కరుటూరి సూర్యారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరుటూరి సూర్యారావు కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు సమీపమున, మోర్త గ్రామములో పేద కర్షక కుటుంబములో జన్మించారు. "ప్రపంచ గులాబీ మహారాజు" గా పేరు బడ్డారు. సూర్యారావు ప్రతి రైతుకూ ఆదర్శప్రాయుడు.

కరుటూరి సూర్యారావు

సెప్టెంబరు 8, 1933 లో జన్మించిన సూర్యారావు ఉన్నత పాఠశాల చదువు ముగించాడు. తండ్రి నుండి సంక్రమించిన ఒక ఎకరము పొలము అమ్మి, కర్ణాటక రాష్ట్రము వలస వెళ్ళి, హాస్పేట లో వ్యవసాయము చేయుటకు స్థిరపడ్డాడు. కష్టాన్ని నమ్ముకున్న సూర్యారావు అంచలంచలుగా ఎదిగాడు. 'వరలక్ష్మి' ప్రత్తి వంగడాన్ని సాగు చేసిన ప్రధముడు. ఒకే పంటలో 75 టన్నుల చెరకు పండించి పురస్కారాలు పొందాడు. రహదారుల కాంట్రాక్టరుగా, రైస్ మిల్లు యజమానిగా, ఎరువుల వ్యాపారిగా సంపాదించిన డబ్బుతో కూర్గ్ లోని బ్రిటిష్ వారి తేయాకు ఎస్టేట్ కొన్నాడు. 1975లో మెగ్నీసియం ఉత్పాదక పరిశ్రమ, 1978లో నవభారత్ స్టీల్, 1979లో దీపక్ కేబుల్స్ , 1993 లో కరుటూరి ఫ్లోరిటెక్ స్థాపించాడు.

కరుటూరి గ్లోబల్[మార్చు]

ఆస్ట్రేలియా పర్యటనలో, భారత దేశపు గులాబీల చిన్న పరిమాణము వల్ల వ్యాపారము వృద్ధి కావడం లేదని గ్రహించి, కొడుకు సాయిరామకృష్ణ ను కెన్యా దేశము లో గులాబీల సాగు చేయమని ప్రోత్సహించాడు. అమెరికాలో వ్యాపార శాస్త్రములో పట్టా పొందిన రామకృష్ణ తండ్రి స్ఫూర్తితో 150 ఎకరములలో గులాబీలు సాగుచేసి ఐరోపా దేశాలకు ఎగుమతి మొదలుపెట్టాడు. క్రమముగా ఇథియోపియాలో 300 ఎకరాలు తీసుకొని ఐరోపా, అమెరికాలకు రోజా పువ్వుల వ్యాపారం విస్తరించాడు. ప్రస్తుతం మూడు దేశాలలో, 900 ఎకరాలలో గులాబీ మొక్కల సాగు నడుస్తున్నది. కరుటూరి గ్లోబల్ ప్రస్తుతము ఇథియోపియాలో 1,11,700 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు మొదలైన పంటలు పండిస్తున్నది.ప్రపంచములో అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్థగా ఎదుగుతున్నది. కరవుకాటకాలకు నెలవైన ఆఫ్రికా ఖండములో అహారోత్పత్తికి తోడ్పడుతూ, విశ్వవాణిజ్యవిపణి లో విలక్షణమైన ముద్రతో పెరుగుతున్న ఈ సంస్థ ఒక సామాన్య కర్షకుని పట్టుదలకు, శ్రమకు, భూమిని నమ్ముకొని జీవించే తత్వానికీ ఒక ఉదాహరణ.

ఔదార్యము[మార్చు]

సూర్యారావు గొప్పదాత. రాయచూరులో ఆసుపత్రి, త్రాగునీటి పధకాలు, రైతుల కోసం పురుగు మందుల పరీక్షాశాల, ఇథియోపియా లోని పల్లెలలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములో నిత్య అన్నదాన పధకానికి లక్షల రూపాయలు దానం చేశాడు. ప్రతి సంవత్సరము జనవరి 17వ తేదీన వేలాదిమంది ప్రజలకు ఉచిత వస్త్రదానము, భోజనము కల్పిస్తాడు.

సూర్యారావు జూన్ 3, 2011బెంగళూరులో మరణించాడు.

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]