Jump to content

నాయిని నర్సింహారెడ్డి

వికీపీడియా నుండి
నాయిని నర్సింహారెడ్డి
నాయిని నర్సింహారెడ్డి

నియోజకవర్గం ముషీరాబాద్

తెలంగాణ తొలి హోం, జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖామంత్రి
(తెలంగాణ ప్రభుత్వం)
పదవీ కాలం
2014 జూన్ 2  2018 డిసెంబరు 11

సాంకేతిక విద్యాశాఖ
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
పదవీ కాలం
2004  2008

వ్యక్తిగత వివరాలు

జననం (1934-05-12)1934 మే 12
నేరడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం 2020 అక్టోబరు 22(2020-10-22) (వయసు: 86)[1]
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి నాయిని అహల్య
సంతానం నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి
2018, జులై 25న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కైరాలి టీవీ ఇన్నోటెక్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సత్కారం అందుకుంటున్న నాయిని నరసింహా రెడ్డి (తెలంగాణ హోం మంత్రి)

నాయిని నర్సింహారెడ్డి (1934 మే 12 - 2020 అక్టోబరు 22) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన నర్సింహారెడ్డి, తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.[2]

జీవిత విషయాలు

[మార్చు]

నర్సింహారెడ్డి 1934, మే 12న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరడుగొమ్ము గ్రామంలో జన్మించాడు.[3] నర్సింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.

కార్మిక నాయకుడిగా

[మార్చు]

ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై పోరాడాడు. వీఎస్‌టీ, ఐడీఎల్, హెచ్‌ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్‌ బేకరి వంటి కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యాడు. సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్లకు అధ్యక్షుడిగా, వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా అనేకసార్లు ఎన్నికయ్యాడు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నర్సింహారెడ్డిని అరెస్టు చేసి 18 నెలల పాటు ముషీరాబాద్‌ జైల్లో ఉంచగా, ఎమర్జెన్సీ మొత్తంకాలం జైల్లోనే గడిపాడు.

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

తొలి, మలి దశల తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4][5] తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్న నర్సింహారెడ్డి, 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. హైదరాబాదులోని సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారిగా హైదరాబాదుకు వచ్చాడు. తరువాత సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు.

జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నర్సింహారెడ్డి ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.

1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటిచేసి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి. అంజయ్యపై 2,167 ఓట్ల తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి కూడా పోటిచేశాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడ్ పై 10,984 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలల్లో జనతాదల్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 1989 ఎన్నికల్లో 12,367 ఓట్లు, 1994 ఎన్నికల్లో 4,931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2004లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి బిజెపి అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.

కేరళ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయిని నరసింహారెడ్డి (కుడి)

టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నర్సింహారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన తొతి మంత్రివర్గంలో (2014 నుంచి 2018 వరకు) కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖల బాధ్యతలను అప్పగించాడు.[6]

మరణం

[మార్చు]

నర్సింహారెడ్డికి కరోనా సోకడంతో 2020, సెప్టెంబరు బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందాడు. కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో అక్టోబరు 13న జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ 2020, అక్టోబరు 22న (అర్ధరాత్రి 12.25 గంటలకు) మరణించాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత". ఒరిజినల్ నుండి 2020-10-22 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-10-22.
  2. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. the original నుండి 2 జూన్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.
  3. Eenadu (25 November 2023). "నల్గొండ నుంచి వచ్చారు... నగరంలో గెలిచారు". the original నుండి 25 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2023.
  4. "Council of Ministers". telangana.gov.in. the original నుండి 14 జూలై 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 అక్టోబరు 2020.
  5. "Telangana State ushers in its first Bonalu". Hindu-Journal. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.
  6. సాక్షి, తెలంగాణ (22 October 2020). "నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత". Sakshi. the original నుండి 22 October 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2020.
  7. "Former Home Minister Nayani Narasimha Reddy passes away". The Hindu. 21 October 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 October 2020.
  8. "Nayini Narasimha Reddy, former Telangana Home Minister dies at 86". The Hans India.