జగ్గన్నతోట ప్రభల తీర్థం


తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది.కోనసీమ చుట్టుపక్కనున్న 11 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు.[1]
చరిత్ర
[మార్చు]ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం.[2][3]
ప్రభల తయారీ
[మార్చు]
ప్రతి గ్రామం నుండి వచ్చే ప్రభకు సోంతగా ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. సంక్రాంతి 10 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. ముందుగ వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగ కడతారు. తరువాత వాటి పై రంగు రంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది.రంగు రంగుల వస్త్రాలతో,పూలతో అలంకరిస్తారు.గంగలకుర్రు,అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరించి జగ్గన్నతోట మోసుకు వస్తారు.
జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు
[మార్చు]- గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి
- గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి
- వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి
- ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి
- వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి
- పెదపూడి – మేనకేశ్వరస్వామి
- ముక్కామల – రాఘవేశ్వర స్వామి
- మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి
- నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి
- పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి
- పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి
ప్రభల తీర్థం
[మార్చు]

ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు.కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు.ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం యాభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థ పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు.ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.
జగ్గన్నతోటపై ప్రధాని మోదీ సందేశం
[మార్చు]తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో కనుమ సందర్భంగా జరిగే ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శివకేశవయూత్ ప్రభల తీర్థం విశిష్టతపై ప్రధానమంత్రికి లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ సందేశం పంపారు. జగ్గన్నతోట ప్రభల తీర్థం 17వ శతాబ్దం నుంచి జరగడం ఎంతో అరుదైన విషయన్నారు. ఈ తీర్థానికి దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు రావడం ఎంతో సంతోషమని పేర్కొన్నారు. గ్రామాల్లో నేటికీ సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగుతుండడాన్ని కొనియాడారు.[4]
అరుదైన గుర్తింపు
[మార్చు]2023 జనవరి 26న న్యూడిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ప్రభల తీర్థ శకటం అరుదైన గుర్తింపు పొందింది.
మూలాలు
[మార్చు]- ↑ "అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం". Sakshi. 2020-01-17. the original నుండి 2020-01-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-18.
- ↑ "జగ్గన్నతోట ప్రభల తీర్థం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. the original నుండి 2024-07-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-15.
- ↑ "జగ్గన్నతోటలో కొలువు దీరనున్న ఏకరుద్రులు". Sakshi. 2020-01-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". the original నుండి 2022-01-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-15.