గోదావరి నిత్య హారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజమండ్రి వద్ద గోదావరికి నిత్యహారతి
రాజమండ్రి వద్ద గోదావరి నిత్యహారతి దృశ్యం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నగోదావరి నదిని ఆరాధించే కార్యక్రమమే గోదావరి నిత్య హారతి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు దేవాదాయ ధర్మాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టులు సంయుల్క్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తొలుత ప్రతి పున్నమికీ హారతి ఇవ్వడంతో ట్రస్టు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, ఆ తర్వాత గోదావరి పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భాగస్వామ్యంతో నిత్య హారతిగా మారింది[1].

ఇలా మొదలైంది[మార్చు]

వారణాసిలో నిర్వహించే నిత్య గంగాహారతి మాదిరిగా రాజమండ్రిలో కూడా గోదావరికి హారతి సమర్పించాలని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు సంకల్పించి, 2010 లో కార్తీక పౌర్ణమి హారతితో శ్రీకారం చుట్టింది. గంగానదికి కాశీ, హరద్వార్‌లలో ఇచ్చే విధంగా గోదావరికి కూడా హారతి ఇవ్వాలన్న ఆలోచన ట్రస్టు అధిపతి బుద్ధవరపు కుమార్‌కు కలిగింది. సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను పండితులను కాశీ, హరద్వార్‌లకు తీసుకువెళ్ళి అక్కడ శిక్షణ ఇప్పించారు. హారతికి అవసరమైన సామాగ్రిని ప్రత్యేకంగా తయారు చేయించారు. రాజమహేంద్రవరం పుష్పగిరి (పుష్కరాల) రేవులో కార్తిక పౌర్ణమి హారతితో ప్రారంభించిన ట్రస్టు, ప్రతినెలా పౌర్ణమికి హారతి కార్యక్రమం నిర్వహించింది.

హారతిచ్చేదిలా[మార్చు]

ముందుగా మహిళలు లలితా, విష్ణు సహస్ర నామ పారాయణాలు చేస్తారు. గోదావరి మాత విగ్రహానికి హారతి సమర్పిస్తారు. ఆ తర్వాత గోదావరికి 14 రకాల హారతులు ఇస్తూ, వాటి ప్రాధాన్యత వివరిస్తుంటారు. ఈ హారతుల దర్శనం వలన కింది విధంగా ఫలితాఅలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

  1. ధూప హారతి: దీనిని దర్శిస్తే, చెడు దోష నివారణ, కలుగుతుంది.
  2. ఏక హారతి: దీనిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
  3. నేత్ర హారతి: ఈ హారతి దర్శిస్తే, నేత్రములకు సంబంధించిన దోషములు తొలగిపోతాయి.
  4. బిల్వ హారతి: ఈ హారతి దర్శనం వలన మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి.
  5. నాగ హారతి: దీనిని దర్శించడం వలన నాగ దోషములు తొలగిపోతాయి.
  6. పంచ హారతి: ఈ హారతిని దర్శిస్తే, పంచ మహాపాతకాలు తొలగిపోతాయి.
  7. వృక్ష హారతి: ఈ హారతిని దర్శిస్తే, ప్రకృతికి హాని చేసివుంటే పోతుందని.
  8. నంది హారతి: ఈ హారతిని దర్శిస్తే, నందీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
  9. సింహ హారతి: దీనిని దర్శించిన పక్షంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
  10. రుద్ర హారతి: ఈ హారతిని దర్శిస్తే, ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది.
  11. చక్ర హారతి: ఈ హారతిని దర్శిస్తే, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది.
  12. కుంభ హారతి: ఈ హారతిని దర్శిస్తే, గ్రహ దోషాలు పోయి, ఐశ్యర్య సిద్ధి కలుగుతుంది.
  13. కర్పూర హారతి: ఈ హారతిని దర్శిస్తే, అనేక దోషాలు తొలగిపోతాయి.
  14. నక్షత్ర హారతి: ఈ హారతిని దర్శిస్తే, నక్షత్ర, జాతక దోషాలు తొలగిపోతాయి.

2003 గోదావరి పుష్కరాలలోనే నాంది[మార్చు]

వాస్తవానికి 2003 గోదావరి పుష్కరాల సందర్భంగానే గోదావరికి హారతి ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు. కొన్నాళ్ళు దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యాన పున్నమి హారతి మొదలైంది. ట్రస్టు, గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫంటుమీద ప్రతియేటా వార్షిక పౌర్ణమి హారతి కనువిందుగా సాగిస్తూ వచ్చారు. కార్తీక పౌర్ణమినాడు లక్షలమంది భక్తుల సమక్షంలో నిర్వహించే ఆ హారతి ఉత్సవంలో పలురంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన వారికి సత్కార కార్యక్రమాలను ట్రస్టు నిర్వహిస్తూ వచ్చింది. కొంత కాలం తరువాత అన్నవరం దేవస్థానము, ఆ తరువాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం వహించాయి.

2013 హారతి ఉత్సవం[మార్చు]

జీవనది గోదావరికి కార్తీక పౌర్ణమి సందర్భంగా 2013 నవంబరు 17 ఆదివారం రాత్రి కన్నులపండువగా హారతి ఉత్సవం నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమికి హారతి సమర్పిస్తున్న బుద్దవరపు ఛారిట బుల్ ట్రస్టు కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఉత్సవం నిర్వహిస్తోంది. 2012 లో దేవదాయ శాఖ, అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఈ ఉత్సవంలో భాగస్వామ్యం వహించగా 2013 లో కూడా పాలుపంచుకున్నాయి. యథావిధిగా లలితా సహస్రనామ పారాయణ జరిగింది. హైదరాబాద్ ఫణి నారాయణ బృందం జుగల్ బందీ, అనంతరం హైదరాబాద్ నృత్యమాల అకాడమీకి చెందిన 16 మంది కళాకారులు "ప్రణతోస్మి గౌతమీ" కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. గోదావరి జలాలను కాలుష్య కోరలనుంచి కాపాడుకోడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్న సందేశంతో సాగింది ఆ నృత్య రూపకం. అనంతరం రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి, తితిదే పూర్వపు కార్యనిర్వహణాధికారి, ప్రముఖ రచయిత పి.వి.ఆర్.కె.ప్రసాదును బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్టు పక్షాన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారంతో అప్పటి హెచ్.ఎం.టి. వి. చీఫ్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి చేతులమీదుగా సత్కరించారు.

2014 లో గోదావరి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ[మార్చు]

పౌర్ణమి హారతికి 50 మాసాలు పూర్తైన సందర్భంగా, 5వ వార్షిక వేడుక నేపథ్యంలో పలు అంశాలు జోడించి, 2014 నవంబరు 6, కార్తిక పౌర్ణమి నాడు హారతి ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. దీంతో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సందడి నెలకొంది. ఆ రోజు ఉదయం గోదావరి పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులు, పౌరులతో ఎ.బి.ఎన్. (ఆంధ్రజ్యోతి) చానెల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ, పుష్కర్ ఘాట్ దగ్గర సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.

స్వచ్చ గోదావరిఫై చర్చ[మార్చు]

ఆ తర్వాత, పుష్కరాల రేవు రెండు వంతెనల నడుమ బోట్ మీద 'స్వచ్ఛ గోదావరి' చర్చా కార్యక్రమాన్ని వేమూరి రాధాకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫైడికొండల మాణిక్యాలరావు, మేయర్ పంతం రజనీ శేషసాయితో పాటు ఇతరులు పాల్గొన్నారు. గంగానది కాలుష్య నివారణకు ఏవిధంగా కార్యచరణ చేస్తున్నారో అలాగే గోదావరి కాలుష్య నివరణ పథకం అమలు చేయాలని, ఉత్తరాన గంగ ఎలాగో, దక్షిణాన గోదావరికి కూడా అంతే ప్రాధాన్యత వుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్దారు.

హారతి ఉత్సవంలో గోదావరి పురస్కారాలు[మార్చు]

ఇక ఆ రోజు సాయంత్రం గోదావరి నదిలో సాలంకృత పంటు మీద హారతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. మహిళలచే సామూహిక నామ పారాయణ, హైదరాబాద్ నృత్యమాల అకాడమీచే గణేశ నృత్య ప్రార్థన, చెన్నైకి చెందిన బోంబే సిస్టర్స్ సంగీత కచేరీ జరిగాయి. ఈ సందర్భంగా ప్రతియేటా ఇచ్చే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (సాహిత్యం) గోదావరి పురస్కారంతో పాటు గోదావరి తీరంలో వివిధ రంగాలలో కృషి చేసిన ప్రముఖుల పేరిట మొత్తం ఐదుగురికి గోదావరి పురస్కారాలు ఇచ్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (సాహిత్యం) గోదావరి పురస్కారాన్ని రిటైర్డ్ ఐ.పీ.ఎస్. అధికారి రచయిత రావులపాటి సీతారామారావుకు ఎ. రవిశంకర ప్రసాద్ (పత్రికా రచన, పౌర హక్కులు, అవినీతి వ్యతిరేక ఉద్యమం) గోదావరి పురస్కారాన్ని మల్లేపల్లి లక్ష్మయ్యకు, సర్ ఆర్థర్ కాటన్ (నీటిపారుదల,వ్యవసాయం) గోదావరి పురస్కారాన్ని ఇరిగేషన్ పూర్వపు చీఫ్ ఇంజనీర్ బి.వి.ఎస్.రామారావుకు,ఎస్.వి.రంగారావు (కళారంగం) గోదావరి పురస్కారాన్ని డాక్టర్ దాసరి నారాయణరావు తరపున ఆయన కుమారుడు అరుణకుమార్‌కు, జిఎంసి బాలయోగి (సంఘసేవ, నిష్కళంక ప్రజాసేవ) గోదావరి పురస్కారాన్ని సామాజిక సేవకురాలు శ్రీమతి సునీతా లక్ష్మణ్‌కు అందజేసి, 25వేల రూపాయల నగదు, జ్ఞాపికలతో సత్కరించారు.

పుష్కరాల్లో నిత్యహారతికి శ్రీకారం[మార్చు]

2015 గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచి పౌర్ణమి హారతిని నిత్య హారతిగా మార్చాలని బుద్ధవరపు ట్రస్ట్ సంకల్పించింది. ఈ ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తేవడంతో ఆయన అంగీకరించి మరింత వినూత్న స్థాయిలో జరిగేలా చూడాలని తద్వారా హారతి చూసేందుకు పర్యాటకులు తరలి వస్తారని సూచించారు. ఆ బాధ్యతను ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. ఆయన సినీ తరహాలో లైటింగ్ ఏర్పాట్లు చేయించి మొదటి, మూడవ రైలు వంతెనల నడుమ పంటులో ఏర్పాటు చేయించారు. 2015 జూలై 1 నుంచి నిత్యహారతి లాంఛనంగా మొదలు పెట్టారు. ఇక అటు గట్టుపై నుంచి ఉత్తర దిశకు తిరిగి ఇచ్చే హారతి ఇచ్చేవిధంగా నిత్య హారతి కానిస్తున్నారు. పర్వదినాల్లో మాత్రం నదిలో ఉండి తూర్పు వైపునకు ఇచ్చే హారతి ఇస్తున్నారు. గురుపూర్ణిమ, శంకర జయంతి, శ్రావణ శుక్రవారం, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, దుర్గాష్టమి, విజయ దశమి, కార్తిక పున్నమి, సంక్రాంతి, ఉగాది వంటి పండుగ పర్వదినాల్లో మహాహారతి ఇస్తున్నారు.

నిత్యహారతి తిలకించిన ప్రముఖులు[మార్చు]

గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రివర్గ సభ్యులు, సింగపూర్ ప్రతినిధులు, బాబా రాందేవ్, కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్ తదితర ప్రముఖులు నిత్యహారతిని తిలకించారు. 2016 జూలై 1 నాడు నిత్యహారతి తొలి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

కృష్ణా హారతికి స్ఫూర్తి[మార్చు]

ఇక 2016 కృష్ణా నది పుష్కరాల సందర్భంగా కృష్ణా హారతి ఇచ్చారు. అందుకు గోదావరి హారతి స్ఫూర్తిగా నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. http://sarikothasamacharam.com/sarikotha-samacharam-12th-issue-8-7-16/[permanent dead link]

[1]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; sarikothasamacharam.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు