అందుగుల వెంకయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందుగుల వెంకయ్య
జననం17వ శతాబ్దం
వృత్తికవి
గుర్తించదగిన సేవలు
రామరాజీయము (లేదా) నరపతి విజయము
తల్లిదండ్రులుఅందుగుల సూరన్న

అందుగుల వెంకయ్య నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్న కుమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయమను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను.[1] ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తళ్ళికోట యుద్ధంలో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును.

రామరాజీయ మను గ్రంధములో విజయనగర రాజ్యాదీశుల చరిత్రను తెలిపే ఈ కవి రచనలు[మార్చు]

రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందనూలు, ఆదవాని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడింది.

గీ. సకలవిభు తిమ్మరాజుసేనలను ద్రుంచి
గుత్తి పెనుగొండ మఱిగండికోట కంద
నూలుపుర మాదవే నవలీల గెలిచి
తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.

ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతి విజయము నందీ క్రింది రీతిని వర్ణింపబడింది.

చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
జ్వలనశిఖాసముత్కరముచందము నందమునొందె నెంతయున్
సకలయ తిమ్మయప్రముఖశత్రుపురంబుల నెల్ల నారయన్.

ఈరామరాజుతండ్రియైన శ్రీరంగరాజు కృష్ణదేవరాయల తండ్రియైన నృసింహరాజునకు కర్ణాటకరాజ్యమును నిలుపుటలో సహాయుడుగా నుండినట్లు కానబడుచున్నది. ఈశ్రీరంగరాజుయొక్క శౌర్యము నరపతివిజయములో నీక్రింది పద్యమున వర్ణింపబడింది.

సీ. కడువిజాపురవరకామినీ గర్భముల్ భేదించు నెవ్వనిభేరిరవము
దామిడి బోయి నిజాముపట్టణముల ధూళిగాజేయు నేదొరబలంబు
గోలకొండవజీర్ల కోటులకాయముల్ చించు నేరాజేంద్రుచేతికత్తి
సకల భూపాలకాస్థానసన్నుతి గాంచి వెలయు నేశూరునివిజయలక్ష్మీ
యతడు కేవలనృపతియే యఘవిదూర
చర్యు డాశ్రితరక్షావిచక్షణుండు
జీర్ణ కర్ణాటభూపునర్జీవనుండు
రమ్యగుణశాలి శ్రీరంగరాయమౌళి.

రామరాజీయము లోని కవిత్వ రీతిని దెలుపు పద్యములు[మార్చు]

ఈ నరపతి విజయము కవిత్వముకంటే జరిత్రమును జెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనదైనను, కవిత్వముకూడ రసహీన మయినదికాదు. కవిత్వరీతిని దెలుపుట కయి రామరాజీయములోని రెండు పద్యముల నిం దుదాహరించబడినవి.

ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
బమ్మిన జూతపోతనవపల్లవబింబఫలారుణాంబుజా
తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.

మూలాలు[మార్చు]

  • ఆంధ్ర కవుల చరిత్రము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [అందుగుల వెంకయ్య (విభాగం) ]