32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్‌ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 15 డిసెంబర్‌ 2018 నుంచి 25 డిసెంబర్‌ 2018 వరకు నిర్వహించారు.[1][2]

నిర్వహణ[మార్చు]

32వ జాతీయ పుస్తక ప్రదర్శన 15 డిసెంబర్‌ 2018 నుంచి 25 డిసెంబర్‌ 2018 మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. జర్నలిస్ట్ వట్టికోట ఆళ్వార్‌ స్వామి పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ కవి రచయిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పేరిట వేదికను ఏర్పాటు చేశారు.[3] 331 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించగా, తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా కమిషన్‌ చైర్మన్‌ అల్లం నారాయణ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[4] పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ పుస్తక ప్రదర్శనలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన జీవితంలో ఎదురైన సమస్యలు, వాటికి సంబంధించి ఆయనకు తోచిన పరిష్కారాలతో ‘దోసిటి చినుకులు’ పేరుతో పుస్తకంగా తీసుకవచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగు భాషకు సంబంధించి విశాలాంధ్ర, నవచేతన, నవతెలంగాణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, ఎమెస్కో సంస్థలకు సంబంధించిన ప్రచురణలతో పాటు ఆంగ్ల భాషకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలైన పెంగ్విన్‌తో పాటు, రూట్లేజ్, సేజ్, హచెట్, గ్రీన్వుడ్ తదితర సంస్థలు తమ ప్రచురణ పుస్తకాలను అందుబాటులో ఉంచాయి. ఈ పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ ‘సాహిత్య సమాలోచన’ పేరుతో సాహిత్య సదస్సు నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 December 2018). "వేడుకలా పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021. వేడుకలా పుస్తక ప్రదర్శన
  2. Vaartha (13 December 2018). "ఈనెల 15నుండి భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన". Archived from the original on 13 December 2018. Retrieved 26 December 2021.
  3. Sakshi (17 January 2018). "పుస్తక పఠనం.. ప్రగతికి సోపానం". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
  4. Sakshi (16 December 2018). "పుస్తక పఠనంతోనే చైతన్యం: వెంకయ్యనాయుడు". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021. పుస్తక పఠనంతోనే చైతన్యం: వెంకయ్యనాయుడు