదాలు ఏర్పడి ఆ సంస్థనుండి మధ్యలోనే తిరిగి వచ్చేశాడు.

భక్త కుచేల

సినిమాలు[మార్చు]

ఆర్మీలో నాలుగేళ్ళు[మార్చు]

1942లో మద్రాసులో యుద్ద వాతావరణం నెలకొన్న రోజులలో ఆర్మీలోని వినోద శాఖలో చేరి సైనికులకు ఆహ్లాదాన్ని పంచాడు. అలాగే నాలుగేళ్ళు చిత్రరంగానికి దూరంగా ఉండి అర్మీలోనే కొనసాగాడు.

తిరిగి సినిమాలలోకి[మార్చు]

యుద్దం ముగిసిన తరువాత 1946లో అతను నెల్లూరు వెళ్ళిపోయాడు. అతని అత్తవారు ఊరు కూడా అదే. అప్పటికి చిత్రరంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఆ వాతావరణానికి ఇమడలేక మద్రాసు వదిలి నెల్లూరు చేరుకున్నాడు. ఆ ఊరి పెద్దల సహకారంతో మళ్ళీ సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చాడు. 1947లో సువర్ణలతా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి "సువర్ణమాల" సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆంధ్రా బ్యాంకు లో పనిచేసే సూర్యనారాయణ, బాలసరస్వతి ఇందులో నటించారు. ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో చిత్ర నిర్మాణం కొనసాగించలేక పోయాడు. బయట సినిమాలకు అవకాశాలు రాకపోవడం, సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోవడంతో పబ్లిసిటీ ఆఫీసును ప్రారంభించాడు. దీనిని 1950 నుండి 1953 వరకు నడిపాడు. తరువాత ఆ సంస్థను కూడా మూసివేసాడు.

తరువాత హైదరాబాదులో "చిత్ర కల్పనాలయ" పేరుతో యాక్టింగ్ స్కూలును 1966లోప్రారంభించాడు.

కొంత కాలానికి హైదరాబాదులోనే మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "జానపద చిత్రాల నిర్మాణానికి ఆద్యుడు 'కాళ్ళకూరి'". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-31.

బాహ్య లంకెలు[మార్చు]