రాబర్టు క్లైవు- వారన్ హేస్టింగ్సుల రాజ్యతంత్రములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భారతదేశములో బ్రిటిష్ వారి రాజ్యస్థాపనకు దోహదమైన ప్రముఖ రాజ్యతంత్రజ్ఞులు రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సు కార్యకాలములలో జరిగిన కుటిల రాజ్యతంఉత్రముల చరిత్ర. ఈస్టు ఇండియా సంస్ధగా సా.శ. 1599న ఇంగ్లండులో స్థాపింపబడిన వ్యాపారసంస్ద వ్యాపారనిమిత్తము 1600లో భారతదేశమువచ్చారు. మొగల్ చక్రవర్తి అనుమతితో భారతదేశములో నాలుగుదిశలలో అమాయకమైన వ్యాపార స్థావరా లేర్పర్చుకుని క్రమేణ దేశీయ పరిపాలకుల రాజకీయాలలో జోక్యము చేయ ప్రారంభించారు. అచిరకాలములోనే సైనిక బలము ప్రయోగించకుండా రాజ్యతంత్రములతో వలస రాజ్యమును స్థాపించారు. మొగల్ చక్రవర్తు లిచ్చిన ఫర్మానాలతో మొదలు పెట్టి దేశీయ పరిపాలకుల మధ్య వైరములలో సైనిక సహాయంచేసి ఇరుపక్షములవారిచే తమకు అనుకూలమైన షరత్తులతో సంధిపత్రములు వ్రాయించుకుని, క్రమేణ రాజ్యాధికారము చట్టబద్దముగనే అబ్బినట్ల నిపించుకుని యావద్భారతదేశమును ఇంగ్లండు రాణిగారి పేరున బ్రిటిష్ దేశ మునకు వలస రాజ్యముగా చేసి చరిత్ర సృష్టించారు.

అట్టి బ్రిటిష ఇండియా చరిత్ర తొలిదశలో మార్గదర్శక పాత్రధారులు రాబర్టు క్లైవు మరియూ వారన్ హేస్టింగ్సు. 1743- 1785 మద్య జరిగిన వీరిద్దరి రాజ్యతంత్రములవల్ల బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వారి వాణిజ్యమనే నెపము వెనుకయున్న ఆర్థిక లభ్దికి, రాజ్యస్థాపన లక్ష్యములకు రూపురేఖలు దిద్ది తమ కంపెనీవారి లక్ష్యాలను అధికమించి పురోగతి సాధించారు. భారత దేశీయ ఆదాయమును, రాజనిధులను తాముచేసిన సేవలకు ప్రతిఫలముగా రాబట్టుకున్నారు. ఇక్కడ జరిపిన యుద్దపు ఖర్చులు, రాజకీయ కార్యాచరణకైన ఆర్థిక భారం ఈ దేశ రాజనిధులనుండే రాబట్టుకునే కుటిల తంత్రములు చేశారు. అట్టి ఉపలబ్ధికి అవలంబించిన రాజ్యతంత్రములు కుటిలమైననూ వారిపైవచ్చిన ఆరోపణలు నిరాధారములన్న అసత్యకారణముచే శిక్షా విమోచనులై బ్రిటిష్ వారిచే ఘనులనిపించుకున్న బ్రిటిషు దొరలు. కేవలం తమ ఆధిక్యత నిరూపణ, దేశీయరాజుని నియమించు స్తోమత గణించుట, ఆర్థికలాభముకొరకు చేసినవే. ప్రత్యామ్నాయంగా రాజ్యపాలన జరిపించుచూ రాజధర్మము పాటించని రాజ్యతంత్రమవలంబించారు.

కొద్దిమంది దేశీయాభిమానముగల నవాబులు ఈ దొరల రాజ్యతంత్రముల ముఖ్యోద్దేశ్యములు గ్రహించి అభ్యంతరం వెలిబుచ్చి పిర్యాదులు చేసి చివరకు ఎదురుతిరిగి దొరల కుటిలోపాయములకు నేలకూలి నశించిపోయారు. అట్టివారిలో వంగరాష్ట్రపు నవాబు మీర్ ఖాసిం ఒకడు. సుంకరహితముగా కంపెనీయే గాక కంపెనీ ఉద్యోగులుగూడా వ్యక్తిగతముగా చేయుచున్న స్వేచ్ఛా వ్యాపారములను ఆపుచేయుటకు విఫలప్రయత్నంచేసి చివరకు దేశీయ వ్యాపరులనూ అట్లాగే స్వేచ్ఛగా వ్యాపారము చేసుకొమ్మని అనుమతి ఇవ్వడంతో కంపెనీ ఉద్యోగులకూ కంపెనీకి లాభములు దిగజారాయి. ఇతనిమీద ఆగ్రహించి యుధ్దము ప్రకటింపజేశారు. మీర్ ఖాసిం పరారీ అయి కంపేనీకి ప్రతిపక్షంగా 1764 బక్సరు యుధ్ధంలో పాల్గొన్నాడు. ఈస్టు ఇండియా కంపెనీ వారి అబిమతం ప్రకారం భారతదేశ పరిపాలకుల అంతః కలహములలో జోక్యము చేసుకొనవద్దన్నప్పటికీ రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సు కార్యకాలములలో (1743-1785) పెద్ద ఎత్తున జరిగిన తంత్రములన్నీ దేశీయ పరిపాలకుల అంతఃకలహములు పై నడచినవే, సింహాసనాధీశుడగటకు ఆశ అను పాశములచే బంధించబడ్డ దేశీయ నాయకులను లోబరుచుకుని ధనరూపములోనూ రాజ్యభూభాగములు జాగీరులగా లంచము పుచ్చకున్న కార్యాచరణలే. వీరిరువురూ అవలంబించిన రాజ్యతంత్రము బ్రిటిష్ కంపెనీవారి సామదాన దండోపాయములకూడిన రాజ్యతంత్రమే యనుట చాల తేలికపాటి ఉధ్ఘోషణ. వారి రాజ్యతంత్రములవల్ల దేశీయనాకులు కొందరని పదవీకాంక్షకు లోబడిన కీలుబొమ్మలను రాజుగా చేసి, రాష్ట్ర రాజనిధులను, దేశాదాయములను వ్యక్తిగతముగానూ, సంస్థాగత లాభమునకు వినియోగించుకున్నారు. ముఖ్యముగా మిత్రద్రోహము, మిత్రబేదము, సంధి అను మూడు మూల సూత్రములు వీరిరువురి కుటిల రాజ్యతంత్రములకు మూలధారములైనవని నిస్సందేహముగా చెప్పవచ్చును.

రాబర్టు క్లైవు కుతంత్రములు[మార్చు]

రాబర్టు క్లైవు యొక్క కుతంత్రాలకు బలికాబడిన వంగరాష్ట్రపు మొదటి దేశీయ పరిపాలకుడు నవాబు సిరాజ్ ఉద్దౌలా. అతను 1757 లో బ్రిటిష్ వ్యాపార సంస్ధవారి వ్యవహారములను నియంత్రణ చేసి చివరకు కలకత్తాలోని బ్రిటిష్ స్థావరమైన విలియంకోటను ముట్టడించి ఆక్రమిచటంతో మొదలైంది రాబర్టు క్లైవు కుతంత్రాల కార్యాచరణ. సిరాజ్ ఉద్దౌలా కలకత్తా ముట్టడించిన కాలంలో విలియంకోట గవర్నింగు సంఘమునకు అధ్యక్షుడు (గవర్నరు) డ్రేక్ దొర ( ROGER DRAKE). కానీ అతడు సైనికంగానూ కుతంత్ర యోధుడుగానూ కార్యసాధకుడు కాకపోబట్టి లండనులోని కంపెనీ ప్రభువులు అప్పటికి చెన్నై దేవీకోట గవర్నరుగానుా, సైనికంగా కర్నల్ స్థాయిలోనున్న రాబర్టు క్లైవు దొరను, అడ్మిరల్ వాట్సన్ (Admiral Charles Watson) సహాయంతో విలియంకోటను విడిపించి వంగరాష్ట్రపు సమస్య తీర్చుటకు నియమించారు. సైనిక బలగంతో ధర్మయుధ్ధం చేయుట అసాధ్యమని తెలుసుకున్న రాబర్టు క్లైవు కుతంత్రాలు చేపట్టి, సురాజ్ ఉద్దౌలా రాజ్యములోని అంతఃకలహములలో భాగస్వాముడైన అతని బంధువు, సేనాని అగు మీర్ జాఫర్తో మొదట మధ్యవర్తిద్వారా కొంత రాయబారం చేసి వప్పంద పత్రాలు ఇచ్చిపుచ్చుకునటం జరిగింది. మీర్ జాఫర్ తో సరాసరి రహస్య వప్పందాలు చేసి పూర్తిగా వశపరచుకున్నాక అతని స్వామి ద్రోహక చర్యల వల్ల సురాజ్ ఉద్దౌలా ఓడిపోవటం జరగింది. దాంతో బ్రిటిష్ వారి ఆధిక్యత వ్యక్తమైనది. రాబర్టు క్లైవుకు రాజుని నియమించే (king maker) స్తోమత కలిగింది. సురాజ్ ఉద్దౌలాను మీర్ జఫర్ చెరపట్టి చంపించాడు.

తదుపరి తనను సింహాసనాధీశుడుగా చేసినందుకు కృతజ్ఞతాపూర్వకముగా రాబర్టుక్లైవుకు మీర్ జాఫర్ వంగరాష్ట్ర రాజనిధులనుండి బహిరంగముగా సైనిక సహాయ ఖర్చుల క్రిందనూ, తమ స్థావరం ఆక్రమించిన కాలంలో వచ్చిన ఆర్థిక నష్టము తీర్చుటకునూ దాదాపుగా 21.5 లక్షల రూపాయలకు పైగా నగదు రూపములోనే కాక ఇంకా 24 పరగణాల జాగీరులు కూడా ముట్టచెప్పాడు. (సెలక్టు కమిటీ వారి అంచనా 12.5 లక్షలు మాత్రమే). అదేకాక చాటుగా క్లైవుకూ అతని సిబ్బందికీ కూడా చాల నిధులను అప్పచెప్పాడు. అంతేకాక, బ్రిటిష్ వారి వ్యాపారమునకు సుంకరహితదిగుమతులకు అనుగ్రహ పత్రము జారీచేశాడు. సురాజ్ ఉద్దౌలా ఓడిపోయి సంధి చేసుకున్న వెంటనే రాబర్టుక్లైవు సరాసరి కార్యాచరణ చేపట్టి అతనినే నవాబుగా వుంచియుండిన యడల బ్రిటిష్ వారికి వచ్చే లబ్ధి కంటే మీర్ జఫర్ ను కీలుబొమ్మ నవాబుగా సింహాసనాధీశుడు చేయుట వల్ల అనేక రెట్లు లాభం కలగటమేకాక తదుపరి రాజ్యతంత్రాలకు అవరోధములు తొలగిపోయినవి. మధ్యవర్తి జగదీశ్ సేథ్, ఓమిచంద్ లకు రాయబారం చేసి మీర్ జాఫర్ ను స్వామిద్రోహమునకు వప్పించుటకు ఇస్తానన్న ప్రతిఫలం మివ్వకుండా నమ్మక ద్రోహం చేశాడు. అతనికి ఇచ్చిన వప్పంద పత్రములో అడ్మిరల్ వాట్సన్ సాక్షి సంతకం పెట్టుటకు నిరాకరించగా కూటపత్రము సృష్టించడం జరిగిందని చరిత్రలో కనబడుచున్నది. ఆ విషయాన్ని క్లైవు బ్రిటిషు పార్లమెంటులో సమర్ధించుకున్నాడు[1]. మధ్యవర్తిగా పనిచేసిన వారు, నవాబు సురాజ్ ఉద్దౌలాకు రాజకీయ సలహాదారులు.

మీర్ జాఫర్ విడుదల చేసిన 24 పరగణాల జాగీరు పట్టాలో షరతులను ఉల్లంఘించి తనకు ఇచ్చిన జాగీరు కొలదిరోజులకే క్లైవు కంపెనీవారికి కౌలుకిచ్చి సాలునా నికరాదాయం 20,000 £ ఆర్జించాడు. కృతజ్ఞతతో ముట్టచెప్పిన అనేక లక్షల పౌనుల ధనం, 24 పరగణాల జాగీరు కాకుండా 1765 సంవత్సరములో మీర జాఫర్ చనిపోతూ తనతదనంతరం కుమారుని కనిపెట్టుకొమ్మని క్లైవుకు ఇంకో 70,000 రూపాయలిచ్చాడు. అయినాకూడా మిత్రద్రోహంచేసి వారసుడైన అతని కుమారుడు నజముద్దీన్ అలీ ఖాన్కు వంగరాష్ట్ర నవాబవుటకు ఇంకో లక్ష రూపాయలు లంచమీయవలసి వచ్చింది. ప్లాసీ యుధ్దానంతరం (1757) ఓడిపోయిన వంగరాష్ట్ర నవాబు సిరాజ్ ఉద్దౌలాకు అధికారములు తొలగించునప్పుడు రాబర్టు క్లైవు వాగ్దానముచేసిన అలవెన్సు 53 లక్షలు. తరువాత వచ్చిన నవాబు (మీర్ జఫర్) కు 41 లక్షలకు తగ్గించాడు. 1765 లో వచ్చిన నాల్గవ నవాబు (నజముద్దీన్ ఖాన్) కు 32 లక్షలకు తగ్గించాడు. 1764 లో బక్సరు యుద్ధానంతరం ఓడిపోయిన మొగల్ చక్రవర్తి రెండవ షా అలం, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా, ఎదురుతిరిగిన వంగరాష్ట్ర నవాబు మీర్ ఖాసీంలు క్లైవు దొరతో చేసుకున్న సంధి వలన వంగరాష్ట్రములో రాజస్యహక్కు (దివానీ) ఇచ్చినట్టుగా చక్రవర్తి ఫరమానాలభించింది. చక్రవర్తిని మనోవర్తిదారుడుగా చేసి సాలునా 26 లక్షలు కప్పముక్రింద ఇచ్చి పేరుకు చక్రవర్తి సింహసనమునందే కూర్చోనిచ్చాడు. అలాగే ఔద్ నవాబును కూడా పూర్తిగా తన వశముచేసుకుని నవాబు సింహాసనంలో కూర్చోనివ్వటం ఆర్బాటమైన ఔదార్యముతో కూడిన కార్యాచరణగా కనబడినా అది రాజ్యతంత్రములో ఒక భాగము. రాబర్టు క్లైవు వంగరాష్ట్రములోసాధించిన పురోగతితో 1765 నే భారతదేశంలో బ్రిటిష్ వలసరాజ్యస్దాపన చేయ గలనని లండన్ లోని కంపెనీ ప్రభువులకు క్లైవు దొర విశ్వాసము తెలిపినట్లుగా చరిత్రలో కనబడుచున్నది.అంతకు పూర్వ1689 మేలో లండన్ నుండి కంపెనీ ప్రభువులు భారతదేశములో తమ కంపెనీకి కేవలం వాణిజ్య ఆదాయమేకాక రాజస్వఆదాయముకూడనుండవలెనని నిశ్చయించిన లక్ష్యముతోకూడిన రాజ్యతంత్రమును క్లైవు దొర తనకాలకార్యములోనే కుతంత్రములతో కంపెనీ వారి లక్ష్యమును అధికమించి భారతదేశ రాజస్వ ఆదాయమును బ్రిటిష్ కంపెనీ వారి వశంచేసి వంగరాష్ట్రమునకు ( విలియంకోటకు) గవర్నరై, బ్రిటిష్ వారి దృష్టిలో ఘనుడనిప్పించుకున్నాడు. తన రెండవ విడత కార్యకాలం (1765-67) లో అనేక కుతంత్రములతో జరిపిన రాజకీయ ఘటనల ద్వారా తాను కంపెనీవారికి చేకూర్చిన ఆదయము, ఆర్థికవనరులు, లాభములు వివిరించుచూ 1765సెప్టెంబరు 30 వ తేదీన రాబర్టు క్లైవు కంపెనీడైరక్టర్లకు వ్రాసిన లేఖ ఒక అమూల్య చారిత్రకాధారము. “....ఈ దేశమునుండిఆదాయములనుండి నవాబుయొక్క అధికారాము, గౌరవము నిలువబెట్టి యుంచుటకు (అలవెన్సు) సొమ్మును మొగలు చక్రవర్తికివ్వవలసిన కప్పమును సక్రమముగా చెల్లింపవలెను. ఈ అధికార ప్రాప్తివల్లన బర్డువాల్ మొదలగు ప్రాతజాగీరులపైన కలిసి తమ రివిన్యూ ఆదాయము సాలుకు 250 లక్షల సిక్కా రూపాయలకు తక్కువ యుండదు, ఇంకనూ ఇరువది ముప్పది లక్షలధికము కాగలదు. మిలిటిరీ, సివిల్ వ్యయములు సామాన్యముగా 60 లక్షలు దాటవు, నవాబులకివ్వవలసిన సొమ్ము ఇప్పుడు 42 లక్షలకు తగ్గించి వేయబడినది. చక్రవర్తి కప్పముక్రింద సాలుకు 26 లక్షలుపోగా మనకు ప్రతి సాలుగు 122 లక్షల రూపాయలు నికరలాభములు మిగులును” (quoted in the book The British Rule in India by D.V. Sivarao (1938) on page 164-165 with cross references] వాన్సిటార్టు (HENRY VARSITTART) గవర్నరుగానున్న కాలంలో నవాబు మీర్ జఫర్ ను భర్తరఫ్ చేశారు (1763). అతని అల్లుడు మీర్ ఖాసీం నవాబుగా ఆకాంక్షించి నవాడగుటవలన అతనిని నవాబుగా చేయుటకు ప్రతిఫలము 2 లక్షల నవవరసుల ధనమునేకాక, బర్డవాను, మిడ్నపూర్, చిట్టకాంగు జిల్లాలను జాగీరులుగా తీసుకున్నారు. బ్రిటిష కంపెనీ రాజ్యతంత్రములు వలసరాజ్య స్థాపన, ఆర్థిక సముపార్జన, రాజస్వ ఆదాయము మొదలగు లక్ష్యములతో ముందుకు సాగినవి. ఇది క్లైవు చూపిన దారే. తరువాత వచ్చిన గవర్నర్లు అవలంబించ వలసిన దోవకు క్లైవు మార్గదర్శకుడైనాడు.[2], [3]

అదే మార్గములో నడచిన వారన్ హేస్టింగ్సు[మార్చు]

క్లైవు మొదలుపెట్టిన కుతంత్ర పధ్ధతుల ఫలితముగా 1760-1765 మధ్య వంగరాష్ట్రములో కంపెనీ ఉద్యోగుల అక్రమ ఆర్థిక సంపాదన, అవినీతి, ప్రజాపీడనము విషమస్థితిక చేరుకుంటున్నసమయంలో స్థితినియంత్రణకు ప్రయత్నించి విఫలులైన దొరలలో అప్పటి గవర్నరుగానుండిన వాన్సటార్టు (HENRY VANSITTART) మరియూ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడైన వారన్ హేస్టింగ్సు కూడానుండుట విశేషము. గవర్నరు కాక ముందు చిన్న అధికారిగా 17/04/1762 న వారన్ హేస్టింగ్సు గవర్నరుకు వ్రాసిన లేఖలో కంపెనీ ఉద్యోగులచేయు స్వేఛావ్యాపారములు ఆక్రమ ఆర్థికసముపార్జనలనుగురించి వాపోయాడు. అటువంటి దొర, గవర్నరు అయినాక కుతంత్రముల కార్యాచరణ అవలంబించటం దురదృష్టకరమైన విషయం. 1773 లో గవర్నరు జనరల్ గావచ్చిన తరువాత దొర గారి 12 ఏండ్ల కార్యకాలంలో వంగరాష్ట్ర ప్రజల దుస్థితి మెరుగుపర్చ లేదు. 1774 లో వారన్ హేస్టింగ్సు ప్రవేశపెట్టిన రాజకీయసంస్కరణలు ప్రజల యోగక్షేమము, రాష్ట్రబివృధ్ధికి కాక భ్రిటిష్ వారి ఆదాయము పెంచటానికి ఉపయోగించాయి. రాబర్టు క్లైవు కాలంలో అబ్బిన రాజస్వ అధికారం (దివానీ) తో సిస్తువసూలకు సిబ్బంది ద్వారా బాధ్యతలు వహించకుండా వేలంద్వారా కౌలుకిచ్చి సొమ్ము చేసుకునటం వారన్ హేస్టుంగ్సు దొర చేసిన సంస్కరణలలోనొకటి. రైతుల ఆర్థిక స్థితి ఇంకా దిగజారి దుస్థితికిపాలుచేసినవి. కలెక్టర్లకు న్యాయ విచారణ అధికారమిచ్చి నందువల్ల గ్రామ పంచాయితీ సంస్థ నశించిపోయింది. కలెక్టర్లు నిర్వహించు కోర్టులలో ఆంగ్లేయుల ధర్మశాస్త్రములు అమలుచేయబడినవి. దేశీయ నవాబులను పేరుకు పరిపాలకులుగానుంచి బాధ్యతలు అప్పచెప్పి ప్రత్యామ్నాయముగా పరిపాలన చెలాయించి దేశాదాయము బ్రిటిష్ కంపెనీ పరంచేశాడు. కంపెనీ వారి ఖజానాలు నిండించుటకు ఆర్థిక లభ్దికోసం చేసిన కుతంత్ర కార్యాచరణలు (1) నందకుమారుడునునాతడు వారన్ హేస్టింగ్సు లంచము తీసుకున్నాడని గవర్నింగు కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాడు. ఆరోపణను నివృత్తిచేయలేక అతని పై కూట సృష్టి (Forgery) చేశాడను ప్రత్యారోపణ చేసి చివరకి ఉరితీయించాడు. (2) వంగరాష్ట్ర నవాబుకు ఇచ్చే అలవెన్సును 32 లక్షలను తగ్గించి 16 లక్షలు చేశాడు. (3) అలహాబాదు సంధి ప్రకారం మొగల్ చక్రవర్తికి ఇవ్వవలసిన 26 లక్షల కప్పమును పూర్తిగా రద్దుచేసి చక్రవర్తినికూడా ఆర్థికదుస్థితికి పాలుచేశాడు. (4) ఆ సంధి ప్రకారమే చక్రవర్తికిచ్చిన అలహాబాదు, కోరా పరగణాలను తీసేసుకుని అయోధ్య నవాబు షూజా ఉద్దౌలాకిచ్చి 50 లక్షలు అక్రమ సముపార్జన చేశాడు. (5) అయోద్యనవాబు కోరికపై రోహిల్లాలను రోహిల్ఖండునుండి తొలగించుటకు అనవసర యుధ్ధం చేయుటకు సైనిక సహాయానికి ప్రతి ఫలము 2 లక్షలు గడించాడు. (6) అయోధ్యనవాబు సూజాఉద్దౌలా తరువాత అసఫ్ ఉద్దౌలా నవాబైనాడు. అతనుకూడ వారన్ హేస్టింగ్సు గుప్పిటలోనున్నవాడే. అతని తల్లి, నాయనమ్మ (అయోధ్య రాణులు) చాల సంపన్నులు. కాశీ రాజుఛైత్ సింగ్ బ్రిటిష్ కంపెనీవారిపై చేసిన తిరుగుబాటుకుటృలోవీరికి సంబంధమున్నదని వారన్ హేస్టుంగ్సు వారిమీద అక్రమ ఆరోపణలు చేశాడు. చిన్నరాణీ (అసఫ్ ఉద్దౌలా తల్లి) ని చెరసాలలో బంధించి ఆమె వద్దనున్న సొమ్ము12 లక్షలు వసూలు చేయించిన కుతంత్రరాజకీయం వారన్ హేస్టింగ్సు చరిత్రలో మాయని మచ్చ. (7) ఇంకా చేసిన అనవసరపు యధ్ధ సన్నాహాలు అయోధ్యనవాబు పై మహారాష్టలు దాడి చేయుదరని భయంచే అయోధ్య నవాబు కోరిక పై సైనిక సహాయం సంసిధ్దము చేసి యుధ్దం జరుగకపోయిననూ నవాబు దగ్గరనుండి ఆర్థిక ప్రతిఫలం సంపాదించాడు, భూటాన్ రాజు కోరికపై టిబెట్టును ముట్టడించ సంసిధ్దుడగుట. (8) లండన్ లో కంపెనీ ప్రభువుల బంధువులకే కాక బ్రిటిష్ కామన్సు సభా సభ్యులలో కొందరి బంధువులకు భారతదేశములో అక్రమ సంపాదనకు దోహదం చేసి ప్రతిఫలముగా తదనంతరం శిక్షావిముక్తికాబడ్డాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Cobbett, William; Hansard, Thomas Curson; Parliament, Great Britain; Parliament, Scotland (1813). The Parliamentary history of England from the earliest period to the year 1803, Volume 17. p. 876.
  2. 2.0 2.1 "The British Rule in India" D.V.Siva Rao (1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల బెజవాడ pp 96-99,150-155
  3. Encyclopedia Britannica, Volume 5, 14th Edition (1929). pp 832-835