వేలు నాచియార్
రాణి వేలు నాచియార్ | |
---|---|
శివగంగై రాజ్య మహారాణి రామనాథపురం రాజ్య యువరాణి | |
![]() | |
పరిపాలన | c. 1780-c. 1790[1] |
ఉత్తరాధికారి | వెల్లచ్చి [2] |
జననం | 3 జనవరి 1730 రఘునాథపురం, తమిళనాడు, భారతదేశం. |
మరణం | 1796 డిసెంబరు 25 శివగంగై, తమిళనాడు, భారతదేశం | (వయసు: 66)
తండ్రి | చెల్లముతు విజయరఘునాథ సేతుపతి |
తల్లి | ముతాతల్ నాచియార్ |
మతం | హిందూ శైవం |
రాణి వేలు నాచియార్ (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) శివగంగ సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన రాణి. ఈమె బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.[మూలాలు తెలుపవలెను]
జీవితం
[మార్చు]
వేలు నాచియార్ రామనాథపురంప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయ రఘునాథ సేతుపతి, రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. విలువిద్య, గుర్రపుస్వారీ, వలరి, సిలంబం (కర్రసాము) వంటి యుద్ధ నైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. ఫ్రెంచి, ఆంగ్లం ఇంకా ఊర్దూ భాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక పుత్రిక.ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకు కలిసి కైలయార్ కోయిల్ యుద్ధంలో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికి సన్నద్ధమైంది. కానీ సైన్యం లేక పోవడంతో దిండిగల్ వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో తన కుమార్తెతో కలిసి ఎనిమిదేళ్ల పాటు తలదాచుకోవలసి వచ్చింది. ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనానాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది. "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించిన అతి కొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి శివగంగ సంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది. భారతదేశంలో బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన మొట్టమొదటి రాణి వేలు నాచియార్. ఆమె 1780 లో మురుతు సోదరులకి పరిపాలనాధికారాన్ని ఇచ్చింది. ఆ తరువాత కొద్దికాలానికే, 25 డిసెంబరు 1796లో ఆమె తన ఒంటిపైన నెయ్యి పోసుకొని నిప్పంటించుకుని మంటలు చెలరేగుతున్న సమయంలో కన్ను మూసింది. ఆమెను "జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు.