ఈనాడు
ఈనాడు | |
---|---|
![]() | |
రకము | దిన పత్రిక |
ఫార్మాటు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం: | ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ |
ప్రచురణకర్త: | రామోజీరావు |
సంపాదకులు: | రామోజీరావు |
స్థాపన | ఆగష్టు 10,1974 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
వెల | భారతదేశం రూపాయలు:5.00 సోమ వారం-శని వారం రూ.6.00 ఆది వారం |
ప్రధాన కేంద్రము | హైదరాబాద్,[telangana]],ఇండియా |
సర్క్యులేషన్ | 11,76,028 ప్రతిదినం[1]. |
| |
వెబ్సైటు: [1] |
ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచింది.[2].
విషయ సూచిక
ప్రారంభం[మార్చు]

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది.[3] చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి.
అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.
ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.
అలాగే తెలుగు పత్రికల పేర్లు - ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.
విశాఖపట్నంలో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం.
ఎడిషన్[మార్చు]
చెన్నై, విశాఖపట్నం, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, అనంతపురము, కరీంనగర్, రాజమండ్రి, సూర్యాపేట, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, తాడేపల్లిగూడెం, వరంగల్, కడప, నిజామాబాదు, ఖమ్మం, ఒంగోలు, మహబూబ్ నగర్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కేంద్రాల నుండి ప్రచురితము.
ప్రస్థానం[మార్చు]
ప్రముఖ పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వహణలోను, ఆ తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.
సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్ఠమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.
పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో తెలుగు దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.[4] 1993, 1994లలో జరిగిన మధ్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్ర సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.
1989 జనవరి 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. ఆదివారం అనుబంధాన్ని 28 పిభ్రవరి 1988 నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్య పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 1992 సెప్టెంబరు 24న మహిళల కోసం ప్రత్యేకంగా వసుంధర పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యోగవకాశాల కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించింది. 1985 ఆగష్టు నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది.[5] ఈనాడులో 2010 తరువాత ఆదివారము అనుబంధంలో రాశి ఫలాలు చేర్చారు
భాష[మార్చు]
ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శైలి ఉండే మాట నిజం. అయితే పత్రికా ప్రచురణ ఎవరో ఒక వ్యక్తి చేయగలిగింది కాదు. అందులోనూ దినపత్రికల విషయంలో అసలు సాధ్యం కాదు. రకరకాల అనుభవాలూ, విద్యాసంస్కారాలు ఉన్న వ్యక్తులు పత్రికల్లో పనిచేస్తుంటారు. వారంతా ఒక ప్రాంతంవారు గాని, ఒక మతం వారు గాని కారు. విద్య, కులం, మతం, వృత్తి, ప్రాంతం వంటివన్నీ భాషలో బేధాలు తెచ్చిపెట్టేవే. భాషలో ఉన్న ప్రత్యేకత వైవిధ్యంలో ఏకత్వం, భిన్నవ్యక్తులు రాసే భాషలో ఏకత్వం సాధించటం అంటే భిన్న మాండలికాల నుంచి ఒక సాధారణ భాషా లక్షణాన్ని ఏర్పరుచుకోవటమే. ఒకే పత్రిక భిన్న ప్రాంతాల నుంచి ఏక కాలంలో వెలువడేటప్పుడు ఆ పత్రికా భాషలో సాధ్యమైనంత ఏకరూపత లేకపోతే అది ఒకే పత్రిక అనిపించదు. అందువల్ల అందరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. ప్రపంచ భాషా పత్రికలన్నింటికీ భాషా విషయకంగా కూడా కొన్ని నియమనిబంధనలున్నాయి. అలాగే ఈనాడుకూ కావాలి
—బూదరాజు రాధాకృష్ణ
ఈనాడులో ఉపయోగించే భాష విషయంలో నియమాలు రూపొందించుకుని, పూర్తిస్థాయి భాషా శైలిని రూపొందించుకున్నారు. ఈ భాషా శైలిని రూపొందించడంలో ప్రముఖ భాషాశాస్త్రజ్ఞుడు, పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ కృషి ఉంది. అతను ఈనాడు భాషా స్వరూపం అన్న పుస్తకాన్ని కూడా ఈ విషయంపై రాశాడు. ఈ నిబంధనలు రూపొందించుకోవడంతో పాటుగా, అమలుచేయడంలో కూడా ఈనాడు సంస్థ పలు విధానాల్లో కృషిచేసింది. పత్రికల్లో పలు ప్రాంత, మత, కుల, విద్య నేపథ్యాలకు చెందినవారు పనిచేసినా ఇదంతా ఒకటే పత్రిక అన్న భావన పాఠకుడికి రావడానికి ఈ భాషా శైలి, ఆ భాషా శైలిని అమలుచేసి పత్రికా భాషలో ఏకరూపత తీసుకురావడం ఉపయోగపడతాయి. అత్యంత సంక్లిష్టమైన ఏకరూపతను ఈనాడు పత్రిక సాధించి, నిలబెట్టుకుంది. "భాషా ప్రయోగం విషయంలో ఈనాడు సాధించిన ఏకరూపత లేదా తనదైన ప్రత్యేక శైలిని మరో పత్రిక సాధించినట్లు కనిపించదు." అని కాసుల ప్రతాపరెడ్డి పేర్కొన్నాడు.[6]
భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. సాధారణంగా ఇంగ్లీషులో అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తారు. అయితే సమయం తక్కువగా ఉండటం చేతగాని, ఒక పద్ధతికి అలవాటు పడటం వలనగానీ మిగిలిన పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో కూడి, సరళంగా ఉండేది కాదు. ఈనాడు, అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది.
తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి.
శీర్షికలు, విశిష్టతలు[మార్చు]
వారం | శీర్షిక | వివరాలు |
---|---|---|
సోమవారం | విద్యకు సంబంధించి, నూతన కోర్సుల గురించి సమాచారం[1] | |
మంగళ వారం | ఆరోగ్యంనకు, జబ్బులు సంబంధించి ప్రముఖ వైద్యులతో నివారణ చర్యలు, చర్చ, సూచనలు ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం | |
బుధ వారం | ప్రపంచ ఆటలు, క్రీడల గురించి సమగ్ర సమాచారం, విశ్లేషణ ఆటలలో గత రికార్డులు, జరగబోవు క్రీడల సమాచారం. | |
గురు వారం | కంప్యూటర్, సమాచార సాంకేతికాంశాలు గురించి సమాచారం, ప్రశ్నలు-జవాబులు, ఉపయోగకరమైన వెబ్సైట్ల వివరాలు | |
శుక్ర వారం | ఆర్ధిక అంశాలు పన్నులు, వడ్డీలు, మ్యూచువల్ ఫండులు, ఆర్థిక నేరాలు-మోసాలు తీసికోవలసిన జాగ్రత్తలతో నిపుణులతో సూచనలు, మెలకువలు | |
శని వారం |
| |
ఆది వారం | ||
ఆది వారం | ఆదివారం ప్రత్యేక అనుబంధాన్ని పుస్తకం రూపంలో అందించే సంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టింది ఈనాడే. 1988 ఫిబ్రవరి 28నాడు ఇది మొదలైంది. సరదా పఠనం ఈ పుస్తకంలోని శీర్షికల ముఖ్య ఉద్దేశం. చిన్న పిల్లలకు కావలసిన వినోదం, సరదా సంగతులు, కార్టూనులు, ప్రముఖుల గురించి వ్యాసాలు, పర్యాటక క్షేత్రాల వివరాలు మొదలగు సమాచారం. ఈ ప్రత్యేక అనుబంధం పుస్తకరూపంలో ఇప్పుడు ప్రతి తెలుగు దిన పత్రిక ఇస్తుందంటే ఈనాడు సాధించిన విజయం అర్ధం చేసికోవచ్చు. | |
ప్రతిదినం | స్త్రీలకు ప్రత్యేకించిన ఈ అనుబంధంలో బహుళ ప్రచారం పొందిన ప్రముఖ మహిళల గురించే కాక, రాష్ట్రంలోని, దేశ విదేశాలలోని వార్తలకెక్కని గొప్ప స్త్రీల గురించిన విజయాలు, విశేషాలు, స్త్రీ ఆరోగ్య, సౌందర్య చిట్కాలు, గృహాలంకరణ, ఉద్యోగ జీవితం మొదలగు సమాచారం ప్రచురిస్తారు. ఇప్పుడు చాల తెలుగు దినపత్రికలు స్త్రీల కోసం ప్రత్యేక అనుబంధాలు ప్రచురించే సంప్రదాయానికి ఈ వసుందర శీర్షిక ప్రేరణ అని చెప్పవచ్చు. | |
ప్రతిదినం | పూర్తిగా రెండు పేజీలలో వ్యాపార సంభంద సమాచారం, మార్కెట్ కబుర్లు, ప్రస్తుత విదేశీ మారకపు రేట్లు, బంగారం, వెండి ధరలు, షేర్ల ధరల సూచిక, ప్రముఖులతో మాట-మంతి మొదలగు వివరాలు. | |
ప్రతిదినం | ఈ శీర్షిక క్రింద పత్రిక మొదటి పుటలో ఎడమవైపు క్రింద చిన్న వ్యంగ్య చిత్రం (కార్టూన్) వర్తమాన సంఘటనల మీద (ఎక్కువగా రాజకీయాల మీద) ప్రచురిస్తారు. ఈనాడు వ్యంగ్య చిత్రకారుడు శ్రీధర్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మీద వ్యంగ్య చిత్రం. | |
ప్రతిదినం | ఈనాడు సినిమాలో కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల విశేషాలు, కబుర్లు, ఇంటర్వ్యూలు, వ్యాసాలు, నటీ, నటుల, సాంకేతిక నిపుణుల ఫోటోలు ఉంటాయి. | |
ప్రతిదినం | జిల్లా ఎడిషన్లు (మినీ ఎడిషన్లు) |
ఫ్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధాన్ని ప్రారంభించి, తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది ఈనాడు. 1989 జనవరి 26న ప్రారంభమైన ఈ జిల్లా అనుబంధాలతో వార్తల సమర్పణలో ఒక కొత్త శకం మొదలైంది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టారు. ఈ సంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి. |
పరిశోధనా విభాగం[మార్చు]
ఈనాడుకు ఒక స్వంత పరిశోధనా విభాగం (రీసెర్చి అండ్ రిఫరెన్స్ గ్రూప్) ఉంది. ఇది ఈనాడుకు సమాచార నిధి వంటిది. దేశ విదేశాలనుండి ఎన్నో పత్రికలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు, వార్తల విశ్లేషణకు, వివరణకు అవసరమైన సమాచారం ఇక్కడి నుండే వస్తుంది.
జర్నలిజం స్కూల్[మార్చు]
1991 లో జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఔత్సాహికలకు శిక్షణ నిచ్చి తమ సంస్థలో ఉపాధి కల్పిస్తున్నది.[5]
ఆన్ లైన్ వెర్షన్[మార్చు]
ప్రస్తుతం ఈనాడు పేపర్ సంప్రదాయ ప్రచురణ కాకుండా, అంతర్జాలంలో ఆన్ లైన్ వెర్షన్ రెండు విధాలుగా ప్రచురిస్తుంది.
- ఈనాడు ఖతితో వెలువడే వెబ్సైటు 2015 డిసెంబర్ 14న యూనికోడ్ ఖతికి మార్చబడింది.[7],
- పిడీయఫ్ ఫార్మాట్ (.pdf format)[8]
ఈ పిడీయఫ్ ఆన్ లైన్ వేర్శన్లో ఈనాడు పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. పిడీయఫ్ ఫోర్మాట్ పనిచేయకపోతే జేపియిజి (.jpeg) ఫోటో ఫోర్మాట్లో కాని అక్షరాలలో (text) కాని కనిపించటం ఈనాడు యి.పేపర్ విశిష్టత.[9]
అంతర్జాతీయంగా విశ్వసనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్ ర్యాంకులు ప్రచురించే సంస్థ (ఆన్ లైన్ వెబ్ సైట్) ఎలేక్సా (Alexa) వారి ఈనాడు ట్రాఫిక్ రాంకు: 827 గా ఉంది.[10] ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు, 80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శనలు [11] కలిగివున్నది
ఈనాడు.నెట్ ఆన్ లైన్ వెబ్ సైట్ని దేశాల వారిగా వీక్షించేవారి శాతం ( గూగుల్ ఎనలిటిక్స్ జూలై 2010 ప్రకారం ఈ నాడు మార్కెటింగు సమాచార సైటు నుండి)
భూభాగం | శాతం |
---|---|
ఇండియా | 41.5% |
అమెరికా | 38.01% |
ఆసియా (ఇండియా కాక) | 10.29% |
ఐరోపా | 5.98% |
ఒషేనియా | 2.9% |
ఆఫ్రికా | 1.07% |
ఇతరాలు | 0.26% |
(ట్రాఫిక్ రాంకు: అంటే ప్రతి రోజు సైట్ వీక్షకుల సంఖ్యని బట్టి వెబ్సైట్ స్థానాన్ని నిర్ణయించటం)
మొత్తం ఈనాడు ఆన్ లైన్ వెబ్ సైట్ వీక్షకుల శాతం:
ప్రముఖులు[మార్చు]
ఈనాడుకు ఎంతోమంది ప్రముఖులు ఖ్యాతి తీసుకువచ్చారు. అలాగే ఎంతో మంది ఈనాడు ద్వారా ఖ్యాతి పొందారు. వారిలో కొందరు:
- ఎ.బి.కె.ప్రసాద్: ఈనాడుకు ప్రథమ సంపాదకుడు. తొలినాళ్ళలో పత్రిక అభివృద్ధికి దోహదపడ్డాడు.
- శ్రీధర్: ప్రముఖ కార్టూనిస్టు. ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి.
- గజ్జెల మల్లారెడ్డి: "పుణ్యభూమి" శీర్షిక
- బూదరాజు రాధాకృష్ణ: "పుణ్యభూమి" శీర్షికను "సి.ధర్మారావు" అనే కలం పేరుతో కొనసాగించాడు. ప్రతి ఆదివారం "మాటలూ మార్పులూ" అనే పేరుతో తెలుగు మాటల తప్పొప్పుల గురించిన శీర్షిక.
- చలసాని ప్రసాదరావు: "కబుర్లు"
- డి.వి.నరసరాజు: "అక్షింతలు"
- కొమ్మినేని శ్రీనివాసరావు: "రాష్ట్రంలో రాజకీయమ్"
- కులదీప్ నయ్యర్: "లోగుట్టు"
విమర్శలు[మార్చు]
1977లో ఈనాడు సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది. సుప్రీం కోర్టు - సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది.[12] తొలిదశలో ప్రముఖ పాత్రికేయులు సంపాదకవర్గంలో వుండేవారు. ఆ తరువాత వర్కింగ్ ఎడిటర్ లేకుండా ప్రధాన సంపాదకుడుగా అన్నీ తనే చూసుకోవటం ద్వారా రామోజీరావు వర్కింగ్ ఎడిటర్ పదవిని, ప్రాముఖ్యాన్ని తగ్గించిన అపఖ్యాతి పొందాడు. జర్నలిజంలో యజమానే ఎడిటర్ గా కొనసాగుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చడంతో ఉద్యోగులంతా తీవ్ర మనస్థాపనానికి గురై అసంతృప్తితో బతుకుతున్నా పట్టించుకోవటట్లేదన్న అపవాదు ఉంది.[13].
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Eenadu History నుండి జులై 05 2008న సేకరించబడినది.
- ↑ జాతీయ చదువరుల సర్వే 2006 నుండి డిసెంబర్ 9 2006న సేకరించబడినది.
- ↑ Registrar of Newspapers for Indiaలో వివరాలు.
- ↑ A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983
- ↑ 5.0 5.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 410–411.
- ↑ కాసుల, ప్రతాపరెడ్డి. "తెలుగు దినపత్రికల్లో భాష". Telugu OneIndia. Retrieved 6 June 2018.
- ↑ http://eenadu.net పాఠ్య రూపం ఈనాడులింకు
- ↑ http://epaper.eenadu.net పిడీయఫ్ ఫార్మాట్ ఈనాడు లింకు
- ↑ [http://www.eenadu.net ఈనాడు జాలస్థలి నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.
- ↑ http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.
- ↑ 11 అక్టోబరు 2010 నాటి ఈనాడు మార్కెటింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో
- ↑ వి., హనమంతరావు. ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’. Retrieved 2014-03-18.
- ↑ గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 78.
- నామాల విశ్వేశ్వరరావు రాసిన తెలుగు జర్నలిజం చరిత్ర పుస్తకం.
బయటి లింకులు[మార్చు]