వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 01వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1878 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త. వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లి లో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.

19 ఏళ్ల వయసులో దేశభక్తి మరియు ఉత్సాహముతో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధములో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యము అర్ధశతాబ్దము పాటు నిలిచింది. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని దీన్ని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపాడు. 1916 లో " భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక వెలయించాడు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవాడు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది.

1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919 లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921 లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కొత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి