గుర్రం మల్లయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రం మల్లయ్య
గుర్రం మల్లయ్య
జననంగుర్రం మల్లయ్య
గుంటూరు జిల్లా, కొత్తూరు
ప్రసిద్ధిచిత్రకారుడు , స్వాతంత్ర్య సమరయోధుడు.
మతంహిందూ
తండ్రిగుర్రం వీరయ్య
తల్లినాగలక్ష్మమ్మ

గుర్రం మల్లయ్య ప్రముఖ చిత్రకారుడు, శిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు[1].

విశేషాలు[మార్చు]

ఇతడు గుర్రం వీరయ్య, నాగలక్ష్మమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, కొత్తూరులో జన్మించాడు.[2] ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా, మాచెర్ల. ఇతడు బందరు జాతీయ కళాశాలలోని ప్రముఖ చిత్రకళా కోవిదులు ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రకళను అభ్యసించాడు. ఇంటర్‌మీడియట్ వరకు చదివి 1920 లో కలకత్తా వెళ్ళి అవనీంద్రనాథ్ ఠాగూర్‌వద్ద శాంతి నికేతన్‌లో మూడు సంవత్సరాలు చిత్రకళాభ్యాసం చేశాడు. ఆ సమయంలో ఇతడు వేసిన చిత్రాలు, వ్రాసిన వ్యాసాలు బెంగాలీ భాషా పత్రికలలోను ఇతర భాషల పత్రికలలోను ప్రచురితమయ్యాయి.

ఇతడు వేసిన కొన్ని ప్రముఖమైన చిత్రాలు:

  • నీలకంఠ
  • బాలచంద్ర
  • మాంచాల
  • శివతాండవం
  • వరూధిని
  • వూర్వశి
  • రాధాకృష్ణ
  • కృష్ణార్జున
  • గ్రీష్మ సాయంకాలం
  • కుటీర పరిశ్రమ మొదలైనవి.

ఇతడు కలకత్తాలో శిక్షణ పొందిన తరువాత తిరిగి బందరు వచ్చి జాతీయ కళాశాలలో చిత్రకళాధ్యాపకుడిగా చేరాడు. కళాశాలలో పనిచేస్తున్నప్పుడే గాంధీజీ పిలుపును అందుకుని మద్యపాన నిషేధము, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగులు నిర్వహించడంతో అరెస్టయ్యాడు. ఇతడు మాచర్లలో నవయుగ చిత్రకళా సమితి పేరుతో ఒక సంస్థను స్థాపించి ఎందరినో చిత్రకారులుగా తీర్చిదిద్దాడు[3]. నాగార్జున కొండ నుండి కొన్ని అపురూపమైన శిల్పాలను విదేశీయులు తరలించుకు పోవడాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి ఆ శిల్పసంపద మన దేశం నుండి తరలిపోకుండా కాపాడాడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఇక్ష్వాకుల కాలం నాటి విజయపురి శిథిలాలను, శిల్పాలను నీటిలో మునిగిపోకుండా భద్రపరచవలసిన ఆవశ్యకతను ఇతడు స్వయంగా నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు విన్నవిస్తే నెహ్రూ స్వయంగా పరిశీలించి వాటి నమూనాలు తయారు చేయించి కొండపై మ్యూజియం ఏర్పాటు చేసి వాటిలో ఉంచవలసిందిగా ఆదేశించాడు. నెహ్రూ ఆదేశం ప్రకారం ఇతడే అన్ని నమూనాలు తయారు చేశాడు. నాగార్జున శిల్పకళ ప్రావీణ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఇతడు కోలవెన్ను రామకోటేశ్వరరావుతో కలిసి నాగార్జున శిల్పకళా పీఠాన్ని నెలకొల్పి 11 సంవత్సరాలు అనేక మందికి శిక్షణ ఇచ్చి మంచి శిల్పులుగా తయారు చేశాడు. కోస్లా కమిటీని పల్నాడుకు రప్పించి, నంది కొండ ప్రాంతాలను చూపించి, వారు చూసిన, చూడదలచిన ప్రాజెక్టు ఏరియాలు అన్నిటి కంటే నందికొండ అనువైనస్థలమని వారికి నచ్చచెప్పి నాగార్జునసాగర్ ఆ ప్రాంతానికి రావడానికి ఇతడు చేసిన ప్రయత్నం ఎనలేనిది. ఇతడిని ఆచార్య రంగా "అభినవ బ్రహ్మన్న"గా వర్ణించాడు.

మరణం[మార్చు]

ఈయన మాచర్లలో 1984 మార్చి 6 న కన్నుమూశారు.

మూలాలు[మార్చు]

  1. అక్కల, కోటయ్య (7 November 1980). "దేశభక్తుడు - చిత్రకారుడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 294. Retrieved 30 January 2018.[permanent dead link]
  2. వెబ్ మాస్టర్. "Gurram Mallaiah". art@telangana. Retrieved 30 January 2018.[permanent dead link]
  3. A STUDY OF ANDHRA JATEEYA KALASALA

బయటి లింకులు[మార్చు]