లోకపల్లి సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోకపల్లి సంస్థానం ప్రవేశద్వారం

నారాయణపేట జిల్లాలో వెలసిన ఏకైక సంస్థానం లోకాయపల్లి (లోకపల్లి) సంస్థానం. ఇది ప్రస్తుత నారాయణపేట నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఇక్కడి చివరి పాలకురాలైన లక్షమ్మను దైవంగా పూజిస్తారు.[1]

లోకపల్లి లోని ఇతర దేవాలయాలు[మార్చు]

లోకపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయం
లోకపల్లిలోని శ్రీకృష్ణ దేవాలయం

ఇక్కడి ప్రజలు లోకపల్లి సంస్థానం చివరి పాలకురాలైన లక్ష్మమ్మకు దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ సమీపంలోనే శ్రీకృష్ణుడి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన ఔదుంబరేశ్వర దేవాలయం ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది.

చరిత్ర[మార్చు]

సా.శ. 1294లో మక్తల్ ను దేవగిరి యాదవరాజైన రామచంద్రుని ప్రతినిధిగా స్థాణుచమూపతి పాలించాడు. ఈ సంస్థాన పాలకులు మహారాష్ట్ర నుండి వచ్చిన బ్రాహ్మణులు. వేదశాస్త్ర పోషకులు. ఈ సంస్థాన పాలకుడైన మొదటి వెంకటనారాయణరావు సా.శ. 1611 లో ప్రస్తుత నారాయణపేటలోని పళ్ళ ప్రాంతానికి చెందిన త్ర్యంబకభట్టు , విర్ధలభట్టు అనే శ్రౌతతంత్రవేత్తలకు భూదానం చేశాడు. వీరు లోకాయపల్లి ప్రభువులకు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు. ఈ వంశంలో నారాయణరావు, లక్ష్మమ్మలు చాలామంది ఉన్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ లక్ష్మమ్మలు ఆధ్యాత్మిక, ధార్మిక సంపన్నులు, అనేక ఆలయాలను కట్టించారు. ఈ సంస్థానానికి చివరి పాలకురాలు కూడా లక్ష్మమ్మ. ఈ సంస్థానంలో సాహిత్య వికాసం అంతగా కనిపించదు. ఒక్క భాస్కరరాయలు మాత్రం శాక్తవిద్యకు సంబంధించి అనేక రచనలు చేశాడు.[2]

భాస్కరరాయలు[మార్చు]

భాస్కరరాయలు లోకాయపల్లి సంస్థానకవి. గంభీరరాయలు , కోనమాంబల పుత్రుడు. శాక్తదర్శనాలలో చేయితిరిగినవాడు. 17 వ శతాబ్దంలోనివాడు. ఇతడు నారాయణపేటకు దగ్గరలో గల లోకాయపల్లిలో నృసింహయజ్వ దగ్గర విద్యనభ్యసించాడు. లోకాయపల్లి శాతంత్రవేత్తలకు కేంద్రం.

రచనలు[మార్చు]

సౌభాగ్య భాస్కరం , వరివష్యరహస్యం, నిత్యాషో శికార్డవ టీకయైన సేతువు, దుర్గా సప్తశతి వ్యాఖ్యయైన గుప్తవతి, కాల భావనా త్రిపురోపనిషత్తులపై టీక, వాద కుతూహలం అనే పూర్వమీమాంస శాస్త్రం వంటివి భాస్కరరాయలు రచనలు. లలితా సహస్ర నామావళి భాష్యమైన ' సౌభాగ్య భాస్కరం'లో తాంత్రిక , మాంత్రిక , వామాచార , దక్షిణాచార , కౌళాదిభిన్న సిద్ధాంత రహస్యాలు ఉన్నాయి. సేతుబంధం , చండాభాస్కరం , తృచ భాస్కరం ' మొదలైనవి కూడ ఇతడి రచనలే. ఇతడి రచనలు మొత్తం 43 ఉన్నట్లు తెలుస్తున్నది.

జగన్నాథుడు[మార్చు]

భాస్కర రాయల గురించి అతడి శిష్యుడు అయిన జగన్నాథుడు 'భాస్కర విలాస కావ్యం' అనే గ్రంథాన్ని రాశాడు. ఇతని తండ్రి కూడ ఒక కవి. అతను మహాభారతాన్ని పార్శీ భాషలోకి అనువదించాడు.[3]

ఆదిభట్ట నారాయణుడు[మార్చు]

నారాయణపేట ప్రాంతంలో భాస్కర రాయలకంటే ముందు ఆదిభట్ట నారాయణుడు అనే పండితుడు కూడా చరిత్రలో ఉన్నాడు. లలితా సహస్రనామాలకు ఇతడు రచించిన 'జయమంగలము' వ్యాఖ్య ఎంతో ప్రసిద్ధం. నారాయణుని వ్యాఖ్య మిగతావారికంటే చాలా సమంజసంగా ఉన్నదని పండితుల అభిప్రాయం.

మూలాలు[మార్చు]

  1. "నాటి నారాయణపురమే... నేటి నారాయణపేట". నవ తెలంగాణ.కం.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "నారాయణ పేట జిల్లా". Cckraipedia.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య చరిత్ర. తెలంగాణ సాహిత్య అకాడమీ.