అమరావతి కథా సంగ్రహం 26-50

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూరు కథలు అమరావతి కథలు. రచన సత్యం శంకరమంచి ఈ నూరు కథల్నీ ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా, సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

అమరావతి కథలు వ్యాసంలో ఈ పుస్తకం గురించిన వివరాలు, అమరావతి కథల జాబితా ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కథ గురించి మరిన్ని విశేషాలు నాలుగు వేరు వేరు వ్యాసాలలో పొందుపరచబడ్డాయి .

అమరావతి కథలు 26 నుండి 75 వరకు[మార్చు]

26. భోజన చక్రవర్తి[మార్చు]

  • ముఖ్య పాత్ర - అప్పంభొట్లు
  • బాపు బొమ్మ - అప్పంభొట్లు పీటమీద దిట్టంగా కూచుని, తన ముందు విస్తట్లోకి వడ్డించబడుతున్న భక్ష్య భోజనాలను ఆరగిస్తున్నట్టు వేశారు. సామాన్యంగా ఒక బొమ్మలోని వస్తువులు గాని, మనుషులు గాని ఒకే నిష్పత్తిలో వేయటం జరుగుతూ ఉంటుంది. కాని ఈ బొమ్మలో, అప్పంభొట్లును చాలా పెద్దగాను, బొమ్మలోని మిగిలినవి-వడ్డిస్తున్న మహిళ, భోజ్య పదార్ధాలు-అతనిలో సగంకూడ లేనట్టు వేసి, అప్పంభొట్లు తిండి పుష్టి ముందు ఇతరాలన్నీ కూడా తీసికట్టు అని సూచించారు.
  • కథ - తిండి పుష్టి గల అప్పంభొట్లు అనే వ్యక్తి కథ వినోదాత్మకంగా చెప్పబడింది. అతని "తినగల శక్తి"కి ఉదాహరణగా మూడు సంఘటనలు వర్ణించబడినవి. ఆ వర్ణనలో చక్కటి హాస్యం తొణికిసలాడుతుంది. అప్పంభొట్లు తిండిపోతుకాదని అతని తినే పద్దతే అంతని తెలుస్తుంది. అతను తిని ఊర్కోడు, దానికి తగినంత శ్రమ కూడా పడి తిన్నదానిని హరాయించుకోగల శక్తి చూపిస్తాడు. గ్రామంలో ఇతరులకి అంతో ఇంతో సహాయపడుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. తన తదనంతరం, తన తద్దినానికి తిండి పుష్టి గల భోక్తలను పెట్టమని చివరికోరిక కోరతాడు తన కొడుకుతో. "తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కన్పించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకీ, మునిమనవలకీ అప్పంభొట్లు ఆహారలీలలు చెప్పుకోవటమే మిగిలింది" అని చెప్తూ ముగించి, తరాలు మారేటప్పటికి వచ్చి పడిన జీవనవిధాన మార్పు సూచించారు రచయిత.


27. నావెళ్ళిపోయింది[మార్చు]

  • ముఖ్య పాత్రలు - పడవ వాడు రంగయ్య, వ్యాపారి సుబ్బయ్య
  • బాపు బొమ్మ - సుబ్బయ్య నోరు పెద్ద సుడిగుండంలాగానూ, అందులో రంగయ్య అతని పడవ లోపలకు లాగబడుతున్నట్లు వెయ్యబడింది.
  • కథ - అమరావతి నుండి ఆవలి గట్టుకి కృష్ణా నదిమీద పడవ నడుపుకునే రంగయ్య జీవనం ఈ కథాంశం. అతను అమరావతి గ్రామ ప్రజల మధ్య మనిషిగా వారి నవ్వులూ, కన్నీళ్ళూ పంచుకుంటూ వారి జీవితాలలో కలసిపోయి బతకటం చక్కగా సంఘటనాపూర్వకంగా చెప్పబడింది. వ్యాపారి సుబ్బయ్యకు తన తండ్రి చేసిన అప్పు ఏరోజుకారోజు సంపాదనలోనుండి జమవేసి మిగిలిన దాంతో తన బతుకు లాక్కొస్తుంటాడు రంగయ్య. వ్యాపారి సుబ్బయ్య దౌర్జన్యంగా రంగయ్య పడవను తన దొంగవ్యాపారానికి వాడుకోవటమే కాక, తన దొంగ సరుకు బయటబడినప్పుడు, తనను రంగయ్యే బయటపెట్టి ఉంటాడన్న భ్రమలో అతని మీద పగ బట్టి, అతని పడవను అప్పుకింద జమచేసి బలవంతంగా తీసుకునెళ్ళిపోతాడు. "ఇంతకాలం అందర్నీ అవతలొడ్డుకు చేర్చాను. బగమంతుడు నన్నీ వొడ్డునే వొదిలేశాడా!" అని రంగయ్య కుమిలి పోయ్యాడు అని చెప్తూ కథ ముగించారు రచయిత.


28. నీరు నిలవదు[మార్చు]

  • ప్రధాన పాత్రలు - ఊరిలోని అమ్మలక్కలు
  • బాపు బొమ్మ - కృష్ణానదిలో నిలబడి గుంపులు గుంపులుగా, నీళ్ళు తెచ్చుకుంటూ, బట్టలుతుక్కుంటూ, స్నానంచేస్తూ కబుర్లాడుకుంటున్న మహిళలు. నదీ ప్రవాహం, వారు నుంచున్నంతమేరా మకిలిగాను వారిని దాటిన తరువాత శుభ్రంగాను ఉన్నట్టుగాను వేసి, కథలోని రచయిత చెప్పదలచిన విషయాన్ని చూపించారు.
  • కథ - ఉదయాన గ్రామ మహిళలు రకరకాల పనులకోసం కృష్ణానదిని చేరి, అక్కడ వారు ఆడుకునే మాటలే ఈ కథ. ఆ మాటల్లోంచి రచయిత చేయించిన వారి అంతరంగ దర్శనం కథ ఉద్దేశం. ఒకళ్ళ మాట మరొకరు చొరబడకుండా, ఒకరిమాటకు మరొకరు అడ్డొస్తూ, ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు ఖండిస్తూ, అక్కడలేనివారి గురించి చెప్పుకోవటం, కొంత కావాలని, మరికొంత సహజంగా ఏదైనా వార్త ఒకరినుంచి మరొకరి వచ్చేటప్పటికి ఎలా మారి వికృతరూపం చెందుతుందో సోదాహరణ పూర్వకంగా చెప్పబడింది. ఎవరెన్ని కబుర్లు చెప్పుకున్నా అవేమీ కాలగమనంలో నిలిచేవి కావని, నదీ ప్రవాహ గమనంలో కలసి పోతాయని, కానీ వాటి రుచే మిగులుతుందని తేల్చి చెప్పి కథ ముగిస్తారు రచయిత.


29. ఎంగిలా?[మార్చు]

  • ముఖ్య పాత్రలు - రామశాస్త్రి, శ్రీదేవమ్మ
  • బాపు బొమ్మ - పరమేశ్వరున్ని అర్ధనారీశ్వర రూపంలో వేసి, ఆ రూపంలోని శివుని రామశాస్త్రి, పార్వతీ దేవిని శ్రీదేవమ్మ మొక్కుతున్నట్లు వేసి కథలో వారు తమ అమాయకత్వంలో పార్వతీ పరమేశ్వరులను వేరువేరుగా భావించి విడివిడిగా పూజించటం సూచించారు. అదేవిధంగా, భార్యాభర్తలు పార్వతీపరమేశ్వరుల లాగ జీవించాలని మరొక చక్కటి భావనను కూడా స్ఫురింపచేశారు.
  • కథ - సాంసారిక విషయాలమీద ఎంత మాత్రం దృష్టి సారించక దైవ ప్రార్థనే పరమావధిగ ఒకరు శివుని, మరొకరు పార్వతీ దేవిని పూజిస్తున్న నవ దంపతుల కథ ఇది. ఈ కథలో వారిద్దరూ సాంసారిక జీవనం వైపుకు మళ్ళిన విధానం ఐదు మన్మధ బాణాలుగ వర్ణించటం (ముళ్ళపూడి వెంకటరమణ కనిపెట్టినవి ఈ బాణాలు) ఒక చక్కటిప్రక్రియ.శివపార్వతులే ఏక శరీరంగా ఉండి భార్యాభర్తలు ఉండవలసిన విధానం సూచిస్తున్నప్పుడు, భర్త ముద్ద నోటికి అందిస్తున్నప్పుడు, "ఎంగిలి కాదో" అని శ్రీదేవమ్మ అనటం "ప్రసాదమనుకోరాదో" అని రామశాస్త్రి తానప్పుడప్పుడే అర్ధం చేసుకుంటున్న విషయాన్ని చమత్కరించి తెలియ చెప్పటం కథకు పెట్టిన పేరు "ఎంగిలా?" అన్న ప్రశ్నకు సమాధానంగా ఉంది.


30. బాకీ సంతతి[మార్చు]

  • ముఖ్య పాత్రలు - రంగయ్య, పంతులు
  • బాపు బొమ్మ - రంగయ్యనే కాడెద్దుగా కట్టి దున్నిస్తున్న పంతులు. చిన్న రైతులను ఏ విధంగా పీడించి పిప్పి చేస్తున్నారో, కథా విషయాన్ని చక్కగా చూపించారు బాపు.
  • కథ - రంగయ్య తన తండ్రి చేసిన అప్పును ప్రతి సంవత్సరం చెల్లు వేస్తూనే ఉంటాడు. అయినా సరే బాకీ మొత్తం కట్టలేదని, పంతులు అతని ఎద్దుల్ని జప్తు చేసి పట్టుకొని పోతాడు. తన ఎద్దులు లేక పోవటంతో వ్యవసాయం ఎలా కొనసాగించాలో అన్న ఆరాటంతో పంతులు మీద మండిపడుతూ అతని ఇంటి ముందు నుంచుని కేక వేస్తాడు రంగయ్య. కథలో సంభాషణలు చాలా తక్కువ. రంగయ్య ఆక్రోశంతో, కోపావేశంలో తనలో తను అనుకునే మాటలు, అపరాధభావంతో ఉన్న పంతులు మనసులోని భావనలతో రచయిత కథ నడిపారు. కథ చివరలో, ఎద్దుల్ని వదిలి పెడుతూ పంతులు అన్న విషపు మాటలకు ("...... మీ నాన్న చేసిన బాకీ కదా! పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని... సరే... ఇచ్చినంతే చాలు... ఇవ్వని వాళ్ళని పీడిస్తానా"), రంగయ్య అమాయకంగా "ఎప్పటికిమల్లే బాకీ జమేసుకోండయ్యా! మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా? నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేట్టు వొట్టేయించుకుని పోతానయ్యా!" అని సమాధానమిస్తాడు. ఈ ఉదంతాన్ని హృదయాన్ని హత్తుకునేట్లు రచించి, రైతులను తర తరాలుగా పీడిస్తున్న నీచులు పరివర్తన చెందుతారేమో అని రచయిత ఆశపడినట్టు కనిపిస్తుంది.


31. మాయ[మార్చు]

  • ముఖ్య పాత్ర - చిల్లరకొట్టు సుబ్బయ్య
  • బాపు బొమ్మ - ఇనప్పెట్ట కింద పడి ఉన్న మనిషి. అంత బరువు మీద పడి కూడా చేతిలోని నోటును వదలని ఆ మనిషి చెయ్యి. కథలోని సుబ్బయ్య ఎంతటి డబ్బు మనిషో, డబ్బుకి అతని ప్రాణానికి ఉన్న లంకె ఎంత గట్టిదో బొమ్మచక్కగా వ్యక్తపరుస్తున్నది.
  • కథ - చిన్నతనంలో సుబ్బయ్య మరమరాలు అమ్ముకుని బతుకినా, అంచెలంచెలుగా పెద్దవాడయి ఒక చిల్లరకొట్టు, ఆ కొట్టు మీద సంపాదనతో రెండిళ్ళు, చాలా రొక్కం సంపాయించుకున్నాడు. కాని మనిషికి డబ్బు యావ ఎక్కువవటంచేత, పెళ్ళాన్ని, కొడుకులను కూడా నమ్మకపోగా, సరైన తిండి కూడా తాను తినడు వారిని తిననివ్వడు. చిల్లరకొట్టు సంపాదనతో పాటు తాకట్టులు, అప్పులు మీద కూడా సంపాదన. కాని చివరకు ఒక రోజురాత్రి బాగా ఆకలివేసిన సుబ్బయ్య వంటింట్లొకెళ్ళి తినటానికె ఏమైనా ఉన్నదేమోనని వెదుకుతుంటే, తన పెళ్ళాం పిల్లలు తనకు మాత్రం పచ్చడి కూడు పెట్టి వాళ్ళు పప్పు కూరలు చేసుకు తింటున్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ దెబ్బతో "పెళ్ళాం పిల్లలు మాయ! మాయ! మాయ!" అని గొణుక్కుంటూ డబ్బు సంచులూ, ప్రాంసరీ నోట్లూ గుండెలకి హత్తుకుని ప్రాణాలువిడుస్తాడు. డబ్బు మనిషికి అందరూ దూరమే, డబ్బు అతని వెంటరాదు. ఈ విషయం తెలుసుకునేటప్పటికి జీవితంలో ఆలస్యం అయిపోతుంది. ఈ జీవిత సత్యాన్ని, తన చక్కటి శైలిలో రచయిత చిన్నకథలో ఇమిడ్చారు.


32. నివేదన[మార్చు]

  • ముఖ్య పాత్ర - కోటిలింగం
  • బాపు బొమ్మ - దేవుని ముందు తనకు తానే హారతి అయిపోయినట్టుగా కోటిలింగం యొక్క చిత్రణ, కథలో అతను తన్ని తాను నివేదించుకున్న విషయం సూచనప్రాయం.
  • కథ - కోటిలింగం తన భార్య ఆరోగ్యం కోసం మొక్కుకుంటాడు. కాని అమె దక్కక కోటిలింగం దాదాపు పిచ్చివాడయిపోతాడు. ఆ పిచ్చిలోనె మహాశివరాత్రి నాడు పరమేశ్వర దర్శనం కోసరం వెళ్ళి అక్కడ జనసందోహంలో దర్శనం దొరక్క గుళ్ళో అభిషేకం పూర్తయ్యేప్పటికి గుడి బయట మరణిస్తాడు. అతని మరణాన్ని, అతని చేతిలోని కొబ్బరికాయ టప్ మని పగిలి రెండుగా విడిపోయింది అని వ్రాసి సూచించారు.

33. ధర్మపాలడు[మార్చు]

  • ముఖ్య పాత్రలు - మున్సబు హనుమయ్య
  • బాపు బొమ్మ - పెద్ద పెద్ద మీసాలతో హనుమయ్య, అతని మీసాలకు త్రాసులు అతని ధర్మ పాలనకు నిదర్శనం.
  • కథ - ధర్మాన్ని పాలించేవాడు ధర్మపాలుడు. హనుమయ్య ఒక పరగణాకు మున్సబు. సిస్తులు వసూలు చెయ్యటంలో అతని నేర్పు, అతని న్యాయ వర్తనకు చక్కటి ఉదాహరణలివ్వ బడ్డాయి కథలో. ఒకానొక సంవత్సరం పంటలు సరిగా పండక శిస్తు వసూళ్ళు బాకీ పడతాయి. పైఅధికారి వచ్చి శిస్తు కట్టని వారిని శిక్షించాలంటాడు. గ్రామీణులతోపాటు, తనని కూడా కట్టెయ్యమని, వారిని కొట్టినట్టు తనని కూడా కొట్టమని అధికారికి విన్నవించుకుంటాడు. మాదగ్గర డబ్బుల్లేవు కాని దెబ్బలకు సిద్ధమేనయ్యా అని ఆ అధికారికి తన న్యాయ వర్తనద్వారా ఉన్న విషయం తెలియచెప్తాడు. ఆ అధికారి, ఆ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. హనుమయ్య పాత్రద్వారా పరిపాలనా దక్షత గల ఒక అధికారి ఎలా ఉండాలో చక్కగా చెప్పించారు రచయిత.


34.నాన్న - నది[మార్చు]

  • ముఖ్య పాత్రలు -సీతయ్య, అతని తండ్రి
  • బాపు బొమ్మ -మూడు తరాలుగా ఉన్న పురుషాకృతులు కృష్ణా నదీ ప్రవాహంగా వెయ్యటం చక్కగా ఉంది. కథా వస్తువను బొమ్మలో చక్కగా చూపించారు.
  • కథ - సీతయ్య తండ్రి మరణించినాక, అతను పడిన దు:ఖం, తన తండ్రితో అనుబంధపూర్వక పాత జ్ఞాపకాల దొంతర, ఈ కథలో ముఖ్యాంశాలు. చివరలో సీతయ్యకు తన తండ్రి మీద ఇంత దిగులు పడుతుంటే, తటాలున తాను కూడా తన పిల్లలకు తండ్రే అని తడుతుంది. తన తండ్రి తనకు ఎలా మార్గదర్శనమిచ్చాడో అలాగే తాను కూడా, తన పిల్లపట్ల తన బాధ్యత నిర్వర్తించాలన్న విషయం అవగతమయ్యి కొంత సాంత్వన పడతాడు . దాదాపు అందరి జీవితాలలోను ఎదురయ్యే సంఘటనలను, జీవిత సత్యాలుగా తీర్చి, సందేశాత్మకంగా కథారూపమిచ్చారు రచయిత.

35.కీలుగుర్రం[మార్చు]

  • ముఖ్య పాత్రలు- ఎవరూ లేరు
  • బాపు బొమ్మ- కీలుగుర్రం మీద ఉన్న పరమేశ్వరుడు చేతిలోని చర్నాకోలతో అర్చకుడు సూరయ్యను దెబ్బ వేస్తున్నట్టు, ఆ పక్కనే బూబి, కథాంశానికి దర్పణం
  • కథ - ఈ కథ కూడా అమరావతి గుళ్ళో జరిగే సంరంభాలలో ఒకటైన కీలుగుర్రం ఉత్సవం గురించి. పాపం చేసినవాడు అర్చకుడైనా సరే దేవుడు క్షమించడు అన్న విషయం చెప్పబడింది. అటువంటి ఊరేగింపులలో, గ్రామ ప్రాంతాలలో జరిగే హడావిడి యావత్తూ కళ్ళకు కట్టినట్టు వర్ణించబడింది.

36.అచ్చోసిన ఆంబోతులు[మార్చు]

  • ముఖ్య పాత్రలు-ఆంబోతు, వీరడు
  • బాపు బొమ్మ అచ్చోసిన ఆంబోతు మీద వీరడు ఊరిలోని దుర్నీతిపరులను హడలెత్తిస్తున్నట్టు
  • కథ-ఊళ్ళొ జరిగే అన్యాయాలకు, నోరులేని జంతువైనా, అచ్చోసిన ఆంబోతుగా తీవ్రంగా స్పందిస్తూ, అన్యాయపరుల పని పడుతుంటుంది. వీరడు రౌడీ, తాగుబోతుగా పిలవబడుతున్నా, దుర్మార్గులను అదిలించి బెదిరించి తెచ్చిన సొమ్ము బీదవాళ్ళకు ఆ దుర్మార్గుల చేతులో దెబ్బతిన్నవారికి పంచిపెడుతూంటాడు. ఈ ఇద్దరూ కలసి ఊరిలోని దుష్టుల ఆటలు ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఉంటారు. ఆందుకనే, కథ పేరు ఏకవచనంలో కాకుండా బహువచనంలో ఉన్నది!! "అల్లుడికి అన్నం పెట్టి తను పస్తుండాలి", "తాతలు సంపాదిస్తే మేమంతా మీదగ్గరకెందుకొస్తామండీ?" వంటి వ్యాక్యాలు కథలో అతి తక్కువ మాటలతో ఎంతో చెప్పినాయి.

37.వయసొచ్చింది[మార్చు]

38.లకల్లపుట్టింది లచ్చితల్లి[మార్చు]

39.ఇద్దరు మిత్రులు[మార్చు]

40.పున్నాగ వాన[మార్చు]

41.ఖాళీ కుర్చీ[మార్చు]

42.రాజహంస రెక్కలు విప్పింది...[మార్చు]

43.ఎవరా పోయేది?[మార్చు]

44.ముద్దులల్లుడు[మార్చు]

45.ముద్దేలనయ్యా - మనసు నీదైయుండ[మార్చు]

46.వంశాంకురం[మార్చు]

47.బలి[మార్చు]

48.అటునించి కొట్టుకురండి[మార్చు]

49.మనసు నిండుకుంది[మార్చు]

50.అబద్ధం - చెడిన ఆడది[మార్చు]