గొబ్బూరి వెంకటానంద రాఘవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొబ్బూరి వెంకటానంద రాఘవరావు తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

గొబ్బూరి వెంకటానంద రాఘవరావు విజయనగరం జిల్లా , పార్వతీపురం లో ఏప్రిల్ 14 1892 న జన్మించారు. విశాఖ జిల్లా, యలమంచిలిలో స్థిరపడ్డారు. ఖగోళ శాస్త్ర పరిశోధనలలో జీవితకాలమంతా వ్యయపరిచారు.

పరిశోధనలు[మార్చు]

శతాబ్దాల నాటి ప్రాచీనులందించిన శాస్త్రవిజ్ఞానంతో ఎన్నెన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. ఖగోళంలోని అంశాలను పౌరాణిక పాత్రలలో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలు, కవులను తన పరిశోధనలకు ఆదర్శంగా ఎంచారు. వారు పాలపుంతను పాలసముద్రమని అభివర్ణిస్తూ, విష్ణువు పాదాల దగ్గర పుట్టిన దివిజగంగ ఆకాశంలో పయనించి శివుని తలమీద వర్షించిందని చెప్పారు. పాలపుంత ఎగువభాగంలో ఒక మూలన ఉన్న ప్రధాన నక్షత్రం విష్ణువు అనే దేముడి నామం కలిగినది. పాలపుంత దిగువభాగంలో చివరలో ఉన్న ప్రధాన నక్షత్రం ఆరుద్ర. ఇది శివుడి పేరు కలిగిఉన్నది. ఈ రెండు సక్షత్రాల నడుమ "హంస" పేరు కలిగిన నక్షత్రం ఒకటి ఉన్నది. హంసకు ఎడమ భాగమున ఉన్నది క్షీరసముద్రమనీ, రెండవ వైపున ఉన్నది దివినుండి భువికి చేరిన గంగ అనీ చెప్పారు. ఈ అంశాలన్నిటినీ రాఘవరావు పరిశీలించి, అధ్యయనం చేసి, ఆ పాలనూ, నీళ్ళను వేరుచేసే హంసతో సహా ఖగోళ చిత్రపటాన్ని తయారుచేసి "భారతి" సాహిత్య మాసపత్రిక (1920 దశకం) లో ప్రచురించారు. ఖగోళ శాస్త్రాన్ని గురించి చిరకాలం పరిశోధనలు చేసి కనుగొన్న వాటిని వేదాల్లోనూ, తైత్తరీయ సంహిత లోనూ, పురాణాలలోనూ , మహాభారతంలోనూ నర్మగర్భితంగా ఉన్న అంశాలతో సమన్వయం చేసి, అధ్భుతమైన విషయాలను ఆవిష్కరింపజేస్తూ "జ్యోతిర్వేదం" పేరుతో తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని ప్రచురించారు. ఇది కేవలం శాస్త్ర గ్రంధమే గాని, జ్యోతిష గ్రంథం కాదు. స్క్రిప్చర్స్ ఆఫ్ ది హెవెన్స్ ఆంగ్ల గ్రంథ రచనను, నక్షాత్రములు, చుక్కల శుద్ధి మొదలైన గ్రంథాలను రాశారు. జ్యోతిర్వేదమును, ఆంగ్ల గ్రంధాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు.

ఆయన అక్టోబరు 10 1958 న మరణించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

  1. విశ్వ ప్రకాశం పత్రికలోని సంపాదకీయంలో ఆయన విషయాలు