ప్రాచీన భారత దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాకేంద్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్యాకుబ్జం (కనౌజ్)‌[మార్చు]

కన్యాకుబ్జము హిందూ విద్యాకేంద్రముగా విలసిల్లినది. ముఖ్యముగా యశోవర్థనుడు దీని ప్రాముఖ్యతలో ప్రశంశనీయమైన స్థానం వహించాడు. ఇతను దీనిని సుమారుగా క్రీస్తు శకం 675 లో అభివృద్ధిచేసాడు. ఇక్కడ ముఖ్యమైన అభివృద్ధి పూర్వ మీమాంసలో జరిగింది. ఇక్కడి గురువులు బహుభూతి, అతని గురువు కుమార లీలాభట్టు.

కంచి[మార్చు]

కంచి లేదా కాంచీపురం మరొక విద్యా కేంద్రం. ఇక్కడ హుయాన్ త్సాంగ్ వచ్చినప్పుడు ధర్మపాల అను పండితుడు నూరుమంది సింహళ దేశ పండితులను ఓడించాడు. ఈ వాదం ఒక వారం రోజులు జరిగింది.

కాశి[మార్చు]

కాశీ లేదా బెనారస్‌, ఒక విద్యా కేంద్రం. ముఖ్యముగా ఏడవ శతాబ్దం నుండే దీనిలో విద్యా సువాసనలు దేశమంతా వ్యాపించినాయి. అశోకుని కాలంలో దీని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఇక్కడ పదిహేను వందల మంది బౌద్ధ సన్యాస విద్యార్థులు ఉండేవారు. పన్నెండవ శతాబ్దం అరకూ ఇది బౌద్ధ విద్యా క్షేత్రంగా ఉండేది.తరువాత హిందూ విద్యా నిలయంగా మారినది. పదకొండవ శతాబ్దంలో ఇది ముఖ్య స్థానం వహించింది. శంకరాచార్యులు కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడి పండితులను ఓడించారు. ఇక్కడి పండితులతో వాదన ఓ ముఖ్యమైన ప్రక్రియ. దక్షిణాది నుండి చాలా మంది పండితులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్బర్, షాజహాన్, దారా షికోవ్ వంటి ముస్లిం ప్రభువులు కూడా దీనికి ధన సహాయం చేసారు.

మిథిల[మార్చు]

మిథిల లేదా విదేహ, ప్రాచీన కాలం నుండి ఒక విద్యా కేంద్రము. ఇక్కడి జనకుడు జగద్విఖ్యాతుడు. తరువాత కామేశ్వర వంశం (1350 - 1515) కాలంలో మరింత ప్రసిద్ధి పొందినది. ఇక్కడి జగద్దర పండితునికి చాలా కీర్తి ఉంది. కవి విద్యాపతి కూడా ఇక్కడి వాడే. న్యాయ విభాగం యొక్క అభివృద్ధి ఇక్కడ జరిగింది. దీనిని గంగేశ పండితుడు, పక్షధార పండితుడు కలిసి అభివృద్ధి చేసారు.

ఇక్కడ పరీక్ష పద్ధతులలో ఓ చమత్కారం ఉన్నది, ఓ పెద్ద పుస్తకాన్ని తెచ్చి ఓ సూదిని దానిలోనికి గుచ్చుతారు. ఆ సూది ఎంతవరకూ వెళ్తే ఆ తరువాత తాళ పత్రాన్నుండి ప్రశ్నలు వేస్తారు. దీనిని శాలక పరీక్ష అనేవారు.

నదియ[మార్చు]

లక్ష్మణ సేన పండితుడు, 1106 - 1138, ఇక్కడివాడు. హల్యాయుద్ధ అను గొప్ప జ్ఞాని మరియూ ప్రధానమంత్రీ, శూలపాణి అను న్యాయ శాస్త్ర నిపుణుడు, గీత గోవిందం విరచించిన జయదేవ కవి ఇక్కడివారే.

నదియా భారత సాంఘిక వ్యవస్థలో జోక్యం చేసుకోని ముస్లిం పరిపాలకుల కాలంలో చాలా ప్రఖ్యాతి వహించింది. ఇది హిందూ శాస్త్ర పరిశోధనకూ, వాగ్యుద్ధాలకూ వేదికగా నిలిచింది. ఈ కాలంలో మిథిల చాలా జటిలంగా తయారయింది. ఎందుకంటే అక్కడనుండి ఏ శాస్త్రాన్నీ కూడా బయటకు పంపేవారు కాదు. కనీసం చిన్న తాళపత్ర గ్రంథాన్ని కూడా పంపించేవారు కాదు. ఇటువంటి పరిస్థితులలో నదియాకి చెందిన ప్రఖ్యాత సార్వభౌమ భట్టారకుడు రెండు పుస్తకాలను మిథిలలో చదివి తరువాత వాటిని తు. చ. తప్పకుండా లిఖించారు. ఈ సార్వభౌమ భట్టారకుడినే నిమాయి పండితుడుగా పేరుగాంచిన శ్రీ చైతన్య మహా ప్రభువు వాదనలో ఓడించినాదు. ఈ వివరాలు చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం అను పుస్తకాలలో చెప్పబడినాయి.

నలంద[మార్చు]

ఆహా! నలందా విశ్వ విద్యాలయం ఖ్యాతి తెలియనిది ఎవరికి? దేశ విదేశాలనుండి ఇక్కడికి పండితులు వచ్చేవారు, విద్యార్థులు వచ్చేవారు. వైశాల్యంలోకానీ, సంఖ్యలలో కానీ గుణంలోకానీ, నిర్వహణలో కానీ ఇది ఇప్పటి విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోదు.

భవనాలు[మార్చు]

పాటలీపుత్రం (పాట్నా)కు నలభై మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉండేది. ఇక్కడి త్రవ్వకాల ఆధారంగా ఓ మైలు పొడవు, అరమైలు వెడల్పు ఉన్న ఆవరణలో పెద్ద, పెద్ద భవనాలు ఉండేవని నిర్ధారణ అవుతున్నది. ఏడు పెద్ద గదులు కల పెద్ద కేంద్ర కళాశాల, మూడు వందల చిన్న తరగతి గదులూ ఉన్నాయి. ఎన్నో అంతస్తులు కల అద్భుతమైన నిర్మాణం ఇది.

ఇక్క నివాస, వసతులకు అన్నీ రెండంతస్తుల భవనాలే. ఇందు ఒకటి లేదా రెండు మంచాలు కల గదులు ఉన్నాయి. ఇక్కడి వంటశాల చాలా పెద్దది.

ఆదాయ మార్గాలు[మార్చు]

దీనికి ఆదాయ వనరులుగా రెండు వందల గ్రామాలు ఉండేవి, అంతే కాకుండా రాజులు, ధనికులు ఇతోధికంగా సహాయం చేస్తుండేవారు.

వసతులు[మార్చు]

ఇక్కడి విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజనం, వసతి, బట్టలూ ఇచ్చేవారు.

విద్యార్థుల సంఖ్య[మార్చు]

హుయన్‌ త్సాంగ్‌ చెప్పిన ప్రకారం ఏడవ శతాబ్దంలో ఇక్కడ సుమారుగా పదివేల మంది విద్యార్థులు ఉండేవారు.

గ్రంథాలయం[మార్చు]

ఇక్కడ ఓ పెద్ద గ్రంథాలయం ఉండేది, చైనా విద్యార్థులు ఎన్నో నకళ్లు ఇక్కడనుండి తయారు చేసుకొని వెళ్ళేవారు.

పాఠ్యాంశాలు[మార్చు]

ఈ విశ్వ విద్యాలయము ముఖ్యముగా మహాయాన తెగకు చెందినది. అయినా హీనయానము కూడా బోధించేవారు. హిందూ మత విషయములు కూడా బోధించేవారు. తరువాత వ్యాకరణము, తర్కము‌, సాహిత్యము, వేదాలు, వేదాంతాలు, సాంఖ్యము మొదలగునవి బోధించేవారు.

ఉపాధ్యాయుల సంఖ్య[మార్చు]

ఇక్కడ సుమారుగా వెయ్యి మంది మంచి అనుభవం కల సన్యాస ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రతి దినము నూరు తరగతుల వరకు జరిగేవి. విద్యార్థులు వివిధ పాఠ్యాంశాలనుఎన్నుకోవచ్చు.

తక్ష శిల[మార్చు]

ఇది రావల్ఫిండి నుండి పశ్చిమంగా ఇరవై మైళ్ళ దూరంలో ఉండేది. ఇది గాంధార రాజ్యానికి రాజధాని. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలోనే ఇక్కడ‌ ముఖ్యమైన నిర్మాణాలు ఉండేవి అనడానికి ఆధారాలు ఉన్నాయి. అలెగ్జాండరు ఇక్కడ నుండి గొప్ప తత్వ శాస్త్ర పండితులను తన రాజ్యానికి తీసుకొని వెళ్లినాడు. ఇది ఓ పెద్ద విశ్వ విద్యాలయం లాగా కాకుండా, చిన్న చిన్న సంస్థలు వ్యక్తుల ద్వారా నడపబడుతూ ఉండేవి. ఎక్కువలో ఎక్కువ ఇక్కడ ఓ సంస్థకు ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ కేవలం ఉన్నత విద్య మాత్రమే లభించేది. కేవలం జిజ్ఞాసులు, అధికమైన జ్ఞానము కలవారు మాత్రమే ఇక్కడికి మరింత జ్ఞానార్జన కోసం వెళ్ళేవారు.

పాఠ్యాంశాలు[మార్చు]

తత్వ శాస్త్రము, పద్దెనిమిది శిల్పాలు, వైద్యము, శస్త్ర చికిత్స, విలు విద్య, ఖగోళ శాస్త్రము, జ్యోతిషశాస్త్రము, రేఖా గణితము, భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వ్యవసాయము, తంత్రవిద్య(మాయమంత్రములు)‌, నాట్యం, బొమ్మలు వేయుట.

వల్లభి[మార్చు]

వల్లభి ఒక పురాతన విశ్వ విద్యాలయం. ఇది క్రీసు శకం ఐదవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకు ప్రఖ్యాతి గాంచింది. ఇది హీనయాన బౌద్ధ మతానికి చెందినది. ఇక్కడ ధర్మ, మత విషయాలు, నీతి విషయాలు, ఆయుర్వేదం బోధించేవారు.

విక్రమశిల[మార్చు]

విక్రమశిల విశ్వ విద్యాలయాన్ని ధర్మపాల మహారాజు ఎనిమిదవ శతాబ్దంలో అభివృద్ధి పరచాడు. నాలుగు శతాబ్దాలు ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి వహించింది. ముఖ్యముగా త్రివిష్టపము(టిబెట్)‌ నకు ఇక్కడికీ మంచి సంబంధాలు ఉండేవి. ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో సుమారుగా మూడువేల మంది విద్యార్థులు ఉండేవారని తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న గ్రంథాలయం చాలా పెద్దది. ఇక్కడ మంచి నిర్మాణాత్మక నిర్వహణ ఉండేది. కాని ఖిల్జీ దీనిని ఓ కోటగా పొరబడి నాశనం చేసాడు, అని చెప్తారు. ఇందులో పట్టాలూ, బిరుదులూ ఇచ్చేవారు!