కొండవీటి గుర్నాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండవీటి గుర్నాథరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, మునుగోడు శాసనసభ నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు.[1]

జననం[మార్చు]

గుర్నాథరెడ్డి నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, పలివెల గ్రామంలో జన్మించాడు.

ఉద్యమ జీవితం[మార్చు]

భారత స్వాతంత్ర్యోద్యమము లోనూ, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. వందలాది ఎకరాల భూమిని పంచిపెట్టాడు. పదహారేండ్ల వయస్సులోనే 1938లో హైదరాబాద్‌లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. దేశ నాయకులైన గాంధీ, నెహ్రూ ఉపన్యాసాల కోసం హైదరాబాద్ నుంచి ముంబై వరకు 18 రోజుల పాటు కాలినడక సాగించాడు. నిజాం నిరంకుశపాలన, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరీలకు చలించి 1942లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు. స్వామి రామానందతీర్థ పిలుపు మేరకు 1947లో వంద మంది దళ సభ్యులను చైతన్య పరచి సాయుధ పోరాట ఉద్యమాన్ని సాగించాడు. దొరల పెత్తంధార్ల బెదిరింపులకు లొంగకుండా ఊరూరా ఎర్రజెండాలను నాటి వెట్టి చాకిరికి వ్యతిరేఖంగా ఉద్యమించి, తొమ్మిది నెలల పదిహేను రోజుల జైలు జీవితం గడిపాడు.[2]

రాజకీయ ప్రవేశం[మార్చు]

1948లో యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసిన, రజాకారులు పలివెల గ్రామాన్ని భస్మీపటలం చేసే ఘటనను ఈయన ముందుగానే ఊహించి, ప్రజలను సురక్షిత పరచడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం 1953లో పలివెల గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1962లో నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు కేంద్రంగా గల మునుగోడు అసెంబ్లీ నియోజవర్గం నుంచి సీపీఎం తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ పై గెలుపొందాడు. 1973లో సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గంలో చేరి నాలుగేళ్ల పాటు అజ్ఙాత జీవితం గడిపాడు. భారత్-చైనా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసాడు. 1982 అక్టోబరులో ఉమ్మడి రాష్ట్రం నుంచి చైనా పర్యటనకు వెళ్లిన ఆరుగురు సభ్యులు గల బృందంలో ఈయన ఒకరు. 21 రోజలు పాటు చైనాలో పర్యటించాడు. ఓ వైపు సాయుధ పోరాటంలో, మరోవైపు సంఘ సేవా కార్యక్రమలో పాల్గొంటూనే 30 ఏళ్ల పాటు రాత్రి పాఠశాలలు నడిపాడు. సైన్స్, గ్రంథ పఠనంపై తనకున్న ఆసక్తిని ప్రజలకు పంచేందుకు గెలిలీయో పేరిట ప్రజల విరాళాలతో విజ్జాన గ్రంథాలయాన్ని నిర్మించాడు. ఆయన భుజంపై ఎప్పుడు చూసినా ఓసంచి, తెల్లటి దోవతి, లాల్చి ఆయన ఆహర్యం. వృద్ధాప్యం బాధిస్తున్నా చనిపోయేవరకు పలు మండలాల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడు. ప్రభుత్వం నిర్వహించే సభలకు, సమావేశాలకు స్వచ్ఛందంగానే హాజరయ్యేవారు.

మరణం[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతూ 2014, ఆగస్టు 31న ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం స్వగ్రామమైన పలివెల నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు.[3] ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా నల్లగొండ, హైదరాబాద్‌లో స్థిరపడగా, గుర్నాథరెడ్డి స్వగ్రామంలోనే ఉండేవాడు.

మూలాలు[మార్చు]

  1. http://54.243.62.7/breakingnews/article-139122[permanent dead link]
  2. The Hindu, Telangana (20 September 2015). "Rich tributes paid to freedom fighter" (in Indian English). Archived from the original on 15 October 2015. Retrieved 21 June 2021.
  3. The Hindu, Telangana (2 September 2014). "Kondaveeti Gurunatha Reddy no more" (in Indian English). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.