నారా చంద్రబాబునాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారా చంద్రబాబునాయుడు
ప్రతిపక్షనాయకుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
Assumed office
2019 మే 30 - ప్రస్తుతం
అంతకు ముందు వారువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
In office
2004 మే 14 – 2014 జూన్ 2
అంతకు ముందు వారువై.యస్. రాజశేఖరరెడ్డి
తరువాత వారువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి
In office
1995 సెప్టెంబరు 1 – 2004 మే 13
గవర్నర్కృష్ణకాంత్
గోపాల రామానుజం
సి.రంగరాజన్
సుర్జీత్ సింగ్ బర్నాలా
అంతకు ముందు వారుఎన్.టి.రామారావు
తరువాత వారువై.యస్. రాజశేఖరరెడ్డి
In office
2014 జూన్ 8 – 2019 మే 23
గవర్నర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
తరువాత వారువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
శాసనసభ సభ్యుడు
కుప్పం శాసనసభ నియోజకవర్గం
Assumed office
1989 - ప్రస్తుతం
అంతకు ముందు వారుఎన్.రంగస్వామి నాయుడు
శాసనసభ సభ్యుడు
చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం
In office
1978–1983
తరువాత వారుమేడసాని వెంకట్రామనాయుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1950-04-20) 1950 ఏప్రిల్ 20 (వయసు 73)
నారావారిపల్లె, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
రాజకీయ పార్టీ1983 తర్వాత తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ (1978-1983)
సంతానంనారా లోకేశ్ (ఏకైక పుత్రుడు)
బంధువులుఎన్.టి.రామారావు(మామయ్య)
నందమూరి బాలకృష్ణ(బావ)
నందమూరి హరికృష్ణ(బావ)
దగ్గుబాటి పురంధేశ్వరి(వదిన)
జూనియర్ ఎన్. టి. ఆర్ (మేనల్లుడు)
నందమూరి కళ్యాణ్‌రాం(మేనల్లుడు)
నందమూరి తారకరత్న(మేనల్లుడు)
నారా రోహిత్ (తమ్ముని కొడుకు)
నివాసంఅమరావతి, భారతదేశం
హైదరాబాదు, భారతదేశం
కళాశాలశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం

నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.[1][2][3][4] అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.[5][6][7][8] అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.

ప్రారంభ జీవితం, విద్య

ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.[9][10] అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.[11] ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో 1972లో బి.ఎ., తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.[12]

ప్రారంభ రాజకీయ జీవితం

చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను, మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నాడు.[12]

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యుహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది.

శాసన సభ్యుడు, 1978–1983

చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.[13] కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు.[14] 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు.

సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు.[15]

తెలుగుదేశంపార్టీ

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న ప్రారంభించాడు.[16] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు.

1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు.[9] తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.

పార్టీలో ఎదుగుదల

1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.

1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది.[17]

శాసనసభ్యుడు, 1989–1994

1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.[18] కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు.[19] 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.[18]

ముఖ్యమంత్రిగా (1995–2004)

Dark-haired man giving gifts to grey-haired man
2000 లో బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తున్న నాయుడు

1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి, విద్యుత్ సుంకాలను పెంచాడు.[20] అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు.[6] అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు. ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది. [21][22]

విజన్ 2020

భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను "విజన్ 2020" పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.[6]

Middle-aged man listening to two younger men
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో చర్చిస్తున్న దృశ్యం.
  • సార్వజనీనమైన, తక్కువ ఖర్చుతో విద్య,ఆరోగ్యాన్ని అందించడం.
  • గ్రామీణ ఉపాధి
  • చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు.

విజన్ 2020 ను అమలు చేయడం ద్వారా, నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించాడు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన / లాభదాయకమైనది కాదనీ, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలనీ తెలిపాడు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది.[6]

సంక్షేమ కార్యక్రమాలు

1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించాడు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశాడు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు.[23]

జాతీయ రాజకీయాలపై ప్రభావం

1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు.[24]

1999 ఎన్నికల విజయం

1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.

హైదరాబాదు అభివృద్ధి

Large round building, with cross-hatched superstructure
హై-టెక్ సిటీ, హైదరాబాద్‌లో నాయుడు రత్న కిరీటం.

ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.[25] తన లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు.[26] మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు.[7][27] అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.[28] ఇది దేశంలో నాల్గవ అతి పెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.[29] దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది.

రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర

రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్‌ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు[24].

2003 హత్యా ప్రయత్నం

2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.[30] ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 25, 2014, గురువారం తీర్పు చెప్పింది.[31]

2004 ఎన్నికలలో ఓటమి

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.[32] కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.

2014 ఎన్నికలలో విజయం

చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.[33] ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2014 జూన్‌ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[34]

ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్ననమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం.[35]

హెరిటేజ్ ఫుడ్స్

1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది.[36]

సూర్యోదయ రాష్ట్రం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, నవ్యాంధ్ర కు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా [37][38] అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ [39] గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.[40][41]

అమరావతి శంకుస్థాపన

2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.[42] ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.

2019 ఎన్నికలలో పరాజయం

అతని నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలను చేపట్టాడు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది.

సాహిత్య రచనలు

  • ఇండియాస్ గ్లోబల్ లీడర్ - తేజశ్వినీ పగడాల
  • మనసులోమాట - చంద్రబాబు జీవిత చరిత్ర.

విజయాలు

  • 28వ యేట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్నవయసు గల సభ్యుడు, మంత్రి [13]
  • తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించినఘనత.
  • రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు.
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.[43]
  • ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపిక.[44]
  • టైం మ్యాగజైన్ ద్వారా "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు.[5]
  • ఎకనమిక్స్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు.
  • "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలుస్తారు.
  • 2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి "ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం".[45]
  • మే 2017లో "ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు".

వివాదాలు, విమర్శలు

  • మే 2018లో టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై - ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసాడు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్నవిలువైన ఆభరాణాలకోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశాడు[46][47].
  • 2015 వోటుకి నోటు ఘటన: డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయ‌కులు దొరికిపోవ‌టంతో ఈ ఓటుకి నోటు [48] అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నిక‌ల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్ర‌లోభ పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆయ‌న్ని కోర్టు ముందు హాజ‌రు పరిచి, జైలుకి పంపించ‌టం జ‌రిగింది. త‌ర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంభాషణ అన్న [49] ఫోన్ సంభాష‌ణ‌లు నాట‌కీయంగా బ‌య‌ట‌పడ్డాయి. దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైద్రాబాదునుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చటం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి.[50]
  • కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని, వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులను చంద్రబాబు నాయుడుకు జారీ చేసింది. ఈ మొత్తాన్ని "బహిర్గతం కాని ఆదాయం"గా పరిగణించరని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అతను ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన తరువాత 2023 ఆగస్టు 4న సెంట్రల్ సర్కిల్, హైదరాబాద్ నుండి ఈ నోటీసు జారీ చేశారు. [51] షాపూర్జీ పలోంజీ & కో. ప్రైవేట్ లిమిటెడ్ (SPCL) తరపున డిసెంబర్ 2017 నుండి ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్ధసాని (నోటీస్‌లో MVP గా ప్రస్తావించారు) చెందిన ప్రాంగణంలో సోదాలు జరిపారు. నవంబర్ 2019లో పార్దసాని అసోసియేట్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుపై I-T దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూటకపు సబ్-కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, SPCL ద్వారా నిధులను స్వాహా చేయడానికి బోగస్ కాంటాక్ట్‌లు, వర్క్ ఆర్డర్‌లను సృష్టించినట్లు పార్ధసాని అంగీకరించాడని నోటీసుల్లో పేర్కొంది.[52]
  • స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (ఆంధ్రప్రదేశ్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)లో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో ఆయనను నేర పరిశోధన విభాగం (సీఐడీ) పోలీసులు 2023 సెప్టెంబరు 9న నంద్యాలలో అరెస్ట్‌ చేశారు.ఆయన హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం పేరిట స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని ఆయన ఎదురకరుంటున్న ప్రధాన ఆరోపణలు. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి.[53]నారా చంద్రబాబునాయుడు కు ఈ కేసులో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

కుటుంబం

నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు. వీరి కుమారుడు దేవాన్ష్.

ఇవీ చూడండి

మూలాలు

  1. "TDP to elect N Chandrababu Naidu as legislature party leader on June 4" – Economic Times. Articles.economictimes.indiatimes.com (31 May 2014). Retrieved on 7 June 2014.
  2. Chandrababu Naidu invites PM Modi to his swearing-in ceremony – IBNLive Archived 2014-10-07 at the Wayback Machine. Ibnlive.in.com (31 May 2014). Retrieved on 7 June 2014.
  3. "TDP chief Chandrababu to take oath as Andhra CM on June 8" : Andhra Pradesh, News – India Today. Indiatoday.intoday.in (28 May 2014). Retrieved on 7 June 2014.
  4. Naidu to take oath at Mangalagiri. The Hindu (2 June 2014). Retrieved on 7 June 2014.
  5. 5.0 5.1 Ghosh, Aparisim (31 December 1999). "South Asian of the Year: Chandrababu Naidu". TIME Asia. Archived from the original on 2 April 2012. Retrieved 16 January 2012.
  6. 6.0 6.1 6.2 6.3 This Is What We Paid For. www.outlookindia.com (20 May 2004). Retrieved on 16 January 2012.
  7. 7.0 7.1 Naidu, India's leading reformer. Ia.rediff.com (12 May 2004). Retrieved on 16 January 2012.
  8. With Naidu, Blair and Clinton have also been voted out -DAWN; 19 May 2004. Archives.dawn.com (19 May 2004). Retrieved on 16 January 2012.
  9. 9.0 9.1 Devesh Kumar. "Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi". NDTV. Retrieved 17 April 2014.
  10. Economic times. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.
  11. Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.
  12. 12.0 12.1 Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.
  13. 13.0 13.1 A High-Tech Fix for One Corner of India – Page 4 – New York Times. Nytimes.com (27 December 2002). Retrieved on 16 January 2012.
  14. "N. Chandrababu Naidu Profile". Times of India.
  15. "Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi". NDTV. Retrieved 17 April 2014.
  16. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [1] Archived 2016-04-28 at the Wayback Machine వివరాలు జులై 19, 2008న సేకరించబడినది.
  17. "వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?". జనంమనం. 16 Mar 2018.
  18. 18.0 18.1 "Chandrababu Naidu". Hindustan Times. Archived from the original on 27 May 2014. Retrieved 3 April 2004.
  19. "Chandrababu Naidu: A desperate fight for survival in a divided state". CNN-IBN. Archived from the original on 9 ఏప్రిల్ 2014. Retrieved 7 April 2014.
  20. South Asia | Surprise performance in Andhra Pradesh. BBC News (7 October 1999). Retrieved on 16 January 2012.
  21. {{Cite web |url=http://edition.cnn.com/ASIANOW/time/asiabuzz/9912/30/sd/ |publisher=TIME Asia |title= South Asian of the Year: Chandrababu Naidu | date=1999-12-30| |date= 19 September 2018.
  22. "Andhra's Vote Is a Test for Reform". TIME. 13 September 1999. Archived from the original on 14 January 2012. Retrieved 16 January 2012.
  23. టి డి జనార్ధన్ (21 Feb 2018). "నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2018-03-01. Retrieved 2020-08-05.
  24. 24.0 24.1 "జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర". Archived from the original on 2018-06-10. Retrieved 2018-06-01.
  25. 'Defeat has been an eye-opener'. Rediff.com (11 November 2004). Retrieved on 16 January 2012.
  26. "ASIANOW - TIME Asia | South Asian of the Year: Chandrababu Naidu". edition.cnn.com. 1999-12-30. Retrieved 15 January 2020.
  27. Biswas, Soutik (7 September 1998) Reinventing Chief Ministership. www.outlookindia.com. Retrieved on 16 January 2012.
  28. Hyderabad booms: IT exports top $1 billion. Ia.rediff.com (June 2004). Retrieved on 18 June 2016.
  29. Software exports from Hyderabad may touch Rs 64,000 crore. Deccanchronicle.com. Retrieved on 18 June 2016.
  30. A blast and its shock Archived 2014-02-11 at the Wayback Machine. Hindu.com. Retrieved on 24 August 2010.
  31. "'అలిపిరి' ఘటన కేసులో ముగ్గురికి శిక్ష".
  32. "Naidu wins by a Huge Margin". Rediff. 20 May 2004. Retrieved 20 May 2004.
  33. "Election results 2014: Chandrababu Naidu's TDP sweeps Andhra with 102 seats out of 175". deccan-journal.com. Archived from the original on 2014-05-21. Retrieved 2018-06-01.
  34. CBN to take oath on June 8th. Deccan Journal
  35. "నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -". www.andhrajyothy.com. Archived from the original on 2018-03-01. Retrieved 2018-06-01.
  36. "ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ". Archived from the original on 2020-02-25. Retrieved 2018-06-01.
  37. https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cms
  38. http://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece
  39. https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms
  40. http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ece
  41. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece
  42. "శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన -". www.andhrajyothy.com. Archived from the original on 2016-03-24. Retrieved 2018-06-01.
  43. Chandrababu's chance to equal ND Tiwari's record Archived 3 డిసెంబరు 2013 at the Wayback Machine. timesofap.com. 31 July 2013
  44. "Naidu voted IT Indian of the millennium". The Indian Express. 10 January 2000. Archived from the original on 28 September 2013. Retrieved 18 May 2013.
  45. "Chandrababu Naidu receives "Best CM" Award". The Siasat Daily. 31 January 2016. Retrieved 30 January 2016.
  46. తుపాకి. "Ramana Deekshitulu Sensational Comments on Chandrababu Naidu". tupaki. Retrieved 2018-06-01.
  47. http://www.republicworld.com/india-news/general-news/sensational-andhra-pradesh-cm-chandrababu-naidu-ttd-plundered-tirupati-temples-wealth-claims-ex-head-priest
  48. "భ్రీఫ్ కేసులో బాబు". progressivemedia.in. Archived from the original on 2015-06-28. Retrieved 2015-06-22.
  49. "CM Profile". ap.gov.in. Archived from the original on 2015-06-13. Retrieved 2015-06-22.
  50. "ఓటుకు నోటు... తెలుగుదేశంపై ఈ కేసు ప్ర‌భావమెంత‌..?". Telugu360 - Telugu. 2018-05-31. Retrieved 2018-06-01.
  51. "Former CM Chandrababu Naidu gets show-cause notice from I-T department | Latest News India - Hindustan Times". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  52. "118 కోట్ల రూపాయలకు అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబే: ఆదాయపు పన్ను శాఖ | I-T department serves show-cause notice to former andhrapradesh CM Chandrababu Naidu". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  53. "Chandrababu: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు | police arrested chandrababu". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

అంతకు ముందువారు
నందమూరి తారక రామారావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
1995–2004
తరువాత వారు
వై.యస్. రాజశేఖరరెడ్డి
అంతకు ముందువారు
రాష్ట్రపతి పాలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
2014 ఫిబ్రవరి 28 – 2019 జూన్ 8
తరువాత వారు
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి