కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ | |||
![]() కొండా లక్ష్మణ్ బాపూజీ | |||
నియోజకవర్గం | అసిఫాబాద్, చిన్నకొండూర్, భువనగిరి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సెప్టెంబర్ 27,1915 వాంకిడి | ||
మరణం | సెప్టెంబర్ 21, 2012 హైదరాబాదు | ||
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | శకుంతల | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కూతురు | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ |
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.[1] స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.
బాల్యం, విద్య[మార్చు]
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న కొమరంభీం జిల్లా, వాంకిడిలో జన్మించాడు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.
స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం[మార్చు]
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు.[2] 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు[3]. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.[4] ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.
రాజకీయ జీవితం[మార్చు]
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ లో చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.
జలదృశ్యం[మార్చు]
1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.
గర్తింపులు[మార్చు]
- రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది.
- ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. వేడుకల నిర్వహణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైర్మన్, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లతో రాష్ట్రస్థాయి నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసి, సెప్టెంబరు 27న ఉదయం 10 గంటల నుంచి నగరంలోని రవీంద్రభారతిలో జయంతి వేడుకులను నిర్వహిస్తోంది. బాపూజీ పేరుమీద జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది.[5]
బాపూజీ విగ్రహాలు[మార్చు]
- హైదరాబాదులోని జలదృశ్యంలో ఏర్పాటుచేసిన 15 అడుగుల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని 2022 సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.[6][7]
- సిరిసిల్ల పట్టణంలో మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని 2022 సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుమార్, నాఫ్కెబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.[8][9]
మూలాలు[మార్చు]
- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40
- ↑ చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291
- ↑ The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity[permanent dead link]
- ↑ స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య
- ↑ "అధికారికంగా.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-27. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
- ↑ telugu, NT News (2022-09-28). "కూల్చిన చోటే.. గెలిచి నిలిచినం". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
- ↑ "KTR: కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
- ↑ "తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
- ↑ telugu, NT News (2022-09-27). "కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం మరువలేనిది : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
- All articles with dead external links
- తెలంగాణ విమోచనోద్యమం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1915 జననాలు
- 2012 మరణాలు
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న కొమరంభీం జిల్లా వ్యక్తులు
- కొమరంభీం జిల్లా న్యాయవాదులు
- నల్గొండ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- నల్గొండ జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు
- మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొమరంభీం జిల్లా వ్యక్తులు
- మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ వ్యక్తులు
- కొమరంభీం జిల్లా రాజకీయ నాయకులు
- కొమరంభీం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- హైదరాబాదు రాష్ట్ర శాసన సభ్యులు