రత్నం బాల్ పెన్ వర్క్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాల్ పాయింట్ పెన్

రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్.[1] 1930 లో రాజమహేంద్రవరం లో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నం పెన్[2] ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నంపెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది.[3]

కళలకు, సంస్కృతికి ఆలవాలమైన రాజమహేంద్రవరం స్వాతంత్ర్య సమరవీరులకు, త్యాగాధనులకూ పెట్టింది పేరే. ఇక కీలకమైన స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ నగరం 'కలం' (పెన్ను) పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ నాంది పలికింది. ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం గారి హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్ గా విడివడింది. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారంలో విరాజిల్లుతున్నాయి.

అంకురార్పణ[మార్చు]

దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. ఏ విధంగా పెన్ తయారు చేయాలనే దానిఫై సర్వే చేసారు. మచిలీపట్నం అయ్యగారి రామమూర్తి, మద్రాస్ కంపెనీ నుంచి సూచనలు తీసుకుని, 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు. రత్నం పెన్ ని సబ్ జడ్జి కృష్ణమాచార్య తొలిసారిగా వాడారు. 1932లో హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు పంతులుగారి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా వచ్చిన ఆర్డర్ మేరకు వెండితో రెండు పెన్నులు తయారుచేసి, బంగారం పాళీలు అమర్చి అందించారు. అప్పట్లో ఈ విధంగా రూపొందించిన పెన్ను ఖరీదు కేవలం రెండు రూపాయల పావలా.

గాంధీజీ ప్రశంసలతో లేఖ[మార్చు]

ఇక 1933లో రత్నం పెన్ గాంధీజీకి పంపిస్తే, ఇది విదేశీ ముద్రగా ఉందని తిప్పి పంపేసారట. ఆల్ ఇండియా విలేజ్ ఇండస్త్రీస్ సెక్రటరీ జె ఎ సి కమార్ రాజమహేంద్రవరం వచ్చి, రత్నం పెన్నులకు ముడిసరుకు కోసం లైసెన్స్ ఇస్తామని, అందుచేత శాంపిల్స్ తయారుచేసి ఇవ్వాలని అనడంతో ఎబోనైట్, ఎరిడియం పాయింట్లతో రెండు పెన్నులను రత్నంగారు తయారుచేసి ఇచ్చారు. వీటిని 1935 లో గాంధీజీకి అందించడంతో 'విదేశీ కలాలకు ప్రత్యామ్నాయంగా వుంది' అని అభినందిస్తూ లేఖ పంపారు.[4]

ప్రముఖుల మెచ్చుకోలు[మార్చు]

దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు రత్నం పెన్నులను వాడారు. మరెందరో రత్నం సంస్థను దర్శించారు. 1936లో తిరువనంత పురం మహారాజా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, 1937లో పండిట్ నెహ్రూ, సి.ఆర్.రెడ్డి, మొసలికంటి తిరుమలరావు, ఆచార్య వినోబా భావే, దుర్గాబాయి దేశముఖ్, కమలాదేవి ఛటోపాధ్యాయ, 1947 లో మద్రాస్ గవర్నర్ ఆర్చ్ బాల్డ్ నై, 1955 లో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, 1958లో నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి), ఆనాటి గవర్నర్ భీమ సేన్ సచార్, తదితరులు రత్నం పెన్ వర్క్స్ సందర్శించి, పెన్నులు స్వీకరించారు. రష్యా ప్రెసిడెంట్ బల్కానియాన్ క్రుచేవ్, అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్, జర్మనీ చాన్సలర్ అర్బన్ నాన్ తదితర ప్రముఖులకు రత్నం పెన్నులు పంపబడ్డాయి.

కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, పూరి శంకరాచార్య, శివానంద ఆశ్రమ అధిపతి ఇలా ఎంతో మంది స్వామిజీలు రత్నం పెన్నులను స్వీకరించి, ఆశ్సీస్సులు అందించారు.

ప్రస్తుత నిర్వహణ[మార్చు]

రత్నం బాల్ పెన్ వర్క్స్ (కె వి రత్నం అండ్ సన్స్) ని డాక్టర్ కె. వి.రమణమూర్తి నిర్వహించారు. అతని కుమారులు గోపాలరత్నం (గోపి), చంద్రశేఖర్ కూడా భాగస్వామ్యం వహించడంతో మూడోతరం ఈ పరిశ్రమలో మిళితమైంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ, అతి పెద్ద, అతి చిన్న పెన్నులు తయారు చేసి రికార్డు సృష్టించి, వెలుగొందుతున్న ఈ సంస్థ ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలతో కలిపి 8 పుష్కరాలను చూసింది. ఆయుర్వేదంలో డిప్లొమా చేసిన డాక్టర్ కెవి రమణమూర్తి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, 2021 సెప్టెంబరు 21 న మరణించే వరకు [5]కూడా 'రత్నం బాల్ పెన్ను' ల రూపకల్పనలో శ్రమించారు. కొత్త ప్రయోగాలు చేసారు. 2008లో అతి పెద్ద పెన్ రూపొందించి, ఆనాటి స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి అందించారు. ఆతర్వాత అతి చిన్న సైజులో బాల్, ఇంకు పెన్నులను బంగారంతో తయారు చేయగా, ఆనాటి గవర్నర్ ఎన్.డి.తివారి రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు.

ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్‌లో స్థానం[మార్చు]

రత్నం బాల్ పెన్ వర్క్స్ కి అనేక అవార్డులు లభించాయి. 2012 డిసెంబరులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన రత్నం సన్ వర్క్స్, [6] 2014 మేలో ఎవరెస్ట్ వరల్డ్, సృజన పత్రికలలో చోటు దక్కించుకుంది. 2010 లో హిందూ ఎడిటర్ ఎన్. రామ్, డిసెంబరు 18 న సి.బి.ఐ మాజీ జె.డి డా వి.వి.లక్ష్మీనారాయణ, ఎపి రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఇలా ఎందరో ఈ సంస్థను సందర్శించి, అభినందించారు.

2015 గోదావరి పుష్కరాలలో కొత్త పెన్ను[మార్చు]

2015 గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరుడు-గోదావరి మాత-గోదావరి గలగలలు-పుష్కర ప్రారంభ తేదీ (14.7.15) లను చిత్రించి, బంగారు పాళీతో రూపొందించిన వెండి పెన్నును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల 7వ రోజు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆవిష్కరించారు. 'రత్నం పెన్ ' చరిత్ర తెలుసుకుని, పులకించిపోయారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌గా కూడా దోహదపడుతున్న ఈసంస్థను విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు 60 మంది వచ్చి, పెన్నుల తయారీని పరిశీలించి వెళ్ళారు. రత్నం కలాలు ప్రపంచీకరణలో పోటీని తట్టుకుని, అజేయంగా కొనసాగుతున్నాయి. రత్నంపెన్, రత్నం బాల్ పెన్ సంస్థలు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ శత వసంతాలకు పరుగులు తీస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. ఫోర్బ్‌స్ ఇండియా వెబ్‌సైటు Archived 2016-09-20 at the Wayback Machine లో రత్నం పెన్ గురించిన వ్యాసం
  2. "Ratnam Pens - photos, packing case, et al..."
  3. K. R, Deepak (19 August 2018). "Indelible Ink". thehindu.com. Retrieved 2 Sep 2018.
  4. హిందూ పత్రికలో గాంధీజీ అభినందన ప్రస్తావన
  5. "రాజమండ్రి: 'రత్నం పెన్స్' కేవీ రమణమూర్తి కన్నుమూత". Samayam Telugu. Archived from the original on 2021-09-22. Retrieved 2021-09-22.
  6. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించిన వార్త - న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో

ఇతర ఆధారాలు[మార్చు]

  • స్వదేశీ స్ఫూర్తి "రత్నంపెన్"కి సహస్ర చంద్ర దర్శనం (సరికొత్త సమాచారం 6.11.2015)
  • 'రాజమహేంద్రి అనర్ఘరత్నం' (సమాచారమ్,4.4.1999),
  • 'రాజమండ్రి సన్నిధిలో భారతీయ 'పెన్' నిధి (40401999),
  • 'జాతికే స్ఫూర్తినిచ్చిన రత్నం పెన్ (ఈనాడు 15.8.2005
  • ది స్టోరీ ఆఫ్ ఎ సెబ్రెటెడ్ పెన్ (ది హిందు, 6.10.2005, పెన్ డ్ ఎట్ రాజమండ్రి, ట్రావెల్ ఎయిర్ దక్కన్ (జూన్ 2006)
  • తంగం - రత్నం (కుంగుమం - తమిళ్,9.2.2006), నీ పెన్ను బంగారం కానూ (ఈనాడు,10.4.2006, పెన్ నేమ్, (ది వీక్,17.9.2006)
  • వరల్డ్స్ స్మాలెస్ట్ ఫౌంటెన్ పెన్ (ది ఇండియన్ ఎక్స్ ప్రెస్,6.5.2008), స్మాలెస్ట్ ఇంక్ పెన్ ఎవర్ (దక్కన్ క్రానికల్,12.8.2014) </ref>
  • స్వదేశీ కలం (సాక్షి,5.8.2014), ది పెన్ దట్ మహాత్మ, పండిట్ హేడ్ ఎ పేషన్ ఫర్ (ది హిందు,26.10.2014), స్వదేశీ పెన్ను 'ఇంకు' పొసుకుంది (సరికొత్త సమాచారం,29.5.2015,