కిరికెర రెడ్డి భీమరావు
కిరికెర రెడ్డి భీమరావు | |
---|---|
జననం | కిరికెర రెడ్డి భీమరావు జూన్ 13, 1896 |
మరణం | మార్చి 9, 1964 |
వృత్తి | మునసబు |
ప్రసిద్ధి | ప్రముఖ తెలుగు,కన్నడ కవి |
మతం | హిందూ |
పిల్లలు | 1 కుమారుడు, 1 కుమార్తె |
తండ్రి | రెడ్డి అప్పూరావు |
తల్లి | వేంకటలక్ష్మమ్మ |
కిరికెర రెడ్డి భీమరావు[1] (జూన్ 13, 1896 - మార్చి 9, 1964) తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు.
జీవిత చరిత్ర
[మార్చు]బడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు హిందూపురంలోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చదివాడు. తర్వాత బెంగళూరులో మిషన్ స్కూలులో కొంతకాలం చదివి మైసూరులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మైసూరులో స్వయంకృషితో కన్నడ భాషలో ఛందోవ్యాకరణాలలో నిష్ణాతుడయ్యాడు. ఆ భాషలో కవిత్వం చెప్పనేర్చాడు. మైసూరు సంస్కృత కళాశాలలోని పలువురు విద్వాంసుల సహకారంతో సంస్కృతం నేర్చి వ్యాకరణాది అలంకార సూత్రాలను, ఆయుర్వేదము, జ్యోతిశ్శాస్త్రము, సాముద్రికము, వేదాంతము మొదలైన వేదాంగాలను నేర్చుకున్నాడు. పెనుకొండలోని అసిస్టెంట్ ఇంజనీయరు ఆఫీసులో క్లర్క్గా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తండ్రి మరణంతో వంశపారంపర్యంగా వచ్చిన మునసబు ఉద్యోగంలో చేరాడు. ఇతనికి 22వ యేడు వివాహమైంది. ఒక కొడుకు ఒక కూతురు జన్మించిన తర్వాత 32వ యేడు భార్య మరణించింది. ఇతడు తన 68వ యేట 1964, మార్చి 9 న మరణించాడు.
రచనలు
[మార్చు]తెలుగు భాషలో
- వాయునందన శతకము
- భీమేశ్వర శతకము
- భక్తి పంచకము (ఐదు శతకములు)
- తిరుమలాంబ (నవల)
- శత్రునిగ్రహము (నవల)
- దశావతారములు
- మహేంద్రవిజయము (నాటకం)
- చంద్రమౌళి (నాటకం)
- గరుడ గర్వభంగము (హరికథ)
- సీతాకళ్యాణము (హరికథ)
- కృష్ణరాయబారము (హరికథ)
- కృష్ణగారడి (హరికథ)
- జాతక సుధానిధి (2 భాగములు)
- యోగాయుర్దాయ దర్పణము
- భీముని సాముద్రికము
- జ్ఞానవాశిష్టరత్నములు
- విజయనగర కళావిలాసము
- పితృభక్తి
- జగన్నాయక తారావళి
- యోగవాశిష్ఠము
- ఆధ్యాత్మ రామాయణము
కన్నడ గ్రంథాలు
- ಭಗವದ್ಗೀತ
- ಉತ್ತರಗೀತ
- ಗೀತಾಂಜಲಿ
- ವಿಜಯ ಗೌತಮ
- ಭೀಮೇಶ್ವರೀಯಂ
- ಪಾಂಡವಾಜ್ಞಾತವಾಸ
- ಕೃಷ್ಣ ಮಾಯಾವಿಲಾಸ
- ಯುಗಂಧರ ಪ್ರಜ್ಞೆ
బిరుదులు సత్కారాలు
[మార్చు]- బాలసరస్వతి మండలి, పెనుకొండ బాలకవి బిరుదుతో సత్కరించింది.
- 1946లో బెంగళూరులోని విశ్వకళాపరిషత్ ఆంధ్ర కర్ణాటక కవికేసరి బిరుదును ప్రదానం చేసింది.
- బళ్ళారి ప్రముఖులు 1956లో కవిసవ్యసాచి అనే బిరుదును ప్రదానం చేసి సన్మానించారు.
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం