నాళం కృష్ణారావు

వికీపీడియా నుండి
(నాళము కృష్ణరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాళం కృష్ణారావు
నాళం కృష్ణారావు
జననంనాళం కృష్ణారావు
జనవరి 18 , 1881
మండపేట, తూర్పుగోదావరి జిల్లా
మరణం1961 మార్చి 17(1961-03-17) (వయసు 80)
ఇతర పేర్లునాళం కృష్ణారావు
ప్రసిద్ధికవి.తెలుగు వైతాళికుడు.సంఘ సంస్కర్త
భార్య / భర్తనాళం సుశీలమ్మ
తండ్రికామరాజు,
తల్లిలక్ష్మమ్మ

నాళం కృష్ణారావు (జనవరి 18, 1881 - మార్చి 17, 1961) బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

నాళం కృష్ణారావు 1881 జనవరి 18 తేదీన నాళం కామరాజు, లక్ష్మమ్మల చివరి సంతానంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించారు. 1911-15 ప్రాంతాలలో ఆయన నిర్వహించిన తొలి తెలుగు సచిత్రమాస పత్రిక ‘మానవ సేవ’. తన పదిహేడో ఏట రాజమండ్రిలో గౌతమీ గ్రంథాలయాన్ని స్థాపించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు.బ్రహ్మ సమాజం మతస్థుడిగా తన గురువు అయిన కందుకూరి వీరేశలింగం పంతులుగారి కన్నా ముందే జంధ్యాన్ని పరిత్యజించారు.చింతా శేషయ్య అనే అట్టడుగు కులస్థుడికి తన యింట్లో నివాసం ఏర్పరిచి బ్రహ్మ మతస్థుడిగా తీర్చిదిద్దారు. ఇతర కులస్థులతో తన పెద్ద కుమారునికి వివాహం జరిపించారు. వితంతు వివాహాలు జరిపించారు. ఆయన సతీమణి నాళం సుశీలమ్మ తమ విదేశీ వస్త్రాలన్నీ దహనం చేసి, మహాత్ముడు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు పండ్లరసం అందించారు.భావిభారత పౌరులకోసం తేటగీతులలో కావ్యరచనలు చేశారు.ఆయన రాసిన 'గాంధీ విజయధ్వజ నాటకం' (1921), 'గాంధీ దశావతార లీలలు' (1932) గ్రంథాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. పదివేల సామెతలు జాతీయ లోకోక్తులు పేరుతో సేకరించారు. శ్రీకృష్ణరాయ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్థాపించిన హితకారిణీ సమాజానికి, వీరేశలింగ పాఠశాలకు పంతులుగారి తర్వాత జీవితాంతం అధ్యక్షులుగా పనిచేశారు.కృష్ణారావుగారు నిరాడంబరుడు. కీర్తికాంక్షా రహితుడు. ‘సేవ’కే ప్రాధాన్యం ఇచ్చిన మనిషి.తన అనంతరం మానవసేవ చేయాల్సిందిగా, తన తనయ కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారిని పురమాయించారు.

మరణం[మార్చు]

1961 మార్చి 17 న మరణించారు.[1][2][3][4]

రచనలు[మార్చు]

వీటిలో కొన్ని పుస్తకాలను గుంటూరులోని బొమ్మిడాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు 2011 లో పునర్ముద్రించారు.

కృష్ణారావు లాఠీఛార్జి, జైలు జీవితం మరొక పార్శ్వం సాహిత్యం. లేబ్రాయం నుండి జీవితపు తుదిశ్వాస వరకు తేటగీతులలో కావ్యరచనం చేశారు. కృష్ణారావుగారి ఆశలన్నీ భావిభారత పౌరుల పైనే ఉండేవి. అందుకే ఆయన కావ్యనాయకుడు పిల్లవాడు. వారికి ఆయా 'గోరుముద్దలు', 'మీగడ తరగలు', 'వెన్నె బడుగలు', 'పాల తరగలు' 'తేనె చినుకలు' తినిపిం చారు. 'వెన్నెల వెలుగులు', 'విరిదండ', 'దీపావళి' 'పాపాయి' లను అందించారు.

పిల్లలపై చూపే మాధుర్య గుణమే ఆయనవనీ మధురకవియని రాయప్రోలు సుబ్బారావు గారిచే ప్రశం సించింది. తేట తెలుగుకు ఆయన తేటగీతులే చిరు నామాలు, క్లుప్తత, శుభ్రత, శ్రావ్యతల మేళవింపునకు అద్దాలు. తన కవిత గురించి, తన తెలుగు గురించి కృష్ణారావు ఇలా ప్రత్యక్షర సత్యం చేశారు:

“అందములు చిందుతీరు తీయములు గల్లిగ ముద్దు గులికెడు నుడికాయరములు గల్గి లలిత జాతీయములు గల్గి యలరుచుండు తేటతేనియ యూట మా తెనుగు మాట”.

లలిత లలిత పదాలతో పిల్లల మనసులను చూర గొన్న కృష్ణారావు మంచి భాషావేత్త.బాలసాహిత్య బ్రహ్మగా, తెలుగు బాలబాలికలకు ఆయన ఇచ్చే సందేశాన్ని తాను రచించిన 'జీవన గీతం'లో పొందుపరిచారు.

ఎవరి నెఱుగక, ఎవరిచే నెఱుగ బడని
వానివలె నేను జీవింప వాంఛ సేతు,
ఎవ్వరునునాదు మృతికయి యేడ్వకుండ
ఏకాంతమ్మున కనుమూయ నిచ్చగింతు

-

సూచికలు[మార్చు]

  1. The Hindu images[permanent dead link]
  2. "The Hindu : Magazine / Focus : Tale of two libraries". Archived from the original on 2008-09-02. Retrieved 2013-09-04.
  3. Library in a state of neglect - The Hindu
  4. "Gowthami Library cries for national tag - The New Indian Express". Archived from the original on 2013-08-22. Retrieved 2013-09-04.
  5. భారత డిజిటల్ లైబ్రరీలో మీగడ తరకలు పుస్తక ప్రతి.
  6. భారత డిజిటల్ లైబ్రరీలో ముద్దు - పాపాయి పుస్తకం.
  7. తెలుగు జాతీయములు, ప్రథమ భాగము (మొదటి ముద్రణ ed.). తెనాలి: నాళము కృష్ణరావు. 1940.
  8. గాంధీమహాత్ముని దశావతారలీలలు. నాళం కృష్ణారావు. 1950.

యితర లింకులు[మార్చు]