తెలుగు పత్రికల ప్రచురణ 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. మద్రాసు నుండి కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక. ఆ తరువాత 1835 ప్రాంతంలో బళ్ళారి లేదా మద్రాసు నుండి సత్యదూత అనే పత్రిక వచ్చినట్లుగా కొన్ని మూలాల్లో ఉంది గానీ దానికి ఖచ్చితమైన ఆధారం లభించలేదు. 1837 లో వృత్తాంతి అనే పత్రిక మొదలైంది. ఆ తరువాత వర్తమాన తరంగిణి వెలువడింది. 1862 లో మచిలీపట్నం నుండి హితవాది అనే క్రైస్తవ మత పత్రిక వెలువడింది.
తెలుగు పత్రికలు
1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. రాజమహేంద్రవరం, మచిలీపట్నం కేంద్రాలుగా పలు పత్రికలు వచ్చాయి. పట్టణాల నుండే కాక, చిన్న చిన్న గ్రామాల నుండి కూడా పత్రికలు వెలువడ్డాయి. రావటానికి ఎన్నో వచ్చినప్పటికీ, వాటిలో దీర్ఘకాలం మనగలిగిన పత్రికలు చాలా తక్కువ. 1875-1926 మధ్య కాలంలో 516 పత్రికలు వెలువడగా, వీటిలో చాలా పత్రికలు స్వల్ప కాలంలోనే ఆగిపోయాయి. 1940 నాటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి. 19 వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో పత్రికల సర్క్యులేషను సాధారణంగా 100 నుండి 500 వరకు ఉండేది. వెయ్యికి పైన ప్రతులు ముద్రించిన తొలి రాజకీయ పత్రిక, కృష్ణాపత్రిక. 1930 ల నాటికి పత్రికల సర్క్యులేషను 3 వేల వరకు చేరింది.
తొలినాళ్ళలో తెలుగు పత్రికలను స్థాపించిన ప్రముఖులలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, ఎ.సి.పార్థసారథి నాయుడు, సత్తిరాజు సీతారామయ్య, దేవగుప్తం శేషాచలపతిరావు మొదలైనవారు ఉన్నారు. అనంతర కాలంలో వచ్చిన పత్రికా ప్రముఖుల్లో కొందరు ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఏ.బి.కె. ప్రసాద్, రామోజీరావు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించడం ఉండేది. చాలా పత్రికలకు స్వంత ముద్రణాలయాలుండేవి.
బ్రిటిషు పాలనలో, రాజకీయ వార్తలు ప్రచురించే పత్రికలపై ప్రభుత్వ నిఘా ఉండేది. ఆయా పత్రికలలో వచ్చిన వార్తలపై, వాటి సర్క్యులేషనుపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపేవారు. బ్రిటిషు ప్రభుత్వ దమననీతిని స్వరాజ్య పత్రికలో విమర్శించినందుకు గాను 1908 లో సంపాదకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకూ జైలు శిక్షలు పడ్డాయి, స్వరాజ్య పత్రిక మూతబడింది. సరిగ్గా ఇదే కారణంపై, కృష్ణాపత్రిక మూతబడకుండా కాపాడేందుకు గాను ముట్నూరి కృష్ణారావు పత్రిక సంపాదకత్వానికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.
తొలినాళ్ళలో పత్రికల మధ్య సత్సంబంధాలుండేవి, వివాదాలూ ఉండేవి. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో పరిచయ వ్యాసాలు, సమీక్షలూ ఉండేవి. ఇలాంటి సమీక్షలు, పరిచయాల ద్వారానే గతంలో ఆ పత్రికంటూ ఒకటి ఉండేదని వెలుగు లోకి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన గ్రంథాలనూ, పత్రికలనూ పరిచయం చేసేందుకు వివిధ పత్రికల్లో ప్రత్యేకంగా శీర్షికలుండేవి. కొన్ని పత్రికల మధ్య సైద్ధాంతికమైన, వ్యక్తిగతమైన విమర్శలూ ఉండేవి. 1930 లో మొదలై, 95 ఏళ్ళుగా దాదాపు నిరంతరాయంగా ప్రచురణలో ఉన్న పత్రిక, జమీన్రైతు.
తెలుగు పత్రికల చరిత్ర 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో మొదలైంది. తొలి తెలుగు పత్రిక 1832 ప్రాంతంలో వెలువడింది. కర్నాటిక్ గెజెట్ అనే ప్రచురణ తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. ఇదే తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక.[1] 1835 లో సత్యదూత అనే పత్రిక బళ్ళారి నుండి గానీ లేదా మద్రాసు నుండి గానీ మొదలైందని కొన్ని మూలాల్లో ఉంది. కానీ దానికి ఆధారాలేమీ లభించలేదు. బండి గోపాలరెడ్డి, "సిలోన్ మిషనరీ కాన్ఫరెన్స్ ప్రచురణలో గాని, బళ్ళారి మాన్యువల్లో గాని, మద్రాసు ఆర్మేవ్స్లో గాని ఎక్కడా సత్యదూత గురించి ఎటువంటి దాఖలాలు కనిపించలేదు." అన్నాడు. అయితే, 1832 లోనే కర్నాటిక్ గెజెట్ పత్రిక వున్నట్లు డాక్టర్ జి.ఎన్.రెడ్డి తిరుగులేని ఆధారాలతో నిరూపించాడు. కాబట్టి అదే తొలి తెలుగు పత్రిక.[2] 1837 లో వృత్తాంతి అనే తెలుగు పత్రిక మొదలైంది. ఆ తరువాత, 1842 లో వర్తమాన తరంగిణి వెలువడింది.
19 శతాబ్దిలో మరిన్ని పత్రికలు మొదలయ్యాయి. పత్రికల ప్రచురణ గురించి తిరుమల రామచంద్ర, "19 వ శతాబ్ది ఉత్తరార్థంలో కవులు పండితులు పలువురు వుండేవారు. అందరి వద్ద తాటాకు పుస్తకాలుండేవి. అప్పట్లో ప్రతి పండితుడు ఏదో ఒక పత్రిక నడపడం, దానిలో ఒక ప్రాచీన కావ్యం నాలుగు పుటలో ఎనిమిది పుటలో ప్రచురించడం పరిపాటైంది. వీటిలో కొన్నిటిలో వార్తలూ వుండేవి" అని రాసాడు.[3]
తొలిపత్రికల్లో క్రైస్తవ మత పత్రికలు ఎక్కువగా ఉండేవి. దినవర్తమాని అనే వారపత్రిక అటువంటిదే. 1862 లో వచ్చిన హితవాది కూడా క్రైస్తవ మత ప్రచార పత్రికయే. కానీ అందులో ఇతర విషయాలూ ఉండేవి. ఆ తరువాత హిందూ మత పత్రికలు, సాహిత్య పత్రికలు వచ్చాయి. 1885 లో ఆంధ్ర ప్రకాశిక రాకతో సామాజిక విషయాలను, పరిపాలన సంబంధ విషయాలనూ రాసే రాజకీయ వార్తా పత్రికల శకం మొదలైంది. స్వాతంత్ర్య పోరాట విశేషాలను రాస్తూ ప్రజలకు స్ఫూర్తినిస్తూ రాజకీయ పత్రికలు పనిచేసాయి. ఈ కోవలో దేశాభిమాని, దేశోపకారి, శశిలేఖ వంటి పత్రికలు వచ్చాయి. 1887 లో మొదలైన కృష్ణా వృత్తాంతిని, కృష్ణాన్యూస్ గా మారి చివరికి దేశాభిమానిగా పేరు మార్చుకుని 1901 లో దినపత్రికగా మారింది. ఇదే తెలుగులో మొట్టమొదటి దినపత్రిక.[4] 1901 లోనే వెలువడిన గౌతమి, దినపత్రికల్లో రెండవది.
కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికల ఆవిర్భావంతో 20 వ శతాబ్ది తెలుగు పత్రికల చరిత్ర మొదలైంది. 1902 లో కృష్ణాపత్రిక, 1908 లో ఆంధ్రపత్రికలు వెలువడ్డాయి. ఈ రెండూ రాజకీయ పత్రికలే. 1907 లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావులు కలిసి బెజవాడ నుండి స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో రాసిన ఒక వ్యాసానికి గాను వారికి బ్రిటిషు ప్రభుత్వం జైలుశిక్ష విధించింది. ఆ అరెస్టులతోటే స్వరాజ్య పత్రిక మూతబడింది. వందేమాతరం ఉద్యమంలో ఆంధ్రదేశంలో జైలుశిక్షలు పొందిన తొలి రాజకీయ ఖెదీలు వాళ్ళిద్దరు.[5] ఆ తరువాత 1921 లో టంగుటూరి ప్రకాశం పంతులు ఇదే పేరుతో మద్రాసు నుండి మరొక పత్రికను వెలువరించాడు. అది తెలుగు ఇంగ్లీషు తమిళం - మూడు భాషల్లోనూ వెలువడేది. సరిగ్గా ఇదే పేరుతో 1923 ప్రాంతంలో, విజయవాడ నుండి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి సంపాదకత్వంలో మరొక పత్రిక వచ్చేది.[6]
ఆంధ్రపత్రిక 1908 లో బొంబాయిలో వారపత్రికగా మొదలై, 1914 లో మద్రాసుకు చేరి దినపత్రికగా మారింది. అయితే వారపత్రిక కూడా కొనసాగింది. 1958 లో వారపత్రిక పేరును ఆంధ్ర సచిత్ర వారపత్రికగా మార్చారు. ఈ శతాబ్దిలో సాహిత్య పత్రికలు ఎక్కువగా వెలుగుచూసాయి. 1910 లో ఆంధ్రభారతి, 1912 లో ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, 1914 లో త్రిలింగ పత్రికలు వచ్చాయి. ఆంధ్రభారతిలో తొలి తెలుగు కథ దిద్దుబాటు ప్రచురితమైంది.[7]ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక గ్రాంథిక భాషలో వెలువడేది. గ్రాంథికభాషా వాది అయిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వందేమాతరం, వజ్రాయుధం పత్రికలను కూడా ప్రచురించాడు. 1913 లో మహబూబ్ నగర్ నుండి హితబోధిని అనే మాసపత్రిక మొదలైంది. తెలంగాణలో ఇది తొలి తెలుగు పత్రిక.[8] దీనికంటే ముందే, 1883 - 1887 మధ్య, శేద్యచంద్రిక వచ్చినప్పటికీ, అది అనువాద పత్రిక కావడంతో, హితబోధినికే తొలి తెలంగాణ పత్రిక గౌరవం దక్కింది. 1920 లో దాదాపు ఒకే సమయంలో నీలగిరి, తెనుగు పత్రికలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాదుకు బయట వెలువడ్డ తొలి పత్రికల్లో ఈ రెండూ ఉన్నాయి. 1921 లో ప్రబుద్ధాంధ్ర, 1923 లో మచిలీపట్నం నుండి శారద, 1924 లో ఆంధ్రపత్రిక వారి భారతి, ఆంధ్రసర్వస్వము, 1926 లో హైదరాబాదు నుండి గోలకొండ పత్రిక వెలువడ్డాయి. అభినవ సరస్వతి, గ్రంథాలయ సర్వస్వము, ముక్త్యాల సరస్వతి వంటి సాహిత్య పత్రికలు ఉద్భవించాయి. 1930 లో జమీన్రైతు పత్రిక జమీందారీ రైతు పేరుతో మొదలైంది. ఈ పత్రిక 2025 నాటికీ ప్రచురితమౌతూనే ఉంది.[9] 1933 లో గూడవల్లి రామబ్రహ్మం స్థాపించిన ప్రజామిత్ర వారపత్రిక వచ్చింది. 1927 లో జస్టిస్ పార్టీ తమ పార్టీ ప్రచారం కోసం సమదర్శిని ద్వైవార పత్రికను ప్రారంభించింది. 1936 లో పిఠాపురం రాజా తన పీపుల్స్ పార్టీ ప్రచారం కోసం, తాపీ ధర్మారావు సంపాదకత్వంలో జనవాణి దినపత్రికను ప్రారంభించాడు. పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక అది.[10][11] అప్పటికే ఉన్న ఆంధ్రపత్రిక వంటి పత్రికలు సరళ గ్రాంథికం లోనే ఉండేవి.[12]
1929 లో బుక్కపట్టణం రామానుజాచార్యులు హైదరాబాద్ నగరంలో “హైదరాబాద్ బులెటిన్” అనే ఇంగ్లీషు పత్రికను ప్రారంభించాడు. 1942 లో “తెలంగాణా” దినపత్రికను ఆయన నంపాదకత్వంలో వెలువరించాడు. తన మిత్రుడితో కలిసి 1937 లో దక్కన్క్రానికల్ వారపత్రికను ప్రారంభించాడు. దానికి ఆయనే సంపాదకుడు. 1939 లో దక్కన్ క్రానికల్ దినపత్రికగా మారింది.[13]
1920, 1930, 1940 సంవత్సరాల్లో మద్రాసు ప్రభుత్వం వద్ద నమోదైన పత్రికల సంఖ్య కింది విధంగా ఉంది.[14]
తెలుగు
ఇంగ్లీషు
తమిళం
1920
1930
1940
1920
1930
1940
1920
1930
1940
దినపత్రికలు
1
2
2
7
5
5
3
3
3
వారపత్రికలు
11
20
35
22
19
24
19
35
46
మాసపత్రికలు
20
18
88
29
21
92
30
52
74
ఇతరత్రా
6
7
59
17
13
132
4
11
87
మొత్తం
38
47
184
75
58
253
56
101
210
1934 లో తెనాలిలో చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావుల సారథ్యంలో యువ మాసపత్రిక మొదలైంది. తరువాత ఇది హైదరాబాదుకు మారింది. 1962 లో విజయవాడలో జ్యోతి మాసపత్రిక మొదలైంది. ఇది 1970 లో మద్రాసుకు, మళ్ళీ 1980 లో హైదరాబాదుకూ మారింది.
1942 లో కమ్యూనిస్టు పత్రిక ప్రజాశక్తి మొదలైంది. దీనికి ఆద్యురాలు అనదగ్గ నవశక్తి అనే పత్రిక 1937 డిసెంబరు 15 న రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మూతపడింది. ఆ తరువాత దీన్ని ‘స్వతంత్ర భారత్’ పేరుతో రహస్యంగా ముద్రించారు. అదే 1942 లో ప్రజాశక్తిగా మారింది. 1945 లో ఇది దినపత్రికగా మారింది. 1948 లో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. తిరిగి 1969 లో వారపత్రికగా మొదలై, 1981 లో దినపత్రికగా మారింది. కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత ఇది మార్క్సిస్టు పార్టీ పత్రికగా మారింది. 1962 లో విశాలాంధ్ర పత్రిక మొదలైంది.
1938 లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపులో భాగంగా ఆంధ్రప్రభ దినపత్రిక మద్రాసులో ప్రారంభమైంది. 1959 లో తాత్కాలికంగా మూతబడి మళ్ళీ 1960 లో విజయవాడలో మొదలైంది. 1960 లోనే విజయవాడలో కె.ఎల్.ఎన్.ప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను ప్రారంభించాడు. అది 2000 లో మూతబడి మళ్ళీ 2002 లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొదలైంది. 1960 లోనే మొదలైన మరొక పత్రిక ఆంధ్రభూమి. సికిందరాబాదు నుండి వెలువడే ఈ పత్రికకు కొన్నాళ్ళు గోరాశాస్త్రి సంపాదకీయం వహించాడు.
హైదరాబాదు సంస్థానంలో నిజాము దుష్పరిపాలనను ఎదిరిస్తూ కొన్ని పత్రికలు వచ్చాయి. నిజాము అణచివేత నుండి తప్పించుకునేందుకు, వీటిలో కొన్ని పత్రికలను బ్రిటిషు పాలనలో ఉన్న సర్కారు ప్రాంతం నుండి ప్రచురించేవారు. అలాంటి పత్రికలలో మర్రి చెన్నారెడ్డి నడిపిన హైదరాబాద్, తాళ్ళూరి రామానుజరావు సంపాదకత్వంలో వచ్చిన సారథి పత్రికలను విజయవాడలో ముద్రించేవారు. వీటిని నైజాము ప్రాంతంలో రహస్యంగా పంపిణీ చేసేవారు.[15] హైదరాబాదు లోని కొన్ని పత్రికలు నిజాముకు అనుకూలంగా రాసేవి. వాటిలో మూడు భాషల్లో వెలువడిన మీజాన్ ఒకటి. అయితే తెలుగు మీజాన్ మాత్రం నిజాముకు వ్యతిరేక వార్తలను కూడా ప్రచురించేది.
ప్రముఖ దినపత్రికలకు తోడుగా అదేపేరుతో వారపత్రికలు కూడా ఉండేవి. అవి - ఆంధ్రసచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి. వారపత్రిక ప్రారంభమైంది. ఆంధ్రప్రభ 1952 లో, ఆంధ్రజ్యోతి 1967 లో, ఆంధ్రభూమి 1977 లో మొదలయ్యాయి. దినపత్రికలతో సంబంధం లేని స్వాతి సపరివార పత్రికను 1984 లో వేమూరి బలరాం విజయవాడలో ప్రారంభించాడు. సర్క్యులేషనులో ఇది చరిత్ర సృష్టించింది.
1974 లో రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించాడు. భాష, సర్క్యులేషను, అనేక చోట్ల నుండి ప్రచురణలు, జిల్లా ఎడిషన్లు, ఆదివారం పుస్తకం వంటి కొత్త విశేషాలతో ఈ పత్రిక పలు విశేషాలకు నాంది పలికింది. సర్క్యులేషను పరంగా దేశంలో హిందీ, ఇంగ్లీషు పత్రికలతో పోటీ పడి నిలిచింది. ఈనాడు గ్రూపు కిందనే విపుల, చతుర, అన్నదాత, మార్గదర్శి 1984 లో ఉదయం, 1996 లో వార్త, 2008 లో సాక్షి దినపత్రికలు మొదలయ్యాయి.
తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. 1893 లో జనానా పత్రిక వచ్చింది. 1902 లో స్త్రీల కోసం, స్త్రీలే నిర్వహించిన హిందూసుందరి పత్రిక వచ్చింది. 1904 లో కాకినాడ నుండి సావిత్రి పత్రిక వెలువడింది. తొలినాళ్ళలో వచ్చిన స్త్రీల పత్రికలన్నీ బాల్యవివాహాల నిషేధం, వితంతు పునర్వివాహం వంటి అంశాలపై సస్కరణలను సమర్థించేవి. కానీ సావిత్రి పత్రిక మాత్రం మరీ చిన్నపిల్లల వివాహాలనూ, స్త్రీ విద్యనూ తప్ప మిగతా అన్ని సంస్కరణలనూ వ్యతిరేకించేది. స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక అనసూయ. ఇది 1917 లో వచ్చింది. 1921 లో బరంపురం నుండి ఆంధ్రలక్ష్మి పత్రిక వచ్చింది. ఈ పత్రికలన్నిటినీ స్త్రీలే నిర్వహించేవారు. 1928 లో కె.ఎన్.కేసరి గృహలక్ష్మి అనే స్త్రీల మాసపత్రికను ప్రారంభించాడు. 1943 లో మరో మహిళా పత్రిక ఆంధ్రమహిళ ను మద్రాసు ఆంధ్ర మహిళా సంఘం తీసుకువచ్చింది. 1975 లో చందమామ పత్రిక ప్రచురణకర్తలు వనిత పేరుతో స్త్రీల కొరకు ఒక పక్ష పత్రికను మొదలుపెట్టారు. 1978 లో ఇది మాసపత్రికగా మారింది.[16] 1978 లోోనే, ఆంధ్రజ్యోతి సంస్థ నుండి వనితాజ్యోతి అనే మాసపత్రిక వెలువడింది. అంతర్జాల యుగంలో వచ్చిన మహిళల పత్రిక, భూమిక.
పిల్లల కోసమే ప్రత్యేకించిన తొలి పత్రిక బాలమిత్ర 1914 లో వెలువడింది. ప్రత్యేకించి ప్రకటించనప్పటికీ ఇది క్రైస్తవ సంఘ్హాలు నడిపే పత్రికలా కనిపిస్తుంది.[17] 1944 లో బాలమిత్ర పేరుతోటే మరొక పిల్లల పత్రిక వచ్చింది. 1940 లో బాలకేసరి అనే పత్రిక వచ్చింది. 1945 లో న్యాపతి రాఘవరావు, బాల పత్రికను ప్రారంభించాడు. 1947 లో చందమామ వచ్చి మంచి విజయం సాధించింది. తెలుగే కాక అనేక ఇతర భారతీయ భాషల్లో కూడా అది వెలువడింది. 1944 లో బాలమిత్ర, పాపాయి పత్రికలతో మొదలుకుని అనేక బాలల పత్రికలు వచ్చాయి. 1971 లో బొమ్మరిల్లు పత్రిక వచ్చింది.
మొదటి సినిమా పత్రిక చిత్రకళ, 1938 లో విడుదలైంది. ఇది తెలుగు సినిమా కేంద్రమైన మద్రాసు నుండే వెలువడింది. తర్వాత ప్రాచుర్యం పొందిన పత్రిక "నటన"ను ఎం.ఎస్.రామాచారి ప్రారంభించాడు. రూపవాణి పత్రికను 1940 లో పి. సీతారామయ్య ప్ర్రారంభించాడు. ఆ సమయంలోనే కొమ్మూరి సాంబశివరావుతెలుగు సినిమా పత్రిక మొదలు పెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధం వలన చాలా పత్రికలు ఆగిపోయాయి. 1954 లో టి.వి.రామనాథన్ ఒకేసారి మూడు భాషలలో సినిమా పత్రికలు ప్రారంభించాడు. ఇవి ఇంగ్లీషులో పిక్చర్ పోస్ట్, తమిళంలో పేశుంపడమ్, తెలుగులో సినిమా రంగం. తెలుగు పత్రిక బాధ్యతలను జి.వి.జి.కృష్ణ చూసేవాడు. ప్రముఖ స్టుడియో అధిపతి నాగిరెడ్డి బి.ఎన్.కె.ప్రెస్ ప్రారంభించి సినిమా పేరుతో పత్రిక వెలువరించాడు. 1955 లో గౌతమి పత్రిక రాజమండ్రి నుండి ప్రారంబించి, కె.కె.శర్మ (కాగడా శర్మ) ప్రొద్బలంతో మద్రాసుకు తరలించారు. 1950-60 మధ్య ఎన్నో సినిమా పత్రికలు వచ్చాయి. వాటిలో మధురవాణి, చిత్రాలయ, ధ్వని, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్రజగత్ లు కొన్ని.
1966 లో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర విడుదలైంది. దీనికి రావి కొండలరావు సారథ్యం వహించాడు. 1969 లో బి.ఎ.వి.శాండిల్య వెండి తెర ప్రారంభించాడు. 1975లో సినీ హెరాల్డ్ పత్రికను ఠాకూర్ వి.హరిప్రసాద్ హైదరాబాదు నుండి ప్రారంభించాడు. ఈనాడు రామోజీరావు సినీ వారపత్రిక సితారను 1976 లో మొదలు పెట్టాడు. ఆంధ్ర జ్యోతి వారి జ్యోతిచిత్ర 1977 లో మొదలయింది. శివరంజని, మేఘసందేశంలు ఆ తరువాత వచ్చాయి. 2003 లో సంతోషం పత్రిక వచ్చింది.
తొలి తెలుగు పత్రికలైన ది కర్నాటిక్ క్రానికల్, వృత్తాంతిలలో సాహిత్యానికి ప్రాముఖ్యత ఉండేది కాదు. 1842 లో వెలువడిన వర్తమాన తరంగిణితో సాహిత్య విషయాలు కూడా ప్రచురించడం మొదలైంది. ఈ పత్రిక తొలి సంచికలో కావ్యప్రబంధాల, శతకాల పట్టిక ఉంది. చిన్నయసూరి లాంటి విద్వాంసులు ఈ పత్రికలో రాసేవారు. వర్తమాన తరంగిణి లోనే మహాభారత సంపూర్ణ ముద్రణ ఆరంభమైంది.[18]
తొలినాళ్ళ పత్రికల్లో సాహిత్య వ్యాసాలు, అముద్రిత గ్రంథాల ప్రచురణ, రాజకీయ సామాజికాంశాల ప్రచురణ ఉండేది. క్రైస్తవ మత, హిందూమత సంబంధ పత్రికలు ప్రాచుర్యంలో ఉండేవి. క్రైస్తవమత ప్రచార పత్రికల్లో దినవర్తమాని, హితవాది, సత్యదూత, రవి, వివేకవతి, తెలుగు బాప్టిస్ట్ వంటివి ఉండేవి. వీటికి సర్క్యులేషను కూడా మిగతా పత్రికల కంటే ఎక్కువగా ఉండేది.
1871 లో మొదలైన ఆంధ్రభాషాసంజీవని సంపాదకీయం రాసే ఒరవడిని ప్రవేశపెట్టింది.[19] 1860 ల్లో వచ్చిన శ్రీ యక్షిణి, సుజనరంజని పత్రికలు సాహిత్య విషయాలకు ప్రాధాన్యత నిచ్చాయి.[18] 1885 లో వచ్చిన అముద్రితగ్రంథచింతామణి పత్రిక, పేరుకు తగినట్లు పలు అముద్రిత గ్రంథాలను ప్రచురించేది. చంద్రగిరిచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, భోగినీదండకం, వసుంధరా విజయము, యాదవరాఘవ పాండవీయము, మిత్రవింద పరిణయము లాంటి గ్రంథాలను ఈ పత్రిక ప్రచురించింది.
రాజకీయ, సామాజిక విషయాలను ప్రచురించే తొలి పత్రికల్లో చెప్పుకోదగ్గవి ఆంధ్ర ప్రకాశిక, శశిలేఖ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, దేశోపకారి, దేశాభిమాని, వివేకవర్థని, రవి. 19 వ శతాబ్దం చివరి లోను, 20 వ శతాబ్ది తొలినాళ్ళలోనూ మొదలైన ఈ పత్రికలు ప్రధానంగా స్వాతంత్ర్యోద్యమానికి అనుకూలంగా ఉండేవి. ఆంధ్ర ప్రకాశిక కాంగ్రెసుకు అనుకూలంగా ఉండేది. కొన్నాళ్ళపాటు జస్టిస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. పార్టీలు తమ ప్రచారం కోసం పత్రికలు పెట్టుకునేవి. 1936 లో పిఠాపురం రాజా స్థాపించిన జనవాణి దినపత్రిక అటువంటిదే. ఆయన పార్టీ అయిన పీపుల్స్ పార్టీ ప్రచారం కోసం ఆ పత్రిక పనిచేసేది.
1894 లో రాయదుర్గం నుంచి యల్లమరాజు నారాయణమూర్తి ప్రచురించిన విజ్ఞానవర్ధిని పత్రికలో విజ్ఞానశాస్త్ర విషయాలను ప్రచురించేవారు. దాసు కేశవరావు సంపాదకత్వంలో 1893 లో వచ్చిన జ్ఞానోదయం పత్రిక వ్యవసాయం, పశుపోషణ, వర్తకం, తోటల పెంపకం వంటి విశేషాలను ప్రచురించేది.[20]
19 వ శతాబ్దం, 20 వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో సంఘ సంస్కరణ అంశాలైన వితంతు పునర్వివాహం, బాల్య వివాహాలు వంటివే సమాజంలో ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉండేవి. సహజంగానే పత్రికల్లోనూ ఈ అంశాలే ప్రధానంగా ఉండేవి. సంఘ సంస్కరణల పట్ల తొలినాళ్ళ పత్రికలకు విభిన్న దృక్పథాలుండేవి. వివేకవర్థని, జనానా, హిందూసుందరి, హిందూజనసంస్కారిణి వంటి పత్రికలు సంస్కరణలకు అనుకూలం కాగా, ఆంధ్రభాషాసంజీవని, ఆర్యమతబోధిని, సావిత్రి, అభినవసరస్వతి, అనల్పకల్పితాకల్పకల్పవల్లి వంటి పత్రికలు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉండేవి. ఈ అంశాలపై వీటి మధ్య వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండేవి. అనల్పజల్పితాకల్పకల్పవల్లి పత్రికను మొదలుపెట్టిన దాసు శ్రీరాములు, తొలుత స్త్రీ పునర్వివాహాలకు వ్యతిరేకి అయినప్పటికీ, ఆ తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. దానితో ఈ పత్రిక మౌలికమైన ప్రతిపదికను కోల్పోయి, మూతబడింది.
కొన్ని పత్రికలు స్వాతంత్ర్యోద్యమానికి వ్యతిరేకంగా ఉండేవి. వివేకవర్థని వంటి పత్రికలు బ్రిటిషు వారికి అనుకూలంగా రాసేవి. ఇంగ్లాండు చక్రవర్తి/మహారాణిని కీర్తిస్తూ పద్యాలు వ్యాసాలూ ప్రచురించేవి. ప్రబుద్ధాంధ్ర పత్రిక స్వాతంత్ర్యోద్యమానికి వ్యతిరేకం కానప్పటికీ గాంధీకి, హిందీకి, ఖద్దరుకూ వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించేది.[21]
తెలుగులో మొదటి కార్టూన్ని ఆంధ్రపత్రిక ప్రచురించింది. కార్టూనిస్టు తలిశెట్టి రామారావు. ఈనాడులో శ్రీధర్ వేసిన కార్టూన్లు ప్రసిద్ధి పొందాయి. ఆంధ్రభారతిలో తమాషాలు శీర్షికన జోకులు ప్రచురించేవారు.[22]
తెలుగులో తొలి క్రాస్వర్డ్ పజిల్ను 1937 లో ఆంధ్రభారతిలో ప్రచురించినట్లు ఈనాడు పత్రిక రాసింది.[23] అయితే, 1928 ఫిబ్రవరి లోనే శ్లిష్టాక్షరపదబంధము పేరుతో ఆంధ్రభారతి గళ్ళనుడికట్టును ప్రచురించింది.[22] దీనికి సమాధానాలనూ, రెండవ ప్రహేళికనూ ఏప్రిల్ సంచికలో ప్రచురించింది.[24] దీన్నిబట్టి, 1928 నాటి శ్లిష్టాక్షరపదబంధమే తెలుగులో తొలి క్రాస్వర్డ్ పజిల్ అయి ఉండవచ్చు. జ్యోతి మాసపత్రికలో పదబంధ ప్రహేళిక పేరుతో తొలుత శ్రీశ్రీ, ఆ తరువాత ఆరుద్ర గళ్ళనుడికట్టును నిర్వహించారు. ఈనాడు ఆదివారం పుస్తకంలో గళ్ళనుడికట్టును ప్రచురిస్తూ ఉంటుంది. పొద్దు అంతర్జాల పత్రికలో గళ్ళనుడికట్తు వచ్చేది. ఈమాట గడినుడి పేరుతో గళ్ళనుడికట్టు ప్రచురిస్తోంది.[25]
పత్రికల్లో పాఠకులు రాసే ఉత్తరాలకు ప్రాముఖ్యత ఉండేది. 1841 లో వృత్తాంతి పత్రికలో, ఆనాటి వివాహాల్లో జరుగుతున్న దుబారాఖర్చు, భోగం మేళాల పట్ల ఆవేదనతో ఒక పాఠకుడు రాసిన సుదీర్ఘమైన లేఖను ప్రచురించారు. ఈ లేఖ, ఆ తరువాతి కాలంలో వచ్చిన బ్రౌన్ సేకరణల్లో చోటుచేసుకుంది. చిన్నయసూరి, వర్తమాన తరంగిణికి ఒక లేఖలో ఒక పద్యం రాసి పంపిస్తూ దాన్ని ముద్రించి, పండితుల చేత దానికి అర్థం చెప్పించమని కోరాడు. అముద్రిత గ్రంథ చింతామణి పత్రికలో ప్రచురించిన సాహిత్య లేఖలు ఆ తర్వాతి కాలంలో "అముద్రిత గ్రంథ చింతామణి లేఖలు" అన్న పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి.
1975 లో మొదలైన వనిత పక్ష/మాస పత్రికలో పాఠకుల లేఖలకు పారితోషికం ఉండేది. "అభిప్రాయాలు" శీర్షిక కింద ప్రచురించే ప్రతి లేఖకూ 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు.[26]
తొలినాళ్ళ పత్రికల్లో గ్రాంథికభాష వాడుక విస్తృతంగా ఉండేది. 1871 లో కొక్కొండ వెంకటరత్నం స్థాపించిన ఆంధ్రభాషాసంజీవని గ్రాంథిక భాషలో ఉండేది. 1872 లో వచ్చిన పురుషార్థ ప్రదాయిని వాడుకభాషలో వచ్చిన తొలి పత్రిక. ఆ తరువాత వీరేశలింగం స్థాపించిన పత్రికలు వాడుకభాషనే అనుసరించాయి. 1894 లో వచ్చిన శశిలేఖ గ్రాంథిక భాషలో ఉండేది. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక వంటి దినపత్రికలు రాసేది వాడుక భాష అయినప్పటికీ, 1940 ల వరకూ పూర్తిగా వాడుకభాష లోకి మారలేదు. సంపాదకీయాలు, వ్యాసాలూ, ఉత్తరాల వంటివి సరళ గ్రాంథికం లోనే ఉండేవి. దీన్ని ఎత్తిచూపుతూ 1938 లో గిడుగు రామమూర్తి ప్రబుద్ధాంధ్రలో "తెలుగు పత్రికల సంపాదకులకు" రాసిన బహిరంగ అభ్యర్థనలో ఇలా రాసాడు:[12]
"ఇప్పుడు ఆంధ్రభారతిని ఆరాధించే గొప్ప సంస్థలలో గొప్పవి ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, భారతి, గృహలక్ష్మి మొదలయినవి. వీటి సంపాదకుల ప్రధానోద్దేశము ఆంధ్రులను అందరినీ అలరించడము."
గిడుగు రామమూర్తి
"ఇంగ్లీషువారు ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివినట్లు ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక మొదలయిన వార్తాపత్రికలలోని సంపాదకీయ వ్యాసములున్ను , గ్రాంథికమున రచించిన ఇతరవ్యాసములున్ను , జాబులున్ను తెలుగువారు చదవలేరు. ఈ విషయము అనేకసార్లు పరీక్షించి చూచినాను. ఇంగ్లీషు నేర్చిన తెలుగువారయినా ఇంగ్లీషు వారాపత్రికలు చదివినట్లు సుళువుగా తెలుగువార్తాపత్రికలు చదవలేరు. ఇందుకు కారణము తెలుగు అక్షరములు చదవడము వారికి అలవాటు లేకపోవడము కాదు, గ్రాంథికాంధ్రము సుపరిచతము కాక పోవడము."
"ఏనాడు ఆంధపత్రికలోను కృష్ణాపత్రికలోను సంపాదకీయ వ్యాసములు యథోచితమయిన వ్యావహారిక భాషలో రచితమవుతవో, అనాడు తెలుగువారికి పండిత పామర సామాన్యమైన దేశభాష కలదన్న మాట ప్రస్ఫుటముగా ప్రకటిత మవుతుంది, ప్రజాస్వా మిక పరిపాలనము నిర్వహించడణునకు తగినవారుగా తెలుగువారిని తర్చీయత్ చేసే సంస్థలు స్థాపిత మవుతవి."
"ఇంగండు, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా, తుర్మీ, చీనా, జసాను మొదలయిన దేశములలోని వార్తా పత్రిక సంపాదకులు తమ వాడుక భాషలోనే తమ వ్యాసములు రచిస్తున్నా రని ఆంధ్రపత్రిక, కృష్ణాపతికల సంపాదకులకు తెలుసుననుకొంటాను. తెలిసిన్ని ఆధ్రసాహిత్యపరిషత్ పత్రికాసంపాదకుల వలెనే వారున్ను తను వాడుకభాషను బహిష్కరించి, వ్యవహార భ్రష్టము అయిన ప్రాచీనాంధ్రశబ్దములు ఎందుకు తమ వ్యాసములలో వాడుతున్నారో నాకు బోధపడదు."
1936 లో తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చిన జనవాణి, పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక.[10]1938 లో వచ్చిన ఆంధ్రప్రభ దినపత్రిక, వాడుకభాషను మరింత సరళం చేసింది. దాని సంపాదకుడైన నార్ల వెంకటేశ్వరరావు సరళ గ్రాంథికభాష నుండి సరళమైన వ్యావహారిక భాషకు మార్చాడు.[27] 1970 లో ఈనాడు వచ్చాక భాష పూర్తిగా మారిపోయి, నేటి రూపానికి స్థిరపడింది. టీవీల్లో వార్తాఛానళ్ళు, అంతర్జాలంలో పత్రికల ప్రచురణ, సామాజిక మాధ్యమాలు మొదలైన తరువాత భాషలో మరింత మార్పు వచ్చింది. భాషలో ఇంగ్లీషు పదాలు హెచ్చడమే కాకుండా, భాష ఆంగ్లీకరణ చెందుతోంది.
19 వ శతాబ్దిలో వెలువడ్డ తెలుగు పత్రికలు ఎక్కువగా మద్రాసు, బందరు, జళ్ళారి, విశాఖపట్టణం, బరంపురం, శ్రీకాకుళం వంటి సరిహద్దుల వద్ద నున్న ప్రదేశాల నుండి వచ్చినవే. తెలుగు దేశం నడిబొడ్డు నుంచి వచ్చిన పత్రికల్లో ఎక్కువ భాగం రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం, తుని వంటి గోదావరి నదికి రెండు పక్కల ఉన్న పట్టణాలలో పుట్టాయి. ఏలూరు, గుడివాడ, అత్తిలి పట్టణాలలో కూడా పత్రికలు అవతరించాయి, నెల్లూరు నుండి పత్రికల ప్రచురణ ఎక్కువగా జరిగేది. గుంటూరు, విజయవాడలలో పత్రికలు ఉద్భవించడం తరువాతి కాలంలో వచ్చింది గానీ, తొలినాళ్ళలో లేవు.[28]
తెలుగు పత్రికల పేర్లు సాధారణంగా వృత్తాంతిని, వర్తమానతరంగిణి, హితవాది, దినవర్తమాని, చింతామణి, అముద్రితగ్రంథచింతామణి, ఆంధ్రభాషాసంజీవని వంటి 'ఇ'కారాంత పదాలతో కూడి ఉండేవి. సత్యదూత, మనోరమ, జనానా పత్రిక, శారద వంటి 'అ'కారాంతపు పేర్లు తక్కువగా ఉండేవి. 'స్వదేశ జనప్రసిద్ధ అభిపాయము', 'విద్యార్థి కల్పభూజము', 'నీతి దర్పణము' వంటి 'ము' తో అంతమయ్యే పేర్లు మరీ తక్కువ. బోధిని, దర్శిని, వర్థిని, మంజరి, రంజని వంటి పదాలతో అంతమయ్యే పేర్లతో పత్రికలు వచ్చేవి. 'అనల్పజల్పితాకల్పకల్పవల్లి' అనే పేరుతో ఒక పత్రిక వెలువడేది.[28] దీనికి అర్థం 'అద్భుతమైన మాటల యొక్క అలంకారాలకు, లేదా వైభవాలకు కల్పవృక్షం వంటిది' అని. దీన్ని దాసు శ్రీరాములు 1880 లో స్థాపించాడు.[29]
సాధారణంగా పత్రికల పేర్లలో ఉండే పదాల మధ్య ఖాళీలు ఉండేవి కావు. ఉదాహరణకు వర్తమానతరంగిణి, దినవర్తమాని, అముద్రితగ్రంథచింతామణి, ఆంధ్రభాషాసంజీవని వంటి పేర్లలో పదాలకు మధ్య ఖాళీ ఉండదు. ఆధునిక కాలంలో ఇలాంటి పేర్లలో పదాల మధ్య ఖాళీ ఉండడం సహజం. కానీ అప్పట్లో అలా ఖాళీ ఉంచేవారు కాదు. ఆంధ్రభారతి, ఆంధ్రమహిళ, అభినవసరస్వతి వంటివి మరికొన్ని ఉదాహరణలు.
అనేక పత్రికల పేర్లు "ఆంధ్ర" పదంతో మొదలయ్యాయి. అలాంటి పత్రికలలో ఆంధ్రభాషా సంజీవని పత్రిక మొదటిది.[30] ఆంధ్ర ప్రకాశిక, ఆంధ్రభారతి, ఆంధ్రభాషాసంజీవని, ఆంధ్రజనత, ఆంధ్రకేసరి, ఆంధ్రమహిళ, ఆంధ్రసర్వస్వము, ఆంధ్ర హరిజన్, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి కొన్ని ఇతర ఉదాహరణలు.
కొన్ని పత్రికల పేర్లకు ముందు "శ్రీ" పెట్టేవారు. శ్రీ యక్షిణి, శ్రీ ప్రబంధ కల్పవల్లి, శ్రీ వైజయంతి, శ్రీ కళానిధి, శ్రీ భారతి వంటివి ఈ కోవకు చెందుతాయి. అయితే శ్రీయక్షిణిలో మాత్రమే శ్రీ అనేది పేరులో భాగమై ఉంది. మిగతా అన్నిపేర్లలో శ్రీ అనేది కేవలం శుభసూచకమే.[31] శ్రీ వివేకవర్థిని శ్రీ ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక పేర్లు కూడా అటువంటివే.
ఒకే పేరుతో ఒకటి కంటే ఎక్కువ పత్రికలు వచ్చాయి. స్వరాజ్య పేరుతో మూడు పత్రికలు వచ్చాయి, అన్నీ మూతబడ్డాయి. వీటిలో రెండు పత్రికలు ఒకే కాలంలో - ఒకటి మద్రాసు నుండి మరొకటి విజయవాడ నుండి వచ్చాయి. ప్రతిభ పేరుతో రెండు పత్రికలు వచ్చాయి. నవయుగ పేరుతో రెండు పత్రికలు వచ్చాయి. వనిత పేరుతో రెండు, సుజాత పేరుతో రెండు, శారద పేరుతో మూడు, సరస్వతి పేరుతో నాలుగు పత్రికలూ వచ్చాయి.
1880 ల నుండి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. మద్రాసు నుండే కాక, ఆంధ్ర ప్రాంతం లోని పలు ప్రదేశాల నుండి పత్రికలు వెలిసాయి. అయితే వీటిలో దీర్ఘకాలం నడిచినవి చాలా తక్కువ. ఆర్థిక ఇబ్బందులు పత్రికలు ఆగిపోవడానికి ప్రధాన కారణం. చాలా పత్రికల సంపాదకీయాల్లో తమ ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించేవారు. చందాదారులను, ఏజెంట్లనూ బకాయిలు కట్టవలసినదిగా కోరేవారు. పత్రికలు చాలావరకు ఒకే వ్యక్తిపై ఆధారపడి నడుస్తూ ఉండేవి. ఆ వ్యక్తి ఏ కారణం చేతనైనా కొన్నాళ్ళపాటు పత్రికపై పనిచెయ్యలేని పరిస్థితి వచ్చినా, ముద్రాపకుడు ఆలస్యం చేసినా పత్రిక విడుదల కూడా ఆలస్యమయేది.[32] ఆ వ్యక్తి మరణించినపుడో, అనారోగ్యం పాలైనపుడో పత్రిక కూడా ఆగిపోయేది.
1930 లో భారతిలో రాసిన వ్యాసంలో వావిలాల గోపాలకృష్ణయ్య, 1875-1926 మధ్య మొత్తం 516 పత్రికలు వెలువడ్డాయని రాసాడు. వీటిలో చాలా పత్రికలు తక్కువ కాలంలోనే ఆగిపోయాయి. 1940 లో వేసిన అంచనా ప్రకారం అప్పటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి.[33] 1926 ఉగాది నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో 60 యేళ్ళ తెలుగు వార్తాపత్రికలపై రాసిన సమీక్షలో కొడాలి శివరామకృష్ణారావు, వందల కొలదిగా తెలుగు పత్రికలు పుట్టి, గిట్టాయని చెబుతూ, కొన్ని మొదటి సంచిక తోనూ, కొన్ని మొదటి మాసం తోనూ, కొన్ని మొదటి సంవత్సరము తోనూ అంతరించాయని రాసాడు.[34] పత్రికలు వేగంగా వెలుగు చూసి అంతే వేగంగా మూతబడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లెల శ్రీరామమూర్తి, 'పత్రికలన్నీ ఒక మూసలో ఉండకుండా వివిధ రంగాలకు చెందిన విశేషాలను ప్రచురిస్తూ ఒకరికొకరు పోటీ కాకుండా ఉండాలని తద్వారా తమ అభిరుచుల కనుగుణంగా చందాదారులు లభిస్తార'ని 1941 లో త్రిలిఙ్గ పత్రిక రజతోత్సవ సంచికలో రాసాడు. "..అట్లుకాక అందరు అనుకరణముగ ఒకే మార్గమున పత్రికలు నడిపింప పూనుటచేతనే అనేక పత్రికలు పుట్టిన వెంటనే గిట్టుచున్నవి. మాసపత్రికయినచో తొలి సంచికతోను, పక్షపత్రికయినచో రెండవసంచికతోను, వారపత్రికయైనచో మూడుసంచికలతోను ఆగిపోవుచున్న విషయ మందరెరిగిందే కదా" అని ఆయన చమత్కరించాడు.[35]
"పత్రికా జీవనము ముఖ్యముగ నాంధ్రదేశములో దుర్భరము. విదేశములలో వేనకు వేలు పత్రిక లున్నవి, ఒక్కొక్క పత్రికకు లక్షలు లక్షలు చందాదారు లున్నారు. కాని మన దేశమునకట్టి యదృష్టము లేదు, కారణ మేమి? మన దేశములో చాలభాగము వ్యవసాయకులు, వారు పల్లెలలో నివసించు నుందురు. విద్యా సౌకర్యములు సున్న, చదువుకున్న వారు యే కొలదిమందియో యున్న యెడల నుద్యోగముల కొరకు పట్టణములకు పోవుచున్నారు. ఉద్యోగములలో నున్న వారికి సరిగా భార్యాబిడ్డల ముఖములనైనా చూచి యానందించుటకు సావకాశము చిక్కదు. ఈ పరిస్థితులలో బత్రికలు దీనదశ యందున్నవనిన వింతలేదు. ఇది యిటుండ ముద్రణాశాసనము, మాననష్టవు దావాలు, క్షమాపణలు స్వాతంత్య్య విహీనత, నిత్యము మన పత్రికల నెదుర్కొనుచున్నవి. స్వేచ్భాజీవనము లేని దేశములో పత్రికలు సజీవములై యెట్లుండగలవు? వీటిని వారములు చేసి జీవించు విడ్యార్థికి బోల్చవచ్చును. ఏరోజున యెవరింట్లో భోజనమో వారి యిష్టాయిష్టముల ననుసరించి వర్తించుచు, వారు పెట్టినది తిని సంతృప్తి చెందవలసిన స్ధితి వారములు చేసి జీవించు విద్యార్థిది"[36] - 1928 ఏప్రిల్ నాటి ఆంధ్రభారతి సంపాదకీయంలో రాసిన ఈ వాక్యాలు పత్రికల ఆర్థిక దుస్థితికీ, ప్రభుత్వ నిర్బంధానికీ అద్దం పడుతాయి.
ఏలూరు నుండి ప్రచురితమైన దేశోపకారి పత్రిక 20 వ శతాబ్దపు తొలి నాళ్ళలో మూతబడింది. మూసివేత గురించి తన స్వీయచరిత్రలో రాస్తూ సత్తిరాజు సీతారామయ్య, "శుష్కప్రియములు, శూన్యహస్తములు అన్నటుల మనదేశీయుల కుచితముగా పంపించినంతవరకు సంతోషమే గాని రొక్కమీయమని అడిగిన చేయి వదలుట కష్టము. అర్ధవార పత్రికకు అమితమైన రొక్కము వెచ్చించ వలసి వచ్చినది. దినదినము విశేషశ్రమకోర్చి, చేతిరొక్కము వెచ్చించుకొని ఇతర పనులు చెడి, ఆంధ్రవార్తా పత్రికలు ప్రచురించుటలో గల బుద్ధి తక్కువను గుర్తెరిగి, అర్ధ వారపత్రికకొక్క నమస్కారమును, ఇంతవరకు బాకీయెగరవేసిన చందాదారులకు అనేక శతసహస్ర వందనములతో తత్పత్రికా ప్రకటన ముగించితిని."[37] అని రాసాడు. నాటి పత్రికల ఆర్థిక దుస్థితి ఇలా ఉండేది.
అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ దశాబ్దాల తరబడి సాగిన పత్రికలు కొన్ని ఉన్నాయి.
తొలినాళ్ళ తెలుగు పత్రికలన్నిటికీ స్వంత ముద్రణాలయాలు ఉండేవి కావు. వేరే ముద్రణాలయాల్లో ముద్రించేవారు. ఒకే ముద్రణాలయంలో పలు పత్రికలు ముద్రించే సంప్రదాయమూ ఉండేది. మద్రాసులో కూడా ముద్రణాలయాలు తక్కువగానే ఉండేవి. అంచేత సంపన్నులైనవారు స్వంతంగానే ముద్రణాలయాలు పెట్టి పత్రికలను ముద్రించుకునేవారు. వాటితో పాటు పురాతన గ్రంథాలను ముద్రించేవారు.[38]
పురాణం నారాయణశాస్త్రి అనే పండితుడు మద్రాసులో తొలి ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఆ తరువాత ముద్దంశెట్టి పార్థసారధి సెట్టి ఆదర్శ ముద్రాక్షరశాలను, పుదూరు వంశీకులు భాస్కర ముద్రాక్షరశాలను స్థాపించారు. పుదూరు శాఖీయుడైన వావిళ్ళ రామస్వామి శాస్రులు ఆదర్శ ముద్రణాలయంలో భాగస్థుడిగా ఉండి, ఆ తరువాత 1854 లో సరస్వతీ నిలయము అనే ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఆ తరువాత మద్రాసులో వివేకరత్నాకర ముద్రాక్షరశాల, శారదాంబ నివాస ముద్రణాలయము, హిందూ ముద్రాక్షరశాల, వాణీ దర్పణము వంటీ అనేక ముద్రణాలయాలు వెలుగు చూసాయి.
వర్తమానతరంగిణి పత్రికను మద్రాసు లోని స్వంత ముద్రణాలయములోనే ముద్రించి ప్రచురించేవారు.[38] కొక్కొండ వెంకటరత్నం పంతులు సంజీవనీ ముద్రాక్షరశాలను స్థాపించి ఆంధ్రభాషా సంజీవని పత్రికను ముద్రించడం మొదలుపెట్టాడు. వివేకవర్ధిని పత్రికను కూడా తొలుత ఇక్కడే ముద్రించేవారు. నాలుగవ సంచిక నుండి దాన్ని శ్రీధర ముద్రాక్షరశాలకు మార్చారు.
బందరులో కేశవరాజు అండ్కో వారు స్వధర్మప్రకాశిని అనే ప్రెస్సును పెట్టి అక్కడి నుండి స్వధర్మప్రకాశిని పత్రికను మొదలుపెట్టారు. ఈ ప్రెస్సు లోనే పురుషార్థప్రదాయిని పత్రికను కూడా ముద్రించేవారు. ఈ ప్రెస్సు లోనే అనల్పకల్పితాకల్పకల్పవల్లి పత్రికను కూడా తొలుత ముద్రించారు. ఆ తరువాత ఆ పత్రిక ప్రచురణకర్త యైన దాసు శ్రీరాములు స్వయంగా వాణీ ముద్రాక్షరశాలను స్థాపించాక అక్కడ ముద్రించేవారు.
ఆంధ్రప్రకాశికను మద్రాసులో హిందూ ప్రెస్లో ముద్రించేవారు. మంజువాణి పత్రికను ఏలూరులో మంజువాణి ప్రస్లో ముద్రించేవారు. ఇక్కడే అగ్రికల్చర్ అనే తెలుగు పత్రిక కూడా ముద్రింపబడేది. 1913 లో ఆరోగ్యప్రబోధిని, ప్రారంభ విద్య పత్రికలను ఏలూరు లోని రామమోహన్ ప్రెస్లో ముద్రించేవారు. ఆరోగ్యప్రబోధినిని 1910 లో రాజమండ్రి లోని చింతామణిలో ముద్రించేవారు. ఆర్యవైశ్య పత్రికతో పాటు, అభినవభారతి, విశిష్టాద్వైత ప్రకాశిక పత్రికలను కూడా గుంటూరు లోని ఆర్యవైశ్య ప్రెస్లో అచ్చువేసేవారు. దేశాభిమాని పత్రికను గుంటూరు లోనే దేశాభిమాని ముద్రణాలయంలో ముద్రించేవారు. దేశమాత పత్రిక రాజమహేంద్రిలో మనోరమ ప్రెస్లో ముద్రింపబడేది.[39]
హిందూసుందరి, దేశోపకారి, లా వర్తమాని పత్రికలను దేశోపకారి ప్రెస్లో ముద్రించేవారు. ఈ ముద్రణాలయం మొదట ఏలూరులో ఉండేది. అనంతర కాలంలో దాన్ని కంతేరుకు మార్చారు. కొంతకాలం తరువాత హిందూసుందరిని కాకినాడ లోని కాకినాడ విద్యార్థినీ సమాజము యాజమాన్యం కిందికి వెళ్ళింది.
రాజమండ్రిలో చింతామణి ముద్రణాలయాన్ని స్థాపించి వీరేశలింగం పంతులు దానిలో తన చింతామణి పత్రికను ముద్రించేవాడు. దానిలోనే జనానా పత్రికను కూడా ముద్రించేవారు. అయితే 1905 లో ఆ పత్రిక సంపాదకుడైన రాయసము వెంకట శివుడికీ, వీరేశలింగానికీ మనస్పర్థలు ఏర్పడినపుడు జనానా పత్రిక ముద్రణ కొన్నాళ్ళు ఆగిపోయింది. ఆ తరువాత దాన్ని మద్రాసులో ముద్రించడం మొదలుపెట్టారు. 1906 లో చింతామణి ప్రెస్సును సత్యవోలు గున్నేశ్వరరావు కొన్నాడు.[40] ఆ తరువాత జనానా పత్రికను మళ్ళీ అక్కడ ముద్రించడం మొదలుపెట్టారు. అయితే, కొన్నాళ్ళకు పత్రిక ప్రచురణ ఆగిపొయింది.[41] ఈ ప్రెస్సు లోనే గున్నేశ్వరరావు తన ఆంధ్రకేసరి పత్రికను ముద్రించేవాడు. ఇక్కడే ఎలిమెంటరీ స్కూల్ జర్నల్ అనే తెలుగు పత్రిక కూడా ముద్రింపబడేది. 1910 లో ఆరోగ్యప్రబోధిని ముద్రణ కూడా చింతామణి లోనే జరిగేది.
రాజమండ్రి లోని బ్రౌన్ ఇండస్ట్రియల్ మిషన్ ప్రెస్సులో టీచర్ అనే పేరుతో తెలుగు ఇంగ్లీషు భాషల్లో వేరువేరు పత్రికలు ముద్రించేవారు. ఇక్కడే సహాయ, మానవసేవ అనే పత్రికలు కూడా ముద్రింపబడేవి. కాకినాడ లోని సరస్వతి ముద్రణాలయంలో ఆర్యమతబోధిని పత్రికను ముద్రించేవారు.
అభినవసరస్వతి పత్రికను మొదట్లో విజయవాడ వాణి ప్రెస్లో ముద్రించి, 1912 నుండి గుంటూరు లోని చంద్రికా ప్రెస్సులో ముద్రించేవారు. ఇక్కడే దర్బారు పత్రిక కూడా ముద్రితమయ్యేది. హిందూజనసంస్కారిణి పత్రికను, ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రికనూ మద్రాసులో, వేదము వేంకటరాయశాస్త్రి స్థాపించిన జ్యోతిష్మతీ ప్రెస్సులో ముద్రించేవారు. కృష్ణాపత్రిక సంపాదకత్వాన్ని చేపట్టాక ముట్నూరి కృష్ణారావు, కృష్ణా స్వదేశీ ముద్రాక్షరశాల అనే ప్రెస్సును కొని అక్కడే ముద్రించడం మొదలుపెట్టాడు.[42] ఆంధ్రభారతి పత్రికను కూడా ఇక్కడే ముద్రించేవారు.[43]
బ్రిటిషు ప్రభుత్వం అనేక సందర్భాల్లో పత్రికలపై ఆంక్షలు విధిస్తూ వివిధ చట్టాలు చేసింది. 1823 లో తెచ్చిన నియంత్రణ చట్టం ప్రకారం పత్రికలు ప్రారంభించేందుకు లైసెన్సు పొంది తీరాలి. ఈ చట్టంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 1835 లో దాన్ని రద్దు చేసి మరొక చట్టం తెచ్చారు. దీన్ని మెట్కాఫ్ చట్టం అంటారు. గత చట్టం తెచ్చిన అనేక ఆంక్షలను ఈ చట్టం తొలగించింది. ఈ కారణంగా పత్రికల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు పత్రికల సంఖ్య కూడా బాగా పెరిగింది. 1957 లో మొదటి స్వాతంత్ర్య యుద్ధం తరువాత ప్రభుత్వం మళ్ళీ మరిన్ని ఆంక్షలు విధించింది. ఏ పత్రికనైనా, పుస్తకాన్నైనా ప్రచురణ కాకుండా నిలిపివేసే అధికారాన్ని ప్రభుత్వం తీసుకుంది. 1867 లో వచ్చిన మరో చట్టంతో, పత్రికలు ప్రతి సంచిక లోనూ ప్రచురణ కర్త పేరు, ముద్రాపకుని పేరు, ప్రచురణ ప్రదేశాలను తప్పనిసరిగా ప్రచురించాలని పేర్కొంది. అలాగే పుస్తకాన్ని ప్రచురించిన నెల లోపు ఒక కాపీని ప్రభుత్వానికి సమర్పించాలి.[44] ఈ చట్టం తరువాత, అధికారులు పత్రికలపై ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపడం మొదలైంది.
అ తరువాత 1878 లో బ్రిటిషు ప్రభుత్వం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ పేరుతో ఒక చట్టం తెచ్చింది. ఇంగ్లీషేతర పత్రికలపై పలు ఆంక్షలు విధించింది. ప్రజల్లో జాతీయ భావనలను రేకెత్తించకుండా పత్రికల నోరు నొక్కేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉద్దేశించింది. ఈ చట్టం పట్ల వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత కారణంగా 1881 లో ప్రభుత్వం దీన్ని రద్దుచేసింది.
1908, 1910 సంవత్సరాల్లో వచ్చిన రెండు చట్టాలు పత్రికలపై ఆంక్షలను తిరిగి తెచ్చాయి. 1921 లో ఈ రెంటినీ రద్దుచేసారు. 1931 లో మరొక చట్టం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బ్రిటిషు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉద్దేశించింది.
హైదరాబాదు రాజ్యంలో కూడా పత్రికలపై ఆంక్షలు ఉండేవి. పత్రికలు, ఏడు షరతులతో కూడిన ఎకరార్ నామా అనే ఒక డిక్లరేషన్ను ఇవ్వాలని నిజాం ప్రభుత్వం 1891 లో ఆదేశాలు ఇచ్చింది. నైజాం, బ్రిటిషు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏమీ రాయకూడదు, మత కలహాలను రెచ్చగొట్టే రాతలు రాయకూడదు, ప్రభుత్వాధికారులను విమర్శించకూడదు వంటివి ఆ ఏడు ఆంక్షల్లో ఉన్నాయి. వీటిని ఉల్లంఘించే పత్రికలను మూయించే అధికారం పోలీసులకు ఇచ్చారు.[45] నిజాము ప్రభుత్వ నిర్బంధాల కారణంగా 1938 నుండి 1945 వరకు తెలంగాణలో పత్రికలు వెలువడనేలేదు.
బ్రిటిషు పాలనా కాలంలో పరిపాలనకూ, రాజకీయాలకూ సంబంధించి వివిధ పత్రికలలో వెలువడ్డ వార్తలపై ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపే అధికారులుండేవారు. వివిధ భాషల పత్రికలలో వచ్చిన వార్తలను అనువదించి నెలవారీగా నివేదికలు పంపేందుకు అనువాదకులు ఉండేవారు. ఇలా నివేదికలు పంపడం 1868 లో మొదలైంది. తెలుగు పత్రికలపై తొలుత టి.జి.ఎం.లేన్ అనే అనువాదకుడు ఈ నివేదికలు పంపేవాడు. ఆ తరువాత గుస్టావ్ ఓపర్ట్ పంపాడు.
పరిపాలనపై పత్రికల్లో ఫిర్యాదులేమైనా వస్తే, వాటిలోని వాస్తవాలను నిర్థారిస్తూ, వాటిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదిక ఉండాలి. ఒకవేళ ఆ వార్త అవాస్తవమైతే, దానికి మూలం ఏంటో, అసలు వాస్తవమేంటో తెలుపుతూ నివేదిక పంపాలి అని ప్రభుత్వం ఆదేశించింది.[46] స్థానికుల యాజమాన్యంలో నడిచే పత్రికల్లో రాజకీయ వార్తలను ప్రచురించే పత్రికలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. ఆ పత్రికలలో జరిగే మార్పుల గురించి ఎప్పటికప్పుడు సి.ఐ.డి కి నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.[47]
ఈ రహస్య నివేదికలో ఆయా పత్రికల్లో పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలతో పాటు ఆయా పత్రికల సర్క్యులేషను సంఖ్యలను కూడా పంపేవారు.[48]
ప్రభుత్వ దమననీతిని విమర్శిస్తూ 1908 మార్చి 26 న రాసిన సంపాదకీయానికి గాను స్వరాజ్య పత్రికకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకూ జైలు శిక్షలు పడ్డాయి, పత్రిక మూతబడింది.[49] ఇదే అంశంపై రాసిన సంపాదకీయానికి గాను కృష్ణాపత్రిక మూసివేతకు అంచుదాకా వెళ్ళింది. అయితే, బ్రిటిషు అధికారి పెట్టిన షరతు మేరకు, ప్రచురణకర్తయైన కృష్ణా జిల్లా సంఘం, ఆ సంపాదకీయం రాసిన ముట్నూరి కృష్ణారావు, సహసంపాదకుడైన అవటపల్లి నారాయణరావుల చేత రాజీనామా చేయించడంతో పత్రిక బయటపడింది.[50][49] అదే సమయంలో నవయుగ పత్రిక సంపాదకుడు చిల్లరిగె శ్రీనివాసరావుపై కూడా అరెస్టు వారంటు జారీ అయింది. అయితే పత్రికను మూసివేసే షరతు మీద, అతనిపైనున్న వారంటును కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.[51]
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జమీన్రైతు పత్రిక, బ్రిటిషు వారికి వ్యతిరేకంగా రాస్తోందనే కారణంతో నాటి ప్రభుత్వం 1941 ఫిబ్రవరి 15 -17 తేదీల్లో మూడు రోజుల పాటు పత్రిక వ్యవస్థాపకుడైన నెల్లూరు వెంకట్రామానాయుడు, సంపాదకుడు చుండి జగన్నాథంల ఇళ్ళూ, ఆఫీసులలో సోదాలు జరిపింది.[52] అప్పటి ప్రభుత్వ ఒత్తిడుల కారణంగా మూడు నెలల పాటు - 1942 సెప్టెంబరు 1 నుండి - పత్రిక ప్రచురణను నిలిపివేసారు. తిరిగి 1942 డిసెంబరులో ప్రచురణ మొదలైంది.[52]
1984 లో, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి జరిగిన తీరుపై ఈనాడు దినపత్రిక "పెద్దల సభలో గలభా" అనే శీర్షికన వార్త ప్రచురించింది. గలభా అనే మాట అనుచితంగా ఉందనీ, సభ గౌరవానికీ, సభ్యుల గౌరవానికీ భంగం కలిగించిందనీ భావించి పత్రిక యజమాని రామోజీరావుపై సభాహక్కుల తీర్మానం పెట్టారు. సుప్రీమ్కోర్టు ఆయన అరెస్టు చెయ్యకుండా ఆపింది.[53]
19 వ శతాబ్ది చివరి సంవత్సరాల్లో వెలువడిన పత్రికలు ప్రధానంగా ఐదు - వివేకవర్థని, హిందూజన సంస్కారిణి, ఆంధ్ర ప్రకాశిక, సుజన మనోల్లాసిని, రసికోల్లాసిని. వీటి సర్క్యులేషను వందల్లోనే ఉండేది. 1877 లో పురుషార్థ ప్రదాయినికి 240, వివేకవర్థనికి 300, స్వధర్మప్రకాశినికి 360, ఆంధ్రభాషాసంజీవనికి 150, సకలవిద్యాభివర్థినికి 300, విశ్వకర్మకులసంప్రదాయప్రబోధినికి 40 కాపీల సర్క్యులేషన్లు ఉన్నాయని ప్రభుత్వ రహస్య నివేదికలో రాసారు. హిందూజనసంస్కారిణి సర్క్యులేషను అత్యున్నత స్థాయిలో 950 కి చేరి శతాబ్దాంతానికి క్రమేణా క్షీణించింది.[54] 1884 జూలై నివేదికలో శ్రీ సన్మార్గదర్శిని, శ్రీ ప్రకాశిక అనే పత్రికలు చోటుచేసుకున్నాయి. 1885 లో మొదలైన ఆంధ్ర ప్రకాశికకు 1887 లో 500 ప్రతుల సర్క్యులేషనుండేది. వివేకవర్థిని 300, హిందూజన సంస్కారిణి 100, సుజన మనోల్లాసిని 64, రసికోల్లాసిని 200 ప్రతులతో వెలువడేవి. ఈ నివేదికల్లో 1879 లో వర్తమానరత్నాకరం అనే వారపత్రికలో వచ్చిన వార్తలు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేవి. ఇది మద్రాసు నుండి వెలువడేదని, దాని సర్క్యులేషను 100 అనీ 1879 జూలై నెల నివేదికలో రాసారు.[48]
1910 ల నాటికి పత్రికల సర్క్యులేషను వందల నుండి వేలకు చేరింది. 1911 జూలై నాటికి వెయ్యి సర్క్యులేషను దాటిన పత్రికలు మొత్తం 12 ఉండేవి. ఆనాటి ప్రభుత్వ నివేదికలో మొత్తం 50 వరకూ తెలుగు పత్రికలు చోటు చేసుకోగా వీటన్నిటి మొత్తం నెలవారీ సర్క్యులేషను 75 వేల వరకూ ఉంది.
తెలుగుతో పోలిస్తే, మిగతా దక్షిణ భారత భాషలైన తమిళం, మలయాళం, కన్నడంలలో పత్రికల సంఖ్య, వాటి సర్క్యులేషను రెండూ ఎక్కువగానే ఉండేవి.
20 వ శతాబ్దిలో తెలుగు పత్రికల సర్క్యులేషను బాగా పెరిగింది. 2013 జనవరి - జూన్ కాలానికి ఎబిసి విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల ఉమ్మడి సర్క్యులేషను 35,30,263. ఇది అంతకు ముందరి ఆరు నెలల కాలంతో పోలిస్తే 4 శాతం ఎక్కువ. మిగతా పత్రికల సర్క్యులేషను 3,19,746. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,04,178 గా ఉంది.[55]
తొలినాళ్ళలో పత్రికల మధ్య సత్సంబంధాలుండేవి, వివాదాలూ ఉండేవి. ఒక పత్రిక గురించి మరొక పత్రికలో పరిచయ వ్యాసాలు, సమీక్షలూ ఉండేవి. కొన్ని సందర్భాల్లో, ఇలాంటి సమీక్షలు, పరిచయాల ద్వారానే, గతంలో ఆ పత్రికంటూ ఒకటి ఉండేదని వెలుగు లోకి వచ్చేది.[56] ఇదే విషయాన్ని భారతిలో రాసిన ఒక వ్యాసంలో నిడుదవోలు వెంకటరావు, ఆంధ్రభాషాసంజీవని పత్రిక వలన అనేక ఇతర సమకాలిక పత్రికల ఉనికి గురించి తెలిసిందని రాసాడు.[57] కొత్తగా వచ్చిన గ్రంథాలనూ, పత్రికలనూ పరిచయం చేసేందుకు వివిధ పత్రికల్లో ప్రత్యేకంగా శీర్షికలుండేవి. ఉదాహరణకు, 1912 అక్టోబరు హిందూజన సంస్కారిణి పత్రికలో ఆంధ్ర ప్రకాశిక గురించి వచ్చిన వార్తను చూడవచ్చు.[58]తెలుగు జనానా పత్రికలో గౌతమి అనే కొత్త దినపత్రిక గురించి సుదీర్ఘ పరిచయంలో, “ఈ యాగస్టు నెల మొదట గౌతమి యను పేరనొక యాంధ్రవారవత్రిక యనుదినమును రాజమహేంద్రవరమున బ్రచురమగుచున్నది. ఈ పత్రిక యొక్క 1,2,3 వ సంచికలు వందన పూర్వకముగా నందుకొన్నారము. పత్రిక అరఠావు కాగితము పరిమాణము గలది. ప్రతిసారినేదో యొక ముఖ్యవ్యాఖ్యానమును, కొన్ని చిన్న వ్యాసములను, వృత్తాంతములను ముద్రితములగుచున్నవి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రహసనములు గూడ గలవు.” అని రాసారు.[59]
1934 లో ధర్మసాధని పత్రిక ప్రబుద్ధాంధ్ర గురించి “ఇది భాషాభిమానులకు సంతోషము కల్పించు చౌక పత్రిక” అని రాసింది. 1934 ఫిబ్రవరిలో ఆంధ్రభూమి, "ప్రబుద్ధాంధ్ర చందాదారుల సంఖ్య 2700. నేడు 'వినోదిని' తప్ప అంతమంది చందాదారులు గల మాస పత్రిక మరి యొకటి లేదు...” అని రాసింది.[60]
ఒక్కో ప్రచురణకర్త ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురించేవారు. సహజంగానే ఒకదాని గురించి మరొకదానిలో రాసేవారు.
పత్రికల మధ్య పరస్పర విమర్శలు కూడా ఉండేవి. వితంతు పునర్వివాహం, బాల్యవివాహాల నిషేధం వంటి సంస్కరణల అనుకూల, వ్యతిరేక వాదాలు, గ్రాంథిక, వ్యావహారిక భాషా వివాదం వంటివి పత్రికల మధ్య స్పర్థకు ప్రధాన హేతువుగా ఉండేవి. గ్రాంథిక - వ్యావహారిక భాషా వివాదంలో గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, బుర్రా శేషగిరిరావు, సెట్టి లక్ష్మీనరసింహం తదితరులు వ్యావహారికం పట్ల, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, యన్. మూర్తిరాజు, పానుగంటి లక్ష్మీనరసింహారావు , వేదం వెంకటరాయశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటివారు గ్రాంథికం పట్ల అభీష్టం చూపుతూ పరస్పరం విమర్శిస్తూ వ్యాసాలు రాసారు.[61] సంస్కరణలకు అనుకూలంగా ఎక్కువ పత్రికలుండగా, ఆంధ్రభాషాసంజీవని, అభినవసరస్వతి, సావిత్రి వంటి పత్రికలు సాంప్రదాయికవాదానికి అనుకూలంగా ఉండేవి. ఆ కారణంగా పరస్పర విమర్శలూ ఉండేవి. వితంతు పునర్వివాహం అంశంపై సావిత్రి పత్రికకూ, జనానా పత్రికకూ మధ్య సంవాద వివాదాలు జరిగాయి.[62][63] అదే అంశాలపై సావిత్రికీ, హిందూసుందరికీ మధ్య కూడా విమర్శలు వచ్చేవి.
కొన్ని సందర్భాల్లో సైద్ధాంతిక స్పర్థలు విస్తరించి వ్యక్తిగతంగా ఎగతాళి చేసేవరకూ వెళ్ళేది. వీరేశలింగం స్థాపించిన వివేకవర్ధని పత్రికనూ, అందులోని భావాలనూ వెటకారం చేయడానికి కొక్కొండ వెంకటరత్నం తన ఆంధ్రభాషాసంజీవని పత్రికకు అనుబంధంగా హాస్యవర్థని అనే ప్రత్యేక విభాగాన్ని మొదలుపెట్టాడు. అంతేకాకుండా, ఆయన వివేకవర్ధని పేరును తిరగేసి చదువుతూ, నిర్ధవకవేవి అని చదువుతూ దానికి అర్థం 'వితంతువు బోడిగుండు' అని చెప్పేవాడు. దానికి ప్రతిగా వీరేశలింగం కూడా వివేకవర్ధనికి ఒక హాస్య అనుబంధాన్ని చేర్చి దానికి హాస్యసంజీవని అని పేరు పెట్టాడు. కొక్కొండ వెంకటరత్నం కొన్ని హాస్యసంభాషణలు సృష్టించి అందులో వీరిగాడనే పాత్ర ప్రవేశపెట్టాడు. అది తనను ఉద్దేశించేనని గ్రహించిన వీరేశలింగం పంతులు కూడా ఒక నత్తి పాత్రను సృష్టించి దానికి కొండ వెంకడు అని పేరు పెట్టి, ఆ పాత్ర తన పేరు చెప్పేందుకు కొ.కొ.క్కొ.క్కొండ వెంకడు అనిపించేవాడు.[64]
కొక్కొండ వెంకటరత్నం "ప్రసన్న రాఘవ నాటకం" సంస్కృత నాటకాన్ని "ఆంధ్రప్రసన్న రాఘవ నాటకము" అనే పేరుతో అనువదించాడు. ఇది వైజయంతి పత్రికలో మొదట వెలువడింది. తర్వాత గ్రంథరూపంలో వచ్చింది. ఈ గ్రంథాన్ని వేదం వెంకటరాయశాస్త్రి ““ఆంధ్రప్రసన్న రాఘవ విమర్శ గ్రంథము' అని సమీక్షించి ప్రకటించారు. ఇందులో కొక్కొండ చేసిన 2568 తప్పులను ఎత్తిచూపెట్టారు. ఆ విమర్శను మెచ్చుకొంటూ అముద్రితగ్రంథచింతామణి 1899 ఫిబ్రవరిలో సుదీర్ణమైన వ్యాసాన్ని ప్రచురించింది. దానిపై ఆంధ్రభాషాసంజీవని, అముద్రితగ్రంథచింతామణి లలో తీవ్రమైన దూషణభూషణలు వచ్చాయి. కొక్కొండ రాసిన బిలేశ్వరీయం అనే గ్రంథంపై కూడా ఇరు పత్రికల లోనూ పలు విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి.[65]
అభినవసరస్వతికీ, గోలకొండ పత్రికకూ మధ్య స్పర్థ ఉండేది. అయితే ఇది అంశాలపై ఆధారపడి కాక, వ్యక్తిగత స్థాయిలో ఉండేది. అభినవసరస్వతి బిచ్చగత్తె పత్రిక అని గోలకొండ పత్రిక అంటే, గోలకొండ సంపాదకుడు గ్రామ్య పండితుడు అని అభినవసరస్వతి రాసింది.[66]
21 వ శతాబ్దిలో సాక్షి పత్రికకూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకూ మధ్య పరస్పర నిందలు ఆరోపణలూ జరుగుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు యెల్లో మీడియా అనీ, పచ్చపత్రికలనీ సాక్షి రాస్తుంది. ఈనాడును విషపుత్రిక అని అంటుంది.[67] సాక్షి రోత పత్రిక అని ఆంధ్రజ్యోతి అంటుంది.[68]
ఆధునిక కాలంలో దినపత్రికలు గతంలో వలెనే బ్రాడ్షీట్ల లాగానే వెలువడుతున్నాయి. తెలంగాణా ఉద్యమం సమయం లోను, రాష్ట్రం ఏర్పడ్డాకా నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ వంటి కొత్త పత్రికలు ఉద్భవించాయి. పత్రికలు కాగితంపై ముద్రితమౌతూనే, అంతర్జాలంలో కూడా ప్రచురిస్తున్నారు. అంతర్జాలంలో పత్రికలు రెండు రూపాల్లో ఉంటున్నాయి. మామూలుగా తాజావార్తలను ఎప్పటికప్పుడు న్యూస్ఫీడ్ లాగా ప్రచురించడం ఒకటి. దీంతోపాటు, ఈ-పేపర్ రూపంలో పత్రిక భౌతిక రూపాన్ని యథాతథంగా ముద్రిస్తున్నారు. ఇది, పాఠకులకు ముద్రిత రూపం లోని పత్రికను చదివే అనుభూతి నిస్తుంది.
కేవలం అంతర్జాలంలో మాత్రమే లభించే పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి ముద్రిత రూపం ఉండదు.
పలు పత్రికల పాత సంచికలు ప్రస్తుతం లభ్యం కావడం లేదు. అంతర్జాలంలో, ఆర్కైవ్.ఆర్గ్ లో కొన్ని పత్రికల ప్రతులు లభిస్తున్నాయి. వర్తమానంలో ప్రచురణలో ఉన్న పత్రికల పాత సంచికలు కూడా గూగుల్ వంటి సెర్చి ఇంజన్లకు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని పత్రికల్లో తాజా వార్తలు కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
పత్రికలు ప్రచురించే కాలావధిని అనుసరించి దిన, వార, పక్ష, మాస పత్రికలుగా వర్గీకరించడం సహజం. పత్రికల్లో ప్రచురితమయే అంశాలను అనుసరించి వార్త, సాహిత్య, ఆర్థిక, సాంకేతికాది పత్రికలుగా, ప్రచురణ పొందే పద్ధతులను బట్టి అచ్చు, రాత, గోడ పత్రికలుగా విభజించుకోవచ్చు. పత్రికల్లో చాలావరకు అచ్చుపత్రికలే. ఆంధ్రకేసరి అనే పత్రిక హైదరాబాదు నుండి రాతపత్రికగా మొదలై, ఆ తరువాత అచ్చుపత్రికగా మారింది.
రోజుకు ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తా పత్రికలు దినపత్రికలుగా వెలువడుతూంటాయి. తెలుగులో మొట్టమొదటి దినపత్రిక దేశాభిమాని. ఇది బెజవాడ నుండి వెలువడేది. మొదట 'కృష్ణావృత్తాంతిని' అనే పేరుతో మొదలైంది. ఆ తరువాత 'కృష్ణాన్యూస్' అని పేరు మార్చుకుంది. చివరికి దేశాభిమానిగా మారింది. ప్రచురణ స్థలం కూడా గుంటూరుకు మారింది. మొదట ఇది వారపత్రికగా నడచి 1901 నాటికి దినపత్రికగా మారింది.[4]
సమాచార వ్యవస్థ వేగంగా లేని రోజుల్లో ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం పాఠకుని చేతికి అందేవి. ఈ నేపథ్యంలో తెల్లవారేసరికల్లా పాఠకుని చేతికి అందడాన్ని సవాలుగా స్వీకరించిన పత్రికలు సర్క్యులేషన్లో ముందుకు వెళ్ళి ఇతర పత్రికల్ని వెనక్కి నెట్టాయి.
వారానికి ఒక సంచిక వెలువరించే పత్రికలను వారపత్రికలు అంటారు. ప్రస్తుతం ప్రముఖ వారపత్రికలుగా వెలుగొందుతున్నవి స్వాతి సపరివార పత్రిక, ఆంధ్రభూమి, నవ్య వారపత్రిక మొదలైనవి.
↑సాదనాల, వేంకటస్వామి నాయుడు (1994). కృష్ణాపత్రిక సాహిత్యసేవ ఒక పరిశీలన. ROP HYDERABAD, HYDERABAD PAR INFORAMTICS. రాజమండ్రి: సాదనాల ప్రచురణలు. p. 16.{{cite book}}: CS1 maint: date and year (link)
↑మామిడిపూడి, వెంకటరంగయ్య (1969). The Freedom Struggle In Andhra Pradesh (in ఇంగ్లీష్). ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్యోద్యమ చరిత్రను అక్షరబద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ. p. 53.{{cite book}}: CS1 maint: date and year (link)