నార్ల తాతారావు
నార్ల తాతారావు | |
---|---|
![]() నార్ల తాతారావు | |
జననం | నార్ల తాతారావు మార్చి 8, 1917 |
మరణం | ఏప్రిల్ 7, 2007 |
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | ఇంజినీరు |
సురరిచితుడు | విద్యుత్ సంస్కరణలు |
జీవిత భాగస్వాములు | సౌభాగ్యమ్మ |
పిల్లలు | 2; కుమారుడు గంగాధర్; కుమార్తె జానకి |
నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.
నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించాడు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించాడు. పిదప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్ఈబీ) డివిజనల్ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్ఈబీ ఛైర్మన్గా పనిచేసాడు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించాడు[1].
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించాడు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.
నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు.
పదవులు[మార్చు]
- డివిజనల్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
- కార్యదర్శి, విద్యుత్ బోర్డు, మధ్య ప్రదేశ్
- ఛీఫ్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
- ఛైర్మన్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
- సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ కమిషన్
- ఛైర్మన్, సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్లుకమిటీ
- ఛైర్మన్, ఎనర్జీ రీసర్చ్ శాఖ, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధక పరిషత్
- అధ్యక్షుడు, కేంద్రీయ జల విద్యుత్ సమితి
- డైరెక్టర్, భారత అల్యూమినియమ్ కంపెనీ
- అడ్వైజర్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డ్
పురస్కారాలు[మార్చు]
- ఓమ్ ప్రకాశ్ భాసిన్ పురస్కారము
- పద్మ శ్రీ 1983
- గౌరవ సభ్యుడు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసోసియేషన్, అమెరికా
- భారతరత్న, శ్రీ విశ్వేశ్వరయ్య అవార్డు 1985