హైదరాబాదుపై పోలీసు చర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినదే పోలీసు చర్య (Police Action). ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోను, తెలంగాణా చరిత్రలోను ఇది ఒక ప్రముఖ సంఘటన. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు.

భారత్కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల్లో హైదరాబాదు అన్నిటిలోకీ పెద్దది, అత్యంత సంపన్నమైనది. స్వంత పతాకం, స్వంత ద్రవ్యం, నాణేలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, స్వంత రేడియో కలిగిన సంస్థానం అది. 1947 ఆగష్టులో భారత దేశానికి స్వాతంత్ర్యం రాగానే, హైదరాబాదు నిజాము, హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే ప్రయత్నాలు చేసాడు. ఈ ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితికి ఒక బృందాన్ని పంపించాడు కూడా.

భిన్నాభిప్రాయాలు[మార్చు]

హైదరాబాదుపై పోలీసు చర్య విషయమై కేంద్ర ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలుండేవి. అప్పటి గృహ మంత్రి సర్దార్ పటేల్ పోలీసు చర్యకై వత్తిడి చేయగా, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్, తరువాతి గవర్నర్ జనరల్ రాజాజీ దానికి వ్యతిరేకంగా నిలిచారు. హైదరాబాదుపై పోలీసు చర్య తీసుకుంటే, దాని వలన భారత్‌లో ముస్లిముల నుండి వ్యతిరేకత వస్తుందని, పాకిస్తాన్ భారత్ పై దండెత్తుతుందని ప్రధాని భావించాడు. మౌంట్ బాటెన్ కూడా ఈ ఆలోచనను సమర్ధించాడు. 1948 మే లోనే చేపట్టాలని ప్రతిపాదించిన పోలీసు చర్య మౌంట్ బాటెన్, నెహ్రూల వ్యతిరేకత కారణంగా వాయిదా పడింది. మౌంట్ బాటెన్ గవర్నర్ జనరల్ గా ఉన్నంత వరకూ అది సాధ్యపడలేదు.

చర్య[మార్చు]

మేజర్ జనరల్ (ఆ తరువాత జనరల్, సైన్యాధ్యక్షుడు) జొయంతో నాథ్ చౌదరి కి సికింద్రాబాదు వద్ద లొంగిపోయి హైదరాబాదు రాజ్యపు సైన్యాన్ని అప్పగిస్తున్న మేజర్ జనరల్ ఎల్ ఎద్రూస్ (ఎడమ వైపు)

రెండు సార్లు వాయిదా పడిన తరువాత తిరిగి 1948 సెప్టెంబర్ 13 న పోలీసు చర్య చేపట్టాలని గృహ మంత్రి పటేల్ ప్రతిపాదించాడు. దీనిని వాయిదా వెయ్యవలసినదిగా అభ్యర్థిస్తూ నిజాము రాజాజీకి చివరి నిముషంలో లేఖ రాసాడు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించి, గవర్నర్ జనరల్ రాజాజీ, ప్రధాని నెహ్రూ మళ్ళీ వాయిదా వెయ్యాలని ప్రతిపాదించారు. పటేల్ మాత్రం వెనక్కి తగ్గక అప్పటికే చర్య ప్రారంభం అయిందని ప్రకటించాడు.

అప్పటి భారత సైన్యపు బ్రిటిషు జనరల్ లాబ్‌లాక్‌హార్ట్, తనకు స్నేహితుడైన ఎల్ ద్రూస్ నేతృత్వంలో హైదరాబాదు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, భారతీయ సైన్యాన్ని నెలల తరబడి నిలువరించగల సత్తా దానికి ఉందని సలహా ఇచ్చాడు. అయితే చర్య మొదలైన ఐదవ రోజుకే పూర్తయిపోయింది.

సెప్టెంబర్ 13 న తెల్లవారుజామున 3:30 కి పోలీసు చర్య మొదలైంది. భారత సైన్యం, జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో హైదరాబాదును ముట్టడించింది. సెప్టెంబర్ 17 న నిజాము సైన్యం భారత్ కు లొంగిపోయింది. అధికారిక లొంగుబాటు పత్రంపై సెప్టెంబర్ 18 న సాయంత్రం 4:30 కి సంతకాలు చేసారు.

పోలీసు చర్య తరువాత ప్రధాని నెహ్రూ హైదరాబాదు వచ్చినపుడు నిజాము విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. కొద్ది రోజుల తరువాత పటేల్ వచ్చినపుడు ప్రోటోకోల్ ప్రకారం స్వాగతం పలకవలసి ఉండగా, నిజాము ముందు అందుకు సమ్మతించలేదు. పోలీసు చర్యకు మూలకారకుడు పటేల్ అని నిజాముకు కోపం. అయితే చివరికి విమానాశ్రయానికి వెళ్ళి పటేల్ కు స్వాగతం పలికాడు. అప్పుడు వారిమధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

నిజాము: “పొరపాట్లు మానవసహజం”
పటేల్: “నిజమే. పొరపాట్ల వెంటే, సంబంధిత పరిణామాలు కూడా ఉంటాయి”

అ(న)ల్ప విషయాలు[మార్చు]

పోలీసు చర్య తరువాత ముస్లిములపై దాడులు జరిగాయనీ, వారిని ఊచకోత కోసారనీ వార్తలు వచ్చాయి. దీని విచారణకై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పట్టుదలమీద ప్రధాని నెహ్రూ పండిట్ సుందర్‌లాల్, యూనస్ సలీం, అబ్దుల్ గఫార్ లతో ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించాడు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఈనాటికీ వెలుగు చూడలేదు.

చర్య చేపట్టింది భారత సైన్యమే అయినా, దీనిని పోలీసు చర్య అన్నారు, సైనిక చర్య అనలేదు. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి: నిజాము అప్పటికే హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రక్రియలో భాగంగా పాకిస్తానుతో మంతనాలు నెరుపుతున్నాడు. బ్రిటను టోరీ పార్టీ నాయకులతో కూడా సంబంధాలుండేవి. ఐక్యరాజ్యసమితికి హైదరాబాదు విషయాన్ని అప్పటికే నివేదించి ఉన్నాడు. భారత ప్రభుత్వమేమో హైదరాబాదు దేశ అంతర్భాగమని వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనిక చర్య చేపడితే స్వంత భూభాగంపైనే సైన్యాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందనే ప్రశ్న ఉద్భవిస్తుందని తలచి, ప్రభుత్వం దీనిని పోలీసు చర్య అని పిలిచింది.

సాంస్కృతికంగా..[మార్చు]

పోలీసు చర్య గురించి అడ్లూరి అయోధ్యరామకవి పోలీసు చర్యలు పేరుతో బుర్రకథ రచించాడు.[1]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "పోలీసు చర్య".