నందుల సుశీలాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందుల సుశీలాదేవి ప్రఖ్యాత నవలా రచయిత్రి, కథా రచయిత్రి.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె 1940వ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. విద్యావంతుల ఇంట పుట్టినందువలన ఈమె విద్యకు ఎటువంటి అవరోధం ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌. పట్టాలు పొంది అన్నవరం సత్యవతి కళాశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను అధ్యాపకురాలిగాను, ప్రిన్సిపాల్‌గానూ పనిచేసి పదవీ విరమణ గావించింది. ఈమె భర్త సుసర్ల సుబ్రహ్మణ్యం. వీరి పిల్లలిద్దరు వున్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. ఈమెకు చిన్నతనం నుండి సమాజసేవపట్ల అనురక్తి. వృద్ధాశ్రమాలు, వికలాంగుల పాఠశాలలు వంటి ఎన్నో సేవా సంస్థల కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ కాకినాడలో విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంతంగా గడుపుతున్నది[1].

రచనలు[మార్చు]

ఈమె తొలిరచన సోషల్‌ సర్వీస్‌ అనే కథానిక 1958వ సంవత్సరంలో ఆంధ్రపత్రికలో ప్రచురితమయింది. అప్పుడు ప్రారంభమయిన ఈమె సాహితీప్రస్థానం ఇప్పటికీ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఈ యాత్రలో ఆమె రెండువందలకు పైగా కథలూ, ఒక నాటకం, కొన్ని నవలలు, కొన్ని కథా సంపుటాలు వెలువరించింది. ఈమె రచనలు యువ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, భారతి, స్వాతి, విపుల, ఉషస్సు, నవ్య, పత్రిక, విశాలాంధ్ర, విశాఖ, ఈనాడు వంటి ప్రఖ్యాత పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఈమె రచనలలో కొన్ని:

  • సరళీస్వరాలు (నవల)
  • శ్రావణమేఘాలు (నవల)
  • చిగురాకులు (నవల)
  • శరన్మేఘం (కథాసంపుటి)
  • చిరుగాలి (నాటకం)
  • సుజాత (నవల)
  • అమృతహస్తం (నవల)
  • తరంగం (నవల)
  • లాలస (నవల)
  • సాయంసంధ్య (కథాసంపుటి)

పురస్కారాలు[మార్చు]

ఈమెకు పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి పురస్కారం, ఆంధ్రభాషా సమితి పురస్కారం, చక్రపాణి అవార్డు లభించాయి. 2011లో కేంద్రప్రభుత్వం ఈమె వృద్ధులకు చేసిన సేవలకు గుర్తింపుగా వయోశ్రేష్ఠ సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది[2].

మూలాలు[మార్చు]