వెలిదండ్ల హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ వెలిదండ్ల హనుమంతరావు గారు డా వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిఇంటరనెట్లో ఎక్కడా కనపడలేదు. వారిని గూర్చి విజయవాడలో ఇప్పటికీ చాల గొప్ప వైద్యులని చెప్పుకుంటారు. వారి పేరున కట్టిన లైబ్రరీ విజయవాడలో ఇంకా ఉంది. 1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.

అక్టోబరు ఇరవై తారీఖు 1980 విజయవాడలో వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ ప్రాంగణంలో కాట్రగడ్డ నారాయణరావు అధ్యక్షతన వెలిదండ్లహనుమంతరావుగారి 49 వ వర్ధంతి సభ జరిగింది. ఆరోజు సభ ప్రారంభకులు తుర్లపాటి కుటుంబ రావుగారు. వక్తలు కాట్రగడ్డ మధుసూదన రావు, దిగవల్లి వేంకట శివరావు, కోగంటి గోపాల కృష్ణయ్య, వెనిగళ్ళ వెంకటేశ్వరావు, పెనమకూరు కేశవరావు గార్లు. వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిశివరావుగారి నోట్సులో ఇలా వ్రాశారు “యశః కాయులైన శ్రీ డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారును నేనూ చిన్నప్పటి స్నేహితులము. ఆయన చాల తెలివైన వాడు. తన 13 వ ఏట నే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బి.ఎ పట్టాను పొందిన తరువాత చెన్నపట్ణంలోని వైద్య కళాశాలలో చేరినారు. నేను ప్రసిడెన్సీ కాలేజీలో చదువుతున్నాను. మేముభయులము 1918 నుండి 1920 వరకు చెన్నపట్ణం లోని విక్టోరియా హాస్టల్ అనే విద్యార్థి వసతి గృహములో నుండేవారము. ఆయన స్పురద్రూపి సుకుమారి మితభాషి. స్నేహితులెవ్వరైననూ పలకరిస్తే చిరునవ్వు నవ్వే వాడు. ఎక్కువమందితో స్నేహం చేసేవారు కాదు. నీతినియమాలు కలవారు. ఆకాలంలో మద్రాసుమెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, ప్రొఫెస్సర్లు మిలిటరీ హోదాలు గల I.M.S శాఖకు చెందిన బ్రిటిష్ ఉద్యోగులు. వారు నిరంకుశులు. కొంతమంది అవినీతపరులు. దేశీయ విద్యార్థి ఎంత తెలివైనవాడైనా వారినాశ్రయించకపోతే పరీక్షలలో తప్పించేవారు. చివరి పరీక్ష అనంతరం ఎం బీ బి యస్ డిగ్రీ నివ్వక L.M &S అను తక్కువ హోదా గల పట్టానిచ్చేవారు. హనుమంతరావుగారు మొదటినుండీ ఆత్మగౌరవం గలవారు ఒకరినాశ్రయించే స్వభావము లేదు అందువల్ల ఆయనకు L.M &S పట్టామాత్రమే లభించింది.

ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. సాధారణంగా ఒక డాక్టరు ఇంకకొకరిని ప్రోత్సహించరు. హనుమంతరావుగారిది విశాల హృదయం. మా మిత్రుడు డాక్టరు చాగంటి సూర్యనారాయణ మూర్తిగారు 1924 సంవత్సరంలో ఎంబి బియస్ పరీక్ష ఉత్తీర్ణులై ఎక్కడ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తూ వుంటే హనుమంతరావుగారాయనకు బెజవాడలో ప్రాక్టీసు పెట్టమని ప్రోత్సహించారు. నేను 1922 సంవత్సరంనుండీ బెజవాడలో న్యాయవాదిగా నున్నాను మేము చాల స్నేహంగా నుండేవారము. 1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. గాంధీమహాత్ముడు ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంప్రారంభించగనే ఒకరోజు సాయింత్రం నాథగ్గరకు వచ్చి తాము సత్యాగ్రహ ప్రమాణపత్రిక పైన సంతకం చేశానని చెప్పి రాజకీయ చరిత్ర గ్రంథాలను తీసుకుని వెళ్ళారు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. ఆయనకు శక్షవిధించిన సబు కలెక్టరు హెజమాడీగారికే ఆయన డాక్టరుగానుండిరి. హనుమంతరావుగారికి బి క్లాసు ఖైదీనిచ్చినా ఆయన సి క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు. ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొంది యశః కాయులైనారు.

1933 నేను నా మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య కలిసి రచించిన అధినివేశ స్వరాజ్యము అను రాజ్యాంగ శాస్త్ర గ్రంథమును హనుమంతరావుగారికి బహిరంగ సభలో అంకితం చెశాము. ఆసభకు దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. ఆ అంకితంలో హనుమంతరావుగారిని స్మరించాము” అని శివరావు గారు నోట్సులో వున్నది. ఇంతే కాక శివరావు గారి"Family History and Diary of chronological events" అను పెద్ద డైరీలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం రోజులలో బెజవాడలో జరిగిన ఆందోళన గురించి వ్రాశారు మహాత్మా గాంధీజీ ఇచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో బెజవాడ నుండి 11/04/1930 నాడు మొదటి విడతగా గంపలగూడెం కుమారరాజా గారి ఆధర్యాన బందరు దగ్గర చిన్నపురం బయలు దేరి వెళ్లారు. డా ఘంటసాల సీతారామ శర్మ గారు కూడా మొదటి విడతలో వెళ్లారు. 14/04/1930 తారీఖునాడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావు గారు డాక్టరు ఘంటసాల సీతారామశర్మ గారు కలసి రెండో విడతలో బెజవాడలో కాలి నడకన రైలు స్టేషన్ కు వెళ్లి రైలులో బందరుకు వెళ్లారు. ఆ రాత్రి బందరులో డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారింటి వద్ద బస చేసి మర్నాడు ఉదయం కాఫీ లైన తరువాత బయలు దేరి ముగ్గురు డాక్టర్లు కలసి చిన్నపురం సముద్రతీరంకి వెళ్లి అక్కడ ఉప్పు తయారు చేశారు. అట్లా చేసిన ఉప్పును తీసుకుచ్చి బందరు టౌనులో అమ్మకం చేసి బ్రిటిష్ వారి ఉప్పు చట్టమునుల్లఘించినందున పోలీసు వారిచే అరెస్టు చేయ బడి మెజస్ట్రేటు కోర్టులో హాజరు పరచటం వారికి జైలు శిక్షపటం జరిగింది. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురంలో ఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్టణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న వకీళ్ళందరూ ( ప్లీడర్లందరూ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో శివరావుగారు కూడా కోర్టులోనే ఉన్నారు. కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీగా పనిచేశారు. శివరావు గారి మీద 1930 లో వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46, 1930 కేసులో 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలాన్ని బట్టి స్వతంత్ర ఉద్యమాల్లో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావు గారే కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారని తెలుస్తున్నది. వెలిదండ్ల హనుమంతరావుగారికి కూడా శివరావుగారే అమికస్ క్యూరీగా నుండియుండవచ్చు. 08/05/1930 నాడు బెజవాడలో డా వెలిదండ్ల హనుమంతరావు గారి ఆధ్వర్యాన్న ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపు జరిగింది. అందులో చాలమంది పురప్రముఖలు కూడా వున్నారు 1923 డిసెంబరు 28 తారీఖనాడు కాకినాడ కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారు డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారు వైద్య సిబిరం నెలకొలిపి కాంగ్రెస్సు కార్యకర్తలకు సభకు వచ్చిన ఇతర ప్రజానీకానికానికి కావలసిన వైద్య సహాయమునిచ్చారు. ఆ కాకినాడ కాంగ్రెస్సు మహా ఘనంగా జరిగింది. చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు దిగవల్లి శివరావు గారు స్వరాజ్య పత్రికాప్రతినిధులుగా ఆరోజు సభలో పాల్గొన్నట్లు శివరావుగారి డైరీలో వ్రశారు. 15/06/1930 తారీఖునాడు డా శర్మ, వేలూరి యజ్ఞన్నారాయణ, డా వెలిదండ్ల హనుమంతరావు, బ్రహ్మాండం నరసిహాం, గోనుగుట్ల సుబ్రహమణ్యగుప్త, నూకల వీర రాఘవయ్య, వీర మల్లయ్య మొదలగు వారలు మొత్తం 40 మందిని రాజమండ్రీ సెంట్రల్ జైలులోని బ్రిటిష పోలీసు సార్జంటు దౌర్జన్యంగాలాఠీతో కొట్టారు, వారి మంచనీళ్ల మగ్గు, కళ్లజోడును కారణం లేకుండా విరక్కొటి వారందరును (మొత్తం 40 మందిని) ఆరోజువెల్లూరు తరలించటానికి సి ఆర్ పి సిబ్బందికప్పచెప్పారు 16/06/1930 నాడు పొద్దున్నే వారిని రాజమండ్రీ జైలునుండి వెల్లూరికి పాసింజరు రైలులో ప్రయాణాంచేయించి వెల్లూరు జైలుకు తరలించారు. దారిలో బెజవాడ రైలు స్టేషన్ లో పౌరులూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు శివరావుగారు కూడా రైలు స్టేషన్ కు వారలను చూడ్డానికి వెళ్లారు. పోలీసు వారి బందోబస్తీ నిఘాలో రైలు బండిలో ఖైదీలు గానున్న చాల మంది శివరావుగారితో పోలీసు వారు చూడకుండా చిన్న చిన్న సందేశాలిచ్చారు. అందులో డా శర్మగారు పెన్సిలోతో వ్రాసిన చిన్న లేఖలో శివరావుగారికి పోలీసువారు రాజమండ్రీ జైలు గేటుదగ్గర ఆ క్రితం రోజు రాత్రి ఎలా కొట్టిందీ వ్రాసి దానిని ప్రచురించవద్దని కోరారు. బాగా దెబ్బలు తిన్న వారిలో బ్రహ్మాండం నరసింహాం వెలిదండ్ల హనుమంతరావు గారు . ఆ జైలు సంఘటన కృష్ణా పత్రికలో డిసెంబరు 12 వ తారీఖ 1930 నాడు బొబ్బిలి పాట వరుసలో గురజాడ రాఘవ శర్మ రచించిన పాట ప్రచురించారు ( దాని ప్రతి చివరిలో జత పరిచాము) 31/01/1962 తేదీన ప్రచురితమైన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ రజతోత్సవ సంచికలో డాక్టరు శ్రీ వెలిదండ్ల హనుమంతరావు గారిపై దిగవల్లి వేంకట శివరావు గారు వ్రాసిన వ్యాసంలో ఇంకా కొన్ని వివరాలు: వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. వెలిదండ్ల దాసయ్య గారి పెద్దకుమారుడు.

హనుమంత రావు గారి విద్యాభ్యాసం[మార్చు]

వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. మూడవ ఫారం వరకూ గుడివాడలో తరువాత బందరు హైస్కూలులో స్కూలు ఫైనల్ దాక చదివారు. వారు 13 వ ఏటనే స్కూలు ఫైనల్ క్లాసుకు వచ్చెను. కానీ ఆ సంవత్సరం వారి ఆరోగ్య దృష్ట్యా వారి లెఖ్ళ ల మాస్టారు వారిని పరీక్షకు కూచ్చోవద్దన్న కారణంగా మరుసటిసంవత్సరం స్కూలుఫైనల్ కు వెళ్లి ప్యాసై బందరు నోబుల్ కళాశాలలో ఇంటరులో చేరి తరువాత మద్రాసులో క్రిస్టియన్ కాలేజీకు వెళ్ళి భౌతిక శాస్త్రములో బి.ఎ డిగ్రీలో చేరి 1916 లో పట్టభద్రులైరి. వారిని ఇంజనీరింగు కళాశాలలో చేరమని చాలమంది ప్రోత్సహించిరి కానీ ఆయన వైద్యకళాశాలలో చేరారు. ఆదే కాలం విక్టోర్యా హాస్టలులో వీరికి సమకాలీకులగా 1918-1920 లో దిగవల్లి వేంకట శివరావు గారు కూడా యున్నారు ( చూడు దిగవల్లి వేంకట శివరావు Wikipidea Telugu ). అటువంటి అమూల్య విశేషాలు “Reminiscences of Victoria Hostel” అని శివరావుగారి డైరీలో వ్రాసుకున్నారు.

వైద్య వృత్తిలో హనుమంతరావు గారి ప్రఖ్యాతి[మార్చు]

ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. హనుమంతరావుగారి సౌమ్యస్వభావము, వైద్య ప్రావీణ్యత, సర్వజన సమానత్వము వలన త్వరలోనే వారు ప్రముఖ వైద్యులుగా రాణించారు. బెజవాడలోనున్న వారే గాక చుట్టు పట్ల గ్రామాలు పట్టణములనుండి గూడా అనేక మంది వైద్యానికి వచ్చేవారు. ధనవంతులైనా హోదా కలవారైనా వారిదగ్గరకు వైద్యానికి వరుసలో నున్న రోగులతో పాటు రావలసినదే. బీదవారిని చాల దయగా చూచేవారు. పధ్య పానవిషయములు పాఠించని రోగులతో చాల కఠినముగా మందలించేవారు ఒకక్క సారి చాల కోపంగా రోగులపైనా రోగుల బంధువులపైనా పరుషముగా మాట్లాడినా అపాయస్థితిలో నున్న రోగులను చంటి పిల్లలవలే చూసుకునే వారు. వారి హృదయము కోమలమని రోగులు గ్రహించగలిగారు.

వైద్యమహాసభలలో హనుమంతరావుగారి పాత్ర[మార్చు]

1927 లో హనుమంత రావు గారు, వారి సమకాలీక వైద్య మిత్రులు డా పాలకోడేటి గురుమూర్తిగారు కలిసి రాజమండ్రిలో రాష్ట్రీయ వైద్య మహా సభ జరిపారు. తరువాత 1928 లో బెజవాడ మెడికల్ యసోసియేషన్ అను వైద్యసంఘమును స్థాపించి దానికి కార్యదర్శిగా చేశారు. ఆ సంస్ధ నానాటికి అభివృధ్ధి చెంది బెజవాడలో నున్న డాక్టర్లందరి క్షేమలాభములకొరకు పనిచేసి ప్రఖ్యాతి గాంచింది.

స్వతంత్ర పోరాటము[మార్చు]

1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు.

మరణం[మార్చు]

ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొందినారు.1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.