కవిరాజ మూర్తి

వికీపీడియా నుండి
(కవి రాజమూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సర్వదేవభట్ల నరసింహ మూర్తి
జననం1926 అక్టోబరు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు
ఇతర పేర్లుకవిరాజ మూర్తి
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందు
తండ్రివీరభద్రయ్య

కవి రాజమూర్తి ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత. ఇతని అసలు పేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1926 అక్టోబరు నెలలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలులో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. ఇతని బాబాయి సర్వదేవభట్ల రామనాథం గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. ఇతడు బాబాయి స్ఫూర్తితో కమ్యూనిజం వైపు మొగ్గు చూపాడు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన లేదు కాని ఇతడు ఉర్దూలో అభ్యుదయ కవిత్వం చెప్పడం మొదలు పెట్టాడు. ఇతడి కవిత్వాన్ని మెచ్చి నిజాం ప్రభుత్వం ఇతనికి 19వ యేటనే ప్రజా కవిరాజు అనే బిరుదును ఇచ్చింది. నాటినుండి ఇతడు కవిరాజ మూర్తిగా స్థిరపడిపోయాడు. ఇతనికి 1942లో వరలక్ష్మితో వివాహం జరిగింది. 1946లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభల సందర్భంలో ఇతడిని ప్రభుత్వం ఒక హత్యకేసులో ఇరికించింది. దానితో ఇతడు ఖమ్మం వదిలి హైదరాబాదుకు మకాం మార్చాడు. హైదరాబాదులో భుక్తి కోసం ఒక పుస్తకాల దుకాణం నడిపాడు. ప్రజాసాహిత్య పరిషత్తును స్థాపించాడు. కొంత కాలం నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత తాండూరు, పటాన్‌చెరు మొదలైన చోట్ల వివిధ పనులు చేశాడు. 1949 ప్రాంతాలలో ఇతడు ఉర్దూ భాషలో తెలంగాణ అనే పక్షపత్రికను సుమారు 6 నెలలు నడిపాడు.[2] ఇతడికి గిడుతూరి సూర్యం, బెల్లంకొండ రామదాసు, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావు మొదలైన వారితో స్నేహసంబంధాలు ఉండేవి.

కవిరాజు గా బిరుదు[మార్చు]

ఉర్దూలో అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత ‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. ఖమ్మం పట్టణంలో ఇప్పుడు వారి పేరే మీదుగా కవిరాజ్ నగర్ వున్నది.

ఉద్యోగ జీవితం[మార్చు]

  • 1949లో గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో ‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది.
  • కొన్నాళ్ళు పటాన్ చెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేసారు.

సాయుధ పోరాటం[మార్చు]

సాయుధ పోరాట కాలంలో కవిరాజమూర్తి తో పర్చా దుర్గాప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, వట్టికొండ రామకోటయ్య, అడ్లూరి అయోధ్యరామకవి, తాళ్ళూరి రామానుజస్వామి, హీరాలాల్‌ మోరియా, డి.రామలింగం వంటి వారు కలిసి పనిచేసారు.

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

  • 1949 ప్రాంతాల్లోనే ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత ఆరునెలలపాటువచ్చింది
  • ప్రజాసాహిత్య పరిషత్తును స్థాపించారు.
  • తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశారు.
  • 1949లో ఈయన తెలంగాణ అనే పత్రికను ఉర్దూలో వెలువరించారు.
  • మై గరీబ్‌ హూ – అనే ఉర్దూ నవలలో ప్రధాన పాత్రధారుడైన అపరిచితుడు ఆయనే. ఈ నవల ద్వారా తన జీవితం, తన సమాజం, తనకు ప్రభుత్వంపై గల ఆగ్రహాన్ని తెలిపారు.

రచనలు[మార్చు]

తెలుగు మాతృభాషగా ఉండి ఎక్కువ భాగం ఉర్దూలో రాసిన రచయిత కవిరాజమూర్తి. ఈయన స్వాతంత్య్రానంతరం ‘ఉత్తర’, ‘దక్షిణ’ అన్న మారు పేర్లతో పటంచెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అనేక వ్యాసాలు వెలువరించాడు. కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)పై ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ కవుల, కథకుల ప్రభావం ఎక్కువగా వుండేది. మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది. ఉర్దూలో ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి ‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు

నవలలు[మార్చు]

  1. మై గరీబ్ హూఁ
  2. మొదటి రాత్రి
  3. జారుడు బండ
  4. లహు కీ లకీర్ (ఉర్దూ)

కావ్యాలు[మార్చు]

  1. మహైక
  2. ప్రణుతి
  3. మానవ సంగీతం
  4. నవయుగశ్రీ (గేయాలు)
  5. అంగారే (ఉర్దూ)

నాటకం[మార్చు]

  1. మార్పు

మూలాలు[మార్చు]

  1. సంగిశెట్టి శ్రీనివాస్ (2005). తొలినాటి కతలు. హైదరాబాద్: ముదిగంటి సుజాతారెడ్డి. pp. xxxiv–xxxv.
  2. అఫ్సర్ (2011-10-10). "తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక 'అపరిచితుడు'". ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధ. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 4 April 2015.