గ్రీస్ పురాణ కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రీస్ పురాణ గాథలు: ఒక పరిచయం  [మార్చు]

ఆధునిక పాశ్చాత్య నాగరికత పునాదులు గ్రీసు దేశంలో కనిపిస్తాయి. పైథాగరస్, సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ వంటి ఆద్యులకి గ్రీస్ దేశం పుట్టినిల్లు. ఆధునిక శాస్త్రాల మీద గ్రీసు దేశపు ప్రభావం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. అంతే  కాదు. పాశ్చాత్య  సాహిత్యం మీద, శిల్పాల మీద, తైలవర్ణ చిత్రాల మీద, సినిమాల మీద, ఆటల మీద కూడా గ్రీసు దేశపు పురాణ గాధల ప్రభావం మెండు. కనుక గ్రీసు దేశపు పురాణ గాథలపై అవగాహన ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మౌర్య సామ్రాజ్యం రోజుల నుండి భారత దేశం మీద గ్రీసు ప్రభావం మెండుగా ఉందనే చెప్పాలి.

గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకి మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ  పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు.  ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు. కానీ హిందూ పురాణ గాథలకి, గ్రీసు పురాణ గాథలకి మధ్య మౌలికమైన తేడాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి వాటన్నిటిని పక్కన పెట్టి వారి పురాణ గాథలని ఒక నఖచిత్రంలా అర్థం చేసుకుందాం.

చాల సమాజాలలో పురాణ గాథలు  ఉన్నాయి; ఈజిప్ట్, నోర్స్, వగైరా. ఈ కథలు అన్నిటిలోను ఈ ప్రపంచం ఎలా పుట్టుకొచ్చిందో, అందులో మానవుడు ఎలా ఉద్భవించేడో, రకరకాల కోణాలలో ఆవిష్కరణ జరుగుతుంది. అంతే  కాకుండా దేవతలు, స్వర్గం, నరకం, మొదలైన విషయాల మీద పరిశీలన జరుగుతుంది. వీటిని సునిశితంగా పరీక్షించి చూస్తే వీటన్నిటిలోను కొన్ని పోలికలు కనిపిస్తాయి. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, విభిన్న ప్రదేశాలలో, విభిన్న కాలాలలో నివసిస్తున్న మానవుల మేథలో, ఈ విశ్వం ఆవిర్భావాన్ని గురించి పోలికలు ఉన్న  ఆలోచనలు వచ్చి ఉండవచ్చు. రెండు, అనాది కాలంలో ఈ విశ్వం ఆవిర్భావం గురించి ఒక చోట వచ్చిన మౌలికమైన ఊహా తరంగాలు నాలుగు దిశలకి వ్యాపించి, కాలక్రమేణా దేశ, కాల, పరిస్థితులకి  మార్పులు చెంది, రకరకాల కథలుగా అవతరించి ఉండవచ్చు. స్వర్గం, నరకం, దేవతలు, దానవులు, మంచి, చెడు  అనే భావాలకి భౌగోళిక పరిధులు ఉన్నట్లు తోచదు.

పురాతన కాలపు గ్రీసు దేశంలో ప్రజలు బహుదేవతారాధకులు. ప్రకృతిలో మనకి కనిపించే శక్తులు దేవతల ఆధీనంలో ఉంటాయని నమ్మేవారు. ఆయా దేవతలు ప్రసన్నమైతే ఆయా శక్తులు మనకి అనుకూలంగా ఫలితాలని ఇస్తాయని నమ్మేవారు.

గ్రీసు దేవతలలో ఏకోదరుల మధ్య వివాహాలు జరిగితే తప్పుకాదు; అదే విధంగా తల్లికి కొడుకుకి మధ్య వైవాహిక సంబంధం కానీ, తండ్రికి, కూతురుకి మధ్య వైవాహిక సంబంధం కానీ సమ్మతమే. సృష్ట్యాదిలో ఈ రకం సంబంధాలు తప్పనిసరి. ఈ రకం సంబంధాలు హిందూ పురాణాలలోను కనబడతాయి. దేవతలని, అమరులని  మానవ లోకంలో ఉన్న విలువల పట్టకం ద్వారా విమర్శించి ప్రయోజనం లేదు. అదే విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు విలువలని, శాస్త్ర పరిజ్ఞానాన్ని గజం బద్దలా వాడి వీరిని విమర్శించి లాభం లేదు.

భారతదేశపు ప్రాచీన పురాణ గాథలు  రామాయణ, మహాభారతాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే విధంగా గ్రీసు దేశానికి  సంబంధించిన ప్రాచీన పురాణ గాథలు హోమర్ (క్రీ పూ. 750) రాసిన ఇలియాడ్, ఆడెస్సీ అనే గ్రంథాలలోను,  హెసియోడ్ (క్రీ.పూ. 700) రాసిన థొయోగొనీ లోను, వర్జిల్ (క్రీ పూ. 20) రాసిన ఎనియాడ్,  వగైరా  గ్రంథాలలోనూ  కనిపిస్తాయి. (ఇక్కడ ఇచ్చిన తేదీలు అన్ని సుమారుగా తీసుకోవాలి; కచ్చితంగా ఎవ్వరికి తెలియదు.

గ్రీసు, హిందూ పురాణాల మధ్య పోలికలు[మార్చు]

గ్రీకు పురాణాలలో  కథలకి, హిందూ పురాణ గాథలకి మధ్య ఎంత “గట్టి” పోలికలు అంటే ఒకరి నుండి మరొకరు “అనుకరించారా?” అన్న అనుమానం రాక మానదు. “ఎవరి నుండి ఎవరు?” అనే ప్రశ్న వేసుకుని అనవసరంగా ఆరాట పడే కంటే ఆ పోలికలు కొన్ని చూద్దాం.

ఉదాహరణకి మేషాది మీన పర్యంతం ఉన్న ద్వాదశ రాసులనే తీసుకుందాం. భూమి నుండి సూర్య చంద్రులని  చూసినప్పుడు నేపథ్యంలో కనిపించే నక్షత్ర సమూహాలకి మన పూర్వులు మేషం, వృషభం, …., మీనం అని పేర్లు పెట్టేరు. ఎందుకని ఈ పేర్లు పెట్టేరుట? ఆ నక్షత్ర సమూహాలు ఆయా శాల్తీల ఆకారాలలో ఆనాటి వీక్షకులకి కనిపించి ఉంటాయి. మరొకరి కంటికి ఈ ఆకారాలు అలా అనిపించలేదు. ఎక్కడో, ఎవ్వరికో ఒక నక్షత్ర సమూహం మేషం ఆకారంలోనో,  వృషభం ఆకారంలోనో కనిపించి ఉండు గాక. కానీ అవే నక్షత్ర సమూహాలు అన్ని  దేశాలలో  అవే ఆకారాలలో కనిపించేయనడం నమ్మశక్యం కాని ఊహ.  ఈ రాసి చక్రం లోని పేర్లు ఇటు నుండి అటు అయినా వెళ్లి ఉండాలి, లేదా అటు నుండి ఇటు వచ్చి ఉండాలి.

మరొక ఉదాహరణగా వారాల పేర్లు చూడండి.  ఇంగ్లీషులో వాడే వారాల పేర్లు పాశ్చాత్యుల పురాణాలలోని పాత్రల పేర్లని ఆధారంగా చేసుకుని పెట్టినవి. వాటిని యధాతథంగా సంస్కృతంలోకి అనువాదం చేసి పెట్టిన పేర్లే మనం ఇప్పుడు వాడుతున్నవి అని కొందరి నమ్మకం. ఎందుకంటే గ్రీసు, రోమక పురాణ గాథలలో వీటి  వెనుక చాల లోతైన కథలు ఉన్నాయి. ఇటువంటి లంకె భారతదేశంలో వాడుకలో ఉన్న వారాల పేర్లకి, పురాణ గాథలకి మధ్య ఉందేమో కానీ అది కనబడడం లేదు. నెలల పేర్లు వచ్చేసరికి చైత్ర వైశాఖాదులకి, జనవరి, ఫిబ్రవరి, వగైరాలకి ఇటువంటి సంబంధం కనిపించదు. గ్రహాల పేర్లు చూసినా, నక్షత్రాల పేర్లు చూసినా కూడా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపించదు.

హిందువులకి కైలాస పర్వతం ఉంటే వారికి  ఒలింపస్ పర్వతం ఉంది. కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు, ఒలింపస్ పర్వతం మీద వారి దేవతలు అందరూ ఉంటారు. హిందూ దేవతలూ, గ్రీసు దేవతలూ  అమరులే. వీరికి దేవతలకి అమృతం తాగితే అమరత్వం సిద్ధించింది. వారి దేవతలు “అంబ్రోజియా” తింటారు, “నెక్టర్” తాగుతారు. విష్ణుమూర్తి దేవతలకి అమృతం పంచిపెడుతున్న సమయంలో ఒక రాక్షసుడు దేవతల వరసలో చేరి  దొంగతనంగా అమృతం తాగినందుకు శిక్షగా  విష్ణుమూర్తి అతని తలని తన చక్రంతో నరుకుతాడు. గ్రీసు పురాణాలలో టెంటలస్ “అంబ్రోజియా” ని దొంగిలించి తిన్నందుకుగాను ఆకలిదప్పికలతో పాతాళంలో పడి  ఉండమని శాపం పొందుతాడు.  

తనకి పుట్టిన సంతానమే తన మరణానికి కారణం అవుతుందని తెలుసుకుని రేయాకి పుట్టిన ప్రతి బిడ్డని క్రోనస్ మింగేస్తాడు. చిట్టచివరికి కడసారపు బిడ్డ జూస్  ప్రాణం  కాపాడడానికి రేయా కుట్ర పన్నుతుంది. ఇక్కడ శంతనుడు-గంగ కథ కానీ కంసుడు-కృష్ణ కథ కానీ గుర్తుకి వస్తుంది. ఇలా వెతికితే బాహిరంగా ఇంకా చాల  పోలికలు కనిపించినా ఇలియడ్, ఆడెస్సి  వగైరాలలో కనిపించే గ్రీసు పురాణ గాథలకి రామాయణ, మహాభారతాలలోను, హిందూ పురాణాలలోను  కనిపించే కథలకి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈ కథల ద్వారా ఈ పోలికలు, తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకోడానికి అవకాశం ఉంది.

మూలాలు[మార్చు]

వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీసు దేశపు పురాణ గాథలు, ఈమాట జాలపత్రిక, జనవరి 2020