మా భూమి (నాటకం)
మా భూమి సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు కలిసి రచించిన సాంఘిక నాటకం. తెలంగాణాలోని నిజాం రాచరిక వ్యవస్థను ఈ నాటకం ప్రతిబింబిస్తుంది. మాభూమి నాటకంలో పాత్రలు రెండు పక్షాలకు చెందినవి: ఒకటి ప్రభుత్వ పక్షం; రెండవది ప్రజా పక్షం.
నేపథ్యం[మార్చు]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణా ఇంకా నిజాం పీడిత ప్రాంతంగా దోపిడీదారుల కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న రోజుల్లో కొద్దిపాటి సామాజిక దృష్టి కలిగిన ప్రతి తెలుగువాడు తెలంగాణా పట్ల సానుకూలంగా స్పందించాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాన్ని గురించి ఈ నాటకం వ్రాయబడింది. ఆ పోరాటంలో 240 గ్రామాలపై పోలిసు దాడులు జరిగాయి. 8,500 మంది అరెస్టు అయ్యారు. 15,390 మంది ప్రజలు హింసాకాండకు గురయ్యారు. 12 లక్షల 25 వేల రూపాయల విలువైన ఆస్తి ఆ రోజుల్లో దోపిడీ అయ్యింది. 52 మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. 64 మంది స్త్రీలను మానభంగం చేశారు. వారిలో ఇద్దరు మరణించారు. ఈ పోరాటమే మమ్మల్ని ఈ నాటకం రాయడానికి ప్రోత్సహించింది అని రచయితలు వ్రాసుకున్నారు. 1947లో ఈ నాటకం అచ్చులో వెలువడింది.
ఆకాలంలో వెలువడిన రచనలలో ముఖ్యమైనది మాభూమి. ఈ నాటకం ద్వారా సాటి తెలుగు ప్రజలు పరాయి పాలనలో పడుతున్న అవస్థల్ని సభ్య సమాజానికి పరిచయం చేసి ప్రచారం చేయడానికి ప్రముఖంగా తోడ్పడింది. ఆరోజుల్లో మాభూమి నిజాం ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపింది.
పాత్రలు[మార్చు]
- వీరారెడ్డి - అభ్యుదయవాది, కథానాయకుడు
- యల్లమంద - ఆలోచించే అలవాటులేని ఆవేశపరుడు
- జగన్నాథరెడ్డి దేశ్ముఖ్ - గర్వాంధుడు
- పట్వారీ వెంకట్రావు - తను చేసేది తప్పని తెలిసి చేసే మూర్ఖుడు
- రౌడీ మస్తాన్ - దేశ్ముఖ్ కు ఎడం చెయ్యి
- సీతమ్మ - వీరారెడ్డి భార్య
- కమల - వీరారెడ్డి చెల్లెలు
- అమీన్ - ఇన్స్పెక్టర్.