ఈనాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈనాడు
ఏప్రిల్ 17, 2008 నాడు ఈనాడు పేపర్ ఆన్ లైన్ వెర్షన్ పటచిత్రం
రకందిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్
ప్రచురణకర్తరామోజీరావు
సంపాదకులుతెలంగాణ ఎడిషన్ ఎడిటర్: డి.ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్: ఎం. నాగేశ్వరరావు [1]
స్థాపించినదిఆగష్టు 10,1974
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
కేంద్రంహైదరాబాద్,తెలంగాణ
Circulation16,56,933 [2]
జాలస్థలిఈనాడు జాలస్థలి

ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 పత్రిక అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

ప్రారంభం[మార్చు]

ఈనాడు వ్యవస్థాపకుడు
హైదరాబాదు, సోమాజీగూడలో ఈనాడు ప్రధాన కార్యాలయం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చారు

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది.[3][4]

చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు. అలాగే తెలుగు పత్రికల పేర్లు - ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది. విశాఖపట్నంలో ముఖ్య దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం.

ఎడిషన్[మార్చు]

ఆంధ్రప్రదేశ్ లో 12, తెలంగాణాలో 7, దేశంలో ఇతర తెలుగువారు వుండే ప్రాంతాలలో 4, మొత్తం 23 ఎడిషన్లు ముద్రిస్తున్నారు.

ప్రస్థానం[మార్చు]

పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వహణలోను, ఆ తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్ఠమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.

పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో తెలుగు దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ముఖ్య పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.[5] 1993, 1994లలో జరిగిన మధ్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.

1989 జనవరి 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టారు. ఈ సంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.

ఆదివారం అనుబంధాన్ని 28 పిభ్రవరి 1988 నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్యం పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 1992 సెప్టెంబరు 24న మహిళల కోసం ప్రత్యేకంగా వసుంధర పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యోగవకాశాల కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించింది. 1985 ఆగష్టు నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది.[6] ఈనాడులో 2010 తరువాత ఆదివారము అనుబంధంలో రాశి ఫలాలు చేర్చారు

అమ్మకాలు, చదువరులు[మార్చు]

అమ్మకాలు

ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, ఈనాడు పత్రిక సగటున 16,56,933 పత్రిక అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. [2]2018 సంవత్సరపు ఇదేకాలంతో పోల్చితే 8.3% తగ్గుదల కనబడింది.>[7] 2018 గణాంకాలను 2017 సంవత్సరపు ఇదేకాలంతో పోల్చితే 2.9% తగ్గుదల కనబడింది. 2006 జనవరి-జూన్ గణాంకాల ప్రకారం సగటున 11,76,028 ప్రతిదినం పత్రిక అమ్మకాలుండేవి.[8]

చదువరులు

ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 58,23,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 1,39,46,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 11.5% తగ్గింది.[9] NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, అప్పట్లో దేశంలోనే తృతీయ స్థానంలో నిలచింది.[10]

భాష[మార్చు]

ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శైలి ఉండే మాట నిజం. అయితే పత్రికా ప్రచురణ ఎవరో ఒక వ్యక్తి చేయగలిగింది కాదు. అందులోనూ దినపత్రికల విషయంలో అసలు సాధ్యం కాదు. రకరకాల అనుభవాలూ, విద్యాసంస్కారాలు ఉన్న వ్యక్తులు పత్రికల్లో పనిచేస్తుంటారు. వారంతా ఒక ప్రాంతంవారు గాని, ఒక మతం వారు గాని కారు. విద్య, కులం, మతం, వృత్తి, ప్రాంతం వంటివన్నీ భాషలో బేధాలు తెచ్చిపెట్టేవే. భాషలో ఉన్న ప్రత్యేకత వైవిధ్యంలో ఏకత్వం, భిన్నవ్యక్తులు రాసే భాషలో ఏకత్వం సాధించటం అంటే భిన్న మాండలికాల నుంచి ఒక సాధారణ భాషా లక్షణాన్ని ఏర్పరుచుకోవటమే. ఒకే పత్రిక భిన్న ప్రాంతాల నుంచి ఏక కాలంలో వెలువడేటప్పుడు ఆ పత్రికా భాషలో సాధ్యమైనంత ఏకరూపత లేకపోతే అది ఒకే పత్రిక అనిపించదు. అందువల్ల అందరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. ప్రపంచ భాషా పత్రికలన్నింటికీ భాషా విషయకంగా కూడా కొన్ని నియమనిబంధనలున్నాయి. అలాగే ఈనాడుకూ కావాలి

—బూదరాజు రాధాకృష్ణ

ఈనాడులో ఉపయోగించే భాష విషయంలో నియమాలు రూపొందించుకుని, పూర్తిస్థాయి భాషా శైలిని రూపొందించుకున్నారు. ఈ భాషా శైలిని రూపొందించడంలో భాషాశాస్త్రజ్ఞుడు, పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ కృషి ఉంది. అతను ఈనాడు భాషా స్వరూపం అన్న పుస్తకాన్ని కూడా ఈ విషయంపై రాశాడు. ఈ నిబంధనలు రూపొందించుకోవడంతో పాటుగా, అమలుచేయడంలో కూడా ఈనాడు సంస్థ పలు విధానాల్లో కృషిచేసింది. పత్రికల్లో పలు ప్రాంత, మత, కుల, విద్య నేపథ్యాలకు చెందినవారు పనిచేసినా ఇదంతా ఒకటే పత్రిక అన్న భావన పాఠకుడికి రావడానికి ఈ భాషా శైలి, ఆ భాషా శైలిని అమలుచేసి పత్రికా భాషలో ఏకరూపత తీసుకురావడం ఉపయోగపడతాయి. అత్యంత సంక్లిష్టమైన ఏకరూపతను ఈనాడు పత్రిక సాధించి, నిలబెట్టుకుంది. "భాషా ప్రయోగం విషయంలో ఈనాడు సాధించిన ఏకరూపత లేదా తనదైన ప్రత్యేక శైలిని మరో పత్రిక సాధించినట్లు కనిపించదు." అని కాసుల ప్రతాపరెడ్డి పేర్కొన్నాడు.[11]

భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. సాధారణంగా ఇంగ్లీషులో అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తారు. అయితే సమయం తక్కువగా ఉండటం చేతగాని, ఒక పద్ధతికి అలవాటు పడటం వలనగానీ మిగిలిన పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో కూడి, సరళంగా ఉండేది కాదు. ఈనాడు, అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది.

తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి.

శీర్షికలు, విశిష్టతలు[మార్చు]

వారం శీర్షిక వివరాలు
సోమవారం
విద్యకు సంబంధించి, నూతన కోర్సుల గురించి సమాచారం[8]
మంగళవారం
ఆరోగ్యంనకు, జబ్బులు సంబంధించి వైద్యులతో నివారణ చర్యలు, చర్చ, సూచనలు ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం
బుధవారం
ప్రపంచ ఆటలు, క్రీడల గురించి సమగ్ర సమాచారం, విశ్లేషణ ఆటలలో గత రికార్డులు, జరగబోవు క్రీడల సమాచారం.
గురువారం
కంప్యూటర్, సమాచార సాంకేతికాంశాలు గురించి సమాచారం, ప్రశ్నలు-జవాబులు, ఉపయోగకరమైన వెబ్సైట్ల వివరాలు
శుక్రవారం
ఆర్ధిక అంశాలు పన్నులు, వడ్డీలు, మ్యూచువల్ ఫండులు, ఆర్థిక నేరాలు-మోసాలు తీసికోవలసిన జాగ్రత్తలతో నిపుణులతో సూచనలు, మెలకువలు
శనివారం

  • యువతారానికి సంబంధించిన విషయాలు, విజయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన నిపుణుల సూచనలు, వ్యాసాలు.
  • స్థిరాస్తుల గురించి 4 పుటల ప్రత్యేక అనుభందంలో గృహ రుణాలు, రాష్ట్రం, దేశంలోని రియల్ ఎస్టేట్ సమాచారం, నిపుణుల సూచనలు, ప్రకటనలు.
ఆదివారం
చదువకునే బాలబాలికలు ఆసక్తి కలిగించే బొమ్మలకు రంగులద్దడం, బొమ్మలు గీయడం, చిక్కుప్రశ్నలు లాంటివి వుంటాయి.
ఆదివారం
ఆదివారం ప్రత్యేక అనుబంధాన్ని పుస్తకం రూపంలో అందించే సంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టింది ఈనాడే. 1988 ఫిబ్రవరి 28నాడు ఇది మొదలైంది. సరదా పఠనం ఈ పుస్తకంలోని శీర్షికల ముఖ్య ఉద్దేశం సరదా సంగతులు, కార్టూనులు, వ్యక్తుల గురించి వ్యాసాలు, పర్యాటక క్షేత్రాల వివరాలు, చిన్న పిల్లలకు కావలసిన వినోదం మొదలగు సమాచారం.
తదుపరి ఇతర పత్రికలు కూడా ఈ బాటనే నడిచాయి.
ప్రతిదినం
స్త్రీలకు ప్రత్యేకించిన ఈ అనుబంధంలో బహుళ ప్రచారం పొందిన మహిళల గురించే కాక, రాష్ట్రంలోని, దేశ విదేశాలలోని వార్తలకెక్కని గొప్ప స్త్రీల గురించిన విజయాలు, విశేషాలు, స్త్రీ ఆరోగ్య, సౌందర్య చిట్కాలు, గృహాలంకరణ, ఉద్యోగ జీవితం మొదలగు సమాచారం ప్రచురిస్తారు.
ఇప్పుడు చాల తెలుగు దినపత్రికలు స్త్రీల కోసం ప్రత్యేక అనుబంధాలు ప్రచురించే సంప్రదాయానికి ఈ వసుందర శీర్షిక ప్రేరణ అని చెప్పవచ్చు.
ప్రతిదినం
పూర్తిగా రెండు పేజీలలో వ్యాపార సంబంధ సమాచారం, మార్కెట్ కబుర్లు, ప్రస్తుత విదేశీ మారకపు రేట్లు, బంగారం, వెండి ధరలు, షేర్ల ధరల సూచిక, మాట-మంతి మొదలగు వివరాలు.
ప్రతిదినం
ఈనాడు సినిమాలో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల విశేషాలు, కబుర్లు, ఇంటర్వ్యూలు, వ్యాసాలు, నటీ, నటుల, సాంకేతిక నిపుణుల ఫోటోలు ఉంటాయి.

పాత శీర్షికలు, విశిష్టతలు[మార్చు]

వారం శీర్షిక వివరాలు
ప్రతిదినం
మన బళ్లలో కూడా తెలుగు పెట్టాలి సార్‌ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మీద 3 జూలై 2008 నాటి వ్యంగ్య చిత్రం)
ఈ శీర్షిక క్రింద పత్రిక మొదటి పుటలో ఎడమవైపు క్రింద వ్యంగ్య చిత్రకారుడు శ్రీధర్ నిర్వహణలో చిన్న వ్యంగ్య చిత్రం(కార్టూన్) వర్తమాన సంఘటనల మీద (ఎక్కువగా రాజకీయాల మీద) ప్రచురించారు. శ్రీధర్ తొలి కార్టూన్ 22 ఆగస్టు 1981 నాడు ముద్రించగా, 30 ఆగస్టు 2021 న ఈనాడునుంచి వైదొలిగాడు.[12]చివరి కార్టూన్ 13 ఆగస్టు 2021 నాడు ముద్రితమైంది. [13]

పరిశోధనా విభాగం[మార్చు]

ఈనాడుకు ఒక స్వంత పరిశోధనా విభాగం (రీసెర్చి అండ్ రిఫరెన్స్ గ్రూప్) ఉంది. ఇది ఈనాడుకు సమాచార నిధి వంటిది. దేశ విదేశాలనుండి ఎన్నో పత్రికలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు, వార్తల విశ్లేషణకు, వివరణకు అవసరమైన సమాచారం ఇక్కడి నుండే వస్తుంది.

జర్నలిజం స్కూల్[మార్చు]

1991 లో జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఔత్సాహికులకు శిక్షణ నిచ్చి తమ సంస్థలో ఉపాధి కల్పిస్తున్నది.[6]

ఆన్ లైన్ వెర్షన్[మార్చు]

ఈనాడు ఆన్లైన్ వెబ్ పేజీ తెరపట్టు(Circa 2008)

తొలి కాలపు ఈనాడు వెబ్సైట్ లో యాజమాన్య హక్కలు గల ఈనాడు ఖతిని వాడారు. ఆ ఖతిని పొందటానికి వెబ్ పేజీలో లింకు వుండేది. ఈ ఖతికి తోడ్పాటు విండోస్ లో వుండేది. లినక్స్ వాడుకరులు పద్మ అనే ఎక్స్టెన్షన్ స్థాపించుకోవటం ద్వారా ఫైర్ఫాక్స్ విహరిణిలో ఈనాడు చదువుకోవటానికి వీలైంది. వెబ్సైటు 2015 డిసెంబర్ 14న యూనికోడ్ ఖతికి మార్చబడింది,[14] అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా పత్రికను పిడీయఫ్ ఫార్మాట్ (.pdf format)[15]
దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. 2008లో అంతర్జాతీయంగా విశ్వసనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్ ర్యాంకులు ప్రచురించే సంస్థ (ఆన్ లైన్ వెబ్ సైట్) ఎలేక్సా (Alexa) వారి ప్రకారం ఈనాడు ట్రాఫిక్ రాంకు 827 గా ఉంది.[16] 2010 లో ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు, 80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శనలు [17] కలిగివున్నది

ఈనాడు.నెట్ ఆన్ లైన్ వెబ్ సైట్‌ని దేశాల వారిగా వీక్షించేవారి శాతం ( గూగుల్ ఎనలిటిక్స్ జూలై 2010 ప్రకారం ఈ నాడు మార్కెటింగు సమాచార సైటు నుండి)

భూభాగం శాతం
ఇండియా 41.5%
అమెరికా 38.01%
ఆసియా (ఇండియా కాక) 10.29%
ఐరోపా 5.98%
ఒషేనియా 2.9%
ఆఫ్రికా 1.07%
ఇతరాలు 0.26%


(ట్రాఫిక్ రాంకు: అంటే ప్రతి రోజు సైట్ వీక్షకుల సంఖ్యని బట్టి వెబ్సైట్ స్థానాన్ని నిర్ణయించటం)
మొత్తం ఈనాడు ఆన్ లైన్ వెబ్ సైట్ వీక్షకుల శాతం:

ప్రముఖులు[మార్చు]

ఈనాడుకు ఎంతోమంది ఖ్యాతి తీసుకువచ్చారు. అలాగే ఎంతో మంది ఈనాడు ద్వారా ఖ్యాతి పొందారు. వారిలో కొందరు:

విమర్శలు[మార్చు]

1977లో ఈనాడు సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది. సుప్రీం కోర్టు - సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది.[18] తొలిదశలో పాత్రికేయులు సంపాదకవర్గంలో వుండేవారు. ఆ తరువాత వర్కింగ్ ఎడిటర్ లేకుండా ప్రధాన సంపాదకుడుగా అన్నీ తనే చూసుకోవటం ద్వారా రామోజీరావు వర్కింగ్ ఎడిటర్ పదవిని, ప్రాముఖ్యాన్ని తగ్గించిన అపఖ్యాతి పొందాడు. జర్నలిజంలో యజమానే ఎడిటర్ గా కొనసాగుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చడంతో ఉద్యోగులంతా తీవ్ర మనస్థాపనానికి గురై అసంతృప్తితో బతుకుతున్నా పట్టించుకోవటట్లేదన్న అపవాదు ఉంది.[19] 2019 డిసెంబర్ 14 నుండి రామోజీరావు ప్రధాన ఎడిటర్ గా తప్పుకొనగా, తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ గా డి.ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్ గా ఎం. నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. [1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "'ఈనాడు' నుంచి తప్పుకున్న రామోజీరావు". సమయం. 2019-12-14.
  2. 2.0 2.1 "Details of most circulated publications for the audit period Jan – Jun 2019" (PDF). Audit Bureau of Circulations. Retrieved 22 September 2021.
  3. Registrar of Newspapers for Indiaలో వివరాలు వెతుకుపేజీ.
  4. నామాల విశ్వేశ్వరరావు. తెలుగు జర్నలిజం చరిత్ర.
  5. "A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983". Archived from the original on 2010-09-01. Retrieved 2008-04-25.
  6. 6.0 6.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 410–411.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  7. "Details of most circulated publications for the audit period Jan – Jun 2018" (PDF). Audit Bureau of Circulations. Retrieved 27 December 2018.
  8. 8.0 8.1 Eenadu History నుండి జులై 05 2008న సేకరించబడినది.
  9. "Indian Readership Survey Q2,2019" (PDF). 2019-08-14. Archived from the original (PDF) on 2019-08-17.
  10. "NRS 2006 – Key Findings" (PDF). 2006-08-29. Archived from the original (PDF) on 2007-02-02. Retrieved 2006-12-09.
  11. కాసుల, ప్రతాపరెడ్డి. "తెలుగు దినపత్రికల్లో భాష". Telugu OneIndia. Retrieved 6 June 2018.
  12. "'ఈనాడు'కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా". ఆంధ్రప్రభ. 2021-08-31.
  13. "ఇదీసంగతి". ఈనాడు. 2021-08-13. Archived from the original on 2021-09-06.
  14. "ఈనాడు (పాఠ్యరూపం)". Archived from the original on 2019-08-16. Retrieved 2019-08-17.
  15. "ఈనాడు ఈపేపర్". Retrieved 2019-08-17.
  16. "eenadu.net Competitive Analysis, Marketing Mix and Traffic". Archived from the original on 2008-04-03. Retrieved 2008-04-17.
  17. "ఈనాడు మార్కెటింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో". Retrieved 2010-10-11.
  18. వి., హనమంతరావు (2012). ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం – పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు – అనుభూతుల’. డేటా న్యూస్ ఫీచర్స్.
  19. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 78.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఈనాడు&oldid=3893989" నుండి వెలికితీశారు